అమెరికాలో ట్విన్ టవర్స్ను నేలకూల్చిన భయానక ఉగ్రవాదదాడి జరిగిన సెప్టెంబర్ 11 (9/11) వ తేదీని మానవాళి ఏనాడు మర్చిపోలేదు. అయితే ఇదే రోజున అమెరికాలోని కొన్ని వేలమందికి "ప్రేమ"ను పంచి ఇచ్చిన సంఘటన జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఆ రోజున ఈ ఘోరం జరిగిన సమయంలో విదేశాల నుంచి వచ్చే విమానాలు అమెరికాలో దిగడానికి అనుమతివ్వలేదు. అమెరికాలో తిరుగుతున్న చాలా విమానాల్ని మధ్యలోనే ఎక్కడికక్కడ సమీప విమానాశ్రయాల్లో అప్పటికప్పుడే ప్రభుత్వం దింపించేసింది. ఈ క్రమంలో న్యూ ఫౌండ్లేండ్ వద్ద జేండర్ అనే చిన్న ఊరికి సమీపాన గల విమానాశ్రయంలో సుమారు 55 విమానాలు దిగి అక్కడే ఆగిపోయాయి. వాటన్నిటిలో కలిపి 10,500 మంది ప్రయాణీకులున్నారు. వీరంతా ఉన్నట్టుండి దిగిన జేండర్ గ్రామ ప్రజల సంఖ్య 10,400. ఆ ఉరి ప్రజల సంఖ్యకు సమానంగా ఉన్న విమాన ప్రయాణీకులకు తగినన్ని హొటళ్ళు, సదుపాయాలు ఆ ఊరిలో అంతగా లేవు. దాంతో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన కొందరు ప్రయాణీకుల్ని అక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిస్పోర్ట్ అనే మరో ఊరికి పంపారు.
ఈ అతిథుల కోసం లెవిస్పోర్ట్ గ్రామస్తులు స్కూళ్ళకు సెలవులిచ్చి, కమ్యూనిటీ హాళ్ళలో బస ఏర్పాటు చేశారు. విమానప్రయాణీకులందరిని సౌకర్యంగా ఉంచేందుకుగాను మంచాలు, స్లీపింగ్ బ్యాగ్స్, దిళ్ళు, దుప్పట్లు అందించారు. ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే ముసలివారు, గర్భవతులు, రోగులకు ఆసుపత్రికి సమీపంలోను, ఆడవారికి తోడుగా ఆడవారే ఉండేలా, కుటుంబ సభ్యులంతా ఒకచోటే ఉండేలా బస ఏర్పాటు చేశారు. వీరికోసం రాత్రివేళల్లోనూ బేకరీలు, హోటళ్ళు తెరిపించారు. స్కూళ్ళలో ఉన్నవారికోసం లెవిస్పోర్ట్ ప్రజలు స్వయంగా వంట చేసిపెట్టారు. ఈ ప్రయాణీకులు అక్కడెన్నాళ్ళుంటారో తెలియదు. అయినా విసుగుచెందక వారికి కాలక్షేపం కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు ఎక్స్కర్షన్స్, పడవ ప్రయాణాలు ఏర్పాటు చేశారు.
అతిథులు లాండ్రి మేట్లకు వెళ్ళి దుస్తులు ఉతుక్కోవడానికి ఉచితంగా టోకెన్లు ఇచ్చారు. వీరికి ఇబ్బందులు కలుగకుండా స్కూల్ స్టూడెంట్స్ని స్వచ్ఛంద సేవకులుగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందీ లేకుండా అన్నిరకాలుగా సాయం చేసారు. ఒక రెండుమూడు రోజులు గడిచాక విమానాలు ఒకొక్కటిగా వెళుతున్నాయి. ఏ ఒక్కరూ ఫ్లయిట్ మిస్ కాకుండా అందర్నీ జాగ్రత్తగా విమానాలు ఎక్కించారు.
ఇలా వెళుతున్న విమానాల్లో ఫ్రాంక్ఫర్ట్ విమానం ఒకటి. ఇందులోని ప్రయాణీకులంతా కలసి తమకు ఆతిథ్యమిచ్చిన లెవిస్పోర్ట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే డెల్టా 15 (తమ విమానం నెంబర్) ట్రస్ట్ పేరిట ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. తాము బస చేసిన స్కూలు విద్యార్థులు కాలేజీలో చేరడానికి వీలుగా స్కాలర్షిప్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదన చేసిన ఒక ప్రయాణీకుని కంపెనీ మరి కొంత మొత్తం సాయం చేసింది. ఈ సంగతి తెలిసిన డెల్టా ఎయిర్లైన్స్ సంస్థ ఇంకొంత మొత్తం చేర్చింది. ఈ చక్కని ఆలోచన గురించి పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న మిగిలిన విమానాల్లోని ప్రయాణీకులు తమ వంతుగా డబ్బు పంపారు. దీంతో ఒక పెద్ద ఫండ్ ఏర్పడి లెవిస్పోర్ట్ విద్యార్థులకు సాయం అందుతోంది. నేటికీ ఆనాటి విమాన ప్రయాణీకులు వారి పుట్టినరోజు, పెళ్ళిరోజుల్లో ఈ ఫండ్కు డబ్బు పంపుతూ చేయూతనిస్తూ విద్యార్థుల జీవితాల్లో కొత్తకోణాల్ని పూయిస్తున్నారు. కూలిన ట్విన్ టవర్స్ కంటే ఎత్తయిన కట్టడాలు ప్రపంచంలో ఎన్నో ఉండవచ్చుగాక... వాటన్నిటికీ అంతనంత ఎత్తయింది తమ ప్రేమ అని ఇరువురూ చాటారు.
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.
Monday, August 23, 2010
టవర్స్కు అందని ప్రేమ... లెవిస్పోర్ట్ ఆతిథ్యం
Monday, July 26, 2010
మొక్కలు మొక్కే మనిషి
ఖమ్మం జిల్లావాసి దరిపల్లి రామయ్య ఎప్పుడు కనిపిస్తాడా.. ఆయనకు ఎప్పుడు మొక్కుదామా అని చెట్లన్నీ ఎదురు చూస్తున్నాయి. ఆయన్ని తమ కొమ్మలతో కావలించుకుని.. స్పృశించి తరించాలని తరులన్నీ ఆశపడుతుంటాయి. అయన తన తలకు "వృక్షో రక్షతి రక్షితః" అన్న నినాదం రాసి ఉన్న ఒక చక్రంలాంటి అట్టను తలకు ధరించి, మొక్కలతో సైకిల్ మీద ఊరూరూ తిరుగుతూ వాటిని పెంచమని అందరికీ పంచుతూ ఉంటాడు. మొక్కలు, చెట్లు... వాటి ఉపయోగాలపై చిన్నప్పుడెప్పుడో తన గురువుగారు చెప్పిన పాఠాన్ని గుర్తుంచుకుని ఈ సత్కార్యానికి పూనుకున్నారు రామయ్యగారు. మొక్కలు పంచడమేగాక వాటిని గురించి వనసూక్తులు, పాటలు రచించి గానం చేస్తుంటారు. తన జీవితకాలంలో కనీసం కోటి మొక్కలు నాటాలన్నది ఆయన లక్ష్యం. రామయ్యగారి కోరిక నెరవేరాలని మనమంతా కోటి దేవతల్ని వేడుకుందాం. ఇక రామయ్యగారి భార్యామణి (పేరు తెలియదు) కూలి పని చేసుకుంటూ తన భర్త ఉన్నతాశయానికి అండగా నిలుస్తున్నారు.
Monday, May 31, 2010
అంగదాతా జయీభవ
వికలాంగుడైన గూడూరి నలినేష్ బాబు (45) గుంటూరు జిల్లా మందడం గ్రామవాసి. తనకు పాదాలు లేకపోయినా... తనలా పాదాల్లేని వేలాదిమందికి కృత్రిమ పాదాలందించి పాదదాతగా వారి జీవితాల పాలిట ప్రాణదాత అయ్యారు. నలినేష్ బాబుకు 12 ఏళ్ళ వయసున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళూ పోయాయి. నలినేష్ తల్లిదండ్రులు ఆయనకు కృత్రిమ పాదాలు అమర్చడం కోసం ఏటా జైపూర్ తీసుకెళ్ళి 7,000 రూపాయలకు పైగా ఖర్చుపెట్టేవారు.
తర్వాత వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. అక్కడే సిద్ధార్థ కాలేజీలో బీకాం పూర్తి చేసుకున్న నలినేష్కు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే... ఏటా జైపూర్ వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు తనే స్వయంగా కృత్రిమ పాదాల్ని తయారు చేసుకోవడం. వెంటనే జైపూర్ వెళ్ళి కృత్రిమ పాదాల తయారీలో 6 నెలలు శిక్షణ పొందారు.
అనంతరం భారత్ వికాస్ పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన నలినేష్ అక్కడ 'కృత్రిమ పాదాల పరిశోధన - అభివృద్ధి' విభాగంలో 15 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడాయన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో మంగళం గ్రామంలో ఉన్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్గా ఉన్నారు.
ఇంతవరకూ నలినేష్ సుమారు 17,000కు పైగా కృత్రిమ పాదాల్ని తయారు చేయగా వాటిని భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే విధమైన సేవ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా జరిగింది. వికలాంగుల సౌకర్యం కోసం ఈ కృత్రిమ పాదాలకు ఇంటర్ లాక్ సిస్టంను పరిచయం చేసిన ఘనత ఈయనదే. అన్నట్టు... నలినేష్ కృత్రిమ పాదాలతో నడుస్తున్నవారిలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు.
అంగవికలురకు చేస్తున్న సేవలకుగాను నలినేష్ను రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో వరించాయి. కృత్రిమ పాదాలతో ఎందరినో నడిపిస్తూ వారి జీవితాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న అంగదాతా జయీభవ... సుఖీభవ....
తర్వాత వీరి కుటుంబం విజయవాడలో స్థిరపడింది. అక్కడే సిద్ధార్థ కాలేజీలో బీకాం పూర్తి చేసుకున్న నలినేష్కు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే... ఏటా జైపూర్ వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు తనే స్వయంగా కృత్రిమ పాదాల్ని తయారు చేసుకోవడం. వెంటనే జైపూర్ వెళ్ళి కృత్రిమ పాదాల తయారీలో 6 నెలలు శిక్షణ పొందారు.
అనంతరం భారత్ వికాస్ పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన నలినేష్ అక్కడ 'కృత్రిమ పాదాల పరిశోధన - అభివృద్ధి' విభాగంలో 15 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడాయన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో మంగళం గ్రామంలో ఉన్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్గా ఉన్నారు.
ఇంతవరకూ నలినేష్ సుమారు 17,000కు పైగా కృత్రిమ పాదాల్ని తయారు చేయగా వాటిని భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే విధమైన సేవ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా జరిగింది. వికలాంగుల సౌకర్యం కోసం ఈ కృత్రిమ పాదాలకు ఇంటర్ లాక్ సిస్టంను పరిచయం చేసిన ఘనత ఈయనదే. అన్నట్టు... నలినేష్ కృత్రిమ పాదాలతో నడుస్తున్నవారిలో ఆయన చిన్ననాటి స్నేహితుడు అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు.
అంగవికలురకు చేస్తున్న సేవలకుగాను నలినేష్ను రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో వరించాయి. కృత్రిమ పాదాలతో ఎందరినో నడిపిస్తూ వారి జీవితాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న అంగదాతా జయీభవ... సుఖీభవ....
Friday, April 30, 2010
నరికినందుకు నాటే శిక్ష
సుందర్ వాసుదేవ అనే పెద్ద మనిషి తన చిన్న మనసుతో 2003లో తాజ్పూర్ అనే గ్రామంలో 42 పీపల్ చెట్లను నేలకూల్చాడు. ఆయన ఢిల్లీ నగర వాసి. వాసుదేవ చేసిన తప్పును తీవ్రంగా పరిగణించి ఆయనపై "వృక్ష పరిరక్షణ చట్టం" కింద కేసు పెట్టారు. మామూలుగా అయితే ఆయన చేసిన తప్పుకుగాను ఆ చట్టం నిబంధనల మేరకు జరిమానా విధిస్తారు. అయితే ఢిల్లీలోని ఒక న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి దేవేందర్ కుమార్ భిన్నమైన శిక్షను విధించారు. అదేంటంటే... నరికిన ఒక్కో చెట్టుకూ పరిహారంగా ఐదేసి మొక్కల చొప్పున నాటాలి. అంటే వాసుదేవ మొత్తం 210 మొక్కలు నాటాలన్నది ఈ శిక్ష సారాంశం. అంతేగాక ఆయన ప్రవర్తనపై నిఘా ఉంటుందని, ఆరునెలల పాటు పరిశీలనలో ఉంటారని తెలియజేసి ప్రొబేషన్ మీద విడిచిపెట్టారు. ప్రాణవాయువునిచ్చి మానవాళి ప్రాణాలు కాపాడే వృక్ష దేవతల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ న్యాయమూర్తిగారు వనదేవతల జీవితాల్లో కొత్తకోణాలు పూయించిన పుణ్యమూర్తి.
Tuesday, March 30, 2010
కూలీల బండిలో అన్నమ్మూట
మీరెవరైనా కర్నూలు జిల్లాలో ఉన్న కృష్ణాపురం వెళితే అక్కడ ఓ పేద జంట కనిపిస్తుంది. వాళ్ళు బండి మీద రోజూ ఒక మూట పట్టుకెళుతుంటారు. ఎవరి కోసమో వెదుకుతుంటారు. అదేదో కూలిపని కోసం మోసుకెళ్ళే మూట అనుకుంటే మీరు పొరబడినట్లే... అదేమిటంటే... ఓ బండెడు అన్నం మూట. ఎవరికంటే, దారిలో ఏ జంతువు కనిపిస్తే దానికే. వీరు కొన్నేళ్ళుగా ఈ అన్నదాన యజ్ఞం చేస్తున్నారు. అన్నదాతా సుఖీభవ.
Saturday, February 27, 2010
కరెన్ చదువు మానలేదు...
ఇది చాలా రోజుల కిందటి సంగతి. అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్టన్ అనే ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అక్కడి విద్యార్థులంతా తమ బడిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో ఒకటి అందమైన పూల మొక్కల్ని నాటడం. ఇందుకోసం నిధులు సేకరించాలని నిర్ణయించారు. పిల్లలంతా వారి వారి ఇళ్ళలో చేసుకున్న ఆహారపదార్ధాల్ని అమ్మి నాలుగు వందల డాలర్లను పోగేశారు. ఇక మొక్కలు నాటడానికి రంగం సిద్ధమైంది. ఒక తేదీ నిర్ణయించి, ఆ రోజున విద్యార్థులు, వారి అమ్మానాన్నలు రావాలని పాఠశాల యాజమాన్యం అందరికీ కబురంపింది. అయితే, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొని ఎక్కువ మొత్తం సంపాదించడంలో ముందున్న నాలుగో తరగతి బాలిక కరెన్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేమని తన స్నేహితులకు చెప్పింది. అసలు సంగతి ఏమిటంటే, పాపం ఆ అమ్మాయి తండ్రికి ఉద్యోగం పోయింది. అద్దె ఇవ్వలేకపోవడంతో యజమానులు ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. దాంతో వారు ఊరు చివర తక్కువ ధరకు మరో చిన్న ఇంటికి మారాలనుకుంటున్నట్లు అందరికీ తెలిసింది. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే చిన్నారి కరెన్ ఇక బడికి రాదని తెలిసింది. ఇది మరో షాక్...
కరెన్ తోటి బాలుడు క్రిస్ రంగంలోకి దిగాడు. మిగిలినవారందరితోనూ చర్చించాడు. బడిని అందంగా మార్చడానికి సేకరించిన డబ్బును కరెన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగించాలని ప్రతిపాదించాడు. ఈ సంగతి పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. సేకరించిన సొమ్ముకు మరో అంత మొత్తాన్ని కలిపి కరెన్ కుటుంబానికి చేయూతనివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వార్త స్థానిక మీడియాకు తెలిసింది. ఇది పత్రికల్లో రావడంతో ఆ ఊరిలోని ధనవంతులు కొందరు మరికొంత సొమ్ము చేర్చి ఈ కుటుంబానికి ఇచ్చారు. అంతేకాకుండా కరెన్ తండ్రికి మరో ఉద్యోగం ఇప్పించారు. దాంతో కరెన్ కుటుంబం ఇల్లు ఖాళీ చెయ్యాల్సిన అవసరం గానీ, ఆమె చదువు మానాల్సిన అవసరంగానీ రాలేదు. ఆ తర్వాత ఆ బడిపిల్లల అమ్మానాన్నలు మరి కొంత సొమ్ము పోగుచేసి పాఠశాలను ముందుగా అనుకున్న ప్రకారం మంచి మొక్కలు నాటి అందంగా తయారు చేశారు. చూశారా... పిల్లల ఆదర్శంతో ఒక జీవితంలో కొత్తకోణం ఆవిష్కృతమైంది....
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.
కరెన్ తోటి బాలుడు క్రిస్ రంగంలోకి దిగాడు. మిగిలినవారందరితోనూ చర్చించాడు. బడిని అందంగా మార్చడానికి సేకరించిన డబ్బును కరెన్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగించాలని ప్రతిపాదించాడు. ఈ సంగతి పాఠశాల యాజమాన్యానికి తెలిసింది. సేకరించిన సొమ్ముకు మరో అంత మొత్తాన్ని కలిపి కరెన్ కుటుంబానికి చేయూతనివ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వార్త స్థానిక మీడియాకు తెలిసింది. ఇది పత్రికల్లో రావడంతో ఆ ఊరిలోని ధనవంతులు కొందరు మరికొంత సొమ్ము చేర్చి ఈ కుటుంబానికి ఇచ్చారు. అంతేకాకుండా కరెన్ తండ్రికి మరో ఉద్యోగం ఇప్పించారు. దాంతో కరెన్ కుటుంబం ఇల్లు ఖాళీ చెయ్యాల్సిన అవసరం గానీ, ఆమె చదువు మానాల్సిన అవసరంగానీ రాలేదు. ఆ తర్వాత ఆ బడిపిల్లల అమ్మానాన్నలు మరి కొంత సొమ్ము పోగుచేసి పాఠశాలను ముందుగా అనుకున్న ప్రకారం మంచి మొక్కలు నాటి అందంగా తయారు చేశారు. చూశారా... పిల్లల ఆదర్శంతో ఒక జీవితంలో కొత్తకోణం ఆవిష్కృతమైంది....
సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.
Tuesday, January 26, 2010
చూడలేని కామెంటేటర్...
జింబాబ్వేకు చెందిన డీన్ డు ప్లెసిస్కు ఒక తిరుగులేని సామర్థ్యముంది. అదేంటంటే... మ్యాచ్ చూడకుండానే కామెంట్రీ చెయ్యడం. కళ్లు లేకున్నా స్పందనలు, శబ్దాలను బట్టి క్రికెట్ పిచ్లో ఏం జరిగిందనేది పసిగట్టి కామెంట్రీ చేస్తాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు సేకరిస్తాను.
Monday, December 28, 2009
నెత్తురు ఉడుకుతోంది... మా రక్తం తీసుకోండి
అస్సాం రాష్ట్రానికి 2008వ సంవత్సరం ఒక పీడకలలాంటిది. వరుస బాంబు దాడులతో ఈ ఈశాన్యరాష్ట్రం అతలాకుతలమైంది. అలాంటి ఒక సందర్భంలో జరిగిన భయానక బాంబుదాడి పెద్దసంఖ్యలో జనాన్ని క్షతగాత్రుల్ని చేసింది. వారి ప్రాణం నిలపడానికి కావలసినంత రక్తం లేక ఆసుపత్రులు సతమతమవుతున్నాయి. చూస్తూ చూస్తూ కళ్ళముందే ప్రాణాలు పోతుంటే తట్టుకోలేకపోయిన గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బందికి మనసు కకావికలమైంది పాపం. చివరికి మీడియా, ఎస్ఎంఎస్ల ద్వారా రక్తం కోసం వీలైనంతమందికి విజ్ఞప్తులు పంపారు. ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని, ఒక వేళ స్పందించినా వారిచ్చే రక్తం సరిపోతుందో లేదోనన్న ఆందోళన.
మరికాసేపటికి ఉరుకులు పరుగుల మీద వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. వారంతా బాంబు దాడి బాధితులేమోనని ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. వచ్చింది బాధితులు కాదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలవారు, వ్యాపారులు, వినోదరంగాలకు చెందినవారు ముందుకొచ్చి మేమంటే మేమంటూ రక్తమివ్వడానికి ఉత్సాహం చూపారు. బాంబు దాడులతో మా నెత్తురు ఉడికిపోతోంది... మారక్తం తీసుకుని మావాళ్ళను కాపాడండి అని వారంతా ముక్తకంఠంతో స్పందించారు.
ఆ రోజున వారిచ్చిన రక్తంతో ఎందరో బాధితులు బతికిబట్టకట్టారు. బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఇక రక్తం దాచే చోటు కూడా లేదు. దాంతో చాలామంది దాతల వివరాలు తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని బలవంతంగా తిప్పిపంపారు. ప్రజల స్పందనతో గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎం ఎం దేకా ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఐక్యత దేశమంతటా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. దాతల రక్తంతో పునర్జన్మ ఎత్తిన బాధితులు ఆ ప్రేమ దేవుళ్ళకు చేతులెత్తి మొక్కారు.
మరికాసేపటికి ఉరుకులు పరుగుల మీద వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. వారంతా బాంబు దాడి బాధితులేమోనని ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. వచ్చింది బాధితులు కాదు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలవారు, వ్యాపారులు, వినోదరంగాలకు చెందినవారు ముందుకొచ్చి మేమంటే మేమంటూ రక్తమివ్వడానికి ఉత్సాహం చూపారు. బాంబు దాడులతో మా నెత్తురు ఉడికిపోతోంది... మారక్తం తీసుకుని మావాళ్ళను కాపాడండి అని వారంతా ముక్తకంఠంతో స్పందించారు.
ఆ రోజున వారిచ్చిన రక్తంతో ఎందరో బాధితులు బతికిబట్టకట్టారు. బ్లడ్ బ్యాంకుల్లో అయితే ఇక రక్తం దాచే చోటు కూడా లేదు. దాంతో చాలామంది దాతల వివరాలు తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని బలవంతంగా తిప్పిపంపారు. ప్రజల స్పందనతో గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎం ఎం దేకా ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ఐక్యత దేశమంతటా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. దాతల రక్తంతో పునర్జన్మ ఎత్తిన బాధితులు ఆ ప్రేమ దేవుళ్ళకు చేతులెత్తి మొక్కారు.
Wednesday, December 23, 2009
ఫోన్ చేస్తే రక్తమిస్తా....
మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ప్రశాంతినగర్ వాసి అయిన వరాల ప్రశాంత్ కుమార్ ఎప్పుడూ 'బీ పాజిటివే'. మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ 'సంచార రక్తనిధి'గా ప్రశంసలందుకున్నాడు. అంతేకాదు, ఫోన్ చేస్తే చాలు స్పందిస్తానంటూ తన ఫోన్ నెంబర్లు సైతం బహిరంగంగా ప్రకటించాడు (9397675737, 9949453585). రాత్రి, పగలన్న తేడా లేకుండా అత్యవసర సమయాల్లోను, రక్తం కావాలని వచ్చే టీవీ ప్రకటనలకు స్పందించి రక్తమిచ్చి ఎన్నో ప్రాణాల్ని నిలబెట్టాడు. లెక్కలేనన్నిమార్లు రక్తమివ్వడమేగాక, రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాడీ నిజమైన దేశభక్తుడు. ఆర్తులపాలిటి వరాల మూట వరాల ప్రశాంత్ కుమార్.
Tuesday, December 22, 2009
అతను కూరొండుకోలేదు
చెన్నైలోని పులియంతోపు ప్రాంతంలో జూలై 25, 2006వ తేదీన జరిగిందీ ఘటన. ఉదయం 7.30 గంటల సమయంలో ఒక ఆటోడ్రైవర్ ఆ ప్రాంతం గుండా వెళుతున్నాడు. అప్పుడు దారిలో పడి ఉన్న ఒక గుడ్లగూబ చుట్టూ కొన్ని కాకులు చేరి దాన్ని పొడుస్తుండటం ఈ ఆటోడ్రైవర్ కంటబడింది. ఒక్కసారిగా బండికి బ్రేక్ వేసి దాన్ని కాకుల బారినుంచి కాపాడి అక్కడికి సమీపాన ఉన్న అగ్నిమాపక దళం సిబ్బందికి విషయం చెప్పాడు. వారు వెంటనే ఆ గుడ్లగూబకు ప్రాథమిక చికిత్స చేసి బ్లూక్రాస్కు తరలించారు. అదే దారిలో వెళుతున్న చాలామంది వాహనదారులు వింతగా చూస్తున్నారే తప్ప ఒక్కరూ దానిని కాపాడే ప్రయత్నం చెయ్యలేదని ఆటో డ్రైవర్ ఆవేదన వెలిబుచ్చాడు. అదే మరొకరైతే ఈ గుడ్ల'గూబ గుయ్యిమని'పించి కూర వండేసుకుంటారు. ఒకప్పుడు మనకు రోజూ కనిపించే పిచ్చుకలతోబాటు పలురకాల పక్షి జాతులు నానాటికి అంతరించిపోతూ పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నప్పటికీ చదువుకున్నవారెందరో పట్టించుకోవడంలేదు. వారందరికీ ఆదర్శప్రాయుడీ ఆటో డ్రైవర్ (క్షమించండి, ఇతని పేరు తెలుసుకోలేకపోయాను).
