Saturday, August 31, 2013

సావిత్రికి చేప ప్రసాదం... సత్యమూర్తికి పరమానందం..

నాడు సత్యవ్రతుని కోసం భార్య సావిత్రి యముని వెంటపడి మాంగల్యాన్ని దక్కించుకుంటే... నేడు బిడ్డ సావిత్రి కోసం యజమాని సత్యమూర్తి తపనపడి చేప ప్రసాదం ఇప్పించాడు. అసలీ సావిత్రి ఎవరు?.. ఆమె చేప ప్రసాదం తింటే మాకేంటి?... అనుకుంటారేమో. మన మామూలు కళ్ళకు ఆమె ఒక కుక్కలా కనిపించవచ్చు గానీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నివసించే ఏసీ వ్యాపారి సత్యమూర్తికి మాత్రం సావిత్రి తన కన్నబిడ్డ లాంటిదే. ఈ మధ్యన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద వితరణ జరిగినప్పుడు గర్భవతిగా ఉన్న సావిత్రికి కూడా ఈ ప్రసాదం ఇప్పించాలని అనుకున్నారాయన. తన కన్నబిడ్డ లాంటి సావిత్రి కనబోయే బిడ్డలు సైతం ఆరోగ్యంగా ఉండాలని తలచి చేప ప్రసాదం ఇప్పించారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది బత్తిని సోదరుల చేప ప్రసాదం వితరణ సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బాగ్‌లింగంపల్లిలో ఉండే సత్యమూర్తి అనే అయ్యప్ప స్వామి భక్తుడు 'సావిత్రి'ని తన బండిపై నాంపల్లి గ్రౌండ్స్‌కు తీసుకువచ్చి 'చేప ప్రసాదాన్ని' తినిపించారు. అప్పటికి గర్భవతిగా ఉన్న సావిత్రి శాకాహారే అయినప్పటికీ మంచి ఆరోగ్యం కోసం చేప ప్రసాదం ఇప్పించినట్లు సత్యమూర్తి చెప్పారు. సావిత్రితో చేప ప్రసాదం తినిపించడానికి అక్కడున్న కార్యకర్తలు తొలుత ఇబ్బంది పడినప్పటికీ చివరకు ప్రసాదాన్ని విజయవంతంగా తినిపించారు. పద్ధతి ప్రకారం 45 రోజుల పాటు కచ్చితమైన పత్యం పాటించేలా చూస్తానన్నారు. 'సావిత్రి'ని కన్నబిడ్డలా చూసుకుంటానని, తనతో పాటే పూజల్లో పాల్గొంటుందని సత్యమూర్తి చెప్పారు. చేప ప్రసాదం గురించి బయట ఎన్ని వివాదాలున్నా... ఇక్కడ మాత్రం సావిత్రి పట్ల ఆ యజమానిలో గూడు కట్టుకుని ఉన్న ప్రేమకే పట్టం కడదాం...