Tuesday, September 29, 2009

కండ(డా)క్టర్

బస్సులో టిక్కెట్ల గురించేకాదు, ప్రయాణీకుల ఆరోగ్యపు ఇక్కట్ల గురించి కూడా తెలుసు ఆ కండక్టర్ గారికి. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు తన ప్రవృత్తిగా వనమూలిగా వైద్యాన్ని ఎంచుకున్నారు. పేదలకు ఉచితంగా వనమూలికా వైద్యం చేస్తుంటారు. తన ఇంటి పెరట్లోనే ఔషధ మొక్కలు పెంచుతూ చిన్నతనం నుంచే మూలికల పట్ల మంచి అవగాహన పెంచుకున్నారు. ఆది, మంగళవారాలు ఈయనకు సెలవుదినాలు కావడంతో తన భార్య తోడ్పాటుతో ఇంటివద్దే మందులు తయారు చేసి స్థానికులకు వైద్యపరమైన చేయూతనిస్తున్నారు.

బాలింతలారా మొక్కలతో రండి

పండంటి బిడ్డను ప్రసవించేందుకు ఆ ఆసుపత్రికి వెళ్ళే ఏ గర్భిణి అయినా ఒక మొక్కను చేతబట్టుకుని మాత్రమే ఆ మెట్లెక్కాలి. అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు రోగుల ఉల్లాసం లక్ష్యంగా ఆ ఆసుపత్రి వైద్యులు పెట్టిన నిబంధన అది. దీనిని కనులారా గాంచాలనుకుంటే తమిళనాడులోని మదురై జిల్లా రాజ్‌కూర్‌లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలి. ఇక్కడున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చే ప్రతి బాలింతా ఒక మొక్కను నాటాలని ఆసుపత్రి సిబ్బంది ఒక వినూత్న పథకం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఆసుపత్రికి "మొక్కల ఆసుపత్రి" అనే పేరు వచ్చేసింది. అంతేకాదు, ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించే ఈ ఆసుపత్రి వైద్యురాలి సెల్ నెంబర్ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు. అందువల్ల వారు ఎప్పుడైనా తమ ఆరోగ్య సమస్యలపై ఏ సమయంలోనైనా వైద్యురాలిని సంప్రదించవచ్చు. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి మారుపేరని తరచూ విమర్శలు వెల్లువెత్తే నేటి పరిస్థితుల మధ్య ఒక ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ప్రజల మేలు కోరి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.