Sunday, December 20, 2009
మూగజీవాల వృద్ధాశ్రమం
మనుషుల్లో మానవత్వం మృగ్యమై మృగాలవుతున్న ఈ రోజుల్లో చెన్నైకి చెందిన 45 ఏళ్ళ అశోక్ మాత్రం మూగజీవాల శోకాన్ని పోగొట్టేందుకు నడుం బిగించారు. 10 సంవత్సరాల కిందట చెన్నైలోని ఇంజంబాక్కంలో "బెంజీస్ డాగ్ అకాడెమీని" ప్రారంభించి తొలుత శునక (కుక్కలు) సంరక్షణ, తర్వాత మార్జాల (పిల్లులు) సంరక్షణ కూడా ఆయన చేపట్టారు. అమ్మానాన్నలు ముసలివారైతే ఎలా వదిలించుకోవాలా అని చూసే ఈ కాలం కుర్రకారు లాంటివారు కాదు అశోక్. ఈ మూగజీవాలకు వయసు మీరినా ఇబ్బందులు ఎదురుకాకుండా "మూగజీవాల వృద్ధాశ్రమం" కూడా ఏర్పాటు చేశారు. అవి తనువు చాలిస్తే వాటి అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా స్మశానవాటికను కూడా ఏర్పాటు చేశారాయన. ఈ మూగజీవాలకు అన్నంపెట్టి, వైద్యసేవలందించి ఆదరించడమేగాక వాటికి వివిధ అంశాల్లో తర్ఫీదునిప్పిస్తుంటారు. అందువల్ల అవి తెలుగు, తమిళ సినిమాల్లోను, వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తుంటాయి. అశోక్ జీవకారుణ్యం గురించిన స్థానికులు ఎప్పుడైనా బయటి ఊళ్ళకు వెళ్ళాల్సి వస్తే వారి జంతువుల్ని కొంతకాలం అశోక్ సంరక్షణలో ఉంచి వెళుతుంటారు. తన సేవలకు చెన్నైలో స్థలం చాలకపోవడంతో సమీపానగల ప్రముఖ పర్యాటకకేంద్రం మహాబలిపురంలో మరో విశ్రాంతి కేంద్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సేవలో ఆయన కుటుంబం తోడ్పాటు కూడా ఉంది.
అంధుని పంట పండింది
సకల అంగాలూ సక్రమంగానే పనిచేస్తున్నా కాలం కలసిరాలేదని కలత చెందే మందమతులకు అతను కనువిప్పు కల్గిస్తున్నాడు. నిరాశ, నిస్పృహలకు లోనైన వారికి ఈ అంధుని జీవితం ఒక గుణపాఠం. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం, చిగురుకోటకు చెందిన భట్రాజు చిననాగేశ్వరరావు కళ్ళముందు ఎప్పుడూ కారు చీకట్లే. ఒకరి తోడు లేకుండా తన జీవితం గడపలేని ప్రతికూల పరిస్థితుల్లో ఇతను వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. పుట్టుకతోనే కళ్ళులేని చిననాగేశ్వరరావు బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు. ఒకనాడు తన తండ్రితో బాటు పొలానికి వెళ్ళివస్తూ ఇతను కూడా సేద్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. కళ్ళు లేకున్నా కూలీలతో పనులు చేయిస్తూ దిగుబడుల్లో సాటి రైతులకంటే ముందున్నాడు. తనకు స్వంతంగా ఉన్న భూమితోపాటు ఇంకొంత భూమిని కౌలుకు సాగుచేసి మంచి 'ఫలసాయం' పొందాడు. ఒకప్పుడు చేపల చెరువుల నిర్వహణలో నష్టం రావడంతో తన భూములమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చినప్పటికీ దిగులుపడక మొక్కవోని దీక్షతో జీవితంలో ముందుగు సాగాడు చిననాగేశ్వరరావు.
Saturday, December 19, 2009
గొల్లనాగయ్య మూలికావైద్యం
మహబూబ్నగర్ జిల్లా చర్లపల్లికి చెందిన గొల్ల నాగయ్య కోసం ఆయన ఇంటివద్ద ప్రతిరోజూ వందల సంఖ్యలో జనం నిరీక్షిస్తుంటారు. మూలికావైద్యం, మేకపాలతో మందులివ్వడం ఈయన ప్రత్యేకత. ఏ మాత్రం డబ్బు ఆశించకుండా గత 30 ఏళ్ళ నుంచీ ఆయన ఈ సేవలందిస్తున్నారు. విశేషమేంటంటే... పెద్ద ఆసుపత్రుల్లో పనిచేసే నర్స్లు, ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఆయన వైద్య సేవలందుకుంటుంటారు. గొల్ల నాగయ్య కుమారులు కూడా తండ్రి బాటనే అనుసరిస్తూ రోగులకు స్వాంతన కల్గిస్తున్నారు. రోగుల సౌకర్యార్థం వారు తమ స్తోమత మేరకు ఒక రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసి ధన్వంతరి ఆశీస్సులు అందుకుంటున్నారు. గొల్ల నాగయ్య వైద్యం ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పూయించింది. అన్నట్టు మరిచిపోయా... ఈయన వైద్య సేవలు మూగజీవాలకు కూడా అందుతున్నాయ్.
వికలాంగుని చేపలవేట...
ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం సమీపానగల కె పల్లెపాలెం వాసి ఏసురత్నం. కాళ్ళులేని ఈ మత్స్యకారుడు తన ఇంట్లో పెద్దకొడుకు. ఈ వికలాంగుని చేపలవేటతోనే ఆ ఇంటికి పూటగడుస్తుంది. ముసలివారైన అమ్మానాన్నలు, అత్తింటివారి కట్నం వేధింపులతో తిరిగివచ్చిన సోదరి, మరో చెల్లెలు, ఒక తమ్ముణ్ణి ఇతను పోషిస్తున్నాడు. వీరుగాక మరో ఇద్దరు అక్కచెల్లెళ్ళకు తానే పెళ్ళిళ్ళు చేసి పంపాడు. కాళ్ళులేక తాను వికలాంగుడై ఉన్నప్పటికీ అతి కష్టం మీద తోటి జాలర్ల సాయంతో పడవ నడుపుకుంటూ చేపలకోసం నడి సముద్రంలోకి వెళ్ళోస్తాడితను. తీరనికష్టాలతో ఇతని కుటుంబమూ నడి సంద్రంలోనే ఉంది. అతని గుండె మాత్రం ఆత్మస్థైర్యపు అలలతో కదలాడుతూనే ఉంది. ప్రభుత్వ సాయం ఆశించక తన కుటుంబాన్ని తానే పోషించుకుంటున్న ఈ ఏసురత్నం... ఏ అమ్మానాన్నలకైనా నిజమైన పుత్రరత్నమే...
Friday, November 27, 2009
బ్యాంక్ మేనేజర్ జలయజ్ఞం
కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దేవరాజ్ అక్కడ మైసూర్ స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. దేశంలోని 30 నదుల అనుసంధానం, 50 వేలకు పైగా కుంటలకు జీవం పొయ్యడం లక్ష్యంగా కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకూ కొన్నేళ్ళ కిందట పాదయాత్ర చేపట్టారాయన. ఇందుకోసం తన ఉద్యోగానికి 9 నెలల పాటు సెలవు పెట్టి తన యాత్రలో భాగంగా 2006లో ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు. అప్పటికి ఆయన 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి నదులను అనుసంధానించాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈయన చేపట్టిన ఈ జలయజ్ఞం స్ఫూర్తిని రాజకీయ నాయకులు కూడా అందిపుచ్చుకోవాలి.
Thursday, November 26, 2009
సేవకుడు బాలసుబ్రహ్మణ్యన్
తమిళనాడులో దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మహామాఘం ఉత్సవం అంటే అందరికీ గుర్తుకొస్తారు 95 ఏళ్ల పైబడిన బాలసుబ్రహ్మణ్యన్. ఇంత పెద్దవయసులోనూ ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో సేవ చెయ్యడం కోసం పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవకులతో సన్నద్ధులవుతారు బాలసుబ్రహ్మణ్యన్. 1932 నుంచి ఈ సేవాయజ్ఞాన్ని తలపెట్టి 1944, 1956, 1968, 1980, 1992 సంవత్సరాల్లోనూ... తర్వాత 2004లో 95 ఏళ్ళ వయసులోనూ స్వచ్ఛంద సేవకుల బృందానికి నేతృత్వం వహించి తన బాధ్యతను నిర్వర్తించారాయన. స్కాట్స్ అండ్ గైడ్స్తో సుదీర్ఘకాల సాన్నిహిత్యం కలిగి ఉన్న బాలసుబ్రహ్మణ్యాన్ని తమిళనాడు ప్రభుత్వం నాగపట్టణం జిల్లాకు శాశ్వత కమిషనర్గా నియమించింది. న్యాయశాస్త్రపట్టభద్రుడైన ఈ సేవకుడు క్రైస్తవుల ఆరాధ్యదైవమైన వేలాంకన్నిమాత ఉత్సవానికి కూడా స్వచ్ఛంద సేవకులను తీసుకెళ్ళారు. అక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా, వినియోగదారుల మండలిలోను, ఉచిత న్యాయసహాయ సంఘంలోను సభ్యునిగా సేవలందించారు. నాగపట్టణం సెయింట్ జాన్స్ అంబులెన్స్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
Thursday, October 29, 2009
యమధర్మరాజా ఎంటర్ప్రైజెస్
పాన్ షాపులు, చిల్లర దుకాణాల్లో ఎక్కవగా అమ్ముడయ్యేవి బీడీలు, సిగరెట్లు, కిళ్ళీలు. చెన్నైలోని మందవెలి ప్రాంతంలో చిల్లర కొట్టు నడుపుకుంటున్న శివశంకర్ అనే దుకాణదారుడు ఇవేమీ అమ్మడు. కానీ ఆయన దుకాణం ముందు ఒక బోర్డ్ మాత్రం దర్శనమిస్తుంది. దానిపైన తమిళంలో రాసి ఉన్న ప్రకటనకు తెలుగు అనువాదం ఇది...
బంపర్ బహుమతులు
రోజూ క్రమం తప్పక బీడీలు, సిగరెట్లు తాగేవారికి మా యమధర్మరాజ ఎంటర్ప్రైజెస్ అందించే అద్భుతమైన బహుమతులు.
మొదటి బహుమతి - గుండె జబ్బు
రెండవ బహుమతి - పక్షవాతం
మూడవ బహుమతి - టీబీ
వారం వారం కానుక - ఆర్థిక సమస్యలు
శాశ్వత కానుక - మనోవేదన
బంపర్ బహుమతి - క్యాన్సర్...
ఇవి చాలా... ఇంకా కావాలా ?
బంపర్ బహుమతులు
రోజూ క్రమం తప్పక బీడీలు, సిగరెట్లు తాగేవారికి మా యమధర్మరాజ ఎంటర్ప్రైజెస్ అందించే అద్భుతమైన బహుమతులు.
మొదటి బహుమతి - గుండె జబ్బు
రెండవ బహుమతి - పక్షవాతం
మూడవ బహుమతి - టీబీ
వారం వారం కానుక - ఆర్థిక సమస్యలు
శాశ్వత కానుక - మనోవేదన
బంపర్ బహుమతి - క్యాన్సర్...
ఇవి చాలా... ఇంకా కావాలా ?
కళాకారుడు... సేవాతత్పరుడు
అతను ఒక సాధారణ తోటమాని కొడుకు. పేరు ప్రభాకరన్ (25). తమిళనాడులోని తన స్వస్థలమైన ముత్తుక్కాడులో తన 12వ సంవత్సరం నుంచీ సంప్రదాయ కళలైన తప్పెట, సిలంబాట్టం (కర్రసాము), గరగాట్టం, ఒయిలాట్టం, దేవరాట్టం లాంటివి నేర్చుకుని అమెరికా, బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్స్, హాలెండ్ తదితర దేశాల్లో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. అతను కేవలం ప్రదర్శనలకే పరిమితం కాలేదు. ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బుతో వికలాంగులకు చేయూతనిస్తుంటాడు. తనను ఇంతవాడిని చేసిన సంప్రదాయ కళల పునరుద్ధరణకు తోడ్పడుతుంటాడు. కళాకారులు ఎలా జీవించాలో చెప్పే పాఠమై నిలిచాడు. రుద్రవీణ సినిమాలో చిరంజీవిలాగా...
Tuesday, September 29, 2009
కండ(డా)క్టర్
బస్సులో టిక్కెట్ల గురించేకాదు, ప్రయాణీకుల ఆరోగ్యపు ఇక్కట్ల గురించి కూడా తెలుసు ఆ కండక్టర్ గారికి. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేసే వెంకటేశ్వర్లు తన ప్రవృత్తిగా వనమూలిగా వైద్యాన్ని ఎంచుకున్నారు. పేదలకు ఉచితంగా వనమూలికా వైద్యం చేస్తుంటారు. తన ఇంటి పెరట్లోనే ఔషధ మొక్కలు పెంచుతూ చిన్నతనం నుంచే మూలికల పట్ల మంచి అవగాహన పెంచుకున్నారు. ఆది, మంగళవారాలు ఈయనకు సెలవుదినాలు కావడంతో తన భార్య తోడ్పాటుతో ఇంటివద్దే మందులు తయారు చేసి స్థానికులకు వైద్యపరమైన చేయూతనిస్తున్నారు.
బాలింతలారా మొక్కలతో రండి
పండంటి బిడ్డను ప్రసవించేందుకు ఆ ఆసుపత్రికి వెళ్ళే ఏ గర్భిణి అయినా ఒక మొక్కను చేతబట్టుకుని మాత్రమే ఆ మెట్లెక్కాలి. అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు రోగుల ఉల్లాసం లక్ష్యంగా ఆ ఆసుపత్రి వైద్యులు పెట్టిన నిబంధన అది. దీనిని కనులారా గాంచాలనుకుంటే తమిళనాడులోని మదురై జిల్లా రాజ్కూర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాలి. ఇక్కడున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవానికి వచ్చే ప్రతి బాలింతా ఒక మొక్కను నాటాలని ఆసుపత్రి సిబ్బంది ఒక వినూత్న పథకం ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఆసుపత్రికి "మొక్కల ఆసుపత్రి" అనే పేరు వచ్చేసింది. అంతేకాదు, ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించే ఈ ఆసుపత్రి వైద్యురాలి సెల్ నెంబర్ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ తెలుసు. అందువల్ల వారు ఎప్పుడైనా తమ ఆరోగ్య సమస్యలపై ఏ సమయంలోనైనా వైద్యురాలిని సంప్రదించవచ్చు. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి మారుపేరని తరచూ విమర్శలు వెల్లువెత్తే నేటి పరిస్థితుల మధ్య ఒక ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ప్రజల మేలు కోరి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
Subscribe to:
Posts (Atom)