Friday, January 31, 2014

పెన్షన్ ఇస్తున్నారుగా... పనిచేస్తా..

రిటైర్ అయిన తరువాత హాయిగా ఇంట్లో కూర్చుందామనుకోలేదు ఆ పెద్దాయన. ఇస్తున్న పెన్షన్‌కు తగిన పని చేస్తానంటూ మళ్ళీ ఆఫీసు బాటపట్టారు. తమిళనాడులోని శ్రీరంగంలో నివసిస్తున్న రిటైర్డ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ వి గోపాలన్ గారి జీవితం ఇది. అక్కడికి 9 కిలోమీటర్ల దూరాన మన్నార్‌పురంలో పనిచేస్తుండేవారు. అయితే 2006లో రిటైర్ అయినప్పటికీ పెన్షన్ పేరిట డబ్బులిస్తున్నారు కనుక అందుక తగ్గ సేవలందిస్తానంటూ రోజూ సైకిల్‌పై అంతదూరం వెళ్ళి స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. తన ఆరోగ్యం భేషుగ్గా ఉందంటూ మళ్ళీ సైకిలెక్కారాయన..

Saturday, November 30, 2013

అతనొక్కడే... ఒక చోట స్టూడెంట్.. మరోచోట హెడ్మాస్టర్

అతనే బాబర్ అలీ. 17 సంవత్సరాల ఈ కుర్రాడు 9 ఏళ్ళ వయసుకే ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి అలా అలా ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు భుజానికెత్తుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ గ్రామానికి చెందిన అలీ బెర్హంపూర్‌లో ఉన్న కాసింబజార్ రాజ్ గోవింద సుందరి విద్యాపీఠ్‌లో ఒక పక్క ప్లస్ టూ చదువుకుంటూనే తన ఊళ్ళో పేదల కోసం తమ ఇంటి పెరడులో ఏర్పాటు చేసిన బడికి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాడు. పెరడులో బడి అంటే ఏదో చిన్నదనుకునేరు. ఇక్కడ దాదాపు 800 మంది పేద విద్యార్థులకు అలీ ద్వారా విద్యాబుద్ధులందుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ బడికి గుర్తింపునిచ్చి ఇక్కడి విద్యార్థులకు నెల నెలా బియ్యం సరఫరా చేస్తోంది. బాబర్ అలీ సేవల్ని గుర్తించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇతనిని పురస్కారాలతో సత్కరించి ప్రోత్సహిస్తున్నాయి.

Saturday, August 31, 2013

సావిత్రికి చేప ప్రసాదం... సత్యమూర్తికి పరమానందం..

నాడు సత్యవ్రతుని కోసం భార్య సావిత్రి యముని వెంటపడి మాంగల్యాన్ని దక్కించుకుంటే... నేడు బిడ్డ సావిత్రి కోసం యజమాని సత్యమూర్తి తపనపడి చేప ప్రసాదం ఇప్పించాడు. అసలీ సావిత్రి ఎవరు?.. ఆమె చేప ప్రసాదం తింటే మాకేంటి?... అనుకుంటారేమో. మన మామూలు కళ్ళకు ఆమె ఒక కుక్కలా కనిపించవచ్చు గానీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నివసించే ఏసీ వ్యాపారి సత్యమూర్తికి మాత్రం సావిత్రి తన కన్నబిడ్డ లాంటిదే. ఈ మధ్యన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద వితరణ జరిగినప్పుడు గర్భవతిగా ఉన్న సావిత్రికి కూడా ఈ ప్రసాదం ఇప్పించాలని అనుకున్నారాయన. తన కన్నబిడ్డ లాంటి సావిత్రి కనబోయే బిడ్డలు సైతం ఆరోగ్యంగా ఉండాలని తలచి చేప ప్రసాదం ఇప్పించారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది బత్తిని సోదరుల చేప ప్రసాదం వితరణ సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బాగ్‌లింగంపల్లిలో ఉండే సత్యమూర్తి అనే అయ్యప్ప స్వామి భక్తుడు 'సావిత్రి'ని తన బండిపై నాంపల్లి గ్రౌండ్స్‌కు తీసుకువచ్చి 'చేప ప్రసాదాన్ని' తినిపించారు. అప్పటికి గర్భవతిగా ఉన్న సావిత్రి శాకాహారే అయినప్పటికీ మంచి ఆరోగ్యం కోసం చేప ప్రసాదం ఇప్పించినట్లు సత్యమూర్తి చెప్పారు. సావిత్రితో చేప ప్రసాదం తినిపించడానికి అక్కడున్న కార్యకర్తలు తొలుత ఇబ్బంది పడినప్పటికీ చివరకు ప్రసాదాన్ని విజయవంతంగా తినిపించారు. పద్ధతి ప్రకారం 45 రోజుల పాటు కచ్చితమైన పత్యం పాటించేలా చూస్తానన్నారు. 'సావిత్రి'ని కన్నబిడ్డలా చూసుకుంటానని, తనతో పాటే పూజల్లో పాల్గొంటుందని సత్యమూర్తి చెప్పారు. చేప ప్రసాదం గురించి బయట ఎన్ని వివాదాలున్నా... ఇక్కడ మాత్రం సావిత్రి పట్ల ఆ యజమానిలో గూడు కట్టుకుని ఉన్న ప్రేమకే పట్టం కడదాం...

Sunday, June 30, 2013

మామూలు బడిలో పెద్దాయన కూతురు

ఒక జిల్లా కలెక్టర్ తన కూతురిని కార్పోరేట్ స్కూల్‌లో కాక సర్కారు బడిలో చేర్పించారంటే నమ్ముతారా!.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు 2011లో కలెక్టర్‌గా పనిచేసిన ఆనంద్ కుమార్ తన ఆరేళ్ళ కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకుని అలాగే చేశారు. తన కుమార్తె గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాలలో రెండవవ తరగతిలో చేర్పించారు. ఈ జిల్లాలో చాలా పెద్ద కార్పోరేట్ బడులున్నా ఈ కలెక్టర్‌ మాత్రం తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించి ఎందరికో ఆదర్శంగా నిలబడ్డారు. తమిళనాడులో జరిగే ప్లస్‌ టూ, ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించిన చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే. ఇక్కడ ఇంకొక విషయమేమంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫాంనే గోపికకూ ఇప్పించారు తప్ప ఆమె కోసం కలెక్టర్ గారు మరింత నాణ్యమైన వస్త్రం తెప్పించి యూనిఫాం కుట్టించలేదు. అంతకు మించిన మరో సంగతేమిటంటే ఆమె తన బడిలో ఉచితంగా పెట్టే మధ్యాహ్న భోజనమే తిన్నది తప్ప ఇంటి నుంచి ప్రత్యేకంగా క్యారేజీ రాలేదు. గోపిక తల్లి ఒక డాక్టర్ అట. జిల్లాకు ఎంతో మేలు చేస్తున్న ఈ కలెక్టర్ గారిని ఆ తర్వాత రాజకీయులు బదిలీ చేయించారు.

Tuesday, April 30, 2013

'స్ఫూర్తిదాత.. శ్రీ మామయ్య

ఆయన అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఎ పట్టా పొందారు. బిజినెస్ స్కూల్‌లో బోధకుడిగానూ పనిచేశారు. వ్యాపార విలువల గురించి లోతైన అధ్యయనం చేసినా జీవితాన్ని మాత్రం మానవతా విలువలతోనే అల్లుకున్నారు. ఆయనే శ్రీవ్యాల్. 2004లో మాతృభూమికి తిరిగి వచ్చిన శ్రీవ్యాల్ బిజినెస్ స్కూల్ బోధకునిగా చేరినప్పుడు ఎదురైన కొన్ని అనుభవాల నుంచి పుట్టిందే "స్ఫూర్తి" ఫౌండేషన్. భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో 2006లో హైదరాబాద్ చర్లపల్ల ప్రాంతంలో ఒక కిరాయి ఇంటిలో ముగ్గురు అనాథ బాలల కేరింతల నడుమ ఈ ఫౌండేషన్ ఆవిర్భవించింది. శ్రీవ్యాల్ స్నేహితులు, దాతల విరాళాలతో ప్రస్తుతం సుమారు 200 మంది చిన్నారులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. తన భార్య వెంకటేశ్వరి తోడ్పాటుతో ఇక్కడి పిల్లలకు అన్నీ తామై వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

పిల్లలంతా శ్రీ మామయ్యగా పిల్చుకునే శ్రీవ్యాల్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుండిగల్ వద్ద స్థలాన్ని కేటాయించింది. వీరి కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు జెజె మెహతా మెమోరియల్ ఫౌండేషన్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు "స్ఫూర్తి" బాలల కోసం అప్పుడప్పుడూ కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. ఆ మధ్య అమెరికాలోని మేరీలాండ్ ఫస్ట్ లేడీ మేరీ క్యాథరీన్ కూడా ఈ ఫౌండేషన్‌కు వచ్చి అభినందనలు కూడా తెలిపారు.

"స్ఫూర్తి" బాలలందరికీ భోజనం, బస, వస్త్రాలు, కాన్వెంట్ చదువు ఉచితమే. 7వ తరగతి వరకూ అక్కడి ప్రయివేట్ పాఠశాలలోను, తర్వాత 10వ తరగతి వరకూ "అధ్య"లో వీరిని చదివిస్తారు. సంగీతంతో పాటు ఇక్కడ కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠ్యప్రణాళికను బోధిస్తారు.

ఈ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకుందాం...

Wednesday, January 30, 2013

శివుని మెడలో ఒక పామే.. మరి రతీష్ దగ్గర ?..

పాముల నుంచి కాపాడుకోవడానికి వాటిని చంపాల్సిన పనిలేదని గొంతు చించుకుని అరుస్తుంటాడు రతీష్. విషపూరిత పాములతో ఎలా వ్యవహరించాలో కనిపించినవారికల్లా వివరిస్తుంటాడు. విషముండే పాములేవో.. విషం లేనివి ఏవో యువతరం, విద్యార్థుల్లో అవగాహన కల్గిస్తుంటాడు. అంతెందుకు, వాటి కోసం కోయంబత్తూరు సమీపాన ఇడయారుపాలెంలోని తన ఇంటిని ఏకంగా సర్ప గృహంగా మార్చేశాడు. ఏ పాముకు ప్రమాదం వాటిల్లినా అది రతీష్ సర్పగృహానికి వచ్చి చేరాల్సిందే..

తన ప్రాంతంలోని సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో ప్రజల దురవగాహన వల్ల, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ కనీసం 10 పాములు చనిపోతున్నాయని రతీష్ అంచనా. రోడ్డు ప్రమాదాల్లో తోకలు తెగి, శరీరాలకు గాయాలైన దాదాపు యాభైకి పైగా పాములకు ఇతను తన సర్పగృహంలో సేవలందిస్తున్నాడు. అవి కోలుకోగానే అడవుల్లోనూ, కొండల్లోనూ విడిచిపెడుతుంటాడు. పాములకు ఎవరైనా హానికల్గిస్తున్నారని తెలిస్తే సహించడు. వారి ఎదురుగానే ఆ సర్పాలతో మైత్రిని ఏర్పరుచుకుని అబ్బురపరుస్తాడు.

ఆపదలో ఉన్న సర్పాలకు సేవలందించడం కోసం ఏడుగురితో ఒక బృందాన్ని కూడా రతీష్ సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా పాములకు ముప్పు వాటిల్లినట్లు సమాచారం రాగానే ఈ బృందం అక్కడ వాలిపోతుంది. సర్పసేవలో తరిస్తుంది.

Friday, November 30, 2012

పంచానన్ పడూయ్.. ఎందరికి తెలుసు ?

రేపటి కోసం అంటూ ఒక్క పైసా దాచుకోకుండా తాను జీవితాంతం గడించిన జీతంలో 90 శాతం మొత్తాన్ని పశ్చిమ బెంగాల్లోని 685 పాఠశాలలకు విరాళంగా ఇచ్చిన ధన్యజీవి, విద్యాదాత శ్రీ పంచానన్ పడూయ్. హౌరాలోని  డోమ్‌జడ్ ప్రాంతానికి చెందిన ఈ ఉపాధ్యాయుడు. ఏడేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయి, ఉన్న పొలం కాస్తా కరవు కోరల్లో చిక్కుకోవడంతో ఈ కుటుంబం నిరుపేదగా మారింది. తన తల్లి మట్టికుండల్లో చాలీచాలని బియ్యాన్ని వండిపెట్టేదట. సాయం పొందే అవకాశమేలేకపోయింది. పశువులు కాశారు, గడ్డి కోశారు. డబ్బున్నవారిళ్ళల్లో బట్టలుతికారు. చీరెలు అమ్మారు. జౌళి మిల్లులో పనిచేశారు. ఈ క్రమంలో రాత్రి వేళ చదువుకుని బికాం పాసయ్యారు. రాహ్రాలోని శ్రీ రామకృష్ణ మిషన్ ద్వారా పీజీ పూర్తి చేశారు. చివరికి హిందీ పండితునిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు.

ఒకప్పుడు తనకే గనుక ఉద్యోగం వస్తే ఆర్థిక ఇక్కట్లతో చదువుకోలేకపోయిన వారికి ధన సహాయం చేయాలని ఆ రోజుల్లోనే నిశ్చయం చేసుకున్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పెళ్ళికి దూరంగా ఉండాలని కూడా ఒట్టు పెట్టుకున్నారు శ్రీ పడూయ్. తన ఇంట్లో వెలుగు కోసం లాంతరు, కొవ్వొత్తులూ ఉపయోగించుకుంటూ కరెంట్ వాడకాన్ని సైతం పక్కనపెట్టారు. ఎందుకంటే కరెంటు బిల్లుకయ్యే ఖర్చుతో మరో విద్యార్థికి సాయం చెయ్యచ్చు కదా అంటారాయన. బిగ్డే స్కూలులో 28 సంవత్సరాలు పనిచేసి 1997లో పదవీ విరమణ చేసిన తర్వాత మూడేళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఈయన్ని ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి గౌరవించింది.

Saturday, September 01, 2012

భర్త నుంచి భార్యను రక్షించిన డ్రైవర్...

కలకత్తాలో ఒక ఇల్లాలిని వ్యభిచారకూపంలో పడేయాలనుకున్న భర్త నుంచి ఆమెను ఒక టాక్సీ డ్రైవర్ కాపాడాడు. శ్యామ్ లాల్ సొరెన్ అనే వ్యక్తి తన భార్యతో కలసి ఒక షేర్ టాక్సి ఎక్కాడు. భార్యను వెనుక సీట్లో కూర్చోబెట్టి ముందు సీట్లో ఉన్న డ్రైవర్ పక్కన తాను కూర్చున్నాడు. ఆ షేర్ టాక్సీలో ఉన్న మిగతా ప్రయాణీకులందరూ దిగిపోయాక కలకత్తాలో అమ్మాయిలను అమ్మడానికి సరైన చోటేదని డ్రైవర్ చెవిలో మెల్లగా అడిగాడు. అక్కడికి తీసుకెళితే 250 రూపాయలిస్తానని ఆశపెట్టాడు. శ్యామ్ లాల్ తీరుతో విస్తుపోయిన ఆ డ్రైవర్ మరేమీ మాట్లాడకుండా ఆ మహా నగరంలోని వీధుల గుండా తీసుకెళుతూ సెక్రెటేరియట్ దగ్గర ఆపాడు. అక్కడున్న పోలీసుల్ని పిలిచి శ్యామ్ లాల్ పన్నాగం గురించి చెప్పాడు. పోలీసులు డ్రైవర్‌తో పాటు శ్యామ్ లాల్, అతని భార్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మూడు నెలల కిందటే పెళ్ళి చేసుకున్న శ్యామ్ లాల్‌కు ఏమైందో తెలియదు గానీ తన భార్యను అత్తారించికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వ్యభిచార కూపంలోకి నెట్టాలని చూశాడు. కానీ టాక్సీ డ్రైవర్ మంచితనంతో ఈ ఘోరం తప్పింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల పైన ఆరోపణలు వస్తుంటాయి. తామంతా అలాంటివారం కాదని ఈ టాక్సీ డ్రైవర్ నిరూపించాడు.

Tuesday, July 31, 2012

రోగాలున్నా డబ్బులు తిరిగిచ్చేశారు..


అక్రమార్జన, అవినీతి కలసి ప్రళయ రుద్రతాండవం చేస్తున్న రోజులివి. వ్యక్తులను.. సామాజిక వాతావరణాన్నీ అనారోగ్యం పట్టి పీడిస్తున్న పరిస్థితులివి. అలాంటి తరుణంలో 89 సంవత్సరాల రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి చార్లెస్ విలియమ్స్ అనే ఆయన తన నిజాయితీని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం మైసూరులో నివసిస్తున్న ఈయన అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ తన పెన్షన్ అకౌంట్‌లో తనకు రావలసిన మొత్తంకంటే ఎక్కువగా జమ అయిన డబ్బును తిరిగిచ్చేశారు.

విలియమ్స్ గారు మన దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా చేరారు. పలు యుద్ధాల్లో పాల్గొని ఎన్నో చారిత్రక అనుభవాల గూడుగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత తనకు రావలసిన పెన్షన్ మొత్తంలో పొరపాట్లు చోటు చేసుకున్నట్లు గ్రహించిన విలియమ్స్ స్థానిక సైనిక సంక్షేమం, రీసెటిల్మెంట్ బోర్డు వారిని కలుసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి మైసూరులోని వెకరె ఎక్స్ సర్వీస్‌మెన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎం ఎన్ సుబ్రమణిని సంప్రదించారు. చివరికి మంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు చెందిన సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఎక్కువ మొత్తం విలియమ్స్ పెన్షన్ ఖాతాలో పడినట్లు లెక్కల్లో తేలింది.

తనకు అర్హత లేనప్పటికీ fixed medical allowance కింద ప్రతి నెలా రూ.300 చొప్పున అదనపు మొత్తంగా ఖాతాలో 2007 నుంచీ రూ.15,200 జమ అయినట్లు గ్రహించిన విలియమ్స్ ఈ మొత్తాన్ని తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి కంటి సమస్య, గుండెకు ఆపరేషన్ కోసం ప్రస్తుతం ఆయన ఒకటిన్నర లక్ష రూపాయల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తనకు ఇబ్బందులున్నప్పటికీ దేశ ఖజానాపై భారం మోపకూడదన్న నైతికతతో ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు వారికి లేఖ పంపి తనపై ఆర్థిక భారం పడకుండా ఈ డబ్బును సులభ వాయిదాల్లో వెనక్కి తీసుకోవలసిందిగా కోరారు.

ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటో చెప్పనక్కరలేదనుకుంటా...

Saturday, June 30, 2012

రూపాయికే బీజా...పూర్ ఫీడింగ్


ఒక్క రూపాయిస్తే నాలుగు జొన్న రొట్టెలు, వాటికి సరిపడా కూర. ఎంతమంది వచ్చినా ఇదే రేటు అక్కడ. ఇంతకుముందు 50 పైసలకే ఇదంతా ఇచ్చేవారట. 50 పైసలు కనుమరుగైపోవడంతో ఈ ధరను రూపాయికి పెంచారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేనివారికి ఉచితంగానే ఈ రొట్టెలు, కూర ఇస్తారు. ఇంతకీ ఈ దృశ్యం ఎక్కడిదనుకుంటున్నారా ? కర్ణాటకలోని బీజాపూర్ పట్టణంలోని కబ్‌రాజీ బజార్‌లో ఉన్న హేమంత్ నగర్ దుకాణం వద్ద ఒక చేత్తో రూపాయి.. మరో చేత్తో విరిగిన పళ్ళెమో లేక పాలిథిన్ కవరో పట్టుకుని మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో పేదలు వరుసలో నిల్చుని ఉంటారు. 

ఇది దాదాపు నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్న సేవ. అప్పట్లో హేమంత్ తండ్రిగారు కేవలం 10 పైసలకే పేదల కోసం ఈ సేవను ప్రారంభించారట. అప్పటి 10 పైసలుకానివ్వండి.. ఇప్పటి రూపాయి కానివ్వండి. ఈ మొత్తం సొమ్ముకు మరి కొంత డబ్బు చేర్చి వంటవారికి, రొట్టెల కోసం పిండి ఆడే మిల్లువారికి ఇస్తుంటారు. హేమంత్ కుటుంబం చేస్తున్న ఈ సేవ గురించి తెలిసినవారు ఈ సేవలో భాగస్వాములై ఎంతో కొంత సొమ్మును విరాళంగా ఇస్తుంటారు. కొందరైతే జొన్నలు, కూరగాయలు ఇస్తుంటారు. దాతలెవరైనా 08352 250114 ద్వారా హేమంత్ నహర్‌ను సంప్రదించవచ్చు.

Wednesday, May 30, 2012

పదేళ్ళ కుర్రాడు.. ప్లెయిన్ ఐస్‌క్రీం చాలన్నాడు..


ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఆ రోజుల్లో సన్‌డా ఐస్‌క్రీం వెల ఒకొక్కటి యాభై సెంట్లు. ఆ రోజుల్లో పిల్లలకు ఇది మహా ప్రాణమట. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హేరిస్‌బర్గ్ అనే ఊరిలో ఎప్పుటూ కిటకిటలాడే ఒక ఐస్‌క్రీం పార్లర్‌లోకి పదేళ్ళ కుర్రాడొకడు అడుగుపెట్టి టేబుల్ ముందు కూర్చున్నాడు. వెయిట్రెస్ వచ్చి గ్లాస్ మంచినీరు ఇచ్చి నిలబడింది...

ఐస్‌క్రీం సన్‌డా ఎంత ?.. అడిగాడు ఆ అబ్బాయి.

యాభై సెంట్లు.. చెప్పిందామె.

ఆ అబ్బాయి తన జేబులో ఉన్న నాణేల్ని లెక్కబెట్టుకుంటూ మళ్ళీ అడిగాడు.

మామూలు ఐస్‌క్రీం ఎంత ?..

అక్కడ చాలామంది కస్టమర్లు ఉండటంతో "ముప్ఫై ఐదు సెంట్లు.." అని విసుగ్గా చెప్పింది ఆ వెయిట్రెస్.

పిల్లవాడు తన దగ్గరున్న నాణేలన్నిటినీ లెక్కబెట్టుకుని చివరికి ఒక ప్లెయిన్ ఐస్‌క్రీం తెమ్మని అడిగాడు.

ఆమె ఐస్‌క్రీంతో పాటు బిల్ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళింది. ఈ పిల్లవాడు దాన్ని తినేసి కౌంటర్‌లో డబ్బు చెల్లించి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఈ వెయిట్రెస్ ఆ ఖాళీ కప్ తీసుకెళ్ళడానికి ఈ అబ్బాయి కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. ఖాళీ కప్ పక్కనే రెండు నికెల్స్, ఐదు పెన్నీ నాణేలు.. మొత్తం 15 పెన్నీలు కూడా కనిపించాయి. వెయిట్రెస్‌కు టిప్ ఇవ్వడం కోసం పిల్లలు ఎంతో ఇష్టపడే సన్‌డా ఐస్‌క్రీం వద్దనుకుని మరీ ఈ పిల్లవాడు మామూలు ఐస్‌క్రీం ఆర్డర్ చేసినట్లు ఆమె గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.

సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు...

Saturday, March 31, 2012

పుస్తకాల డాక్టర్..

వైద్యుడి కోసం రోగులు ఎదురు చూస్తుంటారు. ముల్లంగి వెంకట రమణారెడ్డి కోసం పుస్తకాలు ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే చెదలుపట్టి, కుట్లు ఊడి, రేపోమాపో గాలికెగిరిపోయే పరిస్థితుల్లో ఉన్న వేలాది పుస్తకాలకు ఊపిరిపోసి పునర్జన్మనిచ్చారు ఈ విశాఖ వాసి. తన సైకిల్ పై నగరంలోని గ్రంథాలయాల్ని సందర్శించి అక్కడ అట్టలు విడిపోయి, చిరిగిపోయి, కుట్లు తెగిన పుస్తకాలను పట్టుకెళ్ళి బాగుచేసి చదువరుల కోసం సిద్ధం చేస్తుంటారాయన. పుస్తకాలకు జీవంపోయడమేగాక పలు గ్రంథాలయాలకు ఎన్నెన్నో పుస్తకాల్ని తన స్వంత ఖర్చుతో సమకూర్చారు. తెలుగులో తొలి కార్టూనిస్ట్ అయిన తలిశెట్టి రామారావు గురించి పరిశోధన చేశారు. పుస్తకాలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా, వాటి ద్వారా సముపార్జించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టిన ధన్యజీవి ఈయన. 55 ఏళ్ళ కిందటే బాల వితంతువు అయిన తన మామయ్య కుమార్తెను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పుస్తకాలనే కాదు సమాజాన్ని సైతం సంస్కరించే వైద్యుడయ్యారు రమణారెడ్డి.

Wednesday, February 29, 2012

శ్రీనివాసాచార్యులు.. హృదయం చలువపందిరి

సికింద్రాబాద్ అడిక్‌మెట్ వేదపాఠశాలలో గురువు, హబ్సిగూడ రామాలయం పూజారి శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు. సత్గ్రంథ పఠనంతో మనస్సును, వాటి నుంచి నేర్చుకున్న మంచిని సత్కార్యాచరణ ద్వారా అమలు చేయడం ద్వారా దేవుడిచ్చిన శరీరాన్ని పునీతం చేసుకున్నారాయన. మండువేసవిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల్లో వచ్చిపోయేవారికి సూర్య(ప్ర)తాపం నుంచి ఉపశమనం కల్గిస్తూ ఎన్నో పందిళ్ళు స్వంత ఖర్చుతో వేయించారాయన.

"మానవ సేవే మాధవ సేవ" అని తండ్రి వెంకట నరసింహాచార్యులు చేసిన బోధననే శ్రీనివాసాచార్యులు తన బాటగా ఎంచుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని రాంనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, మెట్టుగూ, చిరుగానగర్, నాగోలు, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈయన పాదచారులు, బాటసారులు, ప్రయాణీకుల కోసం పలు తాత్కాలిక చలువ పందిళ్ళు వేయించారు. ఆచార్యులుగారి ఈ చలువ పందిరి సేవలో ఆటో రవి, తడికెల బాలయ్య, మల్లేష్ అనేవారు తగినంత చేయూతనిస్తున్నారట.

ఒక్కో చలువ పందిరి వేయడానికి సుమారు రూ.వెయ్యి వరకూ ఖర్చవుతున్నదని, ఎవరైనా తనతో ముందుకొస్తే ఈ సేవను మరింత ఉధృతంగా చేద్దామని పిలుపు ఇస్తున్నారాయన. మిత్రులారా స్పందిస్తారుగా..

Friday, December 30, 2011

చెట్టు కాదు గోడనే పడగొట్టండి...

ఫ్రెంచ్ మొరాకోలో దర్శకుడు హెన్రీ తన "ది బ్లాక్ రోజ్" సినిమా తీస్తున్న రోజులవి. ఆ ప్రాంతంలో హథవే కెయిడ్ ఇబ్రహీం అనే వ్యక్తికి చెందిన ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉంది. అందులో తన సినిమా షూటింగ్ కోసం ఇబ్రహీం అనుమతి కోసం హెన్రీ వచ్చాడు. తన ప్యాలెస్‌లో షూటింగ్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ప్యాలెస్ ఆవరణలోకి కెమెరాలు, క్రేన్‌లు, భారీ లైట్లు, ఇతర సామాను తీసుకురావడానికి చెట్లు అడ్డు వస్తున్నాయి. ఇక ఆ చెట్లు కొట్టించడానికి అంగీకరించాలంటూ ఇబ్రహీంని కలిశాడు హెన్రీ.

చెట్లు కొట్టించవద్దు. కావాలంటే గోడ పడగొట్టుకోండి.. అన్నాడు ప్యాలెస్ యజమాని ఇబ్రహీం

చెట్లు కొట్టించడం చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. గోడ కూల్చడం, మళ్లీ కట్టించడం చాలా ఖర్చు వ్యవహారం కదా.. అన్నాడు దర్శకుడు హెన్రీ..

నాకున్న డబ్బుతో అలాంటి గోడలు ఎన్నయినా క్షణాల్లో కట్టిస్తాను. కానీ, చెట్లు పడగొడితే తిరిగి మొలిపించే శక్తి నాకు లేదు.. అంటూ గోడను కూల్చడానికే మొగ్గు చూపాడు పర్యావరణ ప్రేమికుడైన ఇబ్రహీం...

భారత పాలకులారా.. మీకు అర్థమయిందనుకుంటాను.

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు..

Thursday, December 01, 2011

డాక్యుమెంటరీల పోలీస్..

గుంటూరు జిల్లా డిసిఆర్‌బిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ కొట్టె శ్రీహరి స్టయిలే వేరు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేయడానికి వినూత్న శైలిని ఎంచుకున్నారీయన. రకరకాల నేరాలపై డాక్యుమెంటరీలు నిర్మించి వాటిని ప్రదర్శించడం ద్వారా శ్రీహరి పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఈక్రమంలోనే 2007 పౌరులారా పారాహుషార్, 2009లో బతుకు బతికించు అనే రెండు లఘు చిత్రాలు నిర్మించి నేరాల నిరోధానికి తన వంతు సేవలందిస్తున్నారు. నకిలీ బాబాలు, వ్యసనాలు, గొలుసు దొంగలు, ప్రేమ మోసాలు, దురలవాట్లు, ర్యాగింగ్, బిస్కెట్ గ్యాంగులు లాంటివి ఈయన నిర్మించే లఘు చిత్రాల ఇతివృత్తంగా ఉంటాయి. జర్నలిజంలో ఎం.ఎ చేసిన శ్రీహరి తన ఈ లఘుచిత్రాలకు గాను 2001లో హైదరాబాద్ పోలీస్ డ్యూటీ మీట్‌లో బంగారు పతకాన్ని కూడా సాధించారు.

Monday, October 10, 2011

బ్లాగుతో బాగుపడిన జీవితం..

బ్లాగులు, ఇంటర్నెట్, చాటింగ్, బజ్.. ఈ పదాలు వింటూనే ఇవేమిటర్రా బాబూ అంటూ ముఖం చిట్లించుకునే ఒక వర్గానికి కనువిప్పు కల్గించాడు ఒక బ్లాగర్. అపూర్వ మానవత్వాన్ని ప్రదర్శించి బ్లాగులు తల్చుకుంటే జీవితాల్ని బాగుచేయవచ్చని నిరూపించాడు. అతనే కేరళకు చెందిన బ్లాగర్ సనల్ శశిధరన్. ఇతను తన బ్లాగు sanathanan.blogspot.com ద్వారా షరి అనే మహిళ ఆపరేషన్ కోసం లక్షలాది రూపాయల విరాళాలు సమకూర్చి సాయపడ్డాడు. ఆ వైనం ఏమిటంటే..

షరి, అనిల్ కుమార్ దంపతులు కేరళలోని కొల్లం పట్టణంలో నివసిస్తుంటారు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న షరికి తిరువనంతపురం ప్రాంతీయ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో వైద్యం చేయిస్తూ వచ్చారు. ఈమెకు కీమోథెరపీ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరగాల్సి ఉందని, ఇందుకోసం దాదాపుగా రూ.15 లక్షల మొత్తం అవసరమవుతుందని వైద్యులు చెప్పారు.

ఈ దంపతుల సమస్య గురించి తెలుసుకున్న శశిధరన్ తన బ్లాగ్ ద్వారా వీరి పరిస్థితిని Google buzz, Blogosphere, Facebook తదితరాల ద్వారా సైబర్‌వాసుల దృష్టికి తీసుకువచ్చాడు. సైబర్ మోసాలు మారుమోగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ దంