Monday, February 26, 2007

ఎదురులేని వెదురు మనిషి...

అస్సాంలోని నాల్‌బారీకి చెందిన దాధీ పాఠక్... ప్రమాదవశాత్తూ అతని నోటి ముందు మూడు పళ్లూ ఊడిపోతే టేకిటీజీ అనుకున్నాడు. వెంటనే వెదురు బొంగను ఆశ్రయించి దాంతోనే మూడు పళ్ల సెట్లు తయారు చేసుకున్నాడు. పదేళ్లుగా వాటినే వాడుకుంటూ చేపలు, చికెన్ నమిలి నమిలి తింటున్నా ఏమీ కాని వెదురు పళ్లతో దంత వైద్యుల్నే సవాల్ చేశాడు. ఈశాన్య భారతదేశంలోని కోట్లాది పేద కుటుంబాల్లో ఎందరో సృజనశీలురున్నారు. వారులో ఒకడు దాధీ పాఠక్. ఇతను ఈ పళ్ల సెట్ తయారీతో సంతృప్తిపడలేదు. స్వతహాగా పాటగాడు కనుక పళ్లూ ఊడిపోతే పాటలో స్పష్టత లోపిస్తుంది కాబట్టి ప్రకృతి ఉత్పత్తినే ఈ లోపాన్ని అధిగమించేందుకు ఉపయోగించుకున్నాడు.

దాధీ పాఠక్ ఏనాడూ తన గ్రామం వదలి బయటకు వెళ్లలేదు. ఓ రోజు ఉన్నట్టుండి ఆ గ్రామంలో వెదురుతో చేసిన తాజ్‌మహల్ వెలిసింది. అందరూ వహ్ తాజ్ అనుకున్నారు. ఇది దాధీ పాఠక్ పనే అని వేరే చెప్పాలా... అయితే గ్రామస్తులందరికీ వచ్చిన సందేహమల్లా అతను తమకు తెలియకుండా ఆగ్రా ఎప్పుడు వెళ్లాడా అని. క్యాలెండర్లో తాను చూసిన తాజ్ బొమ్మకే వెదురుతో ప్రాణం పోశానన్న పాఠక్ మాటలతో వాళ్లంతా అవాక్కయ్యారు. లక్ష రూపాయలు ఇస్తామన్నా అతను దీన్ని అమ్మలేదు. సరైఘాట్ వంతెన సహా అస్సాంలోని పలు చారిత్రక కట్టడాలకు కూడా వెదురు ప్రతిరూపాలను తయారుచేసి తన సత్తా చాటాడు.

ఎలాంటి సమస్య వచ్చినా మనసు చెదిరిపోకుండా... నదురూ... బెదురూ లేకుండా అన్నిటికీ వెదురునే ఆశ్రయిస్తూ తన పొదరింట్లోనే (అదీ వెదురిల్లేనండోయ్) ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు పాఠకు. తన చిన్న చిన్న అవసరాలకు అటూ ఇటూ వెళ్లడానికి ఒక వాహనం ఉంటే బాగుంటుందని పాఠక్‌కు అనిపించింది. ఈ పాటికే మీరు ఊహించే ఉంటారు. అతను ఏం చేసి ఉంటాడా అని. మీరనుకున్నది దాదాపు నిజమే. వెదురు బొంగలతోనే సైకిల్ తయారు చేసుకున్నాడు. ఈ సైకిల్ చైన్, టైర్లు, ట్యూబులు తప్ప మిగిలిన ప్రతి భాగమూ వెదురుతో తయారు చేసిందే. ఆ సైకిల్ మీదే పాఠక్ కొడుకు పాఠశాలకు వెళుతుంటాడు. ఇంతటితో ఆగని పాఠక్ బస్సు నమూనాలు కూడా తయారు చేశాడు. ఇతను తయారు చేసిన ఒక బొమ్మ రైలు విషయం ఇంకా విచిత్రమైంది. వేణువు ఊదుతూంటే దాని స్వరాలే వాహకంగా ఈ రైలు కదులుతుందట. భలే ఆశ్చర్యం కదూ...

ఇంకా చెప్పాలంటే...బావులు, చెరువుల నుంచి నీళ్లు తోడుకోవడానికి వెదురుతోనే ఇతను చేతిపంపు తయారు చేశాడు. దాని పిస్టన్, వాల్వ్, బారెల్, హ్యాండిల్ అన్ని భాగాలూ వెదురే. సంగీత వాద్యాలతో పాటు ఇంకా ఎన్నో వస్తువులు పాఠక్ ప్రతిభకు ప్రతీకలుగా అతని ఇంట్లో కనిపిస్తాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రశంసలందుకున్న దాధీ పాఠక్ జీవితంలో ఎన్ని కొత్త కోణాలో... అతనికే కాదు అతని కళారూపాలను చూసినవారికి కూడా.

Monday, January 29, 2007

జలమా... హాలాహలమా...

సంజీవి... తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా రామభద్రకండ్రిగకు చెందిన హొటల్ కార్మికుడు. అలమట్టి, బాబ్లీ, కావేరి... ఇలా జలం కోసం జరుగుతున్న జనం చేసే పోరాటాలు కోలాహలంగా ప్రారంభమై హాలాహలాన్ని సృష్టించక ముందే జల చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం అతనికి కనిపించింది. వెంటనే అతనూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించేయాలని అనుకోలేదు. ఉద్యమాలు సృష్టించే స్థాయి భేదాల గురించి అతనికీ తెలుసు. అందుకే వన్ మ్యాన్ అర్మీగా అవతారమెత్తాడు. సైకిల్‌నే తన చైతన్య రథంగా చేసుకొని దక్షిణాది నాలుగు రాష్ట్రాల వెంబడి అవగాహన పర్యటన చేపట్టాడు.

జటిలమైన జల పోరాటాల చిక్కు ముడులను విప్పాలంటే నదుల అనుసంధానమే మార్గం అంటున్నాడితను. ఇదే విషయాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పలువురు ఎలుగెత్తి చాటినా... వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు, కాగితాలపై రాతలు జనసామాన్యుల హృదయాలను అంత సులభంగా తాకలేవంటున్నాడు సంజీవి. కుటుంబాలను కాలరాస్తున్న జల ప్రళయాలను అడ్డుకోవాలంటే ప్రతి వ్యక్తీ చొరవ తీసుకొని ఈ మంచిపనికి పూనుకోవాలని, ఆ దిశగా వ్యక్తులందరినీ ప్రేరేపించాలంటే వారితో మమేకమై వ్యక్తిగతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చెయ్యాలని సంజీవి నిర్ణయించుకున్నాడు.

తన ప్రయత్నంలో భాగంగా సంజీవి సైకిల్ ప్రారంభించి దక్షిణాది పర్యటనను విజయవంతంగా పూర్తి చేశాడు. నదుల అనుసంధానంలో భాగంగా మొదట దక్షిణ భారతదేశపు నదులనైనా అనుసంధానించేందుకు ప్రభుత్వాలు - ప్రజలు ముందుకు రావాలని అతను కనిపించిన ప్రతివారినీ కోరాడు. ఈ ప్రయత్నం ఫలించి ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలు పుట్టుకు రావాలని అతను ఆకాంక్షిస్తున్నాడు.

