Wednesday, February 28, 2018

రాజు కోడి అక్కడుంటే జాగ్రత్తగా వెళ్ళాలి మరి...

కోడి పేరెత్తగానే ఎప్పుడు కూరొండుకుని తినేద్దామా అనుకుంటారు చాలామంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌లో ఉన్న ఓ కోడిపుంజు ఇంటికి కాపలా కాస్తూ విశ్వాసాన్ని చూపిస్తోంది. మామూలుగా అయితే, మనుషులు దగ్గరకు రాగానే కోళ్లు పరుగులు తీస్తాయి. కానీ సుల్తానాబాదులోని అమృతమ్మ ఇంటి దగ్గర కొత్తవాళ్ళు కనిపిస్తే కోడి వెంటనే దాడి చేస్తుంది. వెంటపడి, తరిమికొడుతుంది. ఈ పుంజు పిల్లగా ఉన్నప్పుడు దానిని ఓ కుక్క నోట కరుచుకుని తీసుకెళుతుండగా... అమృతమ్మ ఆ కుక్కను తరిమేసి కోడిపిల్లను రక్షించింది. చావు బతుకుల్లో ఉన్న ఆ కోడిపిల్లకు చికిత్స చేయించి చక్కగా పెంచి రాజు అని పేరు కూడా పెట్టింది. అప్పటి నుంచి అమృతమ్మకు ఈ కోడి పుంజుతో విడదీయలేని బంధం ఏర్పడింది. ఒంటరిగా ఉంటున్న అమృతమ్మకు ఈ కోడి పుంజు రక్షణ కల్పిస్తోంది. తన యజమానురాలి అనుమతి లేకుండా ఇంటి వస్తే మీద పడి పొడుస్తుంది. అమృతమ్మ ఆజ్ఞలను అక్షరాలా అనుసరిస్తుంది. ఇంటికి వచ్చినవారిపై ఆ పుంజు దాడి చేసినప్పుడు వద్దని అమృతమ్మ చెబితే చాలు వెంటనే ఆగిపోతుంది. జంతువులు, పక్షులను అందరూ చాలా చిన్నచూపు చూస్తారు. ఈ కోడిపుంజులాంటి చురుకైన పశుపక్ష్యాదులు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి.