Thursday, February 28, 2019

సైన్యం కోసం యాచకురాలి డబ్బులు...

రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరానికి చెందిన నందినీ శర్మ అనే యాచకురాలు అక్కడి బజరంగఢ్ అనే ప్రాంతంలో ఉన్న అంబే మాత అలయం వద్ద యాచిస్తూ జీవించేది. 6 నెలల కిందట అమె మరణించింది. ఆమె తన జీవితకాలంలో భిక్షాటన ద్వారా సేకరించిన 6.61 లక్షల రూపాయలను ఈ ఆలయ ట్రస్టీల చేతికి అప్పగించి ఏదైనా సత్కార్యానికి ఉపయోగించాల్సిందిగా కోరింది. నందినీ శర్మ కోరిక మేరకు పుల్వామా దాడిలో మరణించిన సైనికుల కుటుంబాల సహాయార్థం ట్రస్టీలు ఈ సొమ్మును జిల్లా కలెక్టర్ విశ్వమోహన్ శర్మ ద్వారా చెక్ రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. నందిని ప్రతి రోజూ భిక్షాటన ద్వారా ఆర్జించిన ధనాన్ని బ్యాంకులో దాచేవారు. తనకు ప్రభుత్వ గుర్తింపు ఏదీ లేకపోవడంతో ఆలయ ట్రస్టీల సూచన మేరకు ఒక మెడికల్ షాపు యజమాని అంకుర్ అగర్వాల్‌తో కలసి జాయింట్ అకౌంట్ తెరచి అందులో ఈ డబ్బు వేసేవారు. ఆ డబ్బే ఆమె చివరి కోరిక మేరకు సత్కార్యానికి ఉపయోగపడి ఆ యాచకురాలిని దాతృత్వమూర్తిగా చేసింది. ఆలయ ట్రస్టీల్లో ఒకరైన సందీప్ గౌర్ ఈ వివరాలందించారు.