Saturday, December 23, 2006

రోడ్ వాటర్ కారు... నడక భలే జోరు

ప్రజ్ఞకు వయసుతో సంబంధం లేదని యువ అవిష్కర్త వినోద్ రూపంలో మరోమారు నిరూపితమైంది. అనుకున్నది సాధించడానికి పాపం ఈ యువకుడు అప్పుల పాలు కావడానికి సైతం సిద్ధపడ్డాడు. కేరళ రాజధాని ట్రివేండ్రం సమీపంలోని బలరాంపురం ప్రాంతంలో ఉన్న రస్సెల్‌పురం వాస్తవ్యుడు పిఎస్ వినోద్ వయసు 2003 నాటికి 28 ఏళ్లు. అప్పటి వయసు ఇప్పుడెందుకు అనుకోవద్దు. ఈ మహత్కార్యానికి బీజం పడింది అప్పుడే.

వర్షాకాలం వస్తే కేరళ వాసులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. అందుకని రోడ్డు మరియు నీళ్లలో నడిచే కారును (Amphibious Car) తయారుచేయాలని వినోద్ నిర్ణయించుకున్నాడు. ఎస్సెస్సెల్సీ చదువుకొని, ఐటిఐలో రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసి కారు, ఎసీ మెకానిక్‌గా స్వంత వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వినోద్‌కు ఈ ఆలోచన వచ్చిందే తడవుగా పాతిక వేలకు ఒకటి చొప్పున 1985 మాడల్ మారుతీ కార్లు మూడు కొని తన ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతరత్రా చాలా మంది నుంచి 8 లక్షలకు పైగా అప్పులు చేయాల్సి వచ్చింది. మొత్తానికి మొదటి రెండు ప్రయోగాలు విఫలంకాగా (అంటే 2 మారుతీ కార్లు హాంఫట్...) మూడో ప్రయత్నం విజయవంతమైంది.

ఈ రోడ్ వాటర్ కారు పరిజ్ఞానాన్ని నేవీ, కోస్ట్ గార్డ్ విభాగాలకు ఇవ్వడానికి వినోద్ సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా కేరళ సహా ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లోను, ఈశాన్య భారత రాష్ట్రాల్లో రోడ్డు మార్గంతో పోటీపడుతూ వాటికి సమాంతరంగా కిలోమీటర్ల పాటు సాగే పొడవైన జల మార్గాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో రవాణాకు ఇదెంతో ఉపకరిస్తుంది. రద్దీ కారణంగా ఆలస్యం జరిగే పరిస్థితులను అధిగమించవచ్చు. ముంబై, చెన్నై నగరాల్లో ఆ మధ్య సంభవించిన భారీ వరదలకు రోడ్లన్నీ రోజుల తరబడి నీళ్లలోనే ఉండిపోయాయి. ఇలాంటి సమస్యలకు వినోద్ రూపొందించిన రోడ్ వాటర్ కారు సరైన సమాధానం. సాంకేతికంగా తగు జాగ్రత్తలు తీసుకొని, అన్ని విధాలా పటిష్టంగా ఉండేలా వినోద్ ఈ కారును రూపొందించాడు. ఒక స్నేహితుని సాయంతో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దృష్టికి వచ్చిన వినోద్ కృషిని ఆ సంస్థ వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఇతరులు సైతం ఇలాంటి వాటిని రూపొందించినప్పటికీ వినోద్ పిన్న వయసులోనే వాటికంటే మెరుగ్గా ఈ రోడ్ వాటర్ కారును తయారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం లేదా ఇతర సంస్థల నుంచి ఆశించిన ప్రోత్సాహం లేకుంటే... ఇలాంటి రోడ్ వాటర్ వాహనాల తయారీ, వినియోగం అధికంగా ఉన్న ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ లేదా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలకోసం వెళ్లిపోయిన భారతీయుల్లో వినోద్ కూడా ఒకడై ఇతని జీవితంలో మరో కోణం మొదలయ్యే అవకాశం ఉంది. అప్పుడు మరో రోజున భారత ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహించే ప్రవాసభారతీయ వేడుకలకు ఇతన్నే పిలిచి ఎన్నారైల కోసం రూపొందించిన ఏదో ఓ కొత్త పథకాన్ని అతని చేతే మొదలుపెట్టించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, మన గొప్పదనాన్ని విదేశాలు గుర్తించాకేగా మనవాళ్లూ అహో అనేది.

Saturday, November 18, 2006

ఎనభై ఏళ్ల పడుచు

అవును... తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కూత్తూర్ గ్రామంలో ఉన్న వినోభా ఆశ్రమ నిర్వాహకురాలు కృష్ణమ్మాళ్‌ను ఎనభై ఏళ్ల పడుచు అనడమే సబబు. ఎందుకంటే అభాగ్యుల తరపున అహింసా మార్గంలో పోరాటం చేసి, అనుకున్నది సాధించడానికి ఆమె ఈ వయసులోనూ సిద్ధంగా ఉంటారు. అసలు ఎవరీ కృష్ణమ్మాళ్ ? 80 ఏళ్ల కిందట తమిళనాడులోని ఒక అతి సామాన్య కుటుంబంలో పుట్టారామె. కేవలం పండుగ రోజుల్లో మాత్రమే వాళ్ల ఇంట్లో బియ్యపు అన్నం కనిపిస్తుంది. అమ్మాయిలకు చదువులంటే పెద్దలనబడేవాళ్లు గయ్యిమనే ఆ రోజుల్లోనే పట్టభద్రురాలై మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. డిగ్రీ పట్టా చేతికి రాగానే కృష్ణమ్మాళ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎగబడలేదు. బడుగు వర్గాల తోడుగా నిలిచి సమాజ సేవలో తరించాలని ఆమె నిర్ణయించుకున్నారు.

అదే సమయంలో భూదానోద్యమ సారధి ఆచార్య వినోభాభావె శిష్యులు జగన్నాథన్ పరిచయమై ఈమె లక్ష్యానికి మరింత బలం చేకురేలా దిశా నిర్దేశం చేశారు. అది ఆదిగా కృష్ణమ్మాళ్ తన సేవలను విస్తృతం చేశారు. బడుగు వర్గాలకు చేయూతనిచ్చే క్రమంలో తాను నడిపిన అహింసాయుత పోరాటాల్లో భాగంగా ఈమె ఎన్నోమార్లు జైలుకెళ్లారు. నాగపట్టణం జిల్లాలోని కీళ్‌వెన్మణి ప్రాంతంలోని రైతు కూలీలు తమ వేతనాలు పెంచమని అడిగినందుకు వారిని భూస్వాములు మరిన్ని వెతలకు గురిచేశారు. వారి పోరాటానికి చేయూతనిచ్చిన కృష్ణమ్మాళ్ పరిస్థితులను చక్కబరిచారు. అంతటితో ఆగక వారిని రైతు కూలీల స్థాయి నుంచి రైతులుగా మార్చేందుకు తానే స్వయంగా "లాబ్ టీ" అనే సంస్థను కూడా ప్రారంభించారు. భూమి లేని రైతులకు భూములనిప్పించడం, పంటలు పండించడంలో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, పేదల పిల్లలకు చదువులు చెప్పించడం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలను కృష్ణమ్మాళ్ చేపట్టి విజయాలు సాధించారు.

లక్ష్యసాధనలో వెనుకంజ వేయడం తెలియని కృష్ణమ్మాళ్ గాంధేయవాది. వినోభా శిష్యురాలిగా వారి ఆదర్శాలనే అనుసరించారు. వేధింపులు ఎదురైనా... ఆకలి పోరాటాలకు గురైనా మొక్కవోని దీక్షతో ఈ వయసులోనూ ఆమె ముందడుకు వేస్తున్నారు. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలను పూయిస్తున్నారు.

Wednesday, September 27, 2006

ఖేంద్రీ.... కంటి చూపుతో నింపేస్తా

ఈ మధ్య చాలా మంది "కంటి చూపుతో చంపేస్తా" అనే ఒక సినిమా డైలాగ్‌ను పదే పదే వాడుతున్నారు. కానీ పంజాబ్‌కు చెందిన విజయ్‌పాల్ ఖేంద్రీ మాత్రం అంధులకు కంటి చూపునిచ్చి వాళ్ల బతుకుల్ని వెలుగులతో నింపేస్తా అంటున్నారు. వ్యక్తిగా... శక్తిగా... వ్యవస్థగా ఇదీ ఆయన జీవితం.

డెబ్భై ఐయిదేళ్ల వయసు... మామూలుగా అయితే ఈ వయసు వ్యక్తులు గత స్మృతులు నెమరు వేసుకుంటూ కాలక్షేపం బఠానీలు తింటూ (పళ్లు ఊడకుండా ఉంటే...) కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తుంటారు. దాదాపు 25 (ఈ కథనం రాసేనాటికి) ఏళ్ల కిందట జీవిత బీమా సంస్థ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన ఖేంద్రీని వీరిలో ఒకరిగా చూడలేం. సేవా తత్పరతతో తపించే నిండు మనసు ఆయనది. కంటి సమస్యలతో సతమతమవుతున్న కొందరు వ్యక్తులు ఓ రోజున ఖేంద్రీ కంటబడటంతోనే ఓ మహా నేత్రోద్యమానికి బీజం పడింది. వారికి తన స్వంత ఖర్చుతో శస్త్ర చికిత్సలు చేయించి వారి కళ్లలో వెలుగులు పూయించారు ఖేంద్రీ.. అజ్ఞానం, పేదరికం కారణంగా కంటి చూపు కరవై దృష్టికి దూరమైన అభాగ్యుల జీవితాల్ని వెలుగులతో నింపాలని ఆ క్షణాన ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే స్నేహితులను, ఆత్మీయులను కలుసుకొని తన ఉద్దేశాన్ని బయటపెట్టారు.

శుభ సంకల్పానికి చేయూతనివ్వని చేయి ఉంటుందా...? పంజాబ్‌లోని పుణ్యక్షేత్రమైన అమృత్‌సర్ పట్టణం కేంద్రంగా వీరి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. కంటి సమస్యలతో బాధపడేవారికి వైద్యపరమైన తోడ్పాటునిచ్చేందుకు ఖేంద్రీ తన బృందంతో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యకలాపాలు పలువురి ప్రశంసలకు పాత్రం కాగా అన్ని వర్గాల సహకారంతో 1995లో అమృత్‌సర్ మెడికల్ అండ్ ఐ రిలీఫ్ సొసైటీ (ఎఎమ్ఇఆర్ఎస్) ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ పేరు వింటే చాలు పంజాబ్‌లోని వేలాది గ్రామాల్లోని ఎన్నో హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి. ఎందుకంటే అసంఖ్యాకంగా ఎందరో గ్రామీణులు ఎఎమ్ఇఆర్ఎస్ ఉచిత సేవల ద్వారా కంటి చూపు పొందినవారే.

ఒక్కోసారి శిబిరాలను నిర్వహించాలని కోరుతూ కొన్ని గ్రామాలవారు స్వయంగా ఈ సంస్థను కోరుతుంటారు. నెలకు కనీసం 8 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ సంస్థ చేస్తున్న సేవలు మంచితనానికి మారుపేరుగా కొనసాగుతున్నాయి. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలను అవిష్కరిస్తున్నాయి. సత్సంకల్పానికి కాలం, వయసుతో పనిలేదనేదే ఖేంద్రీ జీవితం మనకు ఇచ్చే సందేశం. ఏమంటారు ?

Thursday, August 31, 2006

ఈ అమ్మ ఒక విజేత...

చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో అడవి మనిషిగా పెరిగిన చిరంజీవిని సంఘ శక్తిగా తీర్చిదిద్దిన తల్లిగా శారద పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మీరు చదవబోయే నిజ జీవిత కథనం ఇలాంటిదే. తమిళనాడులోని చిదంబరం పుణ్యక్షేత్రంలో నివసిస్తున్న పద్మా మోహన్ పాత్ర ఆ శారద పాత్రకు ఏమీ తక్కువ కాదు. ఆ సినిమాలో చిరంజీవి మహారణ్యంలో పెరిగితే ఈమె కొడుకు లలిత్‌కుమార్ జనారణ్యంలో పెరిగాడు. ఇక మిగిలిన విశేషాలకు వస్తే...

ఆంధ్రలోని నెల్లూరు జిల్లాకు చెందిన పద్మా మోహన్ భర్త మోహన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. ఉద్యోగం నిమిత్తం తమిళనాడులో ఉంటున్నారు. పద్మా మోహన్ కొడుకు లలిత్ కుమార్ పుట్టుకతోనే అంధుడు మాత్రమేగాక చిన్నవయసుకే డౌన్‌సిండ్రోం, ఆటిజం బారినపడటంతో మెదడుపై ప్రభావం చూపి వినికిడి, మాటలు, ఎదుగుదల సమస్యలు ఏర్పడ్డాయి. మొత్తం మీద మానసికంగా శారీరకంగా తీవ్రస్థాయిలో అంగ వైకల్యానికి గురయ్యాడు. ఇక ఆ తల్లి బాధను మాటల్లో వర్ణించగలమా...?

లలిత్ కుమార్ చిన్న వయసులో ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడే తల్లి పద్మ సైతం అనారోగ్యం పాలైయ్యారు. ఈమెను చికిత్సకోసం చెన్నై ఆసుపత్రిలో చేర్పించినప్పుడు యోగాను ఆశ్రయించి కోలుకున్నారు. తనకు స్వస్థతనిచ్చిన యోగాను ఆయుధంగా చేసుకొని తన కొడుకును బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్న పద్మ అనుకున్నది సాధించారు. తన కొడుకు కోసం ఆమె కూడా బ్రెయిలీ లిపి నేర్చుకొని, అతనికి దాదాపు 100 యోగాసనాలు వేయడంలో తర్ఫీదునిచ్చారు. తల్లి సాయంతో ఈ రోజున లలిత్ కుమార్ ఏమేం సాధించాడో తెలుసా ?

భారత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా యోగాలో జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 2005లో ప్రభుత్వం నుంచి బెస్ట్ క్రియోటివ్ ఛైల్డ్ అవార్డు సహా తమిళనాడు యోగా సంఘం, సాయ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. కర్ణాటక సంగీతంలో కచేరీలు, మృదంగ వాదనలో నైపుణ్యం సాధించాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో యోగా డిప్లమో చెయ్యడానికి వయసు చాలకపోతే లలిత్ కుమార్ ప్రతిభను గుర్తించిన ప్రో-ఛాన్స్‌లర్ వయసు నిబంధనను సడలించి అవకాశాన్నిచ్చారు.

లోపాలున్న మనిషిని మాటలనే తొలిచే ఈ సమాజంలో తనను అందమైన శిల్పంగా మలిచే బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన తన తల్లే తాను నిత్యం కొలిచే దైవం అంటాడు లలిత్ కుమార్.

తన కుమారుడి ఉన్నతిలోనే ఆనందాన్ని పొందుతున్న ఈ అమ్మ జీవితంలో కొత్త కోణం ఇది.

Monday, July 31, 2006

రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా...

...అనే ఈ మెగా సూపర్ హిట్టే కాదు... చిట్టీ చిలకమ్మా.. అమ్మా కొట్టిందా.. మా గూట్లో కొస్తావా లాంటి చిలకల పలుకుల పాటలు కూడా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని మావూళ్లయ్య, వాసవి దంపతులకు కంఠోపాఠమే. ఎందుకంటే వాళ్లింటికి వెళితే మీకు ముందుగా స్వాగతం పలికేవి రామ చిలుకలే కనుక.

అసలు సంగతేంటంటారా, అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో... గత ఇరవైయ్యేళ్లుగా మావూళ్లయ్య, వాసవి దంపతులు ఈ చిలుకల్ని దేవుడిచ్చిన పిల్లలుగా భావించి సాకుతున్నారు. ఉదయం ఆరున్నర కాగానే ఆ ఊరి చిలకలన్నీ మావూళ్లయ్య నడిపే బియ్యం దుకాణం ముందు వాలిపోతాయి. దుకాణం ముందు వీటి కోసమే మావూళ్లయ్య దంపతులు ఉంచే బియ్యాన్ని ఆరగిస్తూ ఆట పాటలతో రోజూ ఆనందంగా గడిపేస్తుంటాయి. వీటి కోసమే ప్రతిరోజూ సుమారు మూడు లేదా నాలుగు కిలోల నాణ్యమైన బియ్యాన్ని ఆ దంపతులు ప్రత్యేకంగా ఉంచుతారు.

వివరాల్లోకి వెళితే.... మావూళ్లయ్య దాదాపు 30 ఏళ్ల కిందట సిద్ధాంతం వచ్చి బియ్యం దుకాణాన్ని ప్రారంభించారు. ఓ రోజున ఒక చిలుక ఆయన కొట్లోకి వచ్చి బియ్యం రుచి చూసింది. దాన్ని ఆయన ఏమీ అనకపోవడంతో ఈ అనుకోని అతిథుల సంఖ్య అలా అలా పెరిగి ఇప్పటికి యాభైకి చేరుకుంది. ఆ అనుబంధం అలా పెరిగి పెనవేసుకుపోయింది. ఊళ్లకు వెళ్లాల్సివచ్చినప్పుడు వీటికోసం ఎప్పుడూ ఇల్లు, దుకాణం తెరిచి ఉండేలా మావూళ్లయ్య దంపతులు సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. చిత్రం ఏమంటే ఇప్పటి వరకూ చిలుకలు రాని రోజే లేదు. వీటి గురించి ఎవరైనా అడిగితే వారి నుంచి వచ్చే సమాధానం "ఈ పచ్చని చిలుకలు సీతారాముల ప్రతిరూపాలు" అని.

Friday, June 30, 2006

పురుగు... పరుగో పరుగు

ఆయన పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు ఉత్పత్తి చేసే ఎరువుల పనితీరు చూశాడు. వందలు, వేలాది రూపాయల ఖర్చుతో కొన్న ఆ రసాయనిక ఎరువులు పురుగుల్ని చంపలేవు సరికదా... రైతుకు, పంటలకు మేలు చేసే వనరులు సైతం హరించుకుపోతాయి. పైగా వాతావరణ కలుషితం, అనారోగ్యాలూ మామూలే. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో.. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి. మరి మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ముబారక్‌పూర్‌కు చెందిన పొన్నుస్వామి అనే రైతు ఏం చేశారో తెలుసా...

నిర్దిష్ట నిష్పత్తుల్లో వేప, కానుగ గింజలు, ఎండు సీతాఫలాలు, జట్రోపాలను పొడిచేసి, రెండు రకాల బ్యాక్టీరియాలను (డీ కంపోజ్డ్ బ్యాక్టీరియా, బి బ్యాక్టీరియా) మిశ్రమించి, బెల్లం నీటిలో ఆ పొడిని కలుపగా తయారైన సేంద్రీయ ద్రావణాన్ని తన పొలంలో పిచికారీ చేశారు. అంతే... కూరగాయలు, పత్తి, ద్రాక్ష వంటి పొలాల నుంచి పురుగులకు విముక్తి లభించింది. గత రెండేళ్లుగా ఈయన ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పైగా ఈయన అనుసరిస్తున్న పద్ధతి సరైనదేనంటూ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శశిభూషణ్ కూడా నిర్ధారించారు.

తన విధానంపై పొన్నుస్వామి ఏమంటారంటే... ఈ పద్ధతిలో విషరహిత కాయగూరలను ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెరుగై, అధిక ధర లభిస్తుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి రైతులకు శిక్షణనివ్వడానికి తాను సిద్ధమేనంటున్నారు. పై వస్తువుల కోసం సామాజిక వన విభాగం అధికారులు, బయో ఫెర్టిలైజర్స్ విక్రేతలను సంప్రదించవచ్చు.

పొన్ను స్వామి చెప్పిన విధానం....

250 కిలోల వేపగింజలు, 250 కిలోల జట్రోపా గింజలు, 250 కిలోల కానుగ గింజలు, 250 కిలోల ఎండు సీతాఫలాలు కలిపి పొడి చెయ్యాలి. మొత్తం 1000 కిలోల పొడిలో డి-కంపోజ్డ్ బ్యాక్టీరియా కలిపి నెల్లాళ్ల పాటు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమానికి కిలో బి-కంపోజ్డ్ బ్యాక్టీరియా కలిపి మరో నెల్లాళ్లు అలాగే ఉంచాలి. తర్వాత 200 లీటర్ల నీళ్లకు కిలో బెల్లం చేర్చి ఉంచాలి. ఇదంతా పూర్తయ్యాక డి, బి - బ్యాక్టీరియాలు కలిపి ఉన్న గింజల పొడి మిశ్రమాన్ని 20 కిలోలు తీసుకొని బెల్లం నీళ్లలో కలిపి 10 రోజుల పాటు నిల్వ చేస్తే క్రిమి సంహారక ద్రావణం సిద్ధమవుతుంది. దీనిని వడకట్టి ఉపయోగించాలి.

పై విధానంలో సిద్ధంగా ఉన్న 10 లీటర్ల ద్రావణానికి మరో 10 లీటర్ల స్వచ్ఛమైన నీటిని కలిపి పంటపై ఏడెనిమిది రోజులకోసారి పిచికారీ చెయ్యాలి. కూరగాయల తోటలకు నాలుగు సార్లు, పత్తి లేదా ద్రాక్ష వంటి పంటలకు ఐదారు సార్లు పిచికారీ చేస్తే... పురుగులు... పరుగో... పరుగు...

నేటి తరం విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులుగా మారి, రైతులకు అందుబాటులో లేని ధరల్లో, వారికి అంతగా ఉపకరించని క్రిమిసంహారక మందులను అమ్ముతూంటే... పొన్నుస్వామి లాంటి వారు తమ అనుభవ పరిజ్ఞానంతో రైతాంగం జీవితంలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

జై జవాన్... జై కిసాన్ అని మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఊరికే అన్నారా మరి. అందులోనూ... మన పొన్నుస్వామి.... నిజంగా బంగారయ్యే. ఎందుకంటే... పొన్ను అంటే తమిళంలో బంగారం అని అర్థం.

Wednesday, May 31, 2006

నిన్న టీ విక్రేత.... నేడు ఐఏఎస్ విజేత

ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సింఘపూర్ గ్రామంలో నివసిస్తున్న సాహు అనే 62 ఏళ్ల పెద్దమనిషికి గత 30 ఏళ్లుగా తెలిసిన ఏకైక వృత్తి టీ తయారు చేసి బిస్కెట్లు అమ్ముకోవడమే. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. భార్య ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలతో ఉన్న సాహు కుటుంబానికి అతని సంపాదన ఏ మూలకూ చాలదు. మరి ఆయన కొడుకు మనోజ్ కూడా అదే వాతావరణంలో పెరిగినా తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తూ అక్షరాల పుట్టగా రూపొందాడు. ఆ ఊరి పల్లెటూరిలో తన కొడుకు ఒక టీచరు ఉద్యోగం సంపాదిస్తే చాలని మనోజ్ తండ్రి సాహు బుల్లి ఆశ మాత్రం పెట్టుకున్నాడు. ఆ తండ్రికి మనోజ్ అందించిన కానుక ఏమిటో తెలుసా ? ఎటువంటి కనీస సదుపాయాలూ లేని పరిస్థితుల్లో, ఏ మాత్రం శిక్షణ లేకుండా పల్లె వాతావరణంలో పెరిగిన మనోజ్ ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడై జాతీయ స్థాయిలో 34వ ర్యాంకు సాధించాడు. వేలకు వేలు ఫీజులు పోసి పట్టణాల్లోని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరూ పెద్ద పెద్ద శిక్షణా కేంద్రాల్లో చేరి సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న సంగతి అందరికీ తెలుసు.

మనోజ్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. 10వ తరగతి వరకూ తన పల్లెటూరిలోనే చదువుకున్న మనోజ్ తన ప్రతిభతో ప్రభుత్వ ఉపకార వేతనం పొంది భువనేశ్వర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో యు.జి ముగించాడు. ఆ తర్వాత గుజరాత్‌లోని జునాగఢ్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. తర్వాత ఉద్యోగాన్వేషణలో ఢిల్లీ వెళ్లి విజయవంతంగా స్వయంకృషితో సివిల్స్ పూర్తి చేశాడు. కేవలం స్వశక్తితోనే ఎదిగిన మనోజ్‌ను మే 28న గ్రామస్తులంతా కలిసి ఉరేగింపుగా తీసుకెళ్లి గౌరవించగా, అతనికి చదువు చెప్పిన ఆ ఉరి ఉపాధ్యాయులే దండలు వేసి ఆశీర్వదించారు. అదే విధంగా ఆనందభాష్పాల మధ్య అతని తల్లిదండ్రులనూ సత్కరించారు. ఆత్మబలం ఉండాలే కానీ దేనినైనా సాధించేందుకు పేదరికం అడ్డుకానేకాదని నిరూపించిన ఎందరో బుద్ధిజీవుల సరసన ఇప్పుడు మనోజ్ కూడా నిలిచాడు. సింఘపూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డే ఈ ఘనతను సాధించినంత ఆనందపడుతున్నారు.

Saturday, April 29, 2006

మధుమేహం కళ్లు పీకినా... సడలని పట్టుదల

పుట్టుకతోనే కళ్లు లేకపోవడం వేరు. జీవితంలో కొన్నేళ్ల పాటు కళ్లతో ఈ లోకపు అందాలను ఎంతో ఆనందించి, అనుభవించిన తరువాత ఆ కళ్లను పోగొట్టుకోవడం మరింత బాధాకరం. ఈమె జీవితంలోనూ ఇదే జరిగినా, తన ధైర్యాన్ని కోల్పోలేదు సరికదా, పట్టుదలతో ముందడుగు వేసి, చివరకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఔట్ స్టాండింగ్ డిజేబుల్డ్ ఎంప్లాయ్ అవార్డును చేజిక్కించుకుంది. మదురైకి చెందిన డాక్టర్ ఉషానాగరాజన్ (41) స్ఫూర్తిదాయక జీవితం ఇది. 1987లో ఎంబిబిఎస్ పూర్తి చేసి స్పెషలైజేషన్ దిశగా అడుగులేద్దామనుకుంటున్న సమయంలో ఆమె కాలికి వేసిన పుండు ఉగ్రరూపం దాల్చడంతో ఎగబాకిన ఇన్ఫెక్షన్ ఉష కళ్లను కూడా కబళించింది. డయాబెటిక్ రెటీనోపతి ఫలితంగా ఉష జీవితం చీకటిమయమైంది. చిన్నతనం నుంచీ చదువులో మంచి ప్రతిభ కనబరిచి ఉపకారవేతనాలు కూడా పొందిన ఉష డాక్టరై ఎందరికో సేవ చేయాలని తపనపడేవారు. ఈ నేపథ్యంలో ఆమె కళ్లు పోవడంతో పరిస్థితిని జీర్ణించుకోలేని పరిణామాలు చోటుచేసుకున్నా... తను నేర్చుకున్న విద్యతోనే ఎలాగైనా ముందడుగేసి ఇతరులకు చేయూతనిచ్చే స్థాయికి ఎదగాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నారు ఉష. వెంటనే తన వైకల్యాన్ని అధిగమించేందుకు బ్రెయిలీ సహా పలు అంశాలపై రెండేళ్లపాటు తగిన శిక్షణ పొందారు. అనంతరం తన ప్రతిభతో మదురైలోని మదురై కెనెట్ ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా చేరి రోగులకు సేవ చేస్తున్నారు. అంతేగాక ఈ సంస్థకే చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సులకు వివిధ అంశాల్లో పాఠ్యాంశాలను ఉష బోధిస్తున్నారు. ఇంతటితో ఆగక అంగవికలురకు చేయూతనిచ్చే పలు సంస్థలకు ఉష అండగా నిలిచి వైద్య సేవలందిస్తున్నారు. ఆమె మదురైలోని రోటాక్ టాకింగ్ లైబ్రరీ సలహా మండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు. తన సేవలతో అందరినీ మెప్పించిగా లయన్స్ క్లబ్, జేసీస్ క్లబ్ వంటి సంస్థల పురస్కారాలు ఉషను వెదుక్కుంటూ వచ్చాయి. కర్ర సాయం లేకుండానే పనులు చేసుకోవడంలో భర్త నాగరాజన్ ఉషకు ప్రత్యేక శిక్షణనివ్వడంతో ఆమె స్వంతంగా వంట కూడా చేయగలరు. తన కుమారుడు సంజీవ్ కూడా నేత్ర వైద్యంలో పరిశోధన చేసి మరెందరికో సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. కళ్లు పోయినా తన జీవితంలో కోత్త కోణాన్ని ఆవిష్కరించి ఉషస్సును నిలుపుకున్న ఉష జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమనడంలో సందేహమేముంది ?

Friday, April 21, 2006

తేనెటీగలు మళ్లీ వచ్చాయి....

ఇది 1993 నాటి విషయం. అప్పట్లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా చెరువతూర్ ప్రాంతంలో వ్యవసాయ శాఖ చిరుద్యోగిగా పనిచేస్తున్న 57 ఏళ్ల లీలా కుమారిపై ఆ రాష్ట్ర ప్లాంటేషన్ కార్పోరేషన్ అధికారులు పగబట్టారు. ఆమెపై దాడి చేయడానికి గూండాలను పంపడమే గాక ఆమె ఇంటిపై పెస్టిసైడ్ కంపెనీ హెలికాఫ్టర్‌తో రసాయనాన్ని కుమ్మరించారు. ఇంతకూ లీలాకుమారి చేసిన తప్పల్లా... ఎండోసల్ఫాన్ రసాయనాన్ని ఇక్కడి జీడి తోటల్లో చల్లవద్దనడం, ఇందుకోసం ఆవిడ కోర్టుకెక్కడం. ఈ ప్రాంతంలోని జీడితోటల్లో పురుగులను చంపడానికి ప్లాంటేషన్ శాఖ హెలికాఫ్టర్ ద్వారా ఎండోసల్ఫాన్ రసాయనం సృష్టించిన అల్లకల్లోలమే సమస్యకు మూలకారణం. ఈ రసాయన ప్రభావం ఆ తోటల్లోని పురుగులను చంపడంతో ఆగిపోలేదు. అక్కడి జనం ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఈ రసాయనాన్ని తోటల్లో చల్లినప్పుడల్లా ఆ ప్రాంతవాసులకు ఆస్మా, క్యాన్సర్, నరాలు, మెదడు, స్త్రీలకు పునరుత్పత్తి సమస్యలు.... ఇలా ఎన్నెన్నో వ్యాధులు వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అంతేకాదు ఇక్కడి పర్యావరణం కూడా స్తంభించి పక్షులను పారిపోయేలా చెసింది. మరోపక్క రైతులు కట్టే గూళ్లలో చేరి పుట్టతేనెను పండించే తేనెటీగలు తుర్రుమన్నాయి.

ఈ ఎండోసల్ఫాన్ విషపూరితమైనదని యూరోపియన్ యూనియన్, అమెరికా ఎన్విరానమెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు దీనిని నిషేధించినా గత 18 ఏళ్లుగా సుమారు 5 వేల ఎకరాల్లో ఈ రసాయనాన్ని కుమ్మరించారు ప్రభుత్వాధికారులు. దీని ప్రమాదకర ప్రభావాన్ని గుర్తించి పొరాటానికి సన్నద్ధమైన లీలా కుమారికి మొదట గ్రామస్ధుల సహకారం లభించకపోయినా తర్వాత చేయూతనిచ్చారు. లీలా కుమారి పట్టుదలకు మీడియా తోడ్పాటు లభించడంతో పాటు స్థానిక వైద్యులు కూడా దిగజారిన ఇక్కడి ఆరోగ్య ప్రమాణాలపై నివేదికలిచ్చారు. మరోవైపు ఢిల్లీలోని సెంటర్ పర్ సైన్స్ అండ్ ఎన్విరానమెంట్ సైతం రంగంలోకి దిగి ఈ ప్రాంతవాసులకు రక్త పరీక్షలు చేసి జరుగుతున్న దారుణాన్ని ధృవీకరించింది. దీంతో కేరళ హైకోర్టు ఎండోసల్ఫాన్ పిచికారీని పూర్తిగా నిషేధించింది. ఫలితంగా చెరువతూర్ ప్రాంతంలోని పర్యావరణ, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు వైద్యసేవలందించాయి. ఇప్పుడిక్కడి రైతులంతా సేంద్రీయ ఎరువులనే వాడుతున్నారు. ఇదంతా లీలాకుమారి చలవే మరి.

ఈ రసాయనం కారణంగా అనారోగ్యం పాలైన తన కొడుకు చికిత్సకు అవుతున్న ఖర్చులు, మరోవైపు ఈ కేసుకై అవుతున్న వ్యయభారం, ఇంచుమించు అదే సమయంలో తానూ ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైనా.... లీలాకుమారి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయం సాధించింది. తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ, జరుగుతున్న్ దారుణాన్ని ఎండగట్టేందుకు మరో ప్రభుత్వ సంస్థతో పోరాటానికి వెనుకాడలేదామె. కొట్టాయం జిల్లాలోని కిజుతిరి గ్రామంలో 11 మంది సంతానం ఉన్న కుటుంబంలో ఏడో బిడ్డగా పుట్టిన లీలాకుమారి వ్యవసాయ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సును మాత్రమే చదివారు. వ్యవసాయ శాఖలో ఆమె ఉన్నతాధికారి కూడా కాదు. అంతా బాగుండాలనే ఆమె తపన అందరి జీవితాల్లోనూ కొత్తకోణాలను చూపించింది. దశాబ్దాల కిందటే తుర్రుమన్న తేనెటీగలు తిరిగొచ్చాయి, పారిపోయిన పక్షుల కిలకిలారావాలు మళ్లీ వినిపించాయి.

Saturday, April 15, 2006

సాహసంతో సావాసం

మేకుల మొనలు పైకి ఉండేలా దిగ్గొట్టి ఉన్న బల్లపై ఏమాత్రం సంకోచం లేకుండా వెల్లకిల్లా పడుకొని ఉండగా.... ఛాతీపై 10 నాపరాళ్లను పెట్టించుకొని పగులగొట్టించుకొనే శరీరం అది. చేతుల మీద నుంచి ఓ పాతిక ముప్పై కార్లు వెళ్లినా ఆ ముఖంపై చిరునవ్వు చెరగదు. తలపై, ఒంటిపై ఓ పదులకొద్దీ ట్యూబులైట్లను పగలగొడుతున్నా... అదే చిరునగవు. కళ్లకు గంతలు కట్టుకొని బులెట్ నడపడం, తాను పడుకొని తన పొట్టపై నుంచి ఇద్దరు కూర్చొని ఉన్న మొటార్ సైకిల్ వెళుతున్నా పెద్దగా పట్టించుకోకపోవడం.... ఇవండీ ఆ మనిషి చేసే పనుల్లో కొన్ని. పై విషయాలన్నీ వినగానే కండలు తిరిగిన గండర గండడు, మాయా మహేంద్రజాల విద్యలు తెలిసిన మాయగాడు గుర్తొస్తున్నాడు కదూ. ఈ సాహసి ఎవరో తెలుసా... 17 ఏళ్లకే అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణపతకాన్ని జయించిన ఖమ్మం వాసి కల్యాణి. ఈ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెంకటనారాయణ, రాజ్యలక్ష్మిల కుమార్తె అయిన కల్యాణి కరాటేలో బ్లాక్ బెల్ట్ విజేత. పిన్న వయసుకే అన్ని రకాల వాహనాలూ నడపడం నేర్చుకుంది. తల్లి రాజ్యలక్ష్మి మూత్రపిండాల జబ్బుతో మంచాన పడగా ఆమెకు ఎప్పటికప్పుడు సేవలందిస్తూనే అన్ని విద్యల్లోనూ కల్యాణి నైపుణ్యం సాధించింది. ఇవన్నీ చూసుకుంటూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కల్యాణి అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఇతర ఆటలన్నిటిలోను రాణించి, బాలరత్న అవార్డు కూడా గెల్చుకొని, మార్షల్‌ఆర్ట్స్‌లో రెడ్‌బెల్ట్ దిశగా పయనం సాగిస్తోంది (ఈ వివరాలు అందేనాటికి) . కల్యాణికున్న పట్టుదలలో కొంతైనా మనకూ ఉంటే లోకకల్యాణమే.

Tuesday, April 11, 2006

వడియాలతో వడివడిగా...

ఆయన మొదట పట్టు పురుగుల పెంపకం చేపట్టారు. ఫలితం నష్టాలు. తర్వాత కోళ్ల ఫారం పెట్టారు. ఫలితం కష్టాలు. ఇది కాదనుకొని ఎస్టీడీ బూత్ పెట్టగా కష్టనష్టాలు నట్టింట నడిచాయి. ఇక లాభం లేదనుకొని ఆయన శ్రీమతి గంగా భవాని కేవలం 15 రూపాయలు పట్టుకొని రంగప్రవేశం చేసారు. తెలుగింటా రోజూ కరకరలాడే ఆవిరి వడియాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆవిడకు తెలిసిన విద్య అదే. మరి ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఈమె కేంద్రంలో ఒక రోజుకు ఉత్పత్తి చేసే సుమారు 40 నుంచి 50 కిలోల వడియాలు విజయవాడ, విశాఖ, గుంటూరు తదితర పట్టణాల్లోని ప్రముఖ హొటళ్లకు పరుగులు తీస్తుంటాయి. తన అవిడియాలతో (సారీ ఐడియాలతో.... జస్ట్ ప్రాసకోసం) ఎన్ని రకాల ఒడియాలు చేస్తారో చెప్పనా ? కొత్తిమీర, కాకర, పుదీనా, బీట్ రూట్, మొక్కజొన్న, క్యారెట్, మిర్చి, వాము... ఇలా ఎన్నో రకాల మిశ్రమాలతో కూడిన వడియాలను గంగా భవాని బృందం తయారు చేస్తుంటుంది. ఈ కృషిలో ఆమె భర్త, ఓ కుమారుడు చేయుతనందిస్తున్నారు. అన్నట్లు వీళ్లది ఏ ఊరో చెప్పలేదు కదూ.... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం, చొదిమెళ్ల పంచాయితీలోని లక్ష్మీపురం గ్రామం. కృషికి సృజనాత్మకత తోడైతే జీవితంలో కొత్తకోణాలెన్నో కనిపిస్తాయనడానికి ఈ కుటుంబమే ఉదాహరణ.

Tuesday, April 04, 2006

ఇంకా రి...టైర్ కాని మా...స్టార్

ఎందుకంటే ఆయన వయసు ఇంకా 80 ఏళ్లే మరి. పైగా తనకు ప్రభుత్వమిచ్చే పెన్షన్ డబ్బుల్ని కూడా పేద విద్యార్ధుల కోసం ఖర్చు చేస్తూ గత 18 సంవత్సరాలుగా ఉచితంగా విద్యా బోధన చేస్తున్నారు. మనం చెప్పుకుంటోంది గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు గంజిబోయిన కృష్ణారావుగారి గురించి. 1976లో ఈ పాఠశాలకు బదిలీపై వచ్చి, 1987లో పదవీ విరమణ చేసినా ఆయన ఈ ఊరు విడిచి వెళ్లకుండా ఆ గ్రామస్తుల ప్రేమాభిమానాలు కట్టిపడేశాయి. నక్సల్ ప్రభావిత జూలకల్లు గ్రామంలో విద్యార్ధులను తీర్చిదిద్దడంలో కృష్ణారావుగారు చూపిన కృషి, అంకితభావాలే ఇందుకు కారణం. 11 ఏళ్ల కిందటే పదవీ విరమణ చేసినప్పటికీ నేటికీ రోజూ ఈ పాఠశాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యా బోధన చేస్తూ తుదిశ్వాస విడిచే వరకూ ఈ ఉచిత విద్యాబోధన యజ్ఞాన్ని కొనసాగిస్తానని ఒట్టుపెట్టుకున్నారు. ఇదీ మన మా.....స్టార్ గారి జీవితంలోని కొత్త కోణం.

Monday, April 03, 2006

రజనీ సీఏ అయ్యింది

చార్టెడ్ అకౌంటెన్సీ... సర్వాంగాలూ ఆరోగ్యంగా ఉండి, ఇంటి నుంచి ఎప్పటికప్పుడు డబ్బు వస్తూ, ట్యూషన్లు పెట్టించుకుంటున్నా పూర్తి చేయలేక మధ్యలోనే ఈ కోర్సు విడిచిపెట్టిన వాళ్ల సంఖ్య వేలు, లక్షల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ కంటి చూపులేని రజనీ గోపాలకృష్ణన్ ఇందుకు భిన్నం. అందుకే ఆమె గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చిన్నప్పుడు పెన్సిలిన్ రియాక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలై 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే సరికి ఈమె కుడి కంటి చూపు పోయింది. ఎడమ కంటి చూపు మందగించినా అలాగే డిగ్రీ పూర్తిచేశారు. తదుపరి ఎందరికో సవాలుగా నిలిచిన చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో ఆమె చేరారు. సి.ఎ ఇంటర్ పూర్తయ్యే సరికి మొత్తం చూపు పోయింది. ఈలోగా ఆమె కన్న తండ్రి క్యాన్సర్ వ్యాధికి బలై పోయారు. తర్వాత మాతాజీ నిర్మలా దేవి నుంచి సహజ యోగ శిక్షణ పొంది రజని తనను తాను సన్నద్ధం చేసుకున్నారు. అనంతరం సామర్థనం అనే సంస్థ చేయూతనివ్వగా, జీఈ కంపెనీ వారు ఈమెకు ఓ కంప్యూటరును సమకూర్చి, పాఠ్యాంశాలను కూడా చదివి వినిపించే ఏర్పాట్లు చేశారు. నేర్చుకున్న యోగా ద్వారా క్లిష్టమైన ఎన్నో అంశాలను మెదడులో నిక్షిప్తం చేసుకొని స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాసి సిఎలో దిగ్విజయంగా ఉత్తీర్ణురాలయ్యారు. అంతటితో ఆమె ఆగిపోలేదు. బెంగళూరులో తాజ్ వెస్టెండ్ కమ్యూనిటీ కోఆర్డినేటరుగా ఎందరో అంధులకు కంప్యూటర్ ద్వారా పాఠాలు చెబుతూ సేవలందిస్తున్నారు. ఇంకా తనను ఆదరించిన సామర్ధనం సంస్థకు కూడా వీలైనంత తోడ్పడుతున్నారు. రజనీ ప్రతిభను గుర్తించిన చెన్నైలోని ఎబిలిటీ ఫౌండేషన్ సంస్థ కెవిన్‌కేర్ ఎబిలిటీ అవార్డుతో గౌరవించింది. రజనీ ది గ్రేట్.

Wednesday, March 29, 2006

ఎనిమిదే చదివింది ... దేశాలు తిరిగింది

మొక్కవోని దీక్షతో చేసిన స్వయంకృషే కస్తూరికి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం వచ్చేలా చేసింది. తమిళనాడులోని మదురై జిల్లా పెరుంగుడికి చెందిన ఈమె చదువు కేవలం 8వ తరగతి మాత్రమే. భర్త ఆటో డ్రైవర్ కాగా, నలుగురు పిల్లలతో కూడిన కుటుంబం ఆమెది. సిసిడి (కోనేనంట్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్) ద్వారా ప్రారంభమైన మహిళా స్వయం సహాయక బృందం సభ్యురాలిగా కస్తూరి ఉత్సాహంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. వివిధ సమస్యలపై సిసిడి నిర్వహించే సమావేశాల్లోని ప్రతి విషయాన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసి, చివరకు ఈ సమావేశాలకు ఆమె ప్రధాన వక్తగా మారారు. తన చొరవ, ఉత్సాహంతో ఎనిమిది జిల్లాల మహిళా స్వయం సహాయక బృందాలకు నాయకురాలయ్యారు. సమావేశాల ద్వారా వివిధ బృందాల స్త్రీల కష్టనష్టాలను పరిశీలించి వారి ఆదాయంలో అధిక మొత్తం వైద్యానికే సరిపోతోందని కస్తూరి గ్రహించి ఓ పరిష్కారం కోసం నడుం బిగించారు. వైద్యానికి ఉపకరించే వనమూలికల పెంపకం దిశగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారీమె. ఇప్పుడు ఈ ఉద్యమం సుమారు 125 గ్రామాలకు విస్తరించింది. అంతటితో ఆగక సునామీ బాధిత ప్రాంతమైన నాగపట్టణం జిల్లాలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి నిరాశ్రయులెందరికో పునరావాసం కల్పించారు. కస్తూరి కృషి, పట్టుదల గురించి తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి అధికారులు పంపిన ఆహ్వానంపై ఆమె దక్షణాఫ్రికాలో వనమూలికల పెంపకంపై జరిగిన సదస్సుకు హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత సునామీ సహాయక చర్యలు - పునరావాసం అంశంపై న్యూయార్క్, వాషింగ్టన్, బాంగ్లాదేశ్‌లలోనూ అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ఎందరో తమ జీవితాల్లోని కొత్త కోణాలను స్పృశించేందుకు కస్తూరి జీవితం తప్పక స్ఫూర్తినిస్తుంది.

Tuesday, March 28, 2006

ఉద్యోగం చిన్నదే.... హృదయం పెద్దది

ఈయన రాజకీయ నాయకుడో, వ్యాపారవేత్తో లేదా పారిశ్రామిక వేత్తో కాదు. కడప జిల్లాలోని పులివెందుల ఫైర్ స్టేషన్ డ్రైవర్ నారాయణ జీవితం ఇది. ప్రతినెలా తన జీతంలోంచి కనీసం 500 రూపాయలను సమాజసేవకే వినియోగిస్తారు. తాను పనిచేస్తున్న ఫైర్ స్టేషన్ ఆవరణలో రూ.35 వేల ఖర్చుతో నీటి ట్యాంక్ ఏర్పాటు చేయడమేగాక ఫైరింజన్‌కు 2 వేల రూపాయల ఖర్చుతో రంగు వేయించారు. ప్రభుత్వ ఖర్చుతో జరగాల్సిన ఎన్నో మంచి పనులకు తన సొంత డబ్బును ఖర్చు చేసారు. తన కార్యాలయానికే గాక సమీపాన గల గాంధీనగర్ పాఠశాలకు నారాయణ అందించిన తోడ్పాటు అంతా ఇంతా కాదు. ఈ పాఠశాలకు బీరువా, జెండా దిమ్మె, క్రీడా పరికరాలు, ప్లాస్టిక్ నీటి ట్యాంకు, గడియారం ఇంకా ఎన్నెన్నో నారాయణ జీతంలోంచి సమకూరాయి. ఇంతేగాక ఈ ఊరిలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో నారాయణ అందించిన గడియారాలు అతని సేవా తత్పరతకు ప్రతీకగా నిలుస్తాయి. అవి మోగించే ఘంటికలు జీవితకాలపు విలువను చెప్పకనే చెబుతుంటాయి. పదవీ విరమణాతరం తనకు వచ్చే పింఛను మొత్తాన్ని సేవాశ్రమ నిర్మాణానికి ఉపయోగించాలన్నది నారాయణ లక్ష్యం.

Monday, March 27, 2006

బధిరులు నడిపే భోజనశాల

వివేక్ కొఠారి.... పుట్టుమూగ, చెవుడు. ఈ వైకల్యం కారణంగా ఒకప్పుడు హేళనలకు కూడా గురైయ్యాడు. తీవ్రమైన శారీరక సమస్యలున్నా అమెరికా వెళ్లి పై చదువులు కూడా చదువుకున్నాడు. ఇప్పుడితని స్థాయి ఏంటో తెలుసా? జైపూర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంపై విజయవంతంగా నడుస్తున్న రివాల్వింగ్ రెస్టారెంట్‌కు యజమాని. ఈ హోటల్ ఏర్పాటులో పలు ఆటంకాలెదురు కాగా న్యాయపోరాటాలు చేసి మరీ అనుకున్నది సాధించాడు. మరో విశేషమేమంటే... ఇతని సిబ్బందిలో పాతిక శాతం మంది బధిరులేనట. తద్వారా తనలాంటి వికలాంగులకు అండగా నిలుస్తున్నాడు. జైపూర్ వెళ్లేవారికి ఈ హోటల్ కూడా ఓ పర్యాటక స్థలమే.

Friday, March 24, 2006

సమైక్యత కోసం ఆసనాలు

దేశ సమైక్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించడానికి తన వంతు ఏం చేస్తే బాగుంటుంది ? మద్రాసు సమీపానగల పట్టాభిరాంలోని భారతీనగర్‌కు చెందిన సిద్ధ వైద్యులు, యోగాసనాల నిపుణులైన అన్బరసన్‌కు వచ్చిన ఆలోచన ఇది. తనకు తెలిసిన విద్యనే ఇందుకు సాధనంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన జాతీయ పతాకాలను చేబూని, తలపై కూడా పతాకాన్ని ధరించి, వినూత్న రీతిలో అనేక రకాల అసనాలు వేసి జాతి సమైక్యత దిశగా జనావళిని ప్రేరేపించేందుకు పతాకస్థాయిలో ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇదొక్కటే కాదు ఏటా స్వాతంత్ర్య దినమైన ఆగష్టు 15వ తేదీన కూడా దేశ శాంతిని కోరుతూ ఇలాంటి భిన్నమైన కార్యక్రమాలను అన్బరసన్ నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లకు పైగా ఆయన శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తూ విశిష్ట రీతిలో దేశమాతకు సేవలందిస్తున్నారు. ఇదీ ఆయన జీవితంలోని సరికొత్త కోణం.

Thursday, March 23, 2006

వీళ్ల ముందు మా సేవలెంత...

పై మాటలన్నది ఆ జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవండి. వాళ్ల ముగ్గురు పిల్లలతో పాటు ఇంటికొచ్చిన ఏడుగురు బంధువుల్నీ సునామీ రూపంలో ఎగసిన సముద్రం మింగేసింది. అదికూడా ఆ ఇంటి పెద్ద పుట్టిన రోజున. తమిళనాట నాగపట్టణంలో ఓఎన్‌జీసీ ఉద్యోగి పరమేశ్వరన్, అక్కడే పనిచేస్తున్న ఎల్ఐసీ ఉద్యోగిని చూడామణి దంపతుల వ్యధాభరిత కథ ఇది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఏం చేసారో తెలుసా? దైన్యంతో మూల కూర్చోలేదు. ధైర్యంగా ముందడుగేసి తమలాంటి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లా వరకూ ప్రయాణించి తమలాంటి బాధితులకు ఊరటనిచ్చే ప్రయత్నం చేసారు. అంతటితో ఆగలేదు. నంబిక్కై (నమ్మకం) పేరిట సేవా సంస్థను ప్రారంభించారు. సునామీ విలయతాండవంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలలను చేరదీసి, వారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ వసుధైక కుటుంబానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ దంపతులను కలుసుకొని ఈ కథలాంటి ఈ నిజాన్ని ప్రతి చోటా చెబుతానన్నారు.