Saturday, January 22, 2011

దాసరి భూమయ్య... మామూలు SI కాదు

ఒకప్పుడు రాజులు, మంత్రులు మారు వేషాల్లో రాజ్య సంచారం చేసి ప్రజా సంక్షేమం గురించి తెలుసుకునేవారట. ఎక్కడైనా లోపాలు, నేరాలు వారి దృష్టికి వస్తే పరిస్థితిని చక్కదిద్ది సమాజాన్ని గాడిలో పెట్టేవారట. ఇలాంటి వాటి గురించి మనం కథల్లోనే తెలుసుకున్నాం గానీ... నేటి కాలంలోనూ అలాంటివారున్నారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరులో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి భూమయ్యగారే ఆ వ్యక్తి. ఈయన్ని నేరుగా కలుసుకోవాలంటే కాస్త కష్టం కావచ్చు. ఎందుకంటే నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాపెట్టి, వారిని కటకటాల వెనక్కి నెట్టే క్రమంలో భూమయ్యగారు ఆటో డ్రైవర్‌గా, సైకిల్ మీద సామాన్లు అమ్ముకునే వ్యక్తిగా లేదా మరో రూపంలోనో తిరుగుతూ ఉంటారు.

భూమయ్యగారి విజయాల్ని గమనిస్తే... ఎన్నోమార్లు సాధారణ ప్రయాణీకుడిలా ఆటోల్లో ప్రయాణించి, పరిమితికి మించిన ప్రయాణీకులతో ప్రమాదకరంగా బండి నడుపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడే ఆటో డ్రైవర్ల భరతం పట్టారు. పత్తి విత్తనాలు కొంటానంటూ ఒక చోటికెళ్ళి నకిలీ విత్తనాలు అంటగట్టే వ్యాపారులను కోర్టు మెట్లెక్కించారు.

భూమయ్యగారు 2006లో బసంత్‌నగర్‌లో ఎస్ఐగా పనిచేసేటప్పుడు ఒక భూస్వామికి చెందిన భూమిలో కొందరు ఎర్ర జెండాలు పాతిపెట్టారు. ప్రభుత్వం సాయంతో వాటిని పీకించడమేగాక, ఆ భూస్వామిని ఒప్పించి కామన్‌పూర్, మంథని మార్గంలోని 80 శాతం మంది పేదలకు అధికారికంగా పంపిణీ చేయించారు. జీవితంలో ఒక కొత్తకోణాన్ని చూచిన ఆ పేదలంతా ఒక కాలనీ కట్టుకుని దానికి "దాసరి భూమయ్య కాలని" అని పేరు పెట్టుకున్నారు. అక్కడ భూమయ్యగారి ఛాయాచిత్రం కూడా కనిపిస్తుంది.

Thursday, December 23, 2010

బాజా మోత... లక్షల దాత...

మీరెప్పుడైనా అమృత్‌సర్ వెళ్ళి ఉంటే... మునాడీవాలా (బాజా మోగించే వ్యక్తి)  ఉరఫ్ రామ్ లాల్ భల్లా గురించి చిల్లర దుకాణాలవారు, రిక్షావాలాల్ని అడిగి చూడండి. మెడలో బాజా మోగిస్తూ వీధుల వెంట ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి స్వచ్ఛంద దాతలందరి నుంచీ విరాళాలు సేకరించి దాదాపు 20 లక్షల వరకూ (ఇంకా ఎక్కువ కావచ్చు...) దానం చేశారు. ఎవరికి దానం చేశారండీ అంటే... ఉగ్రవాద బాధితులు, అనాధలు, 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల బాధితులు ఇలా ఎవరున్నా వారందరికీ అందేలా చందాలు పోగేశారు. అమరుల కుటుంబాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో సమాచార్ గ్రూపు వార్తాపత్రికల సంస్థ ఏర్పాటు చేసిన "షహీద్ పరివార్ నిధి"కి మన మునాడీవాలాగారు ఒక్కరే 1996 నాటికి 12 లక్షలిచ్చారు. ఆ నిధికి అంత మొత్తం ఇచ్చిన అతి పెద్ద దాత ఈయనే కావడం గమనార్హం. వీరి విరాళాల్లో కొంత మొత్తం ముంబై పేలుళ్ళ బాధితులకు, ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకూ అందింది.

1947లో జరిగిన దేశ విభజన కాలంలో లాహోర్ నుంచి అమృత్‌సర్‌కు వలస వచ్చిన రామ్ లాల్ భల్లా స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. నెల నెలా తనకు లభించే సమరయోధుల పింఛన్ మొత్తంలో కొంత భాగాన్ని కూడా తన విరాళాలకు జత చేసేవారు. తలపై అమృత్‌సర్ సంప్రదాయ టోపీ పెట్టుకుని, భుజానికి సంచీ, మెడలో బాజా తగిలించుకుని దానిని మోగిస్తూ అమృత్‌సర్ వీధుల్లో "వినండి స్నేహితులారా... వితంతువులు, అనాధలకోసం రామ్ లాల్ భల్లా లాహోర్‌వాలా మిమ్మల్ని చందాలు అడుగుతున్నాడు" అని నినదిస్తూ ముందుకు సాగిపోయేవారు. ఆయన గొంతు వినగానే ఆ వీధులగుండా వెళ్ళేవారు, దుకాణదార్లు, రిక్షావాలాలు సైతం స్పందించి ఎంతో కొంత మొత్తం భల్లాగారి సంచీలో వేస్తుండేవారు. 1986 నుంచి భల్లాగారు ఈ ఉద్యమాన్ని చేపట్టగా తనకు 105 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ సేవ కొనసాగించారు. ఈయన చందాలు ఎన్నెన్నో జీవితాల్లో కొత్తకోణాల్ని పూయించాయి.

Sunday, December 12, 2010

వృద్ధులు పాటించారు... డాక్టర్ అనుసరించారు

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన వృద్ధ దంపతులు ఎస్ ఎస్ పళనియప్పన్ (80), మీనమ్మాళ్ (74) ఒక రోజున తిరునెల్వేలి వైద్య కళాశాల ఆసుపత్రికి వచ్చారు.  మరణానంతరం అవయువదానంగా తమ దేహాల్ని ఈ ఆసుపత్రి వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సమర్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాల్ని ఆసుపత్రి డీన్‌కు అందజేశారు.

పళనియప్పన్ గతంలో శంకరన్ కోవిల్ గ్రామంలో మెడికల్ స్టోర్ ఆపీసర్‌గా పనిచేసేవారు. మరణానంతరం వైద్య పరిశోధనల కోసం తమ దేహాల్ని దానంగా ఇవ్వాలని 40 ఏళ్ళ కిందటే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యునిగానూ ఉన్నారు. అవయువదాన ప్రాధాన్యత గురించి తన భార్యతో చర్చించినప్పుడు ఆమెకూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకుందని పళనియప్పన్ తెలిపారు. వీరి అభిమతాన్ని కుటుంబ సభ్యులంతా ఏ మాత్రం ప్రశ్నించక గౌరవించారట. ప్రచారం కోసం కాకుండా... అవయువదానం దిశగా మరిందరిని ప్రోత్సహించాలన్న ఆశయంతో తాము ఈ పని చేశామని వివరించారు.

ఇక పళనియప్పన్, మీనమ్మాళ్ దంపతుల ఔదార్యంతో చలించిపోయిన ఆసుపత్రి డీన్ ఎస్ రామగురు సైతం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని తాను కూడా వారితోబాటే తమ ఆసుపత్రికి తన దేహాన్నీ మరణానంతరం అప్పగించేలా పత్రాలు సమర్పించేశారు. మరణించిన వ్యక్తుల నేత్రాలు, మూత్రపిండాలు, కాలేయం లాంటి అవయువాలు మరెందరికో జీవితాన్నిస్తాయని, సమాజంలో అవగాహన లేకపోవడంతో ఎందరో రోగులు వేదన చెందుతుండటం గురించి తనకు తెలుసని పేర్కొంటూ రామగురు ఆ వృద్ధుల్ని అనుసరించారు.

Monday, November 29, 2010

వైద్యం చేసి పాలబాకీ తీర్చిన డాక్టర్...

అమెరికాలోని ఉత్తర పెన్సిల్వేనియాలో ఓ రోజు ఓ పేదపిల్లవాడు ఇంటింటికి వెళ్ళి సామాను అమ్ముతున్నాడు.  అలా అమ్మితే అతనికి వచ్చే కమీషన్‌తో స్కూలు ఫీజు కట్టుకోవాలి. అతను ఇంట్లోంచి బయలుదేరి చాలాసేపవడమే కాక చాలా దూరం వచ్చేశాడు. అతనికి బాగా ఆకలిగా వుంది. జేబులో చూసుకుంటే అయిదు పెన్నీల నాణెం మాత్రమే వుంది.

తనకి ఆకలిగా వుందని, తినడానికి ఏదైనా పెట్టమని అడుగుదామనుకుని ఆ కుర్రాడు ఓ ఇంటి తలుపు తట్టాడు. ఓ యువతి తలుపు తీసి అతని వంక ఏం కావాలన్నట్టుగా చూసింది.  భోజనం అడగడానికి సిగ్గుపడడంతో ఆ పిల్లవాడు తనకి దాహంగా వుందని కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.

ఆ యువతి అతన్ని లోపలికి ఆహ్వానించి ఓ గ్లాసు నిండా చిక్కని పాలు ఇచ్చి తాగమని నవ్వుతూ చెప్పింది.

పాలు మొత్తం తాగాక ఆ కుర్రాడు అడిగాడు.  ఈ పాలకి నేను మీకు ఎంతివ్వాలి?...

నీకు బాగా ఆకలిగా వుందని నాకు తెలుసు కాబట్టి నువ్వడగకపోయినా నా అంతట నేనే నీకు పాలు ఇచ్చాను.  కనుక ఏం ఇవ్వక్కర్లేదు.. చిరునవ్వుతో చెప్పిందా యువతి.

ఏదీ ఉచితంగా తీసుకోవద్దని మా అమ్మ నాకు చెప్పింది. అందుకని మీకు నేను నా హృదయంలోంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.. అని చెప్పి ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువతికి జబ్బు చేసింది. ఆ గ్రామంలోని డాక్టర్లకి ఆమె రోగం గురించి అర్ధం కాకపోవడంతో దగ్గరే వున్న ఓ పట్టణంలోని హాస్పటల్‌కి ఆమెని పంపిచారు. ఆ హాస్పటల్లో పనిచేసే డాక్టర్ హావార్డ్ కెల్లీ అనే డాక్టర్‌కి ఆమె కేస్ అప్పగించారు. కేస్ షీట్ అందుకున్న ఆ డాక్టర్‌కి ఆమె స్వగ్రామం పేరు చూడగానే ఆసక్తి కలిగింది. వెంటనే వార్డులోకి వెళ్ళి రోగిని చూశాడు. వెంటనే గుర్తుపట్టాడు.  తను చిన్నపిల్లవాడుగా వుండగా ఆకలిగొన్న ఓ మధ్యాహ్నం తనకి పాలు ఇచ్చి కడుపునింపిన యువతే ఆవిడ.

ఆ రోజునుంచి కెల్లీ ఆవిడకి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశారు.  కొద్ది రోజుల్లోనే ఆవిడ జబ్బు నయం అయి హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయింది. డాక్టర్ హావార్డ్ కెల్లీ కోరిక ప్రకారం అకౌంట్సు విభాగం వాళ్ళు ఆవిడ మెడికల్ బిల్‌ని ముందుగా ఆయన దగ్గరికి పంపారు. తర్వాత ఆవిడకి పంపారు.

ఎంత బిల్లు చెల్లించాలో అనే భయంతో ఆవిడ దానివంక చూసింది.  బిల్లు మీద పెద్దక్షరాల్లో రాసిన పదాలు, కింద సంతకం చూసిందావిడ.

పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఒన్ గ్లాస్ ఆఫ్ మిల్క్... అన్న వాక్యాల కింద డాక్టర్ హావార్డ్ సంతకం వుంది.

అమెరికాలో సుప్రసిద్ధ వైద్యుడైన డాక్టర్ హావార్డ్ కెల్లీ (1858 - 1943) వైద్య ప్రపంచానికే ఆదర్శప్రాయుడు.

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు

Tuesday, October 26, 2010

అంకవికలుడు... పేదల కంటి జోడు

విజయవాడలోని అరుండేల్ పేటలో ఆప్టికల్ షాపు నడిపే 50 ఏళ్ళ మహ్మద్ అయూబ్ ఖాన్ అంటే పేదలపాలిటి కంటి చూపుగా మెలగుతూ సేవలందిస్తున్నారు. తన 12వ ఏట బడికి వెళుతున్నప్పుడు జరిగిన ప్రమాదంలో కుడికాలు పోగొట్టుకున్న ఈయన జైపూర్ కాలుతో నడుస్తున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తన వద్ద 2,000 రూపాయలు ఉండి ఉంటే ఆ కాలు పోకుండా రక్షించుకునేవాడినని అంటుంటారాయన. అప్పట్లో ఆయనకు డబ్బులేనందువల్ల చికిత్స పొందలేక కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనే ఈయన జీవితాన్ని మలుపుతిప్పింది. తర్వాతికాలంలో జీవితంలో స్థిరపడి ఆప్టికల్ షాపు పెట్టుకున్నారు. తాను సైతం ఇతరులకు చేయూతనివ్వగలనన్న విశ్వాసం చేకూరాక నేత్ర సమస్యలతో బాధపడే పేదలకు అండగా ఉంటూ వస్తున్నారు అయూబ్. ఈయన సేవలు ఏమిటంటే....

కంటి సమస్యలున్న పేదవారి నుంచి ఎలాంటి రుసుమూ తీసుకోకుండా ఆయూబ్ పరీక్షలు చేయిస్తారు. వారికి ఉచితంగా కంటి అద్దాలు సమకూర్చుతారు. తన వద్దకు వచ్చినవారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఫ్రేమ్‌కు మాత్రం డబ్బు తీసుకుంటారు. వారు ఇవ్వలేకుంటే అదీ పుచ్చుకోరు. అయూబ్ సేవలకు ఆయన కుమారులు చేయూతనిస్తుంటారు. ఈ ఉచిత కంటి పరీక్షలు, కళ్ళద్దాల పంపిణీ గురించి నగరంలోని ముఖ్య కూడళ్ళలో ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతుంటారు.

ప్రస్తుతం ఎందరో నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, ముఖ్యంగా వృద్ధులైన పేదవారి కళ్ళద్దాలు విరిగిపోయి ఉన్నప్పటికీ (ఏనాడో కొనుక్కున్నవి) డబ్బులేక వాటినే వాడుకుంటూ ఉంటారని, వాటికి పవర్ కూడా ఉండదని నేటి పరిస్థితిని అయూబ్ వివరించారు.

Tuesday, October 19, 2010

జ్ఞాననేత్రుని కలం నుంచి భీమాయణం

మధ్యప్రదేశ్‌కు చెందిన వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయులైన ప్రభాకర్ జోషి వయసు 84 ఏళ్ళు. గ్లకోమా వ్యాధికారణంగా అంధత్వానికి గురైన జ్ఞాన నేత్రుడు. అయినప్పటికీ సుమారు తన 78 ఏళ్ళ వయసులో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించారు. అదేమిటంటే... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను సంస్కృతంలో రచించడం. 2004లో ఈ బృహత్కార్యాన్ని చేపట్టిన జోషీ మొత్తం 1,577 సంస్కృత శ్లోకాలతో 2010లో "భీమాయణం" పేరిట మన రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను పూర్తి చేశారు.

ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... డాక్టర్ అంబేద్కర్‌కు సంస్కృతం నేర్పించాలని ఆయన తండ్రి రాంజీకి ఎంతో కోరికగా ఉండేదట. అయితే, ఒకప్పుడు దళితులకు దూరంగా ఉన్న సంస్కృత భాషలో నేడు అంబేద్కర్ చరిత్ర వెలువడటం నిజంగా విశేషమే. ప్రతిష్ఠాత్మక "మహాకవి కాళిదాస్" అవార్డు గ్రహీత అయిన జోషీకి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. అంబేద్కర్ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుసుకున్న కొన్ని వాస్తవాల నుంచి జోషీ గారూ స్ఫూర్తి పొంది "భీమాయణం" రచనకు శ్రీకారం చుట్టారు.

Wednesday, September 29, 2010

జీవితాల్ని అల్లే వాసుదేవన్...

తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కాంచీపురానికి సమీపాన కోటైకాల్ వాసి వాసుదేవన్ (45). ఈయనకు నాలుగున్నరేళ్ళ వయసున్నప్పుడు మశూచి వ్యాధి సోకి కళ్ళుపోయాయి. అదీగాక పిన్న వయసులోనే అమ్మానాన్నలు మరణించారు. ఇక మిగిలిన ఏకైక తోడు తన చెల్లెలే. ఒక పక్క అంధత్వం, మరోపక్క పేదరికం, ఆ పైన చెల్లెలి పోషణ భారం. ఎలాగో శ్రమకోర్చి చెన్నై పూందమల్లి అంధుల పాఠశాలలో 10 తరగతి చదువుకున్నారు. పూర్తిగా కష్టాలు అల్లుకున్న తమ అన్నాచెల్లెళ్ళ జీవితాల్ని గడిపేందుకు వైరు కుర్చీల అల్లిక పని నేర్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి కష్టాలు ఉన్నవారి జీవితాల్లో కనిపించే ఉమ్మడి దృశ్యం ఇదే. కానీ వాసుదేవన్ అక్కడితో ఆగిపోలేదు. తనకు ఈ మాత్రం జీవితాన్నిచ్చిన సమాజం కోసం తనవంతు ఏమైనా చెయ్యాలని సంకల్పించారు. దాంతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అక్షరాస్యత ఆవశ్యకతను తెలియజెప్పడం మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్నప్పుడు సమీప గ్రామాల్లో తిరుగుతూ చదువుకోవాల్సిన అవసరం గురించి స్థానికులకు బోధిస్తుంటారు. పల్లె ప్రజలు వారి పిల్లల్ని చిన్నతనంలోనే పనులకు పంపిస్తుండటం వల్ల గ్రామీణ బాలలు చదువుకు, బాల్యానికి దూరమై జీవితాల్ని చిదిమేసుకోవడం వాసుదేవన్‌ను కలచివేసింది. అందుకనే వాళ్ళ జీవితాల్ని కూడా అల్లే పనిలో పడ్డారు. వాసుదేవన్ వల్ల ఎందరో బాలల జీవితాల్లో కొత్త కోణాలు ఉదయించాయి.

Friday, August 27, 2010

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్

అతను టీ పోస్తాడు. రక్తం ధారపోస్తాడు. ఎలాగో తెలుసుకోండి...

ఒరిస్సా... కటక్ నగరం... బక్సీ బజార్. తెలతెలవారింది. అక్కడే ఉన్న ప్రకాశరావు టీ కొట్టు జనంతో కళకళలాడుతోంది. ఈ ఊళ్ళో మసాలా టీ అంటే ఎవరైనా ప్రకాశరావు కొట్టుకే రావాలి. సలసల కాగే టీ గ్లాసులు పట్టుకున్న జనంతో దుకాణం కళకళలాడుతున్నా... కాసులతో గల్లాపెట్టె గలగలమంటున్నా ఆ యజమానికింకా సంతృప్తి కలగలేదు. అంతలో ఒక ఫోనొచ్చింది. లుకేమియాతో బాధపడుతున్న ఏడేళ్ళ అబ్బాయికి రక్తం వెంటనే కావాలని దాని సారాంశం. "ఇదీ అసలైన పని" అంటూ రంగంలోకి దిగారు ప్రకాశరావు.

ప్రకాశరావుగారు తన ఫోనందుకుని మరో ఇద్దరికి ఫోన్ కొట్టారు. 15 నిమిషాల్లో ఇద్దరు కుర్రాళ్ళు అతని దగ్గరికొచ్చి అడ్రెస్ తీసుకుని రక్తం ఇవ్వడం కోసం రక్తనిధి (బ్లడ్ బ్యాంక్) కి వెళ్ళిపోయారు. ఆ కుర్రాళ్ళు ఎవరంటే... ప్రకాశరావు ఏర్పాటు చేసిన రక్తదాతల బృంద సభ్యులు. వీరిలో రకరకాల బ్లడ్ గ్రూపులున్న వ్యక్తులున్నారు. ప్రకాశరావు పిలుపు అందుకుని స్వచ్ఛందంగా ఈ బృందంలో చేరారు.

కటక్‌లోని ఎస్ సి బి వైద్యకళాశాల - ఆసుపత్రి (ఒరిస్సాలోని అతిపెద్ద వైద్య సంస్థ)కి వాళ్ళ వైద్యులకంటే ప్రకాశరావు చాలా ముఖ్యమైన వ్యక్తి. కనీసం ప్రతి 10 రోజులకొకమారు తన బృంద సభ్యుల ద్వారా రక్తమిప్పిస్తూ లెక్కకు మిక్కిలిగా రక్తం ధారపోసి వైద్యులకు, రోగులకు కావలసిన మనిషయ్యారు. తాను మాత్రమేగాక మరెందరినో రక్తదానం దిశగా ప్రేరేపించి, రకరకాల బ్లడ్ గ్రూపులున్న దాతల వివరాల్ని సేకరించి సేవ చేస్తున్న ప్రకాశరావును ఒక సంస్థగా చెప్పుకోవచ్చు.

అసలు ఇది ఎలా మొదలైందంటే... 1978లో ఒకసారి ప్రకాశరావు వెన్నెముకలో కణితి ఏర్పడినప్పుడు ఎస్ సి బి వైద్యకళాశాలలో చికిత్స పొందుతూ మూడు నెలలు అక్కడే ఉన్నారు. చికిత్సకు అవసరమైన రక్తం లేక చనిపోయేవారిని కళ్ళారా చూస్తూ... వారి బాధను తన బాధలా అనుభవించి ఇక తానుకూడా రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తర్వాత తాను కోలుకుని ఆ ఆసుపత్రి నుంచి బయటపడినప్పటికీ... రక్తదాతగా రోజూ అక్కడికెళ్ళి రోగులపాలిట రక్తదాతగా, ప్రాణదాతగా మారారాయన.

రక్తదానమొక్కటే ప్రకాశరావు వ్యాపకం కాదు. మురికివాడల చిన్నారుల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేసి వారికి ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. టీ దుకాణం నుంచి ఆయనకు వచ్చే రోజువారీ ఆదాయం 500 రూపాయలు. అందులో 150 రూపాయలు ఈ పిల్లల చదువులు, అనాథలకోసం ఖర్చు చేస్తారు. ఈ సేవలో ప్రకాశరావు భార్యా పిల్లలు సైతం ఆయనకు చేదోడుగా ఉండటం తన జీవితంలోని మరో కొత్తకోణంగా ఆయన చెబుతారు.

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్ అంటే... ఇదీ.

Monday, August 23, 2010

టవర్స్‌కు అందని ప్రేమ... లెవిస్‌పోర్ట్ ఆతిథ్యం

అమెరికాలో ట్విన్ టవర్స్‌ను నేలకూల్చిన భయానక ఉగ్రవాదదాడి జరిగిన సెప్టెంబర్ 11 (9/11) వ తేదీని మానవాళి ఏనాడు మర్చిపోలేదు. అయితే ఇదే రోజున అమెరికాలోని కొన్ని వేలమందికి "ప్రేమ"ను పంచి ఇచ్చిన సంఘటన జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఆ రోజున ఈ ఘోరం జరిగిన సమయంలో విదేశాల నుంచి వచ్చే విమానాలు అమెరికాలో దిగడానికి అనుమతివ్వలేదు. అమెరికాలో తిరుగుతున్న చాలా విమానాల్ని మధ్యలోనే ఎక్కడికక్కడ సమీప విమానాశ్రయాల్లో అప్పటికప్పుడే ప్రభుత్వం దింపించేసింది. ఈ క్రమంలో న్యూ ఫౌండ్‌లేండ్ వద్ద జేండర్ అనే చిన్న ఊరికి సమీపాన గల విమానాశ్రయంలో సుమారు 55 విమానాలు దిగి అక్కడే ఆగిపోయాయి. వాటన్నిటిలో కలిపి 10,500 మంది ప్రయాణీకులున్నారు. వీరంతా ఉన్నట్టుండి దిగిన జేండర్ గ్రామ ప్రజల సంఖ్య 10,400. ఆ ఉరి ప్రజల సంఖ్యకు సమానంగా ఉన్న విమాన ప్రయాణీకులకు తగినన్ని హొటళ్ళు, సదుపాయాలు ఆ ఊరిలో అంతగా లేవు. దాంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొందరు ప్రయాణీకుల్ని అక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిస్‌పోర్ట్ అనే మరో ఊరికి పంపారు.

ఈ అతిథుల కోసం లెవిస్‌పోర్ట్ గ్రామస్తులు స్కూళ్ళకు సెలవులిచ్చి, కమ్యూనిటీ హాళ్ళలో బస ఏర్పాటు చేశారు. విమానప్రయాణీకులందరిని సౌకర్యంగా ఉంచేందుకుగాను మంచాలు, స్లీపింగ్ బ్యాగ్స్, దిళ్ళు, దుప్పట్లు అందించారు. ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే ముసలివారు, గర్భవతులు, రోగులకు ఆసుపత్రికి సమీపంలోను, ఆడవారికి తోడుగా ఆడవారే ఉండేలా, కుటుంబ సభ్యులంతా ఒకచోటే ఉండేలా బస ఏర్పాటు చేశారు. వీరికోసం రాత్రివేళల్లోనూ బేకరీలు, హోటళ్ళు తెరిపించారు. స్కూళ్ళలో ఉన్నవారికోసం లెవిస్‌పోర్ట్ ప్రజలు స్వయంగా వంట చేసిపెట్టారు. ఈ ప్రయాణీకులు అక్కడెన్నాళ్ళుంటారో తెలియదు. అయినా విసుగుచెందక వారికి కాలక్షేపం కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు ఎక్స్‌కర్షన్స్, పడవ ప్రయాణాలు ఏర్పాటు చేశారు.

అతిథులు లాండ్రి మేట్‌లకు వెళ్ళి దుస్తులు ఉతుక్కోవడానికి ఉచితంగా టోకెన్లు ఇచ్చారు. వీరికి ఇబ్బందులు కలుగకుండా స్కూల్ స్టూడెంట్స్‌ని స్వచ్ఛంద సేవకులుగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందీ లేకుండా అన్నిరకాలుగా సాయం చేసారు. ఒక రెండుమూడు రోజులు గడిచాక విమానాలు ఒకొక్కటిగా వెళుతున్నాయి. ఏ ఒక్కరూ ఫ్లయిట్ మిస్ కాకుండా అందర్నీ జాగ్రత్తగా విమానాలు ఎక్కించారు.

ఇలా వెళుతున్న విమానాల్లో ఫ్రాంక్‌ఫర్ట్ విమానం ఒకటి. ఇందులోని ప్రయాణీకులంతా కలసి తమకు ఆతిథ్యమిచ్చిన లెవిస్‌పోర్ట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే డెల్టా 15 (తమ విమానం నెంబర్) ట్రస్ట్ పేరిట ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. తాము బస చేసిన స్కూలు విద్యార్థులు కాలేజీలో చేరడానికి వీలుగా స్కాలర్‌షిప్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదన చేసిన ఒక ప్రయాణీకుని కంపెనీ మరి కొంత మొత్తం సాయం చేసింది. ఈ సంగతి తెలిసిన డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇంకొంత మొత్తం చేర్చింది. ఈ చక్కని ఆలోచన గురించి పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న మిగిలిన విమానాల్లోని ప్రయాణీకులు తమ వంతుగా డబ్బు పంపారు. దీంతో ఒక పెద్ద ఫండ్ ఏర్పడి లెవిస్‌పోర్ట్ విద్యార్థులకు సాయం అందుతోంది. నేటికీ ఆనాటి విమాన ప్రయాణీకులు వారి పుట్టినరోజు, పెళ్ళిరోజుల్లో ఈ ఫండ్‌కు డబ్బు పంపుతూ చేయూతనిస్తూ విద్యార్థుల జీవితాల్లో కొత్తకోణాల్ని పూయిస్తున్నారు. కూలిన ట్విన్ టవర్స్ కంటే ఎత్తయిన కట్టడాలు ప్రపంచంలో ఎన్నో ఉండవచ్చుగాక... వాటన్నిటికీ అంతనంత ఎత్తయింది తమ ప్రేమ అని ఇరువురూ చాటారు.

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.

Monday, July 26, 2010

మొక్కలు మొక్కే మనిషి

ఖమ్మం జిల్లావాసి దరిపల్లి రామయ్య ఎప్పుడు కనిపిస్తాడా.. ఆయనకు ఎప్పుడు మొక్కుదామా అని చెట్లన్నీ ఎదురు చూస్తున్నాయి. ఆయన్ని తమ కొమ్మలతో కావలించుకుని.. స్పృశించి తరించాలని తరులన్నీ ఆశపడుతుంటాయి. అయన తన తలకు "వృక్షో రక్షతి రక్షితః" అన్న నినాదం రాసి ఉన్న ఒక చక్రంలాంటి అట్టను తలకు ధరించి, మొక్కలతో సైకిల్ మీద ఊరూరూ తిరుగుతూ వాటిని పెంచమని అందరికీ పంచుతూ ఉంటాడు. మొక్కలు, చెట్లు... వాటి ఉపయోగాలపై చిన్నప్పుడెప్పుడో తన గురువుగారు చెప్పిన పాఠాన్ని గుర్తుంచుకుని ఈ సత్కార్యానికి పూనుకున్నారు రామయ్యగారు. మొక్కలు పంచడమేగాక వాటిని గురించి వనసూక్తులు, పాటలు రచించి గానం చేస్తుంటారు. తన జీవితకాలంలో కనీసం కోటి మొక్కలు నాటాలన్నది ఆయన లక్ష్యం. రామయ్యగారి కోరిక నెరవేరాలని మనమంతా కోటి దేవతల్ని వేడుకుందాం. ఇక రామయ్యగారి భార్యామణి (పేరు తెలియదు) కూలి పని చేసుకుంటూ తన భర్త ఉన్నతాశయానికి అండగా నిలుస్తున్నారు.

Monday, May 31, 2010

అంగదాతా జయీభవ

వికలాంగుడైన గూడూరి నలినేష్ బాబు (45) గుంటూరు జిల్లా మందడం గ్రామవాసి. తనకు పాదాలు లేకపోయినా... తనలా పాదాల్లేని వేలాదిమందికి కృత్రిమ పాదాలందించి పాదదాతగా వారి జీవితాల పాలిట ప్రాణదాత అయ్యారు. నలినేష్ బాబుకు 12 ఏళ్ళ వయసున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళూ పోయాయి. నలినేష్ తల్లిదండ్రులు ఆయనకు కృత్రిమ పాదాలు అమర్చడం కోసం ఏటా జైపూర్ తీసుకెళ్ళి 7,000 రూపాయలకు పైగా ఖర్చుపెట్టేవారు.

తర్వాత వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. అక్కడే సిద్ధార్థ కాలేజీలో బీకాం పూర్తి చేసుకున్న నలినేష్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే... ఏటా జైపూర్ వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు తనే స్వయంగా కృత్రిమ పాదాల్ని తయారు చేసుకోవడం. వెంటనే జైపూర్ వెళ్ళి కృత్రిమ పాదాల తయారీలో 6 నెలలు శిక్షణ పొందారు.

అనంతరం భారత్ వికాస్ పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన నలినేష్ అక్కడ 'కృత్రిమ పాదాల పరిశోధన - అభివృద్ధి' విభాగంలో 15 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడాయన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో మంగళం గ్రామంలో ఉన్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇంతవరకూ నలినేష్ సుమారు 17,000కు పైగా కృత్రిమ పాదాల్ని తయారు చేయగా వాటిని భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే విధమైన సేవ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా జరిగింది. వికలాంగుల సౌకర్యం కోసం ఈ కృత్రిమ పాదాలకు ఇంటర్ లాక్ సిస్టంను పరిచయం చేసిన ఘనత ఈయనదే. అన్నట్టు... నలినేష్ కృత్రిమ పాదాలతో నడుస్తున్నవారిలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు.

అంగవికలురకు చేస్తున్న సేవలకుగాను నలినేష్‌ను రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో వరించాయి. కృత్రిమ పాదాలతో ఎందరినో నడిపిస్తూ వారి జీవితాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న అంగదాతా జయీభవ... సుఖీభవ....

Friday, April 30, 2010

నరికినందుకు నాటే శిక్ష

సుందర్ వాసుదేవ అనే పెద్ద మనిషి తన చిన్న మనసుతో 2003లో తాజ్‌పూర్ అనే గ్రామంలో 42 పీపల్ చెట్లను నేలకూల్చాడు. ఆయన ఢిల్లీ నగర వాసి. వాసుదేవ చేసిన తప్పును తీవ్రంగా పరిగణించి ఆయనపై "వృక్ష పరిరక్షణ చట్టం" కింద కేసు పెట్టారు. మామూలుగా అయితే ఆయన చేసిన తప్పుకుగాను ఆ చట్టం నిబంధనల మేరకు జరిమానా విధిస్తారు. అయితే ఢిల్లీలోని ఒక న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి దేవేందర్ కుమార్ భిన్నమైన శిక్షను విధించారు. అదేంటంటే... నరికిన ఒక్కో చెట్టుకూ పరిహారంగా ఐదేసి మొక్కల చొప్పున నాటాలి. అంటే వాసుదేవ మొత్తం 210 మొక్కలు నాటాలన్నది ఈ శిక్ష సారాంశం. అంతేగాక ఆయన ప్రవర్తనపై నిఘా ఉంటుందని, ఆరునెలల పాటు పరిశీలనలో ఉంటారని తెలియజేసి ప్రొబేషన్ మీద విడిచిపెట్టారు. ప్రాణవాయువునిచ్చి మానవాళి ప్రాణాలు కాపాడే వృక్ష దేవతల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ న్యాయమూర్తిగారు వనదేవతల జీవితాల్లో కొత్తకోణాలు పూయించిన పుణ్యమూర్తి.

Tuesday, March 30, 2010

కూలీల బండిలో అన్నమ్మూట

మీరెవరైనా కర్నూలు జిల్లాలో ఉన్న కృష్ణాపురం వెళితే అక్కడ ఓ పేద జంట కనిపిస్తుంది. వాళ్ళు బండి మీద రోజూ ఒక మూట పట్టుకెళుతుంటారు. ఎవరి కోసమో వెదుకుతుంటారు. అదేదో కూలిపని కోసం మోసుకెళ్ళే మూట అనుకుంటే మీరు పొరబడినట్లే... అదేమిటంటే... ఓ బండెడు అన్నం మూట. ఎవరికంటే, దారిలో ఏ జంతువు కనిపిస్తే దానికే. వీరు కొన్నేళ్ళుగా ఈ అన్నదాన యజ్ఞం చేస్తున్నారు. అన్నదాతా సుఖీభవ.

Saturday, February 27, 2010

కరెన్ చదువు మానలేదు...

ఇది చాలా రోజుల కిందటి సంగతి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్ అనే ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అక్కడి విద్యార్థులంతా తమ బడిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఒకటి అందమైన పూల మొక్కల్ని నాటడం. ఇందుకోసం నిధులు సేకరించాలని నిర్ణయించారు. పిల్లలంతా వారి వారి ఇళ్ళలో చేసుకున్న ఆహారపదార్ధాల్ని అమ్మి నాలుగు వందల డాలర్లను పోగేశారు. ఇక మొక్కలు నాటడానికి రంగం సిద్ధమైంది. ఒక తేదీ నిర్ణయించి, ఆ రోజున విద్యార్థులు, వారి అమ్మానాన్నలు రావాలని పాఠశాల యాజమాన్యం అందరికీ కబురంపింది. అయితే, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొని ఎక్కువ మొత్తం సంపాదించడంలో ముందున్న నాలుగో తరగతి బాలిక కరెన్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేమని తన స్నేహితులకు చెప్పింది. అసలు సంగతి ఏమిటంటే, పాపం ఆ అమ్మాయి తండ్రికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వలేకపోవడంతో యజమానులు ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. దాంతో వారు ఊరు చివర తక్కువ ధరకు మరో చిన్న ఇంటికి మారాలనుకుంటున్నట్లు అందరికీ తెలిసింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే చిన్నారి కరెన్ ఇక బడికి రాదని తెలిసింది. ఇది మరో షాక్...

కరెన్ తోటి బాలుడు క్రిస్ రంగంలోకి దిగాడు. మిగిలినవారందరితోనూ చర్చించాడు. బడిని అందంగా మార్చడానికి సేకరించిన డబ్బును కరెన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగించాలని ప్రతిపాదించాడు. ఈ సంగతి పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. సేకరించిన సొమ్ముకు మరో అంత మొత్తాన్ని కలిపి కరెన్ కుటుంబానికి చేయూతనివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వార్త స్థానిక మీడియాకు తెలిసింది. ఇది పత్రికల్లో రావడంతో ఆ ఊరిలోని ధనవంతులు కొందరు మరికొంత సొమ్ము చేర్చి ఈ కుటుంబానికి ఇచ్చారు. అంతేకాకుండా కరెన్ తండ్రికి మరో ఉద్యోగం ఇప్పించారు. దాంతో కరెన్ కుటుంబం ఇల్లు ఖాళీ చెయ్యాల్సిన అవసరం గానీ, ఆమె చదువు మానాల్సిన అవసరంగానీ రాలేదు. ఆ తర్వాత ఆ బడిపిల్లల అమ్మానాన్నలు మరి కొంత సొమ్ము పోగుచేసి పాఠశాలను ముందుగా అనుకున్న ప్రకారం మంచి మొక్కలు నాటి అందంగా తయారు చేశారు. చూశారా... పిల్లల ఆదర్శంతో ఒక జీవితంలో కొత్తకోణం ఆవిష్కృతమైంది....

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.

Tuesday, January 26, 2010

చూడలేని కామెంటేటర్...

జింబాబ్వేకు చెందిన డీన్ డు ప్లెసిస్‌కు ఒక తిరుగులేని సామర్థ్యముంది. అదేంటంటే... మ్యాచ్ చూడకుండానే కామెంట్రీ చెయ్యడం. కళ్లు లేకున్నా స్పందనలు, శబ్దాలను బట్టి క్రికెట్ పిచ్‌లో ఏం జరిగిందనేది పసిగట్టి కామెంట్రీ చేస్తాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు సేకరిస్తాను.

Monday, December 28, 2009

నెత్తురు ఉడుకుతోంది... మా రక్తం తీసుకోండి

అస్సాం రాష్ట్రానికి 2008వ సంవత్సరం ఒక పీడకలలాంటిది. వరుస బాంబు దాడులతో ఈ ఈశాన్యరాష్ట్రం అతలాకుతలమైంది. అలాంటి ఒక సందర్భంలో జరిగిన భయానక బాంబుదాడి పెద్దసంఖ్యలో జనాన్ని క్షతగాత్రుల్ని చేసింది. వారి ప్రాణం నిలపడానికి కావలసినంత రక్తం లేక ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. చూస్తూ చూస్తూ కళ్ళముందే ప్రాణాలు పోతుంటే తట్టుకోలేకపోయిన గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బందికి మనసు కకావికలమైంది పాపం. చివరికి మీడియా, ఎస్ఎంఎస్‌ల ద్వారా రక్తం కోసం వీలైనంతమందికి విజ్ఞప్తులు పంపారు. ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని, ఒక వేళ స్పందించినా వారిచ్చే రక్తం సరిపోతుందో లేదోనన్న ఆందోళన.

మరికాసేపటికి ఉరుకులు పరుగుల మీద వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. వారంతా బాంబు దాడి బాధితులేమోనని ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. వచ్చింది బాధితులు కాదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలవారు, వ్యాపారులు, వినోదరంగాలకు చెందినవారు ముందుకొచ్చి మేమంటే మేమంటూ రక్తమివ్వడానికి ఉత్సాహం చూపారు. బాంబు దాడులతో మా నెత్తురు ఉడికిపోతోంది... మారక్తం తీసుకుని మావాళ్ళను కాపాడండి అని వారంతా ముక్తకంఠంతో స్పందించారు.

ఆ రోజున వారిచ్చిన రక్తంతో ఎందరో బాధితులు బతికిబట్టకట్టారు. బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఇక రక్తం దాచే చోటు కూడా లేదు. దాంతో చాలామంది దాతల వివరాలు తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని బలవంతంగా తిప్పిపంపారు. ప్రజల స్పందనతో గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎం ఎం దేకా ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఐక్యత దేశమంతటా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. దాతల రక్తంతో పునర్జన్మ ఎత్తిన బాధితులు ఆ ప్రేమ దేవుళ్ళకు చేతులెత్తి మొక్కారు.

Wednesday, December 23, 2009

ఫోన్ చేస్తే రక్తమిస్తా....

మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ప్రశాంతినగర్ వాసి అయిన వరాల ప్రశాంత్ కుమార్ ఎప్పుడూ 'బీ పాజిటివే'. మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ 'సంచార రక్తనిధి'గా ప్రశంసలందుకున్నాడు. అంతేకాదు, ఫోన్ చేస్తే చాలు స్పందిస్తానంటూ తన ఫోన్ నెంబర్లు సైతం బహిరంగంగా ప్రకటించాడు (9397675737, 9949453585). రాత్రి, పగలన్న తేడా లేకుండా అత్యవసర సమయాల్లోను, రక్తం కావాలని వచ్చే టీవీ ప్రకటనలకు స్పందించి రక్తమిచ్చి ఎన్నో ప్రాణాల్ని నిలబెట్టాడు. లెక్కలేనన్నిమార్లు రక్తమివ్వడమేగాక, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాడీ నిజమైన దేశభక్తుడు. ఆర్తులపాలిటి వరాల మూట వరాల ప్రశాంత్ కుమార్.

Tuesday, December 22, 2009

అతను కూరొండుకోలేదు

చెన్నైలోని పులియంతోపు ప్రాంతంలో జూలై 25, 2006వ తేదీన జరిగిందీ ఘటన. ఉదయం 7.30 గంటల సమయంలో ఒక ఆటోడ్రైవర్ ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. అప్పుడు దారిలో పడి ఉన్న ఒక గుడ్లగూబ చుట్టూ కొన్ని కాకులు చేరి దాన్ని పొడుస్తుండటం ఈ ఆటోడ్రైవర్ కంటబడింది. ఒక్కసారిగా బండికి బ్రేక్ వేసి దాన్ని కాకుల బారినుంచి కాపాడి అక్కడికి సమీపాన ఉన్న అగ్నిమాపక దళం సిబ్బందికి విషయం చెప్పాడు. వారు వెంటనే ఆ గుడ్లగూబకు ప్రాథమిక చికిత్స చేసి బ్లూక్రాస్‌కు తరలించారు. అదే దారిలో వెళుతున్న చాలామంది వాహనదారులు వింతగా చూస్తున్నారే తప్ప ఒక్కరూ దానిని కాపాడే ప్రయత్నం చెయ్యలేదని ఆటో డ్రైవర్ ఆవేదన వెలిబుచ్చాడు. అదే మరొకరైతే ఈ గుడ్ల'గూబ గుయ్యిమని'పించి కూర వండేసుకుంటారు. ఒకప్పుడు మనకు రోజూ కనిపించే పిచ్చుకలతోబాటు పలురకాల పక్షి జాతులు నానాటికి అంతరించిపోతూ పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నప్పటికీ చదువుకున్నవారెందరో పట్టించుకోవడంలేదు. వారందరికీ ఆదర్శప్రాయుడీ ఆటో డ్రైవర్ (క్షమించండి, ఇతని పేరు తెలుసుకోలేకపోయాను).

Sunday, December 20, 2009

మూగజీవాల వృద్ధాశ్రమం

మనుషుల్లో మానవత్వం మృగ్యమై మృగాలవుతున్న ఈ రోజుల్లో చెన్నైకి చెందిన 45 ఏళ్ళ అశోక్ మాత్రం మూగజీవాల శోకాన్ని పోగొట్టేందుకు నడుం బిగించారు. 10 సంవత్సరాల కిందట చెన్నైలోని ఇంజంబాక్కంలో "బెంజీస్ డాగ్ అకాడెమీని" ప్రారంభించి తొలుత శునక (కుక్కలు) సంరక్షణ, తర్వాత మార్జాల (పిల్లులు) సంరక్షణ కూడా ఆయన చేపట్టారు. అమ్మానాన్నలు ముసలివారైతే ఎలా వదిలించుకోవాలా అని చూసే ఈ కాలం కుర్రకారు లాంటివారు కాదు అశోక్. ఈ మూగజీవాలకు వయసు మీరినా ఇబ్బందులు ఎదురుకాకుండా "మూగజీవాల వృద్ధాశ్రమం" కూడా ఏర్పాటు చేశారు. అవి తనువు చాలిస్తే వాటి అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా స్మశానవాటికను కూడా ఏర్పాటు చేశారాయన. ఈ మూగజీవాలకు అన్నంపెట్టి, వైద్యసేవలందించి ఆదరించడమేగాక వాటికి వివిధ అంశాల్లో తర్ఫీదునిప్పిస్తుంటారు. అందువల్ల అవి తెలుగు, తమిళ సినిమాల్లోను, వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తుంటాయి. అశోక్ జీవకారుణ్యం గురించిన స్థానికులు ఎప్పుడైనా బయటి ఊళ్ళకు వెళ్ళాల్సి వస్తే వారి జంతువుల్ని కొంతకాలం అశోక్ సంరక్షణలో ఉంచి వెళుతుంటారు. తన సేవలకు చెన్నైలో స్థలం చాలకపోవడంతో సమీపానగల ప్రముఖ పర్యాటకకేంద్రం మహాబలిపురంలో మరో విశ్రాంతి కేంద్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సేవలో ఆయన కుటుంబం తోడ్పాటు కూడా ఉంది.

అంధుని పంట పండింది

సకల అంగాలూ సక్రమంగానే పనిచేస్తున్నా కాలం కలసిరాలేదని కలత చెందే మందమతులకు అతను కనువిప్పు కల్గిస్తున్నాడు. నిరాశ, నిస్పృహలకు లోనైన వారికి ఈ అంధుని జీవితం ఒక గుణపాఠం. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం, చిగురుకోటకు చెందిన భట్రాజు చిననాగేశ్వరరావు కళ్ళముందు ఎప్పుడూ కారు చీకట్లే. ఒకరి తోడు లేకుండా తన జీవితం గడపలేని ప్రతికూల పరిస్థితుల్లో ఇతను వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. పుట్టుకతోనే కళ్ళులేని చిననాగేశ్వరరావు బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు. ఒకనాడు తన తండ్రితో బాటు పొలానికి వెళ్ళివస్తూ ఇతను కూడా సేద్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. కళ్ళు లేకున్నా కూలీలతో పనులు చేయిస్తూ దిగుబడుల్లో సాటి రైతులకంటే ముందున్నాడు. తనకు స్వంతంగా ఉన్న భూమితోపాటు ఇంకొంత భూమిని కౌలుకు సాగుచేసి మంచి 'ఫలసాయం' పొందాడు. ఒకప్పుడు చేపల చెరువుల నిర్వహణలో నష్టం రావడంతో తన భూములమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చినప్పటికీ దిగులుపడక మొక్కవోని దీక్షతో జీవితంలో ముందుగు సాగాడు చిననాగేశ్వరరావు.

Saturday, December 19, 2009

గొల్లనాగయ్య మూలికావైద్యం

మహబూబ్‌నగర్ జిల్లా చర్లపల్లికి చెందిన గొల్ల నాగయ్య కోసం ఆయన ఇంటివద్ద ప్రతిరోజూ వందల సంఖ్యలో జనం నిరీక్షిస్తుంటారు. మూలికావైద్యం, మేకపాలతో మందులివ్వడం ఈయన ప్రత్యేకత. ఏ మాత్రం డబ్బు ఆశించకుండా గత 30 ఏళ్ళ నుంచీ ఆయన ఈ సేవలందిస్తున్నారు. విశేషమేంటంటే... పెద్ద ఆసుపత్రుల్లో పనిచేసే నర్స్‌లు, ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఆయన వైద్య సేవలందుకుంటుంటారు. గొల్ల నాగయ్య కుమారులు కూడా తండ్రి బాటనే అనుసరిస్తూ రోగులకు స్వాంతన కల్గిస్తున్నారు. రోగుల సౌకర్యార్థం వారు తమ స్తోమత మేరకు ఒక రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసి ధన్వంతరి ఆశీస్సులు అందుకుంటున్నారు. గొల్ల నాగయ్య వైద్యం ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయించింది. అన్నట్టు మరిచిపోయా... ఈయన వైద్య సేవలు మూగజీవాలకు కూడా అందుతున్నాయ్.

వికలాంగుని చేపలవేట...

ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం సమీపానగల కె పల్లెపాలెం వాసి ఏసురత్నం. కాళ్ళులేని ఈ మత్స్యకారుడు తన ఇంట్లో పెద్దకొడుకు. ఈ వికలాంగుని చేపలవేటతోనే ఆ ఇంటికి పూటగడుస్తుంది. ముసలివారైన అమ్మానాన్నలు, అత్తింటివారి కట్నం వేధింపులతో తిరిగివచ్చిన సోదరి, మరో చెల్లెలు, ఒక తమ్ముణ్ణి ఇతను పోషిస్తున్నాడు. వీరుగాక మరో ఇద్దరు అక్కచెల్లెళ్ళకు తానే పెళ్ళిళ్ళు చేసి పంపాడు. కాళ్ళులేక తాను వికలాంగుడై ఉన్నప్పటికీ అతి కష్టం మీద తోటి జాలర్ల సాయంతో పడవ నడుపుకుంటూ చేపలకోసం నడి సముద్రంలోకి వెళ్ళోస్తాడితను. తీరనికష్టాలతో ఇతని కుటుంబమూ నడి సంద్రంలోనే ఉంది. అతని గుండె మాత్రం ఆత్మస్థైర్యపు అలలతో కదలాడుతూనే ఉంది. ప్రభుత్వ సాయం ఆశించక తన కుటుంబాన్ని తానే పోషించుకుంటున్న ఈ ఏసురత్నం... ఏ అమ్మానాన్నలకైనా నిజమైన పుత్రరత్నమే...

Friday, November 27, 2009

బ్యాంక్ మేనేజర్ జలయజ్ఞం

కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దేవరాజ్ అక్కడ మైసూర్ స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 30 నదుల అనుసంధానం, 50 వేలకు పైగా కుంటలకు జీవం పొయ్యడం లక్ష్యంగా కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకూ కొన్నేళ్ళ కిందట పాదయాత్ర చేపట్టారాయన. ఇందుకోసం తన ఉద్యోగానికి 9 నెలల పాటు సెలవు పెట్టి తన యాత్రలో భాగంగా 2006లో ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు. అప్పటికి ఆయన 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి నదులను అనుసంధానించాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈయన చేపట్టిన ఈ జలయజ్ఞం స్ఫూర్తిని రాజకీయ నాయకులు కూడా అందిపుచ్చుకోవాలి.

Thursday, November 26, 2009

సేవకుడు బాలసుబ్రహ్మణ్యన్

తమిళనాడులో దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మహామాఘం ఉత్సవం అంటే అందరికీ గుర్తుకొస్తారు 95 ఏళ్ల పైబడిన బాలసుబ్రహ్మణ్యన్. ఇంత పెద్దవయసులోనూ ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో సేవ చెయ్యడం కోసం పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవకులతో సన్నద్ధులవుతారు బాలసుబ్రహ్మణ్యన్. 1932 నుంచి ఈ సేవాయజ్ఞాన్ని తలపెట్టి 1944, 1956, 1968, 1980, 1992 సంవత్సరాల్లోనూ... తర్వాత 2004లో 95 ఏళ్ళ వయసులోనూ స్వచ్ఛంద సేవకుల బృందానికి నేతృత్వం వహించి తన బాధ్యతను నిర్వర్తించారాయన. స్కాట్స్ అండ్ గైడ్స్‌తో సుదీర్ఘకాల సాన్నిహిత్యం కలిగి ఉన్న బాలసుబ్రహ్మణ్యాన్ని తమిళనాడు ప్రభుత్వం నాగపట్టణం జిల్లాకు శాశ్వత కమిషనర్‌గా నియమించింది. న్యాయశాస్త్రపట్టభద్రుడైన ఈ సేవకుడు క్రైస్తవుల ఆరాధ్యదైవమైన వేలాంకన్నిమాత ఉత్సవానికి కూడా స్వచ్ఛంద సేవకులను తీసుకెళ్ళారు. అక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా, వినియోగదారుల మండలిలోను, ఉచిత న్యాయసహాయ సంఘంలోను సభ్యునిగా సేవలందించారు. నాగపట్టణం సెయింట్ జాన్స్ అంబులెన్స్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

Thursday, October 29, 2009

యమధర్మరాజా ఎంటర్‌ప్రైజెస్

పాన్ షాపులు, చిల్లర దుకాణాల్లో ఎక్కవగా అమ్ముడయ్యేవి బీడీలు, సిగరెట్లు, కిళ్ళీలు. చెన్నైలోని మందవెలి ప్రాంతంలో చిల్లర కొట్టు నడుపుకుంటున్న శివశంకర్ అనే దుకాణదారుడు ఇవేమీ అమ్మడు. కానీ ఆయన దుకాణం ముందు ఒక బోర్డ్ మాత్రం దర్శనమిస్తుంది. దానిపైన తమిళంలో రాసి ఉన్న ప్రకటనకు తెలుగు అనువాదం ఇది...

బంపర్ బహుమతులు

రోజూ క్రమం తప్పక బీడీలు, సిగరెట్లు తాగేవారికి మా యమధర్మరాజ ఎంటర్‌ప్రైజెస్ అందించే అద్భుతమైన బహుమతులు.

మొదటి బహుమతి - గుండె జబ్బు

రెండవ బహుమతి - పక్షవాతం

మూడవ బహుమతి - టీబీ

వారం వారం కానుక - ఆర్థిక సమస్యలు

శాశ్వత కానుక - మనోవేదన

బంపర్ బహుమతి - క్యాన్సర్...

ఇవి చాలా... ఇంకా కావాలా ?

కళాకారుడు... సేవాతత్పరుడు

అతను ఒక సాధారణ తోటమాని కొడుకు. పేరు ప్రభాకరన్ (25). తమిళనాడులోని తన స్వస్థలమైన ముత్తుక్కాడులో తన 12వ సంవత్సరం నుంచీ సంప్రదాయ కళలైన తప్పెట, సిలంబాట్టం (కర్రసాము), గరగాట్టం, ఒయిలాట్టం, దేవరాట్టం లాంటివి నేర్చుకుని అమెరికా, బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్స్, హాలెండ్ తదితర దేశాల్లో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. అతను కేవలం ప్రదర్శనలకే పరిమితం కాలేదు. ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బుతో వికలాంగులకు చేయూతనిస్తుంటాడు. తనను ఇంతవాడిని చేసిన సంప్రదాయ కళల పునరుద్ధరణకు తోడ్పడుతుంటాడు. కళాకారులు ఎలా జీవించాలో చెప్పే పాఠమై నిలిచాడు. రుద్రవీణ సినిమాలో చిరంజీవిలాగా...

Tuesday, September 29, 2009

కండ(డా)క్టర్

బస్సులో టిక్కెట్ల గురించేకాదు, ప్రయాణీకుల ఆరోగ్యపు ఇక్కట్ల గురించి కూడా తెలుసు ఆ కండక్టర్ గారికి. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు తన ప్రవృత్తిగా వనమూలిగా వైద్యాన్ని ఎంచుకున్నారు. పేదలకు ఉచితంగా వనమూలికా వైద్యం చేస్తుంటారు. తన ఇంటి పెరట్లోనే ఔషధ మొక్కలు పెంచుతూ చిన్నతనం నుంచే మూలికల పట్ల మంచి అవగాహన పెంచుకున్నారు. ఆది, మంగళవారాలు ఈయనకు సెలవుదినాలు కావడంతో తన భార్య తోడ్పాటుతో ఇంటివద్దే మందులు తయారు చేసి స్థానికులకు వైద్యపరమైన చేయూతనిస్తున్నారు.

బాలింతలారా మొక్కలతో రండి

పండంటి బిడ్డను ప్రసవించేందుకు ఆ ఆసుపత్రికి వెళ్ళే ఏ గర్భిణి అయినా ఒక మొక్కను చేతబట్టుకుని మాత్రమే ఆ మెట్లెక్కాలి. అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు రోగుల ఉల్లాసం లక్ష్యంగా ఆ ఆసుపత్రి వైద్యులు పెట్టిన నిబంధన అది. దీనిని కనులారా గాంచాలనుకుంటే తమిళనాడులోని మదురై జిల్లా రాజ్‌కూర్‌లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలి. ఇక్కడున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చే ప్రతి బాలింతా ఒక మొక్కను నాటాలని ఆసుపత్రి సిబ్బంది ఒక వినూత్న పథకం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఆసుపత్రికి "మొక్కల ఆసుపత్రి" అనే పేరు వచ్చేసింది. అంతేకాదు, ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించే ఈ ఆసుపత్రి వైద్యురాలి సెల్ నెంబర్ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు. అందువల్ల వారు ఎప్పుడైనా తమ ఆరోగ్య సమస్యలపై ఏ సమయంలోనైనా వైద్యురాలిని సంప్రదించవచ్చు. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి మారుపేరని తరచూ విమర్శలు వెల్లువెత్తే నేటి పరిస్థితుల మధ్య ఒక ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ప్రజల మేలు కోరి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

Friday, August 14, 2009

మిస్టర్, మీరు జీససా?

కొన్నేళ్ళ కిందట న్యూయార్క్‌లో జరిగిన ఒక రీజియనల్ సేల్స్ కన్వెన్షన్‌కి షికాగో నగరం నుంచి కొందరు సేల్స్‌మెన్ హాజరయ్యారు. అదయ్యాక తిరిగి షికాగోకి వెళ్ళడానికి వారంతా వేన్‌లో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ట్రాఫిక్ రద్దీ వల్ల వారు ఎయిర్‌పోర్ట్‌కి ఆలస్యంగా చేరుకున్నారు. ఫైనల్ బోర్డింగ్ కాల్ ప్రకటన కూడా వారు విని హడావిడిగా ఒక చేత్తో ఎయిర్ బ్యాగ్, మరొక చేత్తో టికెట్ పట్టుకుని లోనికి పరుగులు తీశారు. ఆ కంగారులో అక్కడున్న ఏపిల్స్ స్టాండ్‌కి వారిలో ఒకరి కాలు తగిలి ఆ పళ్ళన్నీ నేలపై చెల్లాచెదురుగా పడ్డాయి. సెల్స్‌మెన్ అంతా వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా కౌంటర్ వైపునకు పరిగెత్తారు. ఒక్కరు తప్ప.

అతను ఆగి తన మిత్రుల్లో ఒకరితో గట్టిగా చెప్పాడు. "ఫ్రాన్సిస్. షికాగో చేరగానే నువ్వు మా ఆవిడకు ఫోన్ చేసి నేను తర్వాతి ఫ్లయిట్‌లో వస్తున్నానని చెప్పు"

ఆ ఏపిల్ స్టాండ్ మేనేజ్ చేసే 16 ఏళ్ళ పిల్ల సన్నగా ఏడుస్తూ నేలపై పడిన పళ్ళు ఏరుకుంటోంది.

విమానంలో మిత్రులతో పాటు వెళ్ళకుండా ఆగిన ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, నేలపై చెల్లాచెదురుగా పడిన ఆఖరి ఏపిల్ కూడా ఏరి స్టాండ్‌లో ఉంచి చెప్పాడు. "ఏడవక. అన్నీ ఏరాను. దెబ్బ తిన్నవి వేరే ఉంచాను."

ఏడుస్తున్న ఆమె చేతిలో నలభై డాలర్ల నోట్లని ఉంచి చెప్పాడతను. "తీసుకో. ఇది నీకు జరిగిన నష్టానికి సరిపడే పరిహారం. నువ్వు దీని యజమానికి జవాబుదారీ అని నాకు తెలుసు."

ఆమె అతన్ని తడిమి చూస్తూ "మిస్టర్ మీరు జీససా?" అని అడిగింది.

ఆమె అతన్ని భావించినట్లుగా, మనల్ని ఎవరైనా దేవుడు అనుకునేలా, జీవితంలో ఒక్కసారైనా అలా నిస్వార్ధంగా ప్రవర్తించి ఉంటామా?

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.

Wednesday, August 12, 2009

అంధ(ద)మైన దత్తత

సంతానం లేనివారెవరైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఏం చేస్తారు? మొదట తమ మతం, తర్వాత తమ కులం, ఆ తర్వాత తమ బంధువులు లేదా స్నేహితుల కుటుంబాల్లోంచి ఎవర్నైనా దత్తత తీసుకోవాలని చూస్తారు. ఏమీ కాకుంటే అనాథ శరణాలయాలకే చివరిగా వెళ్ళేది. దత్తతగా తీసుకోదలచిన బిడ్డ ఆరోగ్యం సంగతి మరీ ముఖ్యంగా చూసుకుంటారు. ఇక అంగవైకల్యం ఉన్న పిల్లలంటే దత్తత మాట దేవుడెరుగంటూ అలాంటివాళ్ళు వద్దని ఆమడ దూరం పరుగు తీస్తారు. కానీ అమెరికాకు చెందిన అంధుడు జాన్‌కర్ల్ ఫీజ్, మేరీ దంపతులు మాత్రం దేశదేశాల్లో వెతికి వెతికి చివరికి మన దేశంలో అంధ బాలుడైన నాలుగేళ్ళ జ్యోతిని ఈ ఏడాది జూన్‌లో దత్తత తీసుకున్నారు. ఒరిస్సాలోని ప్రముఖ పట్టణం కటక్‌లో ఉన్న "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఈ కారుణ్యపూరిత సంఘటన చోటుచేసుకుంది. అంగవికలురైనవారు మరెవరినైనా దత్తత తీసుకుంటే ఆ బిడ్డ తమకు ఆసరాగా ఉండాలని భావిస్తారు. కానీ, అంధుడైన జాన్‌కర్ల్ తనలాంటి మరొక అంధుడిని దత్తత చేసుకోవడం అందర్నీ విస్మయపరిచింది. ఇందుకు కారణమేంటని అతన్ని అడిగితే.... అంధుడిగా పుట్టి తాను అనుభవిస్తున్న బాధలు మరొకరికి కలుగకుండా చూడాలనే భావనతో అంధ బాలుణ్ణి పెంచుకోదలచినట్లు చెప్పాడు. స్వశక్తితో కంప్యూటర్ సంస్థ యజమానిగా ఎదిగిన జాన్‌కర్ల్ భార్య మేరీ అమెరికాలోని ఒక అంధ విద్యార్థుల పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. ఇక జ్యోతి ఎవరంటే, కటక్‌లోని జగత్‌పూర్‌లో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో పుట్టాడు. పుట్టుకతోనే ఈ బాలుడు అంధుడు కావడంతో అతని తల్లిదండ్రులు ఇతన్ని రోడ్డుపైనే విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఈ అబ్బాయి "వసుంధర" చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చేరాడు.

Tuesday, July 21, 2009

దైవకార్యం కోసం పడవ మాయం

18వ శతాబ్దంలో సెయింట్ కొలంబియాకు 12 మంది మత ప్రచారకులను ఐరిష్ క్రైస్తవ మిషనరీ అప్పగించి అందరినీ ఉత్తర స్కాట్లాండ్‌కు పంపింది. అయితే, ఉత్తర స్కాట్లాండ్‌లోని పిక్ట్స్ అనే తెగకు చెందినవారు ఈ క్రైస్తవ మత ప్రచారకుల పాలిట యమకింకరుల్లా మారారు. ఈ సంగతి తెలిసీ ఇక్కడకు వచ్చిన కొలంబియా, ఆ మత ప్రచారకులు పడవ దిగిన వెంటనే ఆ పడవను తగలబెట్టేశారు. రాబోయే ప్రమాదాలకు భయపడి ఎప్పుడైనా తాము ఇదే మార్గంలో పడవ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవచ్చనే ఆలోచన రాకుండా, వచ్చినా ఆ అవకాశం లేకుండా కేవలం క్రైస్తవ మత ప్రచారమనే దైవకార్యం కోసం కట్టుబడి వారు తమ పడవను తామే తగులబెట్టుకున్నారు. తర్వాత స్కాట్లాండ్‌లో క్రైస్తవ మతం పాతుకుపోవడంలో వీరంతా అత్యంత కీలకపాత్ర పోషించారు.

మనం నమ్మిన దైవం కోసం దైవ కార్యం చెయ్యడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడితే అన్నీ అనుకూలిస్తాయని ఈ ఘటన నిరూపించింది.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Monday, July 20, 2009

ప్రాణం పోతుందనుకుని రక్తమిచ్చాడు....

కెనడాలోని ఒంటరియో ప్రావిన్స్‌లో ఉన్న లిజ్ అనే టీనేజర్ ఒక అరుదైన, ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతోంది. ఆమె రోగానికి మందులేదు. ఆ రోగం వచ్చి తగ్గిన ఎవరి రక్తమైనా ఆమెకి ఎక్కిస్తే, అందులోని యాంటీబాడీస్ పనిచేసి ఆమె రోగం తగ్గవచ్చని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి కంప్యూటర్‌లోని రికార్డ్‌లను పరిశీలిస్తే కొద్ది కాలం కిందట మైఖేల్ అనే ఆరేళ్ళ బాలుడికి ఇదే రోగం వచ్చి తగ్గినట్లు వైద్యులకు తెలిసింది. వారు వెంటనే మైఖేల్ అమ్మానాన్నలతో మాట్లాడారు. ఒక ప్రాణం కాపాడటం కోసం రక్త మార్పిడి చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆరేళ్ళ చిన్నారి మైఖేల్‌ని ఒక రోజున ఆసుపత్రికి తీసుకువచ్చారు. రక్త మార్పిడి ఎలా జరుగుతుందో మైఖేల్‌కు వివరించిన వైద్యులు లిజ్ కోసం రక్తమివ్వడానికి అంగీకారమేనా అని అతన్ని అడిగారు. లిజ్ బతకడానికి రక్తం ఇస్తానని చిన్నారి మైఖేల్ చెప్పాడు.

రక్త మార్పిడి జరుగుతోంది. తన ఒంట్లోని రక్తం లిజ్ ఒంట్లోకి ఎక్కడం మైఖేల్ చూశాడు. కాసేపయ్యాక మైఖేల్ ముఖం పాలిపోయింది. ఏడుపు మొదలు పెట్టాడు. నొప్పిగా ఉందా అని ఒక వైద్యుడు అడిగినప్పుడు ఏమీ లేదని జవాబిచ్చాడు.

""నేను ఇక ఎంతసేపట్లో చనిపోతాను?'' అని మైఖేల్ అడిగాడు.

చిన్నపిల్లవాడైన మైఖేల్ తనకు వైద్యులు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. తన ఒంట్లోని రక్తం మొత్తం లిజ్‌కు ఎక్కిస్తారని, దాంతో తాను చచ్చిపోతానన్న అభిప్రాయంతో మైఖేల్ ఉన్నాడు.

""నువ్వు చనిపోవు. రక్తం అంతా తీసుకోం. కొంచమే తీసుకుంటాం'' అని మైఖేల్‌కు చెప్పాడు వైద్యుడు.

అయితే, తన రక్తం మొత్తం తీసేసి లిజ్‌కు ఎక్కిస్తారని, అందువల్ల లిజ్ బతుకుతుందని, అప్పుడు తాను మరణిస్తానని అనుకుని కూడా మైఖేల్ రక్తమివ్వడానికి ముందుకు రావడం ఆసుపత్రిలో అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. రక్తమార్పిడి జరిగాక మైఖేల్ ఇంటికి వెళుతుంటే అందరూ అతన్ని ఆరాధన భావంతో మెచ్చుకుని వీడ్కోలిచ్చారు.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Saturday, June 20, 2009

గవురుమెంటు డాట్రారు

గవురుమెంటు డాట్రారు అని మన పల్లెవాసులు అమాయకంగా పిలుచుకునే ఒక గవర్నమెంట్ డాక్టర్ గారికి కర్తవ్యం పట్ల ఉన్న నిబద్ధత ఎంత విలువైన ఫలితాన్ని ఇచ్చిందో తెలియజెప్పే ఘటన ఇది. జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీ రామారావు, కర్తవ్యం సినిమాలో విజయశాంతి చట్టానికి, న్యాయానికి ఎంత విలువనిచ్చారో తన వద్దకు వచ్చే రోగుల ప్రాణాలకు అంతకంటే ఎక్కువ విలువనిచ్చి కర్తవ్య పాలన చేశారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ జ్యోతిర్మయి దత్తా. వృత్తిపట్ల దత్తాగారికి ఉన్న అంకితభావం చూస్తే మన తెలుగు సినిమాలు డాక్టర్ ఆనంద్, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో రోగుల పట్ల ఆదరణ కనబరచిన ఎన్టీ రామారావు, అక్కినేని తప్పక గుర్తుకు వస్తారు. కాకుంటే దత్తా జీవితంలో డ్యూయెట్లుండవు అంతే...

గవురుమెంటు డాట్రారు అనగానే తమ వద్దకు వచ్చే రోగులకు రంగునీళ్ళు, నాలుగు తెల్ల మాత్రలు ఇచ్చే రకం అనే అభిప్రాయం జనంలో ఉంది. డాక్టర్ జ్యోతిర్మయి దత్తా అలాకాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్శిటీ బిఎ విద్యార్థి అయిన దుర్గాపూర్ నివాసి సంజొయ్ పుట్టుకతోనే కంటిచూపునకు దూరమై తాను గుడ్డివాడినని ధృవపత్రం తీసుకోవడం కోసం నేషనల్ మెడికల్ కాలేజి డాక్టర్ అయిన జ్యోతిర్మయి దత్తా వద్దకు వచ్చాడు. కొందరు డాక్టర్లు ఎంతో కొంత లంచం ఆ చేత్తో పుచ్చుకుని ఈ చేత్తో ధృవపత్రం ఇచ్చేస్తారు. దత్తా అలా చెయ్యకుండా 22 ఏళ్ళ సంజొయ్‌ని పరీక్ష చేశారు. సంజొయ్‌కు పుట్టుక నుంచే కంట్లో శుక్లాలున్నాయి. కంటిపై ఏదైనా బలమైన కాంతిపుంజం పడినప్పుడు కొంత అనుభూతి కలుగుతుంది. ఇతను "స్టిములస్ డిప్రైవేషన్ అమోలైపియా" అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న డాక్టర్ అతనికి శస్త్రచికిత్స చేస్తే తప్పక చూపు వస్తుందని గ్రహించి ఆ విషయాన్నే సంజొయ్‌కు చెప్పారు.

జీవితంలో 22 ఏళ్ళ కాలం చూపులేకుండా గడిపిన సంజొయ్ తనకు చూపు వచ్చే అవకాశాలున్నాయని తెలిసి ఆనందంగా శస్త్రచికిత్సకు ఒప్పుకున్నాడు. దీంతో ఇతనికి పలు పరీక్షలు చేసి ఈ ఏడాది మార్చి 14, ఏప్రిల్ 7 తేదీల్లో రెండు కళ్ళకూ శస్త్రచికిత్స చేశారు. కనుగుడ్డు కదలికలు అపసవ్యంగా ఉండటంతో అవి కూడా సరిచేశారు. కుడి కంట్లో ఉన్న సున్నం నిల్వలు తొలగించారు. మొదటి ఆపరేషన్ జరిగిన ఒక రోజు గడిచాక ఎడమ కంటి కట్టు తీసేసినప్పుడు కంటిపై చాలా బలమైన కాంతిపుంజం పడిన అనుభూతికి అతను లోనయ్యాడు. ఆ విషయాన్నే అతను డాక్టర్‌కు చెప్పాడు. దత్తా వెంటనే ఆ కన్ను తెరవమని సూచించారు. జీవితంలో మొదటిసారిగా తన సాటి మనిషిని చూశాడు సంజొయ్.

వైద్యులూ దత్తాను ఆదర్శంగా తీసుకుంటే అంతా మిమ్మల్ని వైద్యనారాయణులని కొలుస్తారని మర్చిపోకండి.

Sunday, June 14, 2009

బుద్ధి చెప్పే బాంద్రా బ్యానర్

ముంబై నగరంలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో నగల వ్యాపారం చేసుకునే వర్తకుడు కిశోర్ వాల్‌చంద్ జైన్. అందమైన ఆభరణాలను తళతళ మెరిసేలా తయారు చేసి ఖాతాదార్ల మెప్పు పొందడంలో దిట్ట ఈ వ్యాపారి. నగలు మాత్రం తళతళలాడితే సరిపోతుందా? సుందరమైన ఆ నగలు ధరించే తన ఖాతాదారుల మానసిక సౌందర్యం తనకెంతో ముఖ్యం అంటాడీయన. అందుకే తన దుకాణం బయట మంచి సందేశాలతో కనిపించే బ్యానర్‌ను గత 10 ఏళ్ళకు పైగా ప్రదర్శిస్తూ వస్తున్నారు వాల్‌చంద్ జైన్ గారు. సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ బ్యానర్ ప్రత్యేకత . దేశంలో జరిగే ఉగ్రవాద దాడులు, అధికారుల అవినీతి చర్యలు, రాజకీయ నాయకుల పట్ల అసహ్యంతో వారిపై జరిగే బూటు దాడులు వంటివన్నీ ఇక్కడ బ్యానర్ ఐటెమ్స్‌గా మనకు కనిపిస్తాయి. ఇలాంటి పరిణామాలే ఆయుధాలుగా వాల్‌చంద్ గారి బ్యానర్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వారి డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ సిగ్గుపడేలా చేస్తుంది. తమ దుకాణంలోని నగల అమ్మకాలతో వచ్చే లాభాల్ని మిగిలిన వ్యాపారుల్లాగా అనుభవించడంతో సరిపెట్టుకోని వాల్‌చంద్ గారు సమాజం పట్ల తన బాధ్యతను బ్యానర్ సందేశాల రూపంలో నెరవేర్చుతున్నారు. బంగారు నగల్లాగే ఈయన మనసుకూడా భలే మెరిసిపోతుంది కదూ...

Saturday, May 30, 2009

అక్కడ బొబ్బిలి బ్రహ్మన్న లేడు...

ఆస్తి గొడవలొస్తే అన్నదమ్ములే కత్తులు దూసుకునే రోజులివి. డబ్బు విషయంలో తేడాలొస్తే మిత్రులే శత్రువులవుతున్న సమాజమిది. కుల, మత, జాతి, ప్రాంత విభేదాలతో రగిలిపోతున్న ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని వామన్‌ఖేడ్ గ్రామం గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. రాష్ట్రపతి ప్రశంసలు సైతం పొందిన ఈ గ్రామం ఎన్నోసార్లు ఆదర్శగ్రామంగా పురస్కారం అందుకుంది. ఈ ఊరిలో మహిళలకు సమానహక్కులున్నాయి. వేడుకలను అందరూ కలసికట్టుగా నిర్వహించుకుంటారు. ఈర్ష్య, అసూయలకు చోటు లేదిక్కడ. రాథోడ్ వంశానికి చెందినవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికీ ప్రేమాభిమానాలు సరిసమానం. ఏ ఒక్కరికి సహాయం కావాలన్నా, మరే అవసరమున్నా సత్వరం వారికి చేయూత లభిస్తుంది. ఈ గ్రామ స్త్రీలు వారిళ్ళకు చాలావరకూ తాళాలు వెయ్యరు. కొత్తవారెవరైనా ఈ గ్రామంలోకి అడుగుపెడితే వారి అవసరాన్ని వెంటనే గుర్తించి కావలసిన పనులు చేసిపెట్టి మర్యాదతో సాగనంపుతారు. ఆ మధ్య ఎప్పుడో ఒక వేడుక సందర్భంగా రెండు వర్గాలవారు కేవలం తూలనాడుకున్నందుకు వారిని వెలివేశారు. భారత శిక్షాస్మృతి పరిధిలోకి వచ్చే ఒక్క నేరం కూడా ఈ గ్రామంలో చోటు చేసుకోలేదు. అందువల్లే పోలీసులు కూడా అడుగుపెట్టలేదు. అంతేగాని బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలోలాగా ఆ ఊరు పెద్ద కృష్ణంరాజు పరిపాలనలో లేదు. అక్కడంతా మర్యాద రామన్నలే...

Friday, May 15, 2009

భార్యకోసం కొండను తవ్విన దశరథ్ మాన్జీ

ప్రభుత్వాధికార్ల గుండెల్ని కరిగించడం కన్నా కఠిన శిలల్ని కదిలించడమే తేలిక అని అతను గ్రహించాడు. అర్థాంగి అంటే నిజమైన అర్థం ఎందరికి తెలుసన్నది చెప్పలేం కానీ బీహార్‌కు చెందిన దశరథ్ మాన్జీ జీవితం మాత్రం దీనికి సరైన నిర్వచనమన్నది సూర్యచంద్రులు కనిపిస్తున్నంత నిజం. అతను తన భార్య కోసం 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి బాట ఏర్పరిచాడు. ఇది పూర్తయ్యేనాటికి ఆమె ప్రాణాలతో లేకపోయినా అతని గ్రామస్థుల పాలిట వరమైంది. అదేంటో తెలుసుకుందాం...

బీహార్‌లోని వజీర్‌గంజ్ సమీపాన గల గహ్‌లోర్ ఘాటీ గ్రామానికి చెందిన దశరథ్ మాన్జీ అత్యంత నిరుపేద. ముసాహర్ జాతి (ఎలుకల బొరియల్లో దొరికే ధాన్యాన్ని తిని జీవించే జాతి)కి చెందిన ఈయనంటే మాత్రం ఆ ప్రాంతం వారికి అత్యంత గౌరవం ఉంది. ఈయన్ని దశరథ్ బాబా అని కూడా పిలుస్తారు. 1962లో దశరథ్ భార్య ఫగుణీ ఈయన కోసం పొలానికి భోజనం తీసుకువస్తుండగా కిందపడిపోతే ఆమె చెయ్యి విరిగిపోయింది. వైద్యం కోసం ఊరిలో సదుపాయాలు లేవు. ఊరికి అడ్డుగా ఉన్న కొండను చుట్టి 30 కిలోమీటర్లు ప్రయాణించి గయకు వెళ్ళాల్సిందే. ఈ సంఘటనతో కొండను తవ్వి బాట ఏర్పరచాలన్న సంకల్పానికి ఆయనలో బీజం పడింది. 300 అడుగుల ఎత్తు, 1.5 కిలోమీటర్ వెడల్పున్న ఈ పర్వతాన్ని తవ్వి దారి ఏర్పరచడం అంత సులభం కాదని అందరికీ తెలుసు.

కొండను తవ్వి దారి ఏర్పరచాలనుకుంటున్నట్లు తన వారికి చెప్పగానే అందరూ వేళాకోళం చేశారు. వ్యతిరేకత వ్యక్తమైంది. అదేం పట్టించుకోని దశరథ్ తన మేకలు, ఇతర ఆస్తులు అమ్మి కొండ తవ్వడానికి పనికివచ్చే గడ్డపార, సమ్మెట, ఇతర వస్తువులు కొన్నాడు. ఇది గమనించిన వారు దశరథ్‌ను పిచ్చివాళ్ళ కేటగిరిలో వేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో దశరథ్ భార్య జబ్బు పడగా ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో కొండను తవ్వితీరాలన్న ఆలోచన వజ్ర సంకల్పంగా మారింది. కొండను తవ్వడానికి రోజూ తన ఇంటి నుంచి వెళ్ళి రావడానికి ఆలస్యం అవుతుందని భావించిన ధశరథ్ కొండ దగ్గరే గుడిసె కట్టుకుని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు.

అది మొదలు 22 సంవత్సరాల పాటు ఏ ఒక్కరి సాయం లేకుండా రేయింబవళ్ళు శ్రమించి 1984లో 16 అడుగుల వెడల్పుతో చక్కని దారి సిద్ధం చేశాడు. దీంతో గహ్‌లోర్ ఘాటీ ప్రజల కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు వైద్యం కోసం చాలా తక్కువ సమయంలో గమ్యం చేరుకోగలుగుతున్నారు. కొండను తవ్వి ఎలుకలు పట్టే ఈ రోజుల్లో చోటు చేసుకున్న అద్భుతం ఇది.

దశరథ్ జీవించి ఉండగా గుర్తింపు రాలేదుగానీ, 2007లో ఆగస్ట్ 17న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తన 78వ ఏట మరణించినప్పుడు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన నిర్మించిన ఆ బాటకు "దశరథ్ మాన్జీ మార్గ్" అనే పేరు పెట్టారు. గహ్‌లోర్ ఘాటీలో ఈయన పేరిట ఆసుపత్రి నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.

ఇది కేవలం ప్రభుత్వాధికార్లు మాత్రమేకాదు, సమస్యల బారినపడి ఎదుటివాడు ఏడుస్తున్నా మనకెందుకులే అని మిన్నకుండే తోలుమందం ప్రజలందరూ దశరథ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, మరెన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయాలి....

Sunday, May 10, 2009

గుంటూరు గాంధీజీకీ జై

శ్రమదానం అన్న పదం వినగానే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ప్రవేశపెట్టిందేగా అనెయ్యకండి. ఆయనకంటే ముందే శ్రమదానానికి నిజమైన నిర్వచనమిచ్చి 40 ఏళ్ళకు పైగా శ్రమనే దానం చేస్తూ "గుంటూరు గాంధీ"గా పేరు పొందారు వట్టికూటి వెంకట సుబ్బయ్యగారు. గుంటురు జిల్లాలోని పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో 1916, అక్టోబర్ 28న (గాంధీ పుట్టిన నెలలోనే) జన్మించిన ఈయన తన జీవితాన్ని స్వచ్ఛంద సేవకే అంకితం చేశారు. మురికి కాల్వలు, రోడ్లు... చివరికి శ్మశానాలను సైతం శుభ్రం చేస్తూ కనిపిస్తుంటారు. ఈయన సేవలను గుర్తించి ఆ మధ్య మహాత్మాగాంధీ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఈ గుంటూరు గాంధీ గారికి సత్కారం కూడా చేశారు.

Monday, May 04, 2009

తువాలు విసిరే సవాలు

ఆ దేశం పేరు తువాలు. జనాభా కాస్త అటూ ఇటూగా ఒక 12000 మంది ఉండవచ్చు. అక్కడ స్వతంత్రంగా పత్రికా వ్యవస్థ లేకున్నప్పటికీ సామాన్యుల నుంచి సెల్‌లోని ఖైదీ వరకూ అందరినీ సంతృప్తిగా ఉంచే మానవహక్కుల వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. బాలలను హింసించిన పరిణామాలు కానరావు. పలు దేశాల్లో మానవహక్కుల అమలు గురించి 2002లో అమెరికా విదేశాంగశాఖ ఒక నివేదిక రూపొందించింది. ఈ తువాలు దేశంలో ఒక్క తప్పునైనా పట్టుకునేందుకు ఆ శాఖ విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఫిజీకి ఉత్తరంగా ఉన్న ఈ దేశంలో మహిళలపై నేరాలు జరగడం చాలా చాలా అరుదు. తువాలులోని ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా గౌరవిస్తుంది. ఇక్కడేమిటంటే పెద్దలు చెప్పిన మాట చట్టంతో సమానంగా అమలవుతుంది. నివేదిక 2002లో రూపొందించినప్పటికీ ఈ రోజుకు సైతం ఇది మానవహక్కుల పాలిట భూలోక స్వర్గమే. మానవహక్కుల పరిరక్షణలో తువాలు విసిరే సవాలుకు జవాబెక్కడుంది చెప్పండి?

Sunday, April 26, 2009

అంబలి దాతా సుఖీభవ

మండే ఎండల్లో అలసిపోయినవారి సేద తీర్చేందుకు సుమారు 29 ఏళ్ళ కిందట ఒక తల్లి ప్రారంభించిన సేవా యజ్ఞాన్ని ఆమె కుమారుడు నేటికీ కొనసాగిస్తూ పలువురికి ఆదర్శప్రాయుడై నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన సరోజ దాదాపు 3 దశాబ్దాల కిందట ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ప్రారంభమై వేసవికాలం అంతా రాగులతో చేసిన అంబలిని ఉచితంగా అందిస్తూ మృగశిర కార్తె రోజు వరకూ కొనసాగి మిఠాయిల పంపకంతో ముగుస్తుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సరోజ ఆ తర్వాత మరణించినప్పటికీ ఆమె కుమారుడు, ఎలక్ట్రీషియన్ అయిన ప్రభాకర్ తన భార్య కృష్ణవేణితో కలసి ఈ సేవను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్ చిక్కడపల్లి డివిజన్‌లోని బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి కాలనీలో ఈ కేంద్రం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సేవకు చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ ప్రభాకర్ సున్నితంగా తిరస్కరించి తన స్వంత ఖర్చుతో ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. ఈ వేసవి కాలమంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ దాహార్తులు, ఆకలిగొన్నవారికి ఇక్కడ అంబలి సిద్ధంగా ఉంటుంది.

Monday, April 20, 2009

పెద్దలు ఓటేస్తే పిల్లలకు స్టార్

ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఏమిటన్నది నిజంగా గ్రహించిన పాఠశాల ఇది. హైదరాబాద్ నగరం చింతల్‌లో ఉన్న సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యం తనకున్న పరిధిలో పౌరులను ఓటు వేసే దిశగా చైతన్యపరిచేందుకు ఓ మంచి పథకం వేసింది. తన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యత గుర్తెరిగి ఓటు వేస్తే వారి పిల్లల రిపోర్ట్ కార్డ్‌లో సదరు విద్యార్థికి ప్రత్యేక గౌరవం ఇస్తూ బోనస్ స్టార్ కేటాయిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఉత్తమ పౌరులుగా గుర్తిస్తామని కూడా వెల్లడించింది. ఈ బోనస్ స్టార్ ద్వారా ప్రత్యేక గౌరవం పొందడానికి ఆ పిల్లలు తమ అమ్మానాన్నలతో ఓటు వేయించడంతో పాటు తాము ఉత్తమ పౌరుల బిడ్డలమన్న గుర్తింపు కూడా పొందుతారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఓటు వేసినట్లు రుజువు చేసుకోవడానికి ఈ నెల 25న స్వయంగా పాఠశాలకు వచ్చి తమ వేలిపై ఉన్న ఇంకు మార్కును పాఠశాల ఉపాధ్యాయులకు చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని, ఇది జరగాలంటే పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు వెయ్యాలన్నది ఈ పాఠశాల గుర్తించిన వాస్తవం.

Saturday, March 28, 2009

ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా...

కొన్నేళ్ళ క్రితం అమెరికాలో మేథ్యూ లిసగే అనే మూడో క్లాసు చదివే విద్యార్థి తనుండే నగరంలోని ఆకలిగొన్న బీదవారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దాంతో అతను "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " అనే కార్యక్రమాన్ని ఆరంభించాడు. అది ఆరంభించిన నాలుగో ఏడు "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " నలభై వేల డాలర్లని సేకరించి అనాథల పొట్టలని నింపగలిగింది.

మరో పిల్లవాడి కథ కూడా ఇలాంటిదే. ఆఫ్రికాలోని రోగగ్రస్థులైన బీదవాళ్ళ కోసం డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ కృషి చేస్తున్నాడని తెలిసిన పదమూడేళ్ళ జాన్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఓ ఉత్తరం రాశాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా కొన్నానని, దాన్ని ఆఫ్రికాలోని డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ హాస్పిటల్‌లో పడేయగలరా అని అడిగాడు. ఓ లోకల్ రేడియో స్టేషన్‌కి ఈ సంగతి తెలియడంతో అది ఆ చిన్న పిల్లవాడి గొప్ప మనసు గురించి వార్తగా ప్రసారం చేసింది. అది విన్న ఎంతోమంది తగిన విధంగా స్పందించారు. దాంతో ప్రభుత్వం ఆ పిల్లవాణ్ణి, వేల మంది నుంచి ఉచితంగా వచ్చిన నాలుగు లక్షల డాలర్ల విలువ చేసే నాలుగున్నర టన్నుల మందులతో డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ నడిపే హాస్పిటల్‌కి విమానంలో పంపించింది.

ఆ పిల్లల్లోని నిజాయితీతో కూడుకున్న, బీదలకి సహాయం చేయాలనే తపనని చూసి దేవుడు వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని అనేకమంది మంచివాళ్ళని పరికరాలుగా వాడుకుని చేశాడు.

సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Tuesday, March 17, 2009

కార్ల దొంగ

టర్కీలోని ఓ దొంగకి 16 ఏళ్ళ క్రితం తను చేసిన నాలుగు కారు దొంగతనాలకి పశ్చాత్తాపం కలిగింది. ఆ నాలుగు కార్లలోంచి తను దొంగిలించి అమ్ముకున్న టేప్ రికార్డర్ల ఖరీదు అయిన నాలుగు వందల యూరో డాలర్లని సెంట్రల్ టర్కీలోని కిరిక్కాలె అనే ఊరి పోలీస్ చీఫ్ సలీంకి పంపించాడు. 1992లో తన చేసిన ఆ నాలుగు దొంగతనాల వివరాలని కూడా పంపాడు. ఒకొక్కరికీ వంద యూరో డాలర్లని ఇవ్వమని, తన క్షమాపణలని కూడా తెలియచేయమని కోరాడు. ఆ దొంగ మాత్రం అజ్ఞాతంగానే ఉండిపోయాడు.

సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Thursday, March 12, 2009

ఓటర్ల కోసం గుంజీళ్ళ దీక్ష

తమిళనాట కోయంబత్తూరు జిల్లా పుదూర్ గ్రామానికి చెందిన వడ్రంగి 23 ఏళ్ళ రామనాథన్‌కు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదు. తన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనమంతా ఎన్నికల్లో పాల్గొని మంచి నేతలను ఎన్నుకోవాలని మాత్రం గ్రహించాడు. తన కోరిక ఫలించాలని కోరుతూ తన ఊరిలో ఉన్న ఆది వినాయకర్ ఆలయంలో మే 8, 2006వ తేదీ ఉదయం 6 గంటలకు సుముహూర్తం నిర్ణయించుకుని 14 నిమిషాల్లో 1008 గుంజీళ్ళు తీశాడు. ఈ గుంజీళ్ళు సరిగ్గా తీశాడా లేదో గమనించడానికి అక్కడి "యూత్ పవర్ ఫెడరేషన్" ప్రతినిధులు వచ్చి పర్యవేక్షించారు. తన గుంజీళ్ళ దీక్ష పూర్తయిన తర్వాత రామనాథన్ మాట్లాడుతూ మన ప్రజాస్వామిక దేశంలో ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, రాష్ట్ర భవిష్యత్తును మంచి బాటలో పయనింపజేయాల్సింది ఓటర్లే అయినందున అవినీతి, పక్షపాత వైఖరికి దూరంగా ఉండే నేతలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాజకీయాల్ని అసహ్యించుకొని ఓట్లేయడం మానకుండా మంచివారికి ఓటు వేయడం ద్వారా స్వలాభం కోసం పాకులాడేవారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. తన కోసం కాకుండా జనం బాగు కోసం గుంజీళ్ళు తీసిన రామనాథన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ... జన జీవితంలో కొత్త కోణం ప్రకాశిస్తుంది.

పసివాడి హృదయం కరిగింది

"పిల్లలూ ఈ రోజు మీకో వీడియో చూపిస్తాం... అది చూచి మనకు తోచిన సాయం చేద్దాం" అని టొరంటోలోని ఒక స్కూలు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశమైన మలావీలోని బాలల దుస్థితిని వీడియో ద్వారా చూపించారు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న తొమ్మిదేళ్ళ భారత సంతతి విద్యార్థి నీల్ అగర్వాల్ పసి హృదయం మలావీ చిన్నారుల కష్టాలు చూచి కరిగిపోయింది. వెంటనే తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 170 డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.7,800) యునిసెఫ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నీల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ భారతీయుడు కాగా, తల్లి ఎలిజబెత్ కెనడాలో పుట్టి పెరిగిన ఇటలీ సంతతి మహిళ. ఇంత పెద్ద మొత్తం (ఆ కుర్రాడి వయసుకు ఇది పెద్ద మొత్తమే...) అలా ఎలా ఇచ్చేశావురా అని అడిగితే... నా వయసు పిల్లలు పేదరికంతో తిండి లేక పాఠశాలలకు కూడా వెళ్ళడం లేదని తెలిసి, ఆ డబ్బు నాకంటే వారికే ఎక్కువ అవసరమనిపించిందని బదులిచ్చాడు ఈ రెండవ బాల కర్ణుడు (ఇలాంటి మరో బాలుడి గురించి ఇంతకు ముందొక కథనం ఇచ్చాను అందుకే రెండవ బాల కర్ణుడు అన్నాను). ఈ ఘటన 2006లో జరిగింది.

Thursday, February 26, 2009

మాకు కరెంట్ వద్దు...

మన పొరుగున ఉన్న భూటాన్ మనకన్నా చిన్న దేశం. మనకన్నా పేద దేశం. కాని భూటాన్ ప్రజల మనసులు మాత్రం చాలా విశాలం. వారికి భూతదయ ఎంత ఎక్కువంటే, నదుల్లోని చేపలని పట్టరు. డబ్భై ఐదు శాతం అడవే అయినా జంతువుల్ని వేటాడి చంపరు. ఆ దేశంలోని ఫోబ్జికా లోయకు తరచూ కొంగలు వలస వస్తూంటాయి. ఆ లోయకి వచ్చే దారిలో ఉన్న ఓ ఊళ్ళోని కరెంటు తీగల మీద వాలి అవి మరణించడం గమనించిన ఆ ఊరి వాసులు విద్యుత్‌కు స్వస్తి చెప్పారు. సౌర శక్తితో తమ ఇళ్ళను వెలిగించుకుంటున్నారు. వారు బాగా సున్నిత మనస్కులు కాబట్టి హింసా ప్రవృత్తి గల రెజ్లింగ్ పోటీలను ప్రసారం చేసే పాశ్చాత్య ఛానెళ్ళకు అడ్డుకట్ట వేశారు. ఫ్యాషన్ టీవీ, టెన్ స్పోర్ట్స్, ఎంటీవీ లాంటి అర్ధనగ్న దృశ్యాలు ప్రసారం చేసే ఛానెళ్ళు కూడా భూటాన్‌లో ప్రసారం కావు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించిన తొలి దేశం కూడా భూటానే. ప్రజలు ఇలాంటి మంచి పనులకు వ్యతిరేకతను తెలియచేయకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. సమున్నత సంస్కృతికి మారు పేరని చెప్పుకునే మన భారతీయులంతా భూటాన్‌ను అనుసరించాల్సిన అవసరముంది.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు

Wednesday, February 18, 2009

వీళ్ళు పే......ద్ద పిల్లలు

శత్రువులు పాలిట తూపాకీ తూటాలాంటివాడు తుఫాన్ కుమార్ అయితే... భారతీయ సైనికుల ధన్వంతరి భారతీ సింగ్. ఈ విద్యార్థులు సాధించిన ఘనతల గురించి చదివాక నేను పెట్టిన శీర్షిక నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక బృందం) అధిపతి హేమంత్ కర్కారే, అశోక్ కామ్టే తదితరులు ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. వాళ్ళు వేసుకున్న బులెట్ ప్రూఫ్ జాకెట్లు నాసిరకం కావడమన్నది వీరి మరణానికి ఒక కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని బట్టి ఉగ్రవాద నిర్మూలన పట్ల మన పాలనా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందలాది ప్రాణాలను బలిగొన్న ఆ నాటి దాడి తర్వాత మనం నేర్చుకున్న పాఠాల సంగతేమోగాని ఈ మధ్య మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఒక బాలల సైన్స్ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు.

ఇందులో పాల్గొన్న భువనేశ్వర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థి తుఫాన్ కుమార్ సమాల్ తన వంతుగా... క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల (సిసిటివి) పైన తుపాకులు అమర్చి కంట్రోల్ రూం నుంచి వాటిని పేల్చడం ద్వారా ఉగ్రవాదులను అంతమొందించే వ్యవస్థను రూపొందించాడు. దీనివల్ల సమయం వృథా కాదు... ప్రాణ నష్టం చాలా చాలా తగ్గుతుంది. పెద్ద పెద్ద హొటళ్ళలో తిరిగే (రివాల్వింగ్) కెమెరాలుంటాయి. వాటి సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని చూస్తాం. మరో అడుగు ముందుకేసి వాటికి తుపాకులు అమర్చడం ద్వారా పని పూర్తి చెయ్యవచ్చట. తుఫాన్ కుమార్ తుఫాను వేగంతో కదిలే మానవరహిత ప్లాస్టిక్ విమానాన్ని కూడా తయరు చేశాడు. దీంతో శత్రు స్థావరాల్ని కచ్చితంగా కనిపెట్టడంతో పాటుగా తుఫానులు వచ్చి వరద బీభత్సం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు సాయం కూడా చెయ్యవచ్చు...

ఉత్తరప్రదేశ్ నుంచి ఇదే సైన్స్ సమావేశంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థిని, బరైలీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన భారతీ సింగ్, నీటిలోని నాచును ఉపయోగించి సైనికులకు చికిత్స చేసే వ్యవస్థను రూపొందించింది. నాచు నుంచి ప్రొటీన్ తీసి యుద్ధ సమయాల్లో గాయపడిన సైనికులకు బాక్టీరియా వల్ల వ్యాధి వ్యాపించకుండా దీంతో చికిత్స చెయ్యవచ్చట. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పటి సైనికులు వ్యాధులు రాకుండా ఈ నాచును పైన పెట్టుకుని కాపాడుకున్నట్లు చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకుని దీనిని తయారు చేసినట్లు భారతీ సింగ్ చెప్పింది. నాచులోని ప్రొటీన్‌ను బయటకు తీసి కొన్ని వైరస్‌లపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. గడచిన డిసెంబర్ నెలలో తాను కనిపెట్టిన ఈ ఆవిష్కరణపై పేటెంట్ కూడా తీసుకుంది.

Wednesday, February 11, 2009

నస్రీన్ నుయ్యి తవ్వింది

అమ్మానాన్నలు ఎప్పుడు చస్తారా... ఓ గొయ్యి తవ్వి పారేద్దాం అనుకునే ఈ రోజుల్లో... నీళ్ళ కోసం తల్లి పడుతున్న కష్టం చూచి ఆవేదన చెందిన నస్రీన్ ఆమె కోసం ఒక నుయ్యి తవ్వింది. తన చెల్లాయిలు తోడుగా నస్రీన్ 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వింది. ఇక నస్రీన్ ఎవరో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఉన్న మహా విద్యాలయం విద్యార్థిని అయిన నస్రీన్ పేద కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి రంజాన్ ఖాన్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మరోవైపు నస్రీన్ పగలు కళాశాలకు వెళుతూ, విద్యార్థులకు ప్రయివేట్లు చెబుతూ తన వంతుగా నాలుగు రాళ్ళు సంపాదించి తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉండేది. ఈ ఇంట్లో దాహార్తి తీర్చుకోవాలంటే నస్రీన్ తల్లి మైళ్ళ దూరం నడిచి మంచి నీళ్ళు తీసుకురావాల్సిందే. కని పెంచిన తల్లి కష్టం చూడలేకపోయిన ఈ ధీశాలి అమ్మ కోసం ఏమైనా చేసి తీరాలని సంకల్పించుకుని ఇంట్లేనే నుయ్యి తవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు అమ్మా నాన్నా ఒప్పుకోరు. చెల్లెళ్ళతో ఈ సంగతి మాట్లాడి అమ్మానాన్నలకు తెలియకుండా అందరూ కలిసి పలుగు పార పట్టుకొని 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వేశారు. పని పూర్తయ్యాక అమ్మానాన్నల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక మహావిద్యాలయ ప్రిన్సిపాల్ ఆర్ కె పాటిల్ గారైతే నస్రీన్‌ను నోరారా పోగిడి కుట్టుమిషన్ బహుమతిగా ఇచ్చారు. ఇంకా డబ్బు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగి రెండేళ్లయినా ఆ వివరాలు నాకు ఇప్పుడు దొరికాయి.

ఇదంతా చూస్తుంటే లక్క ఇంటి నుంచి తన తల్లి, సోదరుల్ని కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో నిద్ర మానుకొని సొరంగం తవ్విన పాండవ మధ్యముడు భీముడు గుర్తుకు రావడం లేదూ...! భీమసేనుణ్ణి మనం చూడలేకపోయాం గానీ ఈ యుగంలో నస్రీన్ మన కళ్ళముందుంది. ఈ నస్రీన్ భారతంలోని భీముని తలపించింది. ఎందుకంటే సందర్భాలు, పరిస్థితులు వేరైనా దృఢ సంకల్పం ఒక్కటేగా...

Saturday, February 07, 2009

హిజ్రాలు కాదు మానవతా వజ్రాలు

హిజ్రాలు లేదా నపుంసకులనగానే ఈ (అ)సభ్య సమాజానికి గుర్తుకొచ్చేది వయ్యారమొలకబొసి, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తూ డబ్బులడుక్కుంటున్న దృశ్యం. హిజ్రాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విలేఖరిని దత్తత తీసుకున్న ఈ నిజ సంఘటన గురించి తెలుసుకుంటే వారు మంచోళ్ళకంటే మంచోళ్ళన్న అభిప్రాయానికి రాక తప్పదు. మామూలు మనుషుల కొచ్చే కష్టాలనే పట్టించుకోని ప్రభుత్వం మామూలుగానే వీరి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే దేవుడనేవాడు వీరి కోసం విల్లుపురంలో ఒక మనిషిని పుట్టించాడు. అతనే రామ్మూర్తి. ఈ ఊరిలోనే అర్చకుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి (40 ఏళ్ళు) పత్రికా విలేఖరిగా కూడా సమాచార సేవలందిస్తుంటారు. ఈయన వార్తలు సేకరించడంతో ఆగిపోకుండా ఈ హిజ్రాలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పించారు. వారి హక్కుల కోసం పోరాడుతూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు.

తమకేమీ కాని రామ్మూర్తి తమ సంక్షేమం కోసం ఇంతగా శ్రమించడం ఆ హిజ్రాల మనసును కరిగించేసింది. వెంటనే రామ్మూర్తిని తమ కుమారునిగా దత్తత తీసుకోవాలని జిల్లా నపుంసకుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా 2005 డిసెంబర్ 31న శాస్త్రబద్ధంగా దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నపుంసకులను శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించే హిజ్రాలు తనను దత్తత చేసుకోవడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందని రామ్మూర్తి పారవశ్యంతో చెప్పారు. ఈ మానవతా వజ్రాలను ఎన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే సరిపోతుంది చెప్పండి.

Monday, January 26, 2009

పెళ్ళా... తమ్ముడా...

చివరికి తమ్ముడే తన ప్రాణమంది లక్నో యువతి 21 సంవత్సరాల దివ్య. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బాద్ షా నగర్‌కు చెందిన సుభాష్ కుమార్తె దివ్యకు పెళ్ళీడు రావడంతో పెద్దలు మంచి సంబంధం కుదిర్చారు. డిసెంబర్ 6, 2008న పెళ్ళి జరగాల్సి ఉంది. సరిగ్గా అదే సమయానికి ఆమె తమ్ముడు అపూర్వ మూత్రపిండాల సమస్యతో అనారోగ్యం పాలయ్యాడు. దాత ఎవరైనా మూత్రపిండం ఇస్తే తప్ప అతను బతకడని అక్కడి "సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" వైద్యులు తేల్చి చెప్పారు. తోడబుట్టినవాడి పరిస్థితిని అర్థం చేసుకున్న దివ్య తన మూత్రపిండం తమ్ముడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలా చేస్తే పెళ్ళి మానుకుంటామని మగపెళ్ళివారు హెచ్చరించారు. ఆ పెళ్ళి కోడుకుతో "వెళ్ళవయ్యా వెళ్ళు" అని కరాఖండిగా చెప్పి తన తమ్ముడికే అండగా ఉండాలన్న దృఢ నిశ్చయానికి వచ్చింది. నిజంగా ఆమెది "దివ్య"మైన మనసు కదూ...

Friday, January 23, 2009

నాకు పింఛనొద్దు మొర్రో...

అధికారిక దాఖలాల ప్రకారం ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సాలిజంగ గ్రామానికి చెందిన బంధుదాస్ వయసు 100 ఏళ్ళు దాటింది. బంధుదాస్ పేదవాడైనా అందరికీ ఆత్మబంధువులా మెలుగుతూ తన పనులు తానే చేసుకుంటాడు. ఆ మధ్య కొందరు ప్రభుత్వాధికారులు ఈయన దగ్గరికొచ్చి "అన్నట్టు మీకింకా పింఛన్ అందడంలేదని తెలిసిందండీ... ఇప్పించాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన బంధుదాస్ "పనులు చేసుకోలేనివాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళకు ప్రభుత్వం సాయం చెయ్యాలి గానీ కాళ్ళూ చేతులు ఆడుతున్నవాళ్ళకు కాదురా బాబు. పింఛనిచ్చి నన్ను ముసలోణ్ణి చెయ్యొద్దు. నాకు పింఛనొద్దు మొర్రో..." అని వాళ్ళను వచ్చినదారినే పంపించేశాడు.

బంధుదాస్ దినచర్యను పరిశీలిస్తే... ఉదయమే 5 గంటలకల్లా లేస్తాడు. కొద్దిగా పాలు, మరమరాలు అల్పాహారంగా తీసుకుని తన ఆవులకు గ్రాసం కోసం తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకెళతాడు. తన కోసం ఓ నాలుగు తమలపాకులు తెచ్చుకుంటాడు. పశువులకు తన చేత్తో స్వయంగా తినిపిస్తాడు. అప్పుడప్పుడూ పొలంపనుల్లో ఓ చెయ్యి వేస్తాడని గ్రామస్తులు చెప్పారు.

గ్రామ కార్యక్రమాల్లో పాల్గొని జానపద గీతాలు ఆలపించే బంధుదాస్‌ను రోగాలేవీ సమీపించడం తాము చూడలేదని, ఇప్పటికీ ఆయన వద్ద కళ్ళజోడు లేదని కోడలు లత చెప్పింది. దాసు గారికి ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు కాగా, భార్య లబానీకి 90 ఏళ్ళు. అయితే, దురదృష్టవశాత్తు ఆమె పక్షవాతంతో మంచం పట్టింది. తన ఆహారంలో భాగంగా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు, నెయ్యి తీసుకుంటానని దాస్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బంధుదాస్ మార్గదర్శకునిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని పొరుగున ఉన్న బలన్సా గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త సంతోష్ సాహు అన్నారు.

Saturday, December 27, 2008

వీడేరా పోలీస్...

నాన్నా అని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన పనిలేదు. మరి అక్రమ సంబంధం ద్వారా పిల్లల్ని కంటేనో... అంటారా ? అలాంటి వాళ్లకు తల్లిదండ్రులుగా చెప్పుకునే అర్హత అంతకన్నా ఉండదు. ఆత్మీయతను అందుకోవడానికీ, అనురాగాన్ని పంచుకోవడానికీ ఉన్న మరో మార్గం మానవత్వం. అదే ఒక పోలీస్‌ను నాన్నా అనిపించింది. ఇది వరంగల్ జిల్లాలోని మరిపెడలో చాలాకాలం కిందట జరిగిన సంఘటనే అయినా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం...

ఈ జిల్లాలోని మరిపెడ గ్రామానికి 1997 ప్రాంతంలో 27 ఏళ్ల వయసుగల మతి స్థిమితం లేని ఒక యువతి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమెకు తెలుగు తెలియదు. ఊళ్లో వాళ్లు మాత్రం ఆమెను సత్యవతి అని పిలిచేవారు. మనం కూడా అలాగే పిలుద్దాం. సత్యవతి ఆ ఊళ్లో చెట్లు చేమల వెంట, బస్టాండ్ పరిసరాల్లోనూ తిరుగుతూ అడుక్కుంటూ ఉండేది. వయసులో ఉన్న యువతి పట్ల ఓ కామాంధుడి ప్రవర్తన కారణంగా పాపం ఆమె గర్భం దాల్చింది. తనకేమయిందో కూడా తెలియని స్థితిలో సత్యవతి అలాగే ఊరంతా తిరుగుతూ ఉండేది. రోజులు గడుస్తుండగా ఆమె ఒక రోజున ప్రసవవేదన పడుతుంటే అక్కడివారు ఆటో ఎక్కించి ఆసుపత్రికి పంపిస్తున్న తరుణంలో ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జరిగిందేంటో కూడా తెలియక ఆ పిచ్చితల్లి బిడ్డను కన్న వెంటనే రోడ్డెక్కి అడుక్కోవడానికి వెళ్లిపోయింది. బస్టాండ్‌లో ఆ పసిగుడ్డు అలాగే పడి ఉంది.

మరిపెడలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామరాజు సాంబయ్య ఈ విషయం తెలుసుకుని ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. బిడ్డకు వేద శాస్త్రోక్తంగా సాయికిరణ్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కడి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సాయికిరణ్‌ను చేర్చగా ఈ చిచ్చరపిడుగు అతని ఆశలు నెరవేర్చుతూ నూటికి నూరు మార్కులు సంపాదించి చల్ మోహనరంగా అంటున్నాడు. ప్రతి ఏటా డిసెంబర్ 10వ తేదీన ఈ దేవుడిచ్చిన బిడ్డకు రామరాజు ఘనంగా పుట్టినరోజు జరుపుతుంటారు. అంతేకాదు, ఈ చిన్నారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అక్కడి తపాలా కార్యాలయంలో జమ చేస్తూ వస్తున్నారు. నన్నడిగితే... వీడేరా పోలీస్ అంటాను.

Friday, December 26, 2008

సునామీ... షాజన్ ఉన్నాడు సుమీ!

జీవితాల్ని నాశనం చెయ్యడం నీకు తెలిస్తే... దాన్ని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు. సునామీ... నేనున్నాను సుమీ అంటూ నాలుగేళ్ల కిందట ఇదే రోజున (డిసెంబర్ 26, 2004) చోటుచేసుకున్న జలప్రళయం బారిన పడకుండా నాలుగు నిండు జీవితాల్ని కాపాడాడు తమిళనాట కన్యాకుమారి జిల్లాలో కడియపట్టణానికి చెందిన షాజన్. ఈ ఘటన జరిగినప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్న షాజన్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి ఇతనికి 'జీవన్‌రక్ష' పురస్కారమిచ్చి గౌరవించారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ఇక్కడి సెయింట్ పీటర్ మాథ్యమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షాజన్ డిసెంబర్ 26, 2004వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటికి దగ్గర్లో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎగసిపడుతున్న అలల్ని చూచి కేరింతలు కొడుతున్నాడు. అంతలో ఓ భారీ కెరటం షాజన్‌ను కొట్టుకుంటూ తీసుకుపోగా అతని ఒక ఇంటి పై కప్పుమీదకెళ్ళి పడ్డాడు. అది శేఖరాజన్ అనే వ్యక్తి ఇల్లు. ఆ ఇంట్లో కూడా పూర్తిగా నీరు చేరింది. పై కప్పు మీద ఉన్న షాజన్‌కు ఆ ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. ఆ ఇంటివారిని అప్రమత్తం చేసిన షాజన్‌ను చూచి కాపాడమంటూ తన మూడు నెలల పసికందును కింద ఉన్న శేఖరాజన్ అతనికి అందించాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా పొదివి పట్టుకున్న షాజన్ పక్కింటి కప్పుపై సురక్షితంగా ఉన్న వృద్ధుని చేతిలో పెట్టాడు.

అప్పుడే ఛార్లెస్ అనే వ్యక్తి ఇంట్లోంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించగా షాజన్ ఆ ఇంటి పైకప్పు ఎక్కి పైనున్న పెంకులు తొలగించి చూశాడు. అందులో తన మిత్రుడు విన్‌బ్రాండో, అతని చెల్లెలు నీటిలో చిక్కుకుని కనిపించారు. షాజన్ వారికి పైనుంచి తన చెయ్యి అందించి సినిమాల్లో చూపించే దృశ్యాల్లోలా వారిని పైకి లాగేందుకు ప్రయత్నించాడు. పట్టు జారిపోతున్నప్పటికీ పట్టు విడువక వారిని ఉడుం పట్టుతో విజయవంతంగా పైకి లాగి కాపాడాడు. అదే సమయంలో విద్యుత్ స్తంబానికి వేలాడుతూ కనిపించిన ఆంటోని శ్యామల అనే మహిళను కూడా షాజన్ రక్షించాడు. కిందకు దిగడానికి వీల్లేనంతగా సముద్రపు నీరు ఉండగా నేర్పరితనంతో ఇళ్ల పైకప్పులెక్కుతూ వారికి ప్రాణదానం చేశాడు ఈ జాలరి బిడ్డ. మరొకరైతే తాను బయటపడినందుకు బతుకు జీవుడా అంటూ తలదాచుకునేవారే తప్ప షాజన్‌లాగా స్పందించేవారా.

సునామీ నువ్వెంత?

సునామీ బాధితులైన ఆ చిన్నారులంతా చెన్నైలోని అన్నైసత్య అనాథ శరణాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలారు. వారు కుమిలిపోలేదు సరికదా బాధల్ని నమిలి మింగేసి, తమలాంటి మరిందరిని ఆదుకునేందుకు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని కష్టాల అంధకారంలో కాంతి పుంజాల్లా కదులుతున్నారు. వీళ్లు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సునామీ సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా 2005 డిసెంబర్ నెలలో 66 మంది చిన్నారులు 20 నిమిషాల వ్యవధిలో 72 అడుగుల పొడవైన భారీ చిత్రకళాఖండాన్ని రూపొందించారు. దీంతో అప్పటి వరకూ ఉన్న 43 అడుగుల పొడవైన కళాఖండం రికార్డు చెరిగిపోయింది. మరో సందర్భంలో వీరంతా కలసి 24 గంటల సమయంలో 35 ఎకరాల స్థలంలో 1.74 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. తమ సర్వస్వాన్నీ దూరం చేసిన సునామీని వెక్కిరిస్తూ విజయాలు సాధించుకుంటూ పోతున్న ఈ చిట్టి మనసుల ముందు ఓ సునామీ... నువ్వెంత?

అన్నట్టు మరో విషయం సు(నా)మీ... మా ప్రభుత్వాలది కూడా నీలా కరడుగట్టిన హృదయమే. అయితే, ప్రజలది మాత్రం మంచి మనసే. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో చదువుకుంటున్న విద్యార్థినులు కొందరు భారత సునామీ బాధితులకు చేయూతనిచ్చేందుకు వెయ్యి డాలర్ల నిధిని చెక్కు రూపంలో భారత ప్రధానమంత్రికి అందించారు. భారత్‌లో సునామీ వస్తే పాకిస్థాన్ జనం సంతోషిస్తారనుకున్నావు కదూ. వెర్రి సునామీ... జనాన్ని విడదీద్దామనుకున్నావు. నీ పాచికలు పారవులే.

Saturday, December 13, 2008

రక్త సంబంధం ఎన్టీఆర్, సావిత్రి...

ఇది రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి గురించి కాదుగానీ... అంతకంటే గొప్ప నిజజీవిత పాత్రల గురించి. కాకపోతే ఈ నిజ జీవితగాథలో ఇద్దరికీ పెళ్లి కాలేదు, వీళ్లు డబ్బున్నోళ్లు కాదు. అదే తేడా. ఇక సిద్ధయ్య వయసు 50 ఏళ్ల పైమాటే... అతని చెల్లెలి వయసు బహుశా 40 పైన ఉండొచ్చు. అయినా అతనికి ఆమె "చిట్టి" చెల్లెలే. ఎందుకంటే ఆమెకు పాపం మూర్ఛరోగమట. తాను పెళ్లి చేసుకుంటే తన భార్య, పిల్లల మధ్య ఆమెను పట్టించుకోగలనో లేదో అన్న అనుమానంతో సిద్ధయ్య పెళ్లే చేసుకోలేదు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన సిద్ధయ్య తల్లిదండ్రులు వీరి చిన్న వయసులోనే గతించారు. అప్పట్నుంచీ చెల్లెలు లచ్చవ్వకు అన్నీ సిద్ధయ్యే. తన జీవితాన్ని చెల్లెలి సేవకు అంకితం చేసేశాడు. ఆస్తి పాస్తులేమీ లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అడవికెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ రోజుకారోజు బియ్యం కొనుక్కుని చెల్లెలికి వంట చేసిపెట్టి తానూ తింటాడు. ఊరిలో ఎవరి ఇల్లయినా ఖాళీగా ఉంటే వీరు అందులో నివసిస్తుంటారు. వయసు మీదపడిన కొద్దీ శరీరం సహకరించడం లేదని బాధపడుతుంటాడు సిద్ధయ్య. అనుబంధాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో చెల్లెలి సుఖమే తన జీవితంగా భావించే సిద్ధయ్య లాంటి మనుషులు ఇంకా మన మధ్య ఉన్నారనేది నిజంగా నిజం.

సరోజ చేతిలో ఎర్రజెండా

గడచిన పాతికేళ్లుగా వేలూర్‌లోని వళ్లలార్ బస్టాండ్ గుండా వెళ్లే చెన్నై - బెంగళూర్ జాతీయ రహదారి ప్రాంతంలో చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఇక్కడేదో అదనపు ట్రాఫిక్ పోలీస్ పికెట్ గానీ, ప్రత్యేకంగా సిగ్నలింగ్ వ్యవస్థ గానీ ఉందనుకోకండి. అందుకు కారణం దాదాపు 70 ఏళ్ల పిల్ల (ఆమె చురుకుదనం చూచి నాకైతే ఇలాగే అనాలనిపిస్తోంది) సరోజ చేతిలో ఉండే ఎర్ర జెండా. అందరూ మామీ అని పిలిచే సరోజ ఆ రహదారిపై నిలబడి ఎర్రజెండా చూపిస్తే సైకిల్ నుంచి పంజాబ్ లారీ వరకూ వాహనాలన్నీ ఆగిపోవాల్సిందే. అప్పుడామె తన దగ్గర గుంపుగా నిలుచున్న పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటిస్తుంది. అవతలకెళ్లి ఎర్రజెండా దించాకే ఆ వాహనాలన్నీ కదుల్తాయి. ఇక ఈమె చరిత్ర తెలుసుకుందాం.

సరోజ ఈ ప్రాంతంలోని పర్వతమలై అనే కొండ దిగువన పోరంబోకు స్థలంలో పాత గుడిసెలో నివాసముంటుంది. ఒకప్పుడు స్థానిక గణపతి ఆలయంలో పూజారిగా పనిచేసే ఈమె భర్త వెంకటరామ అయ్యర్ కామెర్ల వ్యాధితో 20 ఏళ్ల కిందటే మరణించారు. అప్పట్నుంచీ పేదరికంతో బాధపడుతున్న సరోజకు 1982లో వంటమనిషిగా ఉద్యోగమిచ్చారు. 1997లో పదవీ విరమణ వయసు రావడంతో ఆ పని కాస్తా పోయింది. కూతుళ్లిద్దరున్నా వారికి పెళ్లిళ్లు కావడంతో వారికి బరువు కాకూడదని ఈమె గుడిసెలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమాజానికి తనకు తోచిన, తాను చేయగల్గిన ఏదో ఒక సహాయం చెయ్యాలన్న తపనతో ఎర్రజెండా చేతబూని పిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల్ని రోడ్డు దాటించి సహకరిస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఈ సేవ సాయంత్రం 5 గంటలకు పాఠశాల ముగియడంతో పూర్తవుతుంది. సరోజ సామాజిక స్పృహకు మెచ్చిన పాఠశాల యాజమాన్యం నెలకు రూ.200, ప్రభుత్వం ఇచ్చే నెలవారీ వృద్ధుల పింఛన్ మరో 200 రూపాయలు, పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ఇచ్చేవి ఈమెకు జీవనాధారం. ముదిమిలోనూ మానవసేవతో జీవితంలో కొత్త కోణాన్ని ఆస్వాదిస్తున్న సరోజ మనందరికీ స్ఫూర్తిదాయకమే కదూ...

Friday, November 21, 2008

చీపురు పట్టాడు ఉద్యోగం కొట్టాడు

అక్కడ బోలెడు చెత్త కనిపిస్తోంది. ఉన్నతాధికారులు, పనివాళ్లు అటూ ఇటూ తిరుగుతున్నారు గానీ ఆ చెత్తను తొలగించాలన్న ఇంగితం ఒక్కరికీ కలగలేదు. అదే సమయానికి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లతో ఆ ప్రాంగళం కిటకిటలాడుతోంది. ఇంటర్వ్యూకోసం సూటు బూటు వేసుకుని వచ్చిన 26 ఏళ్ల వికలాంగుడు గోపికన్నన్ పరిస్థితిని గమనించాడు. ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే అక్కడున్న చీపురు కట్ట తీసుకున్న ఊడ్చడం మొదలు పెట్టి పని పూర్తి చేశాడు. ఇతను ఊడ్చుతున్నప్పుడు అక్కడే ఉన్న పత్రికా ఫోటోగ్రాఫర్లు విలేఖరులు, గోపీకన్నన్ చొరవను ప్రశంసిస్తూ మర్నాడు పత్రికల్లో ప్రశంసిస్తూ వార్తలు వేసారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దృష్టికి వెళ్లడంతో వెంటనే మదురై మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

అసలు విషయం మీకు ఇంకా చెప్పలేదుగా... రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కార్యాలయానికి వేదికైన చెన్నైలోని సచివాలయంలో 2003 జులై నెలలో ఈ సంఘటన జరిగింది. గోపికన్నన్ వికలాంగుడే అయినా విద్యార్హతలతోబాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన మొనగాడు. మదురైలోని సుబ్రమణ్యపుర టీచర్స్ కాలనీ ఇతని నివాసం.

పద్యంతో మద్యం మాయం

అది పశ్చిమగోదావరి జిల్లా కొత్త తలారివాని పాలెం గ్రామం. మద్యం చుక్క పడందే నిద్రపట్టని గంగరాజు పూటుగా తాగి రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చాడు. ఐదో తరగతి చదువుతున్న ఇతని కొడుకు పడాల మహలక్ష్మినాయుడు ఆ రోజే తన పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతంగా పద్యాలు పాడి ఒక స్టీల్ కంచం బహుమతిగా అందుకున్నాడు. తండ్రికి ఈ బహుమతి చూపించాలన్న ఆరాటంలో తను సాధించిన బహుమతిని అతనికి చూపించాడు ఆ చిన్నారి. మందు పుచ్చుకున్న మత్తులో ఉన్న గంగరాజు దాన్ని విసిరికొట్టాడు. పాపం ఆ కొడుకు హృదయం గాయపడి నిద్రపోయాడు. కాసేపటికి మత్తుదిగిన గంగరాజు ఆ కంచం ఎప్పుడు కొన్నావని భార్యను అడిగాడు. ఆవిడ జరిగిన సంగతంతా చెప్పింది. తన ప్రవర్తనకు బాధపడిన గంగరాజు వెంటనే కొడుకును నిద్రలేపి పద్యాలు పాడమన్నాడు. తండ్రి అలా అడగటమే మహాభాగ్యంగా తలచిన ఆ కొడుకు వెంటనే రెండు పద్యాలు పాడి వాటి అర్థాలు వివరించాడు. గంగరాజు హృదయం గంగలా ఉప్పొంగింది. స్టీల్ కంచంకంటే పెద్ద బహుమతే ఇస్తాను ఏం కావాలో కోరుకోమని కొడుకుతో అన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోని ఆ కొడుకు ఇక ఏనాడు తాగరాదని తండ్రిని కోరాడు. ఊహ తెలిసినప్పటి నుంచి మద్యంతోనే పెరిగిన గంగరాజు కొడుక్కి మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు.

ఇక దీని మూలానికొద్దాం. మహాలక్ష్మి నాయుడు చదువుతున్న పాఠశాలలోని అతని గురువు పీలా బాబ్జీ ఈ బాలుడికి పద్య పఠనం నేర్పారు. అనకాపల్లిలో జరిగిన వివి రమణ వర్థంతి సభ సందర్భంగా బాబ్జీ తన గురువైన డాక్టర్ మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో మిగతా పిల్లలతోబాడు నాయుడుచేత కూడా పద్యాలు పాడించారు. రసరమ్యంగా ఉన్న నాయుడి ఆలాపనకు ముగ్ధులై ఈ కంచం బహుమతిగా ఇచ్చారు. ఆ పద్యమే ఆ తండ్రిచేత మద్యం మాన్పించింది. గంగరాజు భార్య సన్యాసమ్మ ఎన్నోమార్లు భర్తచేత తాగుడు మాన్పించాలని ప్రయత్నించింది. తాగనని గంగరాజు మాట ఇచ్చి మళ్లీ అదే బాట పట్టేవాడు. కానీ కొడుకు పద్యం వారి జీవితానికి కొత్త కోణాన్ని చూపించింది.

Friday, October 10, 2008

దానవీరశూర బాల కర్ణ

నాన్నా, ఈ కుర్రాడెవరు ? అని వార్తాపత్రిక చదువుతున్న తన తండ్రిని అందులో ఉన్న ఫొటో గురించి అడిగాడు ఐదేళ్ల సంజీవ్ కుమార్.

"అతనికి గుండె జబ్బు బాబూ. సాయం చెయ్యమని అడుగుతున్నారు. ఆపరేషన్ చెయ్యకపోతే చచ్చిపోతాట్ట" అని బదులిచ్చాడు తండ్రి వేణుగోపాల్.

"ఆ సాయం మనం చెయ్యలేమా నాన్నా ?" అడిగాడు సంజీవ్.

"అంత డబ్బు మన దగ్గర లేదుగా..." బదులిచ్చాడు నాన్న.

"సరేగానీ, నాకు ఈ దీపావళికి ఎన్ని రూపాయల బాణసంచా కొనిస్తావ్?" చెప్పు అనడిగాడు ఈ చిన్నారి.

తండ్రికి ఈ ప్రశ్న ఎందుకో అర్థం కాకపోయినా... "ఓ 2,500 రూపాయలవి కొంటా" అని చెప్పాడు నాన్న.

"అయితే, ఆ డబ్బు ఆ అబ్బాయికిచ్చి సాయం చేద్దాం." అని సంజీవ్ చెప్పగానే ఒక్కసారి ఆ కన్న తండ్రికి ఒళ్లు పులకరించి గగుర్పొడిచింది. చిన్న పిల్లాడికి వచ్చిన ఆలోచన తనకు రాకపోవడం పట్ల సిగ్గుపడ్డాడు కూడా.

ఈ సంఘటన 2003లో జరిగింది. ఆ రోజు మొదలుకొని చిన్నారి సంజీవ్ తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో ఓ 50 మందికి పైగా ఆపన్నులను ఆదుకున్నాడు. ఈ సాయాన్ని అతను పోస్ట్ ద్వారా పంపిస్తాడు. సాయమందుకున్నవారు కృతజ్ఞతతో రాసే ఉత్తరాల్ని చూచి పరమానందం పొందుతుంటాడు ఈ చెన్నై చిన్నారి.

హాకీ వీరుడుకూడా అయిన ఈ బాలకర్ణుడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా తమిళనాడు తరఫున పలు అంతర్ రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నాడు. మంచి హాకీ క్రీడాకారునిగా ఎదిగి ఆ డబ్బుతో తన సేవలను కొనసాగిస్తాట్ట. ఈ బుల్లి కర్ణుడి ఆశయం ఎన్నో జీవితాలకు కోత్త కోణాల్ని చూపించాలని ఆశిద్దాం.

Sunday, September 21, 2008

కుక్కపిల్ల ఉచితం

ఎవరైనా వికలాంగులను పెళ్లి చేసుకున్న విషయం ఆమె చెవినబడితే చాలు. వెంటనే వివరాలు తెలుసుకుని వీవీఐపీల ద్వారా వారికి కావలసిన సామగ్రి అందచేయడం తమిళనాడులోని నామక్కల్ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న మలర్ విళి అలవాటు. ఆవిడ అంతటితో ఆగిపోదు. అవయువాలన్నీ సక్రమంగా ఉన్న మనుషులకే నేటి సమాజంలో ఒంటరి పోరాటం తప్పడంలేదు. అందుకే ఆపత్సమయంలో అండగా ఉండేందుకు వికలాంగులకు ఒక కుక్కపిల్లను కూడా కొనిస్తారీమె. తాను కూడా వికలాంగురాలు కావడంతో వికలాంగుల బాధలు ఎలా ఉంటాయో మలర్ విళికి బాగా తెలుసు. వికలాంగులకు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈమె కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌తో చర్చలు జరుపుతారు.

తన తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఒకరైన మలర్ విళి చరిత్రలో ఎం.ఎ పట్టా అందుకున్నారు. గృహిణిగా, ఉద్యోగినిగా, సామాజిక సేవకురాలిగా ఎన్నో బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈమె గురించి తెలిసేనాటికి ఈవిడ నామక్కల్‌లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా ఎక్కడికి బదిలీ అయితే ఆ ప్రాంతంలో తన సేవలు కొనసాగిస్తుంటారు.

Sunday, August 17, 2008

మనసున్న మెకానిక్

చెన్నై జాఫర్‌ఖాన్ పేటలో ఉంటున్న సెంథిల్ (ఇతని గురించి తెలిసేనాటికి ఇతని వయసు 30) కార్ల మెకానిక్, పెద్దగా చదువుకోలేదు. ఇతని స్నేహితుడు విశాకన్‌కు పాపం పోలియో వల్ల ఎడమకాలు, కుడి చెయ్యి సరిగ్గా పనిచెయ్యవు. తన మిత్రుడికి ఎలాగైనా సహాయపడాలన్నది సెంథిల్ కోరిక. వెంటనే రంగంలోకి దిగి వికలాంగులు అవలీలగా నడపడానికి వీలుగా విశాకన్ వాహనంలో మార్పులు చేశాడు. అందులోని సీట్లు, యాక్సిలేటర్, బ్రేకులు వంటి భాగాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా వికలాంగులు ఉపయోగించుకునేలా రూపొందించాడు. హెడ్‌లైట్లు, హారన్ వంటివి పనిచెయ్యడానికి ఒకే స్విచ్ ఉండేలా సెంథిల్ ఏర్పాట్లు చేశాడు. సెంథిల్ తన స్నేహితుడు కావడం గర్వకారణమంటున్న విశాకన్ ఒకప్పుడు తన వాహనంలో కొంత దూరం వెళ్లడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు 50 కిలోమీటర్లకు మించి స్వయంగా ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు. ఈ స్నేహితుల గురించి తెలుసుకున్న చాలామంది వికలాంగులు ఇప్పుడు తమ కార్లతో సెంథిల్ షెడ్ వద్ద బార్లు తీరుతున్నారు.

Tuesday, July 22, 2008

ఆమెను గోమతి మామీ అంటారు

ఏ కుటుంబంలోనైనా మరణం సంభవించినట్లు తెలిస్తే చాలు, ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడానికి అక్కడ సిద్ధంగా ఉంటారు 70 ఏళ్లు పైబడిన గోమతి మామీ. అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చేస్తారు. వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పురోహితుణ్ణి మాట్లాడటంతోపాటు అంతిమయాత్రకు అవసరమైన పువ్వులు, నవధాన్యాలు, నూనె, గంధపుచెక్క, నిప్పు వరకూ అన్నిటికీ ఆమే దగ్గరుండి చేయూతనిస్తారు. ముఖ్యంగా బాధలో ఉన్నవారు ఏమీ తినరు. వారిని ఓదార్చి నాలుగు మెతుకులు తినిపించడం మర్చిపోరామె. తమిళనాడులోని ప్రముఖ నగరం కోయంబత్తూరుకు సమీపాన ఉన్న పొన్నయ రాజాపురంలో ఉంటారు సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 70 ఏళ్ల గోమతి అమ్మాళ్. అందరూ ఆమెను గోమతి మామీ అంటారు. 12 ఏళ్ల కిందట భర్తను కోల్పోయిన మామీ గారు ఆ దుఃఖాన్ని అనుభవించి తన లాంటి ఎందరికో సాయమందించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో అభ్యంతరాలు ఎదురైనా ఆవిడ పట్టించుకోలేదు. గత పదేళ్లకు పైగా ఈవిడ వేల సంఖ్యలో అంత్యక్రియలు జరిపించారు. పేదలకు అంతా ఉచితంగానే అందజేస్తారు. కుమార్తె మైథిలి, ఒక సహాయకుడు తోడుగా గోమతి మామీ తన సేవలు అందిస్తుంటారు. ఈవిడ దగ్గర అంబులెన్స్ కూడా ఉంది.

Saturday, June 14, 2008

సైకిల్ శాంతిదూతలు ఈ దంపతులు

ముందు వైపు గాంధీ చిత్రపటం, ఆయన హితోక్తుల బోర్డు, జాతీయ జెండా ఉన్న సైకిల్ మీ ఊరు వచ్చిందంటే దాని అర్థం కరుపయ్య, చిత్ర దంపతులు అక్కడికి వచ్చారని అర్థం. వీరిద్దరూ మొత్తం 268 రోజుల్లో 11 వేల 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దేశంలోని 17 రాష్ట్రాలు చుట్టి వచ్చారు. ఇంతకూ వీరు ఇదంతా చేసింది ఏదో వినోదం కోసమో లేదా విహారం కోసమో కాదు. వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ఉగ్రవాదంతో అశాంతిమయమైన మన దేశంలో శాంతి సామరస్యాల ప్రాధాన్యత ఏమిటనేది వివరించడమే వారి లక్ష్యం. తమిళనాడులోని మదురై జిల్లాలోని విరుదునగర్ సమీపాన గల విశ్వనత్తం గ్రామానికి చెందిన ఈ దంపతులు ఆగస్టు 4, 2003వ తేదీన యాత్ర ప్రారంభించి దిగ్విజయంగా ముగించారు. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ విశ్వనత్తం దంపతులు పేరుకు తగ్గట్టుగా విశ్వశాంతి కోరేవారే కదూ....

Wednesday, May 21, 2008

వేడినీళ్ల దానం

తమిళనాడులోని ప్రముఖ పట్టణం సేలం పేరు విననివారుండరు. ఇక్కడున్న ప్రభుత్వాసుపత్రి దగ్గర ఒక పేద మహిళ ఫుట్‌పాత్ పైనే టిఫిన్ దుకాణం నడుపుకుంటుంది. ఆమె టిఫిన్‌కు మాత్రమే డబ్బు తీసుకుంటుంది కానీ వేడి నీళ్లు మాత్రం ఎన్ని కావాలంటే అన్నీ ఉచితం. ముఖ్యంగా ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే పేదలు రోగులందరికీ వేడినీళ్లు, కాచి చల్లార్చిన నీళ్లు మత్రమే తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రభుత్వాసుపత్రుల్లో "మంచి" మంచినీళ్లకే కరవుగా ఉంటే ఇక వేణ్ణీళ్లు ఎక్కడుంటాయి. ఈ సమస్యను గ్రహించిన ఆ ఫుట్‌పాత్ హొటల్ యజమానురాలు ఉచితంగా వేణ్ణీళ్ల సరఫరా ప్రారంభించింది. మరో విషయం.. వేణ్ణీళ్లతోబాటు వాటిని పట్టుకెళ్లడానికి క్యాన్లు కూడా ఉచితమేనండోయ్.

Saturday, April 12, 2008

ఓటరు మహాశయురాలు

ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి ఓటేయడం కోసం 14 రోజుల పాటు తన 13 ఏళ్ల మనుమడి సాయంతో కాలినడకన 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన 65 ఏళ్ల ఓటరు రత్నం ఆమె. ఓటును అమ్ముకోవడమే తప్ప, ప్రజాస్వాములను నమ్ముకునే పరిస్థితులు లేని మన దేశంలో ఇంత గొప్ప ఓటరు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా ? మీరు అంతగా జుట్టు పీక్కోవలసిన పనిలేదు. భారతదేశంలో చాలామంది ప్రజాప్రతినిధుల అవినీతి చరిత్ర కథలు కథలుగా మీడియాలో సీరియళ్లుగా ప్రసారమవుతున్న ఈ రోజుల్లో ఓటేయడానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేంత గొప్ప ఓటర్లు ఎవరూ మన దేశంలో లేరన్న మాట నిజమే. రాచరికం నుంచి ప్రజాస్వామ్య దేశంగా రూపాంతరం చెందే క్రమంలో భూటాన్‌లో నిర్వహించిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన ఇది.

భూటాన్‌లో వాంగ్‌ఛుక్ వంశీయుల పాలనకు తెరదించే ఈ తొట్టతొలి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ పాల్గొని వారి వారి జన్మ స్థలాల్లో మాత్రమే ఓట్లు వేయాలన్న రాజు విజ్ఞప్తికి ఎంతమంది స్పందించారో తెలియదు గానీ, ష్యువాంగ్ డెమా మాత్రం రాజాజ్ఞను శిరోధార్యంగా భావించింది. కారులో వెళదామనుకుంటే వాంతులవుతాయని భయం. నాలుగేళ్ల కిందట ఓ సారి ఆమె కారు ప్రయాణం చేసినప్పుడు వాంతులై అనారోగ్యం పాలైందట. డెమాకు అది గుర్తొచ్చి వాహన ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుంది. ఏమైతేనేం ఎలాగైనా ఓటు వేసి తీరాలని నిర్మయించుకుంది.

భూటాన్ రాజధాని థింపూలో ఉంటున్న డెమా ఎట్టకేలకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో తన జన్మస్థలం ఉన్న ట్రాషియాంగ్‌స్టే జిల్లాకు కాలినడకన ప్రయాణం కట్టింది. భారీ పర్వత ప్రాంతాల గుండా క్లిష్టంగా సాగే ఈ ప్రయాణంలో ఆమె తన మనుమడితో నడుస్తూ రాత్రిళ్లు ఆయా గ్రామాల్లో బస చేసేది. చివరకు స్వస్థలానికి చేరుకొని తన సమీప బంధువు ఇంట్లోకి వెళ్లగానే వాళ్లంతా కన్నీళ్లపర్యంతమయ్యార్ట. ఎందుకంటే వాళ్లు ఈమెను చూసి దాదాపు నాలుగేళ్లయిందట. అందులోను ఈ వయసులో యుక్త వయసైనా రాని బాలునితో నడచి వచ్చిందన్న సంగతి తెలిసి నోరెళ్లబెట్టారు. చివరకు ఓటేసి ఆనందంగా థింపూ వెళ్లిందట డెమా.

డెమా సంగతి ఇలా ఉంటే... ఓట్లేయడానికి దేశంలోని లక్షల మంది జనం స్వస్థలాలకు నడచి వెళ్లకున్నా... వ్యయానికి లెక్క చేయక వాహనాల్లో వందల మైళ్ల దూరం ప్రయాణం చేసి ఓట్లేశారట. స్వంత ఊళ్లకు వెళుతున్నాం కదా అని బంధువులు, మిత్రులకు భారీగా బహుమానాలు పట్టుకెళ్లారట. బహుమానాలను కొనుగోలు చేయడం కోసం చాలా మంది అప్పులు కూడా చేశారట. ఎన్నికల పుణ్యమా అంటూ వాహనాలన్నీ కిటకిటలాడిపోవడం సంగతి అటుంచి కుటుంబీకులంతా ఒక చోట కలుసుకున్నందుకు ప్రజలంతా సంతోషపడ్డారట. ఇదిలా ఉంటే, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉంటున్న భూటాన్ జాతీయులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు కేవలం ఓటు వేయడానికి తమ స్వదేశానికి వచ్చినట్లు ది డ్రక్ అనే ఓ హొటల్ యజమాని దిలు గిరి చెప్పారు.

మన దేశంలో ఇలాంటివి ఊహించగలమా... ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లే లోపు ఆ ఓటును మరొకరు కాజేయరూ....

Friday, March 28, 2008

మాజీ మంత్రి కొడుకు : పేపర్ల అమ్మకం

కాస్త వీలు చేసుకొని అలా బీహార్‌లోని ముజఫర్‌పూర్ వెళ్లి మెయిన్ మార్కెట్లో నడచి ముందుకు నాలుగడుగులు వేస్తే... "ఆజ్ కా తాజా ఖబర్" అంటూ 50 ఏళ్లు దాటిన ఉదయ్ ప్రకాశ్ గుప్తా గొంతు పీలగా వినిపిస్తుంది. అయితే ఏంటంట అని మీరడగటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన గురించి ఎవరికీ తెలియదుగా. 60వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ మంత్రివర్గంలో ఆహారం మరియు పౌర సరఫరాల మంత్రిగా పనిచేసిన మోహన్ లాల్ గుప్తా కొడుకే ఈ ఉదయ్ ప్రకాశ్ గుప్తా.

వార్డు కౌన్సిలర్ కొడుకైతే చాలు ప్రపంచమే తనదైనట్లుగా మధువు, మగువలతో విలాసాల మధ్య ఒళ్లూపై తెలియకుండా మదమెక్కి ప్రవర్తించే ఈ రోజుల్లో ఉదయ్ ప్రకాశ్‌ను నేటి సమాజం వింత జీవిగానే పరిగణిస్తుంది. ఇప్పటి మంత్రులు తమ పిల్లల చేత ఓ వార్తా సంస్థ లేదా టీవీ ఛానల్ పెట్టించేస్తుండగా పాపం మోహన్ లాల్ గారికి, ఉదయ్ ప్రకాశ్‌కు అలాంటి తెలివితేటలు లేకపోయాయి.

ఉదయ్ దైనందిన కార్యక్రలాపాలు పొద్దుటే 4.30 గంటలకు మొదలవుతాయి. ముజఫర్‌పూర్‌లోని నయాటోలాలో ఉన్న తన ఇంటి నుంచి వార్తా పత్రికల కట్టలతో సైకిల్‌పై బయలుదేరి తన ఖాతాదారుల ఇళ్లకెళ్లి పేపర్లు వేస్తుంటాడు. ఈ పని పూర్తయ్యాక మెయిన్ మార్కెట్‌కు వెళ్లి "ఆజ్ కా తాజా ఖబర్" అంటూ పత్రికలు అమ్ముకుంటాడు.

మోటార్ మెకానిక్స్ కోర్సు పూర్తి చేసిన ఉదయ్ తండ్రి మోహన్ లాల్ మంత్రి అయినప్పటికీ సిద్ధాంతాలు, విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. కొడుకు సహా కుటుంబీకులు, బంధువుల పట్ల ఆశ్రత పక్షపాతం కనబరచలేదు. అందుకే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఉదయ్ బీహార్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. ఉదయం ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ 50వ దశకంలో నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు తమ నయాటోలా ఇంటిని సందర్శించిన సంగతులు నెమరు వేసుకున్నారు.

ఈ జీవితం మీకు బాధగా అనిపించడం లేదా అని అడిగితే... ఇదే బాగుందన్న సమాధానమే ఉదయ్ నోటి వెంట వచ్చే జవాబు.

Tuesday, February 19, 2008

ప్రేమికులా?... ఐఎల్‌పీలో చేరండి

అతనూ ఓ భగ్న ప్రేమికుడే ! ప్రేమించిన పాపానికి కుటుంబానికి దూరమై, అవమాన భారాన్ని మోసినవాడే ! అందుకే తనలాంటి వారి కోసం చెన్నైలో ఇండియన్ లవర్స్ పార్టీ (ఐఎల్‌పీ)ని ప్రారంభించాడు. మొన్న 14 తేదీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలోని కోడంబాక్కంలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించాడు. ఇంతకూ ఇతనెవరంటారా ? చెన్నైకి చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీకుమార్. ప్రస్తుతం ఐఎల్‌పీలో 5000 మంది సభ్యులు చేరగా ఇందులో 3000 మంది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల యువతులేనట (ప్రేమలో ఎక్కువగా మోసపోయేది యువతులేగా...)

ఐఎల్‌పీకీ ఓ జెండా... ఓ ఎజెండా కూడా ఉన్నాయండోయ్... హృదయంపై బాణం, మధ్యలో తాజ్‌మహల్ ఈ పార్టీ గుర్తు. ఇక ఎజెండా ఏమిటంటే... ఎన్ని ఆటంకాలెదురైనా ప్రేమకు లక్ష్యం పెళ్లేనన్న కృతనిశ్చయంతోనే పార్టీ సభ్యులను (ప్రేమికులు) ముందుకు నడిపించడం. ప్రేమ ఎంతో విలువైనదని, దీనిని అర్థం చేసుకోలేని కొందరు ప్రేమికుల దినోత్సవాలను వ్యతిరేకిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అన్నట్టు... ఈ ఏడాది వేలంటైన్స్ డేను శ్రీకుమార్ ఘనంగా జరిపాడు. చెన్నైలో ప్రేమ పుష్పాలు ఎక్కువగా వికసించే మెరీనా బీచ్, ఇలియట్స్ బీచ్, పార్కులకు వెళ్లి 'వాలెంటైన్స్ డే వర్థిల్లాలి' అనే నినాదం ఉన్న పోస్టర్లు అంటించాడు. కనిపించిన ప్రేమికులందరికీ గులాబీలు పంచి శుభాకాంక్షలు తెలిపాడు. అదే సమయంలో ఐఎల్‌పీ సభ్యులెవరూ వెకిలి చేష్ఠలకు పాల్పడకుండా, సమాజంలో అప్రతిష్ఠపాలు కాకుండా మార్గదర్శకాలు, నియమ నిబంధనలను కూడా రూపొందించాడు. ప్రేమికుల జీవితాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మజ్ను.

Saturday, January 26, 2008

ష్... గబ్బిలాలు ఎగిరిపోతాయ్

శబ్ద కాలుష్యం అతి తక్కువగా ఉన్న గ్రామాలపై సర్వే చేస్తే... చెన్నై - పాండిచ్చేరి సముద్రతీర మార్గమధ్యంలో ఉన్న కళుపెరుంబాక్కం అనే ఊరికి మొదటి బహుమతి ఖాయం. ఎందుకంటే గత 14 ఏళ్లుగా ఆ ఊరు శబ్దాలకు దూరంగా నిశ్శబ్దంగా ఉంటోంది. అంతేకాదు బాగా కాంతివంతమైన దీపాలు కూడా వెలిగించరు. దీపావళి పండుగ వచ్చినా అక్కడ ఇదే పరిస్థితి. బాంబులు, టపాసులు ఏమీ పేల్చరు.

ఏమిటయ్యా అని గట్టిగా ఆరా తీస్తే ష్... గబ్బిలాలు ఎగిరిపోతాయ్ మెల్లగా మాట్లాడమన్నారు. గబ్బిలాలేమిటి, ఎగిరిపోవడమేమిటి బాబూ కాస్త ఆ కథ, కమామీషు ఏమిటో సెలవిమ్మని అడిగితే అప్పుడు ఆ ఊరి పెద్ద పళనిస్వామి అసలు విషయం చెప్పారు. వాళ్ల ఊళ్లోని చెట్లపై 20 ఏళ్లుగా వందల సంఖ్యలో గబ్బిలాలు నివాసముంటున్నాయని, శబ్దాలకు బెదిరిపోయి అవి ఎగిరిపోకుండా తామంతా శబ్దాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు.

గబ్బిలాలు ఎగిరిపోతే ఏంటంట అని అడిగినవాళ్లను పళనిస్వామి గద్దిస్తూ... అంటే మా ఊరు సుఖంగా ఉండాలని లేదా మీకు అని రెట్టించి అడిగారు. గబ్బిలాలకు, మీ ఊరి సుఖసంతోషాలకు సంబంధమేంటో అర్థం కావడం లేదు కానీ... కాస్త ఆ గుట్టు విప్పండని అడిగితే అప్పుడు ఆయన మళ్లీ మొదలు పెట్టారు.

ఓసారి కళుపెరుంబాక్కం ఆలయంలో మేళతాళాలతో ఉత్సవం జరిగినప్పుడు ఈ గబ్బిలాలు ఆ ధ్వనులకు బెదిరిపోయి చెట్లు విడిచి వెళ్లిపోయాయట. ఆ తర్వాత రెండు రోజులకు ఈ గ్రామంలో జనం ఉన్నట్టుండి వ్యాధుల బారిన పడటం, పలువురు అకారణంగా మరణించడం, కరవు లాంటి అశుభాలు చోటు చేసుకున్నాయట. ఎన్నడూ లేని విధంగా విపరీత పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ చేటుకు కారణం చెట్ల మీద ఉండే గబ్బిలాలు ఎగిరిపోవడమేనని గ్రామస్తులకు అనిపించిందట. ఎందుకంటే, గబ్బిలాలు అన్నాళ్లూ చెట్లపై ఉన్నంతకాలం గ్రామం సుభిక్షంగా ఉందని, అవి బాజాభజంత్రీల శబ్దాలకు బెదిరి చెల్లా చెదురైనప్పుడే ఈ విషాదం సంభవించిందని వాళ్లంతా నమ్మారు. ఆ వెంటనే వాళ్లంతా శబ్దాలకు స్వస్తి పలికి, గబ్బిలాల్ని మళ్లీ రప్పించమని గుడిలో ప్రత్యేకంగా పూజలు జరిపించారు.

ఆ పూజలు ఫలించాయి. గలగలమంటూ గబ్బిలాలు మళ్లీ చెట్లపై వాలాయి. ఆ రోజు నుంచీ కలుపెరుంబాక్కంలో శబ్దాలు వినిపిస్తే ఒట్టు. ఇది ఊరి పెద్దల తీర్మానం.

Saturday, December 08, 2007

కప్పగంతులు...

జంతువుల్లో ఉభయచరమైన కప్ప నుంచి పుట్టిన ఈ కప్పగంతులు... మనుషుల్లో రాజకీయ నాయకులు మాత్రమే పార్టీలు మార్చేందుకు వేస్తుంటారు. అయితే తమిళనాడులోని వేలూరులో రాహుల్ గణేశ్ అనే 13 ఏళ్ల బాలుడు ఎయిడ్స్ వ్యాధిపై జనానికి అవగాహన కలిగించేందుకు డిసెంబర్ 7వ తేదీన ఏడు కిలోమీటర్ల దూరం కప్పగంతులు వేసుకుంటూ వెళ్లాడు. వేలూరు గ్రామీణ యువజన సంఘం నిర్వహించిన ఎయిడ్స్ ప్రచారంలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ కప్పగంతుల కార్యక్రమం సాగింది. మొత్తం మీద పరిశీలిస్తే రాహుల్ గణేశ్ కిలోమీటర్‌కు 1000 కప్పగంతులేసినట్లు లెక్క తేలింది. వేలూరులోని శ్రీపురం లక్ష్మీదేవి స్వర్ణాలయం నుంచి బస్టాండ్ వరకూ సాగిన ఈ కార్యక్రమంలో 100 చోట్ల ఆగి ఎయిడ్స్‌పై ప్రచారం కూడా చేశాడు. ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ను తరిమికొట్టి జీవితంలో కొత్త కోణాలను ఆస్వాదించమంటూ అరియూర్ గ్రామానికి చెందిన రాహుల్ గణేశ్ చేసిన ఈ వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. అతనిపై ప్రశంసల వర్షం కురిసింది.

Wednesday, November 28, 2007

ఆమె కాదని తెలిసింది....

చెన్నైలోని నారద గానసభలో ఓ అందమైన యువతి. జావళితో నాట్యాన్ని మొదలుపెట్టి పదాలు... కీర్తనలతో హావభావ యుక్తంగా నర్తించి ఆహూతులను ఓహో అనిపించింది. కార్యక్రమం ముగిశాక ముఖానికున్న రంగు చెరిపేసుకొని ఆ నర్తకి సభ ముందుకు వచ్చింది. జనం సంభ్రమాశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఆ నాట్యం చేసింది ఆమెకాదు. అలాగని అతడూ కాదు. ఆమే...అతడూ... కాని హిజ్రా 40 ఏళ్ల నటరాజ్.

తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి (కళల్లో మణిపూస... మన నంది అవార్డుకు సమానం) పురస్కారం. దూరదర్శన్ టాప్ గ్రేడ్ హోదా. దేశ విదేశాల్లో సన్మానాలు. ఇదీ నటరాజ్ సత్తా. హిజ్రాగా ఛీత్కారాల నేపథ్యమైన పాత జీవితపు రాళ్లబాటలో నడచిన నటరాజ్ అకుంఠిత దీక్షతో సత్కారాల పూలబాటలోకి అడుగుపెట్టారు. అసలొకసారి నటరాజ్ జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే....

నటరాజ్ పుట్టింది ఓ నిరుపేద కుటుంబంలో. నటరాజ్ పూర్తిగా 'అతడు' కాదని తెలిసిన క్షణం నుంచీ ఇంటితో మొదలై తోటి విద్యార్థుల వరకూ అందరి నుంచీ అవహేళనలే. ఎన్నో అవమానాల మధ్య నాట్యం నేర్చుకుంటే స్త్రీగా అభినయించి ఓ సంప్రదాయ జీవనశైలిని ఏర్పరచుకోవచ్చన్న ఆలోచన నటరాజ్ మదిలో అంకురించింది. సరైన గురువు దొరకక నాటి నటీమణులైన పద్మిని, వైజయంతిమాల సినిమాలు చూస్తూ, వారిని అనుకరించి ఎంత బాగా నాట్యాలు చేసినా ఎవరి నుంచీ ప్రోత్సాహం లేదు. ఇంట్లో నాట్య సాధనకు ఎవరూ ఒప్పుకునే వారు కాదు. దీంతో నటరాజ్ నాట్య సాధన స్మశానంలో సాగేది. (తాండవమాడే శివుడు కూడా ఇష్టపడేది రూద్రభూమినేగా...) తన శారీరక లోపం వల్ల కటుంబీకులు సైతం ఇబ్బందుల పాలవుతున్నారని గ్రహించిన నటరాజ్ తన 16వ ఏట తనకు ఎప్పుడూ ప్రోత్సాహమిచ్చే ఒకే ఒక స్నేహితుడు శక్తి భాస్కర్‌తో కలసి ఇల్లు విడిచిపెట్టారు. చేతిలో డబ్బుల్లేక ఇద్దరూ అష్టకష్టాల పాలయ్యారు.

తంజావూరులోని ప్రముఖ భరతనాట్య ఆచార్యులు కిట్టప్ప పిళ్లై గురించి తెలుసుకున్న నటరాజ్ ఆయన ముందుకెళ్లి తన ఆవేదనను వెళ్లగక్కారు. అయినప్పటికీ కిట్టప్ప పిళ్లై ఏడాది పాటు పరీక్షించాకే నటరాజ్ అంకితభావాన్ని గుర్తించి నాట్యాన్ని కూలంకుషంగా బోధించారు. 1999లో కిట్టప్ప మరణించేవరకూ... అంటే దాదాపు పదిహేనేళ్ల పాటు ఆయనను సేవించి నాట్య కళను అభ్యసించిన నటరాజ్ చెన్నై బాట పట్టారు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. హిజ్రా నాట్యం ఎవరు చూస్తారంటూ అవకాశాలు రాలేదు. అయినప్పటికీ పట్టు వీడని నటరాజ్ అవకాశాలు సంపాదించి తనను తాను నిరూపించుకున్నారు. నటరాజ్ ఏ స్థాయికి ఎదిగారంటే... అమెరికా, బ్రిటన్, రష్యా తదితర దేశాల్లో ప్రదర్శనలివ్వడంతో పాటు భరతనాట్యంలో ప్రముఖులమని చెప్పుకునేవారికి సైతం ఉన్నత శిక్షణనిస్తున్నారు.

స్త్రీ లేదా పురుషునిగా పుట్టినవారు ఒకసారే చస్తారని... అయితే హిజ్రాలుగా పుట్టినవారు అనుక్షణం అవమానాలతో చావలేక బతుకుతుంటారనేది నటరాజ్ తరచూ చెప్పేమాట. అందుకే వారు వ్యభిచారం లేదా యాచకవృత్తిని అశ్రయించి మరింత దిగజారిపోతున్నారని నటరాజ్ అంటుంటారు. హిజ్రాలను సానబడితే మెరిసే వజ్రాలెన్నో బయటకు వచ్చి సమాజానికి వెలుగును సైతం ఇస్తాయనడానికి నటరాజ్ జీవితం ఓ ఉదాహరణ. నిజమే మరి... అలా చేస్తే హిజ్రాల జీవితాల్లో కొత్త కోణాలు కదలాడతాయి.

Sunday, October 21, 2007

ఫర్జానా... ఐదు జీవితాలు

బీహార్ రాష్ట్రం పూర్ణే జిల్లాలోని బైసీ అనే పల్లెటూరులో ఉంటున్న ఫర్జానా అనే 15 ఏళ్ల బాలిక కోసం 2 వేల డాలర్ల డబ్బుతో వెదుక్కుంటూ వచ్చాడు హాంగ్‌కాంగ్ నుంచి పనిచేస్తున్న సుప్రీం మాస్టర్ చింగ్ హాయ్ ప్రపంచ సంఘ ప్రతినిధి యెటు కెన్. ఫర్జానా చేతికి డబ్బిచ్చి, భలే ధైర్య సాహసాలు ప్రదర్శించావంటూ మెచ్చుకొని ప్రశంసా పత్రం కూడా అందించి వెళ్లాడు. ఫర్జానా సాహసం గురించి తెలుసుకున్న స్థానిక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కూడా కానుకలందించారు. డబ్బులేక ఆమె చదువు మానేసిందని తెలుసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఫర్జానా చదువుకయ్యే ఖర్చు తాము భరిస్తామంటూ పాఠశాలలో చేర్పించారు. అసలు ఫర్జానా ఏం చేసిందో తెలుసుకుందాం...

నిరుపేద కుటుంబానికి చెందిన ఫర్జానా ఆ రోజు పనార్ నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటోంది. అల్లంత దూరంలో బోలెడు మోటార్ సైకిళ్లు, మరో 15 మందితో ఓ పెద్ద పడవ వెళుతోంది. పాపం తనకూ అలాంటి మోటార్ సైకిల్ పైన తిరగాలని ఉన్నా... కుదరదుగా. ఎందుకంటే నాన్న జమిల్ అహ్మద్‌కు కష్టపడటమే తప్ప వెనకేసుకోవడం తెలీదు.... కుటుంబం ఎలా గడుస్తుందే ఏమిటోనన్న ఆలోచనలతో బట్టల మురికి వదిలిస్తోంది. పరవళ్లు తొక్కుతున్న పనార్ ప్రవాహంతో సమానంగా ఆమె ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి....

రక్షించమంటూ కేకలు వినిపించడంతో ఆలోచనలకు అడ్డుకట్ట వేసి అటూవైపు చూసిందామె. ఇంకేముంది... తాను దేని గురించి ఆలోచిస్తోందో ఆ మోటార్ సైకిళ్లున్న పడవ నదిలో తిరగబడింది. జనాల హాహాకారాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫర్జానా ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే నదిలోకి దూకి ఓ మహిళ, ఇంకో ముగ్గురు పిల్లలు, మరో లావుపాటి పెద్దాయనతో పాటు మొత్తం ఐదుగురి ప్రాణాలు కాపాడింది. పదిహేనేళ్ల బక్కపిల్ల ఫర్జానా నీట మునుగుతున్న ఐదుగురి ప్రాణాలను కాపాడేందుకు ఎంత కిందామీదా పడి ఉంటుందో చెప్పనక్కర్లేదు. తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఈ సాహసానికి పూనుకుంది.

పేదరికం కారణంగా చదువుకు దూరమైన ఫర్జానా ఎంతో చురుకైన పిల్ల. గ్రామీణ భారతంలోని మామూలు బాలికల్లా క్రమశిక్షణ, కట్టుబాట్ల మధ్య జీవిస్తూనే తాను మాత్రం ఈత చాలా బాగా నేర్చుకుంది. అదే ఆ రోజున ఐదుగురికి పునర్జన్మనిచ్చి ఆ జీవితాల్లో కొత్త కోణాలను పూయించింది.

Thursday, September 27, 2007

పాపం తాబేళ్లు...

అది 2001వ సంవత్సరం. చెన్నైకి చెందిన సుప్రజ బీసెంట్ నగర్ సమీపానగల నీలాంగరై బీచ్‌లో వాకింగ్‌కు వెళ్లారు. బీచ్‌లో ఓ వస్తువు కోసం కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. మొత్తం మీద ఓ కుక్క దాన్ని నోట కరచుకొని కంగారుగా పరిగెడుతుండగా ఆ వస్తువు సుప్రజ కాళ్ల ముందు పడింది. తీరా చూస్తే... అది అలివ్ రిడ్లీ జాతి తాబేలు పిల్ల. ఆ క్షణంలోనే సుప్రజ మదిలో ఉదయించింది తాబేళ్ల సంక్షేమం కోసం కృషి చేసే 'ట్రీ ఫౌండేషన్'.

నీలాంగరై బీచ్‌లో అడుగడుగునా తాబేలు గుడ్లు.... వాటి నుంచి బయటకు వచ్చే తాబేలు పిల్లలు కనిపిస్తుంటాయి. అక్కడి జాలరి కుటుంబాలు ఈ తాబేలు గుడ్లను వండుకోవడం... ఒక్కోసారి ఈ పిల్లల్ని తమ పిల్లలకు ఆట వస్తువులుగా ఇవ్వడం తాబేళ్ల సంతతికి ముప్పుగా పరిణమించడం సుప్రజను కదిలించింది. ఈ పరిణామాల మధ్య ఆవిర్భవించిన ట్రీ ఫౌండేషన్ తాబేళ్ల రక్షణ దిశగా అక్కడి జాలర్ల గ్రామాల్లోని మత్స్యకారులకు, నౌకాశ్రయ సిబ్బందికి స్లయిడ్ షోల ద్వారా అవగాహన కలిగించేందుకు ఉద్యమించింది.

ట్రీ ఫౌండేషన్‌లో ఉన్న సుమారు 500 మంది సభ్యులు వివిధ గ్రామాలను దత్తత తీసుకొని తాబేళ్ల వల్ల కడలికి కలిగే ప్రయోజనాలు, పర్యావరణపరంగా వాటి ఆవశ్యకతపై పాఠాలు చెబుతుంటారు. 2001 నాటి సంఘటన తర్వాత పౌండేషన్ అధినేత్రి సుప్రజ మద్రాసులోని క్రోకడైల్ బ్యాంక్ ట్రస్ట్‌లో చేరి, సముద్ర తాబేళ్ల నిపుణుడైన కార్తీక్ శంకర్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకొని 2002లో ట్రీ ఫౌండేషన్‌కు శ్రీకారం చుట్టారు.

అలివ్ రిడ్లీ జాతి తాబేళ్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం... ఇవి 60 నుంచి 150 గుడ్ల వరకూ పెట్టి సముద్రంలోకి వెళ్లిపోతాయి. సుమారు 50 నుంచి 55 రోజుల తర్వాత గుడ్ల నుంచి బయటకు వచ్చిన తాబేలు పిల్లలు తమంత తాముగా సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత 12 నుంచి 14 ఏళ్ల కాలంలో ఆ తాబేళ్లు తాము పుట్టిన తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. సృష్టిలో ఎంతో అరుదైన విషయం ఇది.

తాబేళ్ల జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ట్రీ ఫౌండేషన్ వైనం ఇది.

Wednesday, August 29, 2007

ఆ కిడ్నీ పేరు రాఖీ...

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని మోడ్రన్ మెడికల్ ఇన్‌స్టిస్ట్యూట్ (ఎమ్ఎమ్ఐ) ట్రామా యూనిట్‌లోని బెడ్ నెంబర్ 5లో ఉన్న రోగి అసిమ్ కుమార్ సిన్హాకు ఆగస్టు 26వ తేదీ ఆదివారంనాడు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. నిబంధనల ప్రకారం అతనికి కిడ్నీ ఇచ్చింది రక్త సంబంధీకురాలు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటారేమో ! ఇక అసలు విషయం చెబుతా...

రాఖీ పౌర్ణమి దగ్గరకొచ్చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా కుంకురి గ్రామానికి చెందిన 36 ఏళ్ల అనూమిత స్నేహితురాళ్లంతా వాళ్ల అన్నయ్యలు, తమ్ముళ్ల కోసం ఖరీదైన రాఖీలు కొన్నారు. అనూమిత, ఆమె అక్క చెల్లెళ్లందరూ తమ సోదరుడికి ఈసారి తప్పనిసరిగా ఓ అపూర్వమైన కానుక ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే, నలుగురు అమ్మాయిలు, ముసలివాళ్లయిన తల్లిదండ్రులున్న ఆ కుటుంబానికి ఏకైక ఆధారమై, చాలీచాలని జీతంతో తమను ఇన్నేళ్లూ పాడుకుంటూ వచ్చాడు వాళ్లన్నయ్య అసిమ్ కుమార్ సిన్హా. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక కుటుంబానికే జీవితాన్ని అర్పించి, చివరకు మూత్రపిండాలు రెండూ దెబ్బతిని కొన్ని నెలలుగా ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.

రాఖీ పౌర్ణమి ఇక రెండ్రోజులే ఉంది. అనూమిత, అక్కా చెల్లెళ్లంతా కలసి ఎమ్ఎమ్ఐ డాక్టర్లను కలుసుకున్నారు. తమ నిర్ణయం చెప్పారు. చివరకు ఆందరికంటే ఆరోగ్యంగా ఉన్నందున అనూమితకే తన అన్నయ్యకు ఆ అపూర్వ కానుక ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ కానుకతో అసిమ్ మళ్లీ ఆరోగ్యవంతుడయ్యాడు. జీవితంలో సోదర ప్రేమకు అసలైన అర్థాన్ని చెబుతూ కిడ్నీ దానంతో అన్నయ్య జీవితంలో కొత్త కోణాన్ని చూపించిన అనూమిత అందరికీ ఆదర్శప్రాయమే.

Thursday, July 26, 2007

ఎన్రికో మెరిగల్లీ...

రీకో అసలు పేరు ఇదే. రీకో అంటే నేను చెబుతోంది వాచీ కంపెనీ గురించి మాత్రం కాదండోయ్. అయితే, ఇటలీలో పుట్టి ఏలూరులో స్థిరపడిన అరవైయ్యేళ్ల ఈ రీకో గారికి వాచీకి మధ్య పోల్చదగిన విషయం ఒకటుంది. ఈ రీకో గారు కూడా వాచీలాగే విరామం లేకుండా ఇరవైనాలుగ్గంటలూ సమాజ సేవ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మన దేశానికి మహా మహా సేవలు చేసిన మహాత్ములే గుర్తుండరు. ఇక ఎక్కడో ఇటలీ నుంచి వచ్చి, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో స్థిరపడి, గాంధేయ విలువలను శ్వాసిస్తూ, ఇటలీలోని తన ఆస్తులను అమ్ముకుని మరీ మన భారతీయులకు సేవలందిస్తున్న ఈ రీకో ఎంతమందికి గుర్తుంటారు చెప్పండి. అందుకే ఈయన్ని ఈ నెల కథానాయకుడిగా పరిచయం చేయాలనుకున్నాను.

ఇంతకీ రీకోగారు ఎక్కడుంటారో తెలుసా...? బాధితులు ఎక్కడుంటే అక్కడ. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు.... ఇలా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించినా... రీకో గారి సేవల్ని మాత్రం కించిత్తు కూడా కదిలించలేవు. నీటి సమస్య ఉన్నచోట బోర్లు వేయిస్తుంటారు. ప్రకృతి విలయతాండవం చేస్తే బాధితులకు ఆహారంతో సిద్ధంగా ఉంటారు. వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు ఇవ్వడం, వసతులు లేని పాఠశాలలకు బల్లలు, కంప్యూటర్ సదుపాయాలు కల్పించడం ఇలా రీకో సేవలు ఎన్నో.

యువతీ యువకులకు ఐటిఐ ద్వారా పలు వృత్తుల్లో శిక్షణనిస్తూ విద్యార్థుల వ్యక్తిగత సంక్షేమాన్ని గమనించే రీకో వారి పెళ్లిళ్లు చేసే బాధ్యతలను కూడా స్వీకరిస్తుంటారు. అరవయ్యేళ్లొచ్చినా ఆయన మాత్రం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఎన్‌ఫీల్డ్ పై దూసుకెళ్లే రీకో చదువుకునే రోజుల్లో మోటార్ సైకిల్ రేసులో ఛాంపియన్. మూడు దశాబ్దాలుగా తెలుగు దేశంలోనే ఉంటూ చక్కని తెలుగు మాట్లాడే రీకో అందరికీ ఆత్మీయుడే.


ఇంతకీ ఈయన మన దేశానికి ఎలా వచ్చారంటే... రీకో గారు ఇటలీలో ఉండే రోజుల్లో పి.ఐ.ఎం.ఇ (పీమే) అనే స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు. ఈ సంస్థకు మన దేశంలోనూ శాఖలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ చేపట్టే సేవల్లో భాగంగా తన సభ్యులను పలు దేశాలకు పంపుతుంటుంది. అలా రీకో గారు 1974వ సంవత్సరంలో భారత్ వచ్చారు. పీమే నిర్వహణలో ఉన్న ఏలూరులోని సెయింట్ జేవియర్ ఐటీఐ నుంచి ఈయన సేవలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.

Wednesday, June 13, 2007

అంధులు కాదు... సుస్వర బంధువులు

రవితేజ, భూమిక, గోపిక నటించిన "నా ఆటోగ్రాఫ్..." సినిమాలో "మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతోంది" అనే పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో భూమికతో నటించిన అంధ గాయకుడు, తమిళనాడు వాసి అయిన కోమగన్ కూడా మొక్కలాగా మౌనంగానే ఎదిగాడు. ఆ పాటలో కనిపించే వాద్య కళాకారులంతా మొక్క నుంచి మహావృక్షంగా ఎదిగిన కోమగన్ నీడలో సంగీత ఫలాలను ఆరగిస్తూ రాగభావాలను ఒలికిస్తుంటారు. వాళ్లెవరికీ కళ్లులేవు... అయినా గుండెగూళ్లలో సుస్వరాల గుళ్లు కడుతూనే ఉంటారు. ఈ సంగీత బృందం పేరు రాగప్రియ, దాని నిర్వాహకుడే ఆ కోమగన్.

సామాజిక బాధ్యతనెరిగిన ఈ (అను)రాగప్రియ బృందం తమ కచేరీల ద్వారా సంపాదించిన డబ్బును తమలాంటి శాపగ్రస్తుల కోసమే వినియోగిస్తూ సద్వినియోగం చేస్తుంటుంది. ఆ మధ్య ఎయిడ్స్ బాధిత బాలల కోసం కోమగన్ జట్టు 40 వేల రూపాయలకు పైగా మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. అలాగే వికలాంగ సంక్షేమానికి కూడా ఈ రాగప్రియ బృందం ధన సహాయం చేసింది. ఈ అంధ కళాకారుల ఉదారతకు ఇదో మచ్చుతునక మాత్రమే... ఆ మధ్య చెన్నైలో ఆర్కెస్ట్రాల మధ్య పోటీలు జరిగాయి. చాలా ఆర్కెస్ట్రాలు ఈ పోటీల్లో పాల్గొనగా రాగప్రియ అంధ బృందం రన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత 16 గంటల నిర్విరామ సంగీత విభావరి, ఈ మధ్య 50 గంటల నిర్విరామ సంగీత విభావరులు నిర్వహించి లిమ్కా బుక్ మరియు గిన్నిస్ బుక్‌ల దిశగా రాగప్రియ బృందం అడుగు వేసింది. ఆ మధ్య వీళ్లకు విదేశాలు వెళ్లే అవకాశం కూడా వచ్చింది. తమిళ, తెలుగు సినీరంగాలకు చెందిన ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు, సంగీత దర్శకులు రాగప్రియ కార్యక్రమాలకు ఎన్నోమార్లు విచ్చేసి ప్రశంసల వర్షం కురిపించారు. అలా... వీళ్లు మొదట తమిళ సినిమా (దాని పేరు కూడా ఆటోగ్రాఫే)లోకి ప్రవేశించి, తర్వాత మన రవితేజ దృష్టిలో పడ్డారన్నమాట. ఎస్పీబీ ఈ బృందాన్ని "ఆర్కెస్ట్రా బై గాడ్ బ్లెస్డ్" అని కొనియాడారు.

కచేరీల్లో పాటలు పాడేందుకు ఈ సంగీత బృందంలోని అంధ గాయనీ గాయకులు గానీ వాద్య కళాకారులుగానీ బ్రెయిలీ లిపిపై ఏమాత్రం ఆధారపడరు. ఈ అంధుల సంగీత బృందంలో ప్రతి ఒక్కరికీ కనీసం 200 పాటలు కంఠతా వచ్చు. అందరికీ వాళ్ల జ్ఞాపకశక్తే పెట్టుబడి. సాధనే వారి అసలైన బడి. అదే వాళ్ల అమ్మ ఒడి. అన్నట్లు వీరి గానం తమిళ భాషకే పరిమితం కాదండోయ్... తెలుగు, కన్నడ, మలయాళ గీతాలనూ అలపించగలరు. వీళ్ల సాధన పద్ధతి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా కొత్త సినిమా విడుదల కాగానే రాగప్రియ నిర్వాహకుడు కోమగన్ ఆ క్యాసెట్ లేదా సీడీ కొని అందులోని మంచి పాటల్ని ఎంపిక చేస్తాడు. తన రాగప్రియులందరికీ ఫోన్లు చేసి ఆ పాటలు వివరాలు చెప్పి సాధన చేయమంటాడు. ఆ తర్వాతి ఆదివారం అందరూ కలుసుకొని సామూహిక సాధన చేసి పరిపూర్ణత సాధిస్తారు.

అసలు ఈ అంధ సంగీత బృంద నిర్వాహకుడు కోమగన్ గురించి కొంచెం తెలుసుకుందాం. అతను పుట్టుగుడ్డి. తనలాగే అందరికీ కళ్లుండవేమో అనుకునేవాడట. చెన్నైలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థలో చేరాకే అసలు ఈ ప్రపంచం గురించి తెలుసుకున్నాడు. ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి. వైరు కుర్చీల అల్లిక నుంచి స్వరాల పల్లకీలు ఎక్కడం వరకూ అన్నీ అతనికి తెలుసు. పాడటం, ధ్వన్యనుకరణ (మిమిక్రీ), బేస్ గిటార్, డ్రమ్స్ ఇలా.... ఎన్నో అంశాల్లో నైపుణ్యాన్ని సాధించాడు. ప్రతి పురుషుని వెనుకా ఓ స్త్రీ ఉంటుందన్న నానుడి కోమగన్ విషయంలో నూటికి నూరుపాళ్లూ నిజం. కళ్లులేని కోమగన్‌ను అతని భార్య అనిత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె ప్రేరణతోనే అతను ఈ రాగప్రియ సంగీత బృందాన్ని స్థాపించడం, విజయాలు సాధించడం అన్నీ జరిగాయి. కోమగన్ - అనితలు మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం. మరెందరో అంధుల జీవితాల్లో కొత్త కోణాలను పూయిస్తారని ఆకాంక్షిద్దాం.

Saturday, May 26, 2007

కరవులోనూ కారుణ్యం...

అవి కర్నాటకలోని కోలార్ జిల్లా మిట్టూర్ గ్రామ పరిసరాలు. కొన్నేళ్ల కిందట తీవ్ర వర్షాభావం కారణంగా అక్కడ కరవు కాటకాలు కరాళ నృత్యం చేశాయి. అన్నం మెతుకు కోసం ఆ ప్రాంతంలోని రైతుల కుటుంబాలు క్షుద్బాధతో విలవిలలాడిపోయాయి. దాదాపు రెండేళ్ల పాటు పొలాల్లో తిండి గింజ మొలవలేదు. దీనికి తోడు ఆ ప్రాంతంలో కోతుల బెడద. ఏ చిన్న తినుబండారం కనిపించినా లాక్కుని పీక్కుపోతాయి. ఇక కరవుకాలంలో వాటి ఆగడాలు సహించనలవి కాదు. నీళ్లు సైతం లేక రైతులు ఎంతో శ్రమించి పండించిన అతి కొద్దిపాటి పంట కోతుల పాలయ్యేది. ఇలాంటి పరిస్థితే మన నగరాల్లో ఎదురైతే ఏం జరుగుతుందో ఊహించండి. వెంటనే కార్పోరేషన్ లేదా మున్సిపాలిటీ సిబ్బంది రంగ ప్రవేశం చేసి కోతుల్ని పట్టి బంధించి చంపడమో లేదా వాటిని సుదూర ప్రాంతాలకు తరలించేయడమో జరుగుతుంది.

మరి ఈ కర్నాటక రైతులేంచేశారో తెలుసా... కోతుల్ని తరిమేయలేదు సరికదా వాటి ఆకలి తీర్చడానికి నడుం బిగించారు. తినడానికి తమకేమీ లేకపోయినా సరే ఆ కోతుల్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆ ప్రాంతంలోని రైతు కుటుంబాలన్నీ వంతులు వేసుకొని కోతుల ఆకలి బాధను తీర్చే కార్యభారాన్ని తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. రోజూ ఆ కోతులకు రాగి ముద్దలను వండి పెడుతూ ప్రతి రైతు కుటుంబం ఈ జీవ కారుణ్య యజ్ఞంలో పాల్గొంది.

మనకు అన్నీ ఉన్నా పక్కవాళ్లను దోచుకోవడం, వీలైతే మన ఖర్చులు కూడా ఎదుటివాళ్లపై రుద్దేయడం, అధికార దుర్వినియోగం, భూ కబ్జాలు, మానవత్వం మంటగలిపేలా కన్నవాళ్లనే గెంటేయడం ఇలా చెప్పుకుంటూ పోతే మానవుల్లో దుర్బుద్ధులు చాలానే బయటపడతాయి. ఇక కరవు కాటకాల్లాంటివి వస్తే సొంత మనుషుల్ని పీక్కు తినడానికి సైతం వెనుకాడం. నాగరికంగా ఎంతో ఎదిగిపోయామనుకునే మనం, మానసికంగా ఇంకా మృగాలమేననిపిస్తుంది. తోటి మనిషినే పట్టించుకోని ఈ రోజుల్లో జంతుజాలానికి ప్రేమను పంచడమనే విలువలకు చోటేలేదు. ఆధునిక సమాజమంటూ మిడిసిపడే మనం గ్రామీణుల నుంచి మంచితనపు పాఠాలు ఎన్నో నేర్చుకోవాలి. అలాంటి పాఠమే ఇది. మన జీవితంలోనూ ఈ పాఠం ఓ కొత్తకోణాన్ని పూయిస్తుందని ఆశిస్తున్నా...

Tuesday, April 17, 2007

శవాల్ని వెదకడంలో సవాల్

దక్షిణ చెన్నైలో ఉన్న పల్లికరణైలోని జలటిన్ పేట వెళ్లయల్ కోవెల వీధికి ఎక్కువగా వచ్చేది అగ్నిమాపక దళం లేదా పోలీసు సిబ్బందే. హత్యలు, దొంగతనాలు లేదా ఇళ్లు తగలబడే కార్యక్రమాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే ! వీళ్లంతా అక్కడికొచ్చేది శవాల వెలికితీతలో దిట్ట అయిన 34 ఏళ్ల అంధుడు సుందర్‌రాజన్ కోసమే. ఇదే ఇతని వృత్తి, ప్రవృత్తి. ఒక్కో కాష్ఠాన్నీ (శవం) వెలికి తీయడంలో ఉన్న కష్టాన్ని బట్టి ఇతనికి రూ.500 నుంచి రూ.5000 వరకూ ఆదాయం వస్తుంది. బావులు లేదా చెరువుల్లో దూకి ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తులు, పడవలు లేదా బస్సులు ప్రమాదవశాత్తూ నీట మునిగినప్పుడు లోపలెక్కడో ఉన్న శవాల్ని బయటకు తీయడంలో పోలీసులు లేదా అగ్నిమాపక దళం సిబ్బందికి ఇబ్బందులతో సతమతమౌతున్నప్పుడు వాళ్లకు గుర్తొచ్చేది ఇతనే.

అసలు సుందర్‌రాజన్ ఈ వృత్తిలోకి ఎలా వచ్చాడో కొంచెం తెలుసుకుందాం. పుట్టుగుడ్డి అయిన ఇతను ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు తనుంటున్న ప్రాంతంలోని బావుల్లో మిత్రులతో కలిసి ఈత కొడుతుండే వాడట. ఎక్కువసేపు శ్వాస నిలిపి నీళ్లలో ఉండాలని వాళ్లలో వాళ్లు పందాలు కాసుకున్నప్పుడు విజయం సుందర్‌రాజన్‌నే వరించేది. మిత్రులంతా వెళ్లిపోయిన తర్వాత కూడా ఇతను ఒంటరిగా ఈ పద్ధతినే సాధన చేసేవాడు. దీంతో శ్వాస తీసుకోకుండా ఏకంగా 4 నిమిషాల పాటు నీళ్లలో ఉండటం సుందర్‌రాజన్‌కు అలవాటైంది. చివరకు శవాలను తీయడానికి ఎక్కువసేపు నీళ్లలో గడపటమే తన వృత్తిలో భాగంగా మారుతుందని తాను ఊహించలేదని ఇతను అంటుంటాడు. సుందర్‌రాజన్ 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నూతిలో దూకి ప్రాణాలు తీసుకున్న ఒక బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు నానా ఇక్కట్లకు గురికాగా వెంటనే సుందర్ రంగప్రవేశం చేసి క్షణాల్లో ఆ శవాన్ని లాగాడు. అలా ఇతని వృత్తి జీవితం మొదలైంది.

ఈ వృత్తిలోని సమస్యల గురించి సుందర్‌రాజన్ మాట్లాడుతూ... నీళ్లలో ఎక్కువసేపు ఉండటం ఎంతగా సాధన చేసినా రోజుల కొద్దీ నీళ్లలో కుళ్లిపోయిన మృతదేహాలను వెలికి తీసేటప్పుడు వచ్చే దుర్వాసన భరించలేనంతగా ఉంటుందని, అలాంటి సమయాల్లో ఊపిరి తీసుకోవడం ప్రాణాంతకంగా ఉంటుందని చెప్పాడు. ముఖ్యంగా బావులు, చెరువుల్లో విషపు పురుగులు కాట్లు వేస్తుంటాయని తన పరిస్థితిని వివరించాడు. ఈ వృత్తి గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే సుందర్‌రాజన్ సహించడు. గుడ్డివాడినైన తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోతే దేవుడే తనకు ఈ మార్గాన్ని చూపించాడంటూ పై వాడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అయితే, నీళ్లలో మునిగిన వారిలో ఒక్కరినైనా ప్రాణాలతో రక్షించగలిగితే అంతకు మించిన సంతృప్తి ఏదీ ఉండదని, అదే తన జీవితంలో ఓ కొత్త కోణమని సుందర్‌రాజన్ పేర్కొంటాడు. సుందర్‌రాజన్ అంతరంగం కూడా సుందర మందిరమే...

Friday, April 13, 2007

ఔదార్యానికి అర్థం చెప్పిన అరక్కోణం...

అది మార్చి 31, 2007వ తేదీ. మిగిలిన అందరి విషయంలో అయితే ఇది వాళ్ల జీవితంలో గడిచిపోయిన ఒక రోజు. పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు, కోయంబత్తూర్-చెన్నై రైలు ప్రయాణీకులకు మాత్రం ఔదార్యానికి అర్థం తెలిసిన రోజు. తమ జీవితాలను కాపాడిన రోజు. ఇక అసలు విషయానికి వద్దాం...

ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన బంద్ కారణంగా ఈ రాష్ట్రంలో తిరుపతి వెళ్లే మార్గంలో ఉన్న అరక్కోణం స్టేషన్‌లో పైన చెప్పిన రెండు రైళ్లూ ఆగిపోయాయి. సాయంత్రం వరకూ బళ్లు కదలవని చెప్పేశారు. బంద్ ప్రభావంతో చుట్టుపక్కల దుకాణాలు, హొటళ్లు ఏమీ లేవు. రాత్రంతా ప్రయాణించిన ఈ రైలు ప్రయాణీకులు పొద్దున్న కూడా ఏమీ తినలేదు. రోజు గడిచిపోతోంది... దాంతో పాటు ఆకలీ మండిపోతోంది. మిట్ట మధ్యాహ్నం వేళైంది. యువకుల సంగతి ఎలా ఉన్నా... పసి పిల్లలు, ముసలివాళ్ల సంగతి దయనీయం.

అదే సమయంలో అరక్కోణం పట్టణంలో అహింసకు ప్రతీకగా నిలిచిన జైన మహనీయుడు మహావీర జయంతి జరుగుతోంది. ఇందులో భాగంగా స్థానిక జైనులు సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం రైల్వే అధికారులకు ఎవరో చెప్పారు. దాంతో వాళ్లు వెంటనే స్పందించి ప్రయాణీకుల పరిస్థితిని మహావీర జయంతి నిర్వాహకులకు తెలియజేసారు.

ఇంకేముంది, మానవత్వం పరిమళించగా ప్రయాణీకుల క్షుద్బాధ ఉపశమించింది. ఆత్మారాముడు శాంతించి ఔదార్యానికి అర్థం చెప్పాడు. అరక్కోణం వారి జీవితంలో కొత్త కోణాన్ని పూయించింది.