Friday, December 31, 2021

అప్పుల్లో కూరుకున్న కుటుంబాన్ని ఆదుకున్న ఎన్నారై...


కుమార్తె పెళ్లి కోసం కేరళలోని కొచ్చి పరిధిలో ఉన్న కంజిరమట్టొంకు చెందిన అమీనా అనే మహిళ కీచేరి సర్వీస్ కోపరేటివ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది. ఈ పెళ్లి కోసం వారి భూమి, ఇల్లు తాకట్టు పెట్టారు. కానీ, సమయానికి అప్పు తీర్చలేకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. దాచుకున్న సొమ్ము కాస్తా ఆమె భర్త సయ్యద్ మహ్మద్ క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చయిపోయింది. 


తమ ఇల్లు, భూమి దక్కవనే బాధతో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న సమయంలో తమకు దగ్గర్లో ఉన్న పనంగాడు అనే చోటుకు లులు గ్రూప్ కంపెనీకి చెందిన యూసఫ్ అలీ అనే ఎన్నారై వచ్చినట్టు తెలుసుకుని తన గోడు వెళ్లబోసుకుంది.


అమీనా కష్టం తెలుసుకున్న యూసఫ్ తమ ఉద్యోగుల్ని పంపి ఆమె అప్పు తీర్చేసి, జరిమానా కూడా కట్టి, ఆమె భర్తకు చికిత్స కోసం అదనంగా డబ్బులిచ్చి ఆదుకున్నాడు.



ఇలాంటి కష్టాల్లో ఎందరో ఇప్పటికీ ఉన్నారు. డబ్బున్నోళ్లు కాస్త కనికరిస్తే ఆ కష్టాల నుంచి ఎందరో బయటపడతారు.