Monday, January 26, 2009

పెళ్ళా... తమ్ముడా...

చివరికి తమ్ముడే తన ప్రాణమంది లక్నో యువతి 21 సంవత్సరాల దివ్య. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బాద్ షా నగర్‌కు చెందిన సుభాష్ కుమార్తె దివ్యకు పెళ్ళీడు రావడంతో పెద్దలు మంచి సంబంధం కుదిర్చారు. డిసెంబర్ 6, 2008న పెళ్ళి జరగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆమె తమ్ముడు అపూర్వ మూత్రపిండాల సమస్యతో అనారోగ్యం పాలయ్యాడు. దాత ఎవరైనా మూత్రపిండం ఇస్తే తప్ప అతను బతకడని అక్కడి "సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" వైద్యులు తేల్చి చెప్పారు. తోడబుట్టినవాడి పరిస్థితిని అర్థం చేసుకున్న దివ్య తన మూత్రపిండం తమ్ముడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలా చేస్తే పెళ్ళి మానుకుంటామని మగపెళ్ళివారు హెచ్చరించారు. ఆ పెళ్ళి కోడుకుతో "వెళ్ళవయ్యా వెళ్ళు" అని కరాఖండిగా చెప్పి తన తమ్ముడికే అండగా ఉండాలన్న దృఢ నిశ్చయానికి వచ్చింది. నిజంగా ఆమెది "దివ్య"మైన మనసు కదూ...

Friday, January 23, 2009

నాకు పింఛనొద్దు మొర్రో...

అధికారిక దాఖలాల ప్రకారం ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సాలిజంగ గ్రామానికి చెందిన బంధుదాస్ వయసు 100 ఏళ్ళు దాటింది. బంధుదాస్ పేదవాడైనా అందరికీ ఆత్మబంధువులా మెలుగుతూ తన పనులు తానే చేసుకుంటాడు. ఆ మధ్య కొందరు ప్రభుత్వాధికారులు ఈయన దగ్గరికొచ్చి "అన్నట్టు మీకింకా పింఛన్ అందడంలేదని తెలిసిందండీ... ఇప్పించాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన బంధుదాస్ "పనులు చేసుకోలేనివాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళకు ప్రభుత్వం సాయం చెయ్యాలి గానీ కాళ్ళూ చేతులు ఆడుతున్నవాళ్ళకు కాదురా బాబు. పింఛనిచ్చి నన్ను ముసలోణ్ణి చెయ్యొద్దు. నాకు పింఛనొద్దు మొర్రో..." అని వాళ్ళను వచ్చినదారినే పంపించేశాడు.

బంధుదాస్ దినచర్యను పరిశీలిస్తే... ఉదయమే 5 గంటలకల్లా లేస్తాడు. కొద్దిగా పాలు, మరమరాలు అల్పాహారంగా తీసుకుని తన ఆవులకు గ్రాసం కోసం తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకెళతాడు. తన కోసం ఓ నాలుగు తమలపాకులు తెచ్చుకుంటాడు. పశువులకు తన చేత్తో స్వయంగా తినిపిస్తాడు. అప్పుడప్పుడూ పొలంపనుల్లో ఓ చెయ్యి వేస్తాడని గ్రామస్తులు చెప్పారు.

గ్రామ కార్యక్రమాల్లో పాల్గొని జానపద గీతాలు ఆలపించే బంధుదాస్‌ను రోగాలేవీ సమీపించడం తాము చూడలేదని, ఇప్పటికీ ఆయన వద్ద కళ్ళజోడు లేదని కోడలు లత చెప్పింది. దాసు గారికి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కాగా, భార్య లబానీకి 90 ఏళ్ళు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె పక్షవాతంతో మంచం పట్టింది. తన ఆహారంలో భాగంగా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నెయ్యి తీసుకుంటానని దాస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బంధుదాస్ మార్గదర్శకునిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పొరుగున ఉన్న బలన్సా గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ సాహు అన్నారు.