Monday, August 06, 2018

నా స్కూటర్ ఆ పిచ్చుకలకే అంకితం!

సవీతా టీచర్ ఇంటికి వెళితే ఇనుప వలల మధ్య భద్రంగా ఉన్న ఒక స్కూటర్ కనిపిస్తుంది. అదేదో కేరళ మహారాజులు ఉపయోగించిన  స్కూటర్ అనుకోకండి. దాని మీద వాలే హక్కును కేవలం పిచ్చుకలకు మాత్రమే ఇచ్చారు ఆ టీచర్. ఆ ఊరి వాళ్ళు రోజూ వచ్చి ఆ స్కూటర్‌ని ఓసారి చూసి పోతున్నారు. కొద్ది రోజుల్లో ఈ సీన్ మారి మళ్ళీ ఆ స్కూటర్‌ని ఆవిడ వాడుకుంటారనుకోండి. అది వేరే విషయం ఇంతకీ అసలేం జరిగిందంటే...

ఉపాధ్యాయురాలైన సవీతా మహేంద్రన్ కేరళలోని సత్యమంగళం ప్రాంతంలో ఉన్న అరియప్పంపాళ్యం గ్రామంలో నివసిస్తుంటారు. ఆ మధ్య పని ఉండి ఓ వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడికో వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి తన స్కూటర్‌ని పిచ్చుకలు ఉపయోగించుకోవడం ఆమె చూశారు. కాళ్ళు పెట్టుకునే చోట పిచ్చుకలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టాయి. ఓ రెండు రోజులయ్యాక వెళ్ళిపోతాయిలే... అనుకున్నారు కానీ అదేం జరగలేదు.

పిచ్చుకల గూడులోని మూడు గుడ్లలో రెండిటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. మరొకటి కూడా పగిలి పిచ్చుక పిల్ల బయటకు వచ్చి, అవన్నీ స్వేచ్ఛగా ఎగిరే వరకూ ఆ స్కూటర్‌ని తాను ఎక్కకూడదని సవీత నిర్ణయించుకున్నారు. తమ వల్ల పిచ్చుకలకు ఇబ్బంది కలగకూడదని, అటు ఎవ్వరూ వెళ్ళకుండా స్కూటర్ చుట్టూ ఇనుప వలలు కట్టించారు.

ఆ పిచ్చుకలు ఎగిరాకే... ఈ బండి చక్రం కదిలేది.

Wednesday, February 28, 2018

రాజు కోడి అక్కడుంటే జాగ్రత్తగా వెళ్ళాలి మరి...

కోడి పేరెత్తగానే ఎప్పుడు కూరొండుకుని తినేద్దామా అనుకుంటారు చాలామంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌లో ఉన్న ఓ కోడిపుంజు ఇంటికి కాపలా కాస్తూ విశ్వాసాన్ని చూపిస్తోంది. మామూలుగా అయితే, మనుషులు దగ్గరకు రాగానే కోళ్లు పరుగులు తీస్తాయి. కానీ సుల్తానాబాదులోని అమృతమ్మ ఇంటి దగ్గర కొత్తవాళ్ళు కనిపిస్తే కోడి వెంటనే దాడి చేస్తుంది. వెంటపడి, తరిమికొడుతుంది. ఈ పుంజు పిల్లగా ఉన్నప్పుడు దానిని ఓ కుక్క నోట కరుచుకుని తీసుకెళుతుండగా... అమృతమ్మ ఆ కుక్కను తరిమేసి కోడిపిల్లను రక్షించింది. చావు బతుకుల్లో ఉన్న ఆ కోడిపిల్లకు చికిత్స చేయించి చక్కగా పెంచి రాజు అని పేరు కూడా పెట్టింది. అప్పటి నుంచి అమృతమ్మకు ఈ కోడి పుంజుతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఒంటరిగా ఉంటున్న అమృతమ్మకు ఈ కోడి పుంజు రక్షణ కల్పిస్తోంది. తన యజమానురాలి అనుమతి లేకుండా ఇంటి వస్తే మీద పడి పొడుస్తుంది. అమృతమ్మ ఆజ్ఞలను అక్షరాలా అనుసరిస్తుంది. ఇంటికి వచ్చినవారిపై ఆ పుంజు దాడి చేసినప్పుడు వద్దని అమృతమ్మ చెబితే చాలు వెంటనే ఆగిపోతుంది. జంతువులు, పక్షులను అందరూ చాలా చిన్నచూపు చూస్తారు. ఈ కోడిపుంజులాంటి చురుకైన పశుపక్ష్యాదులు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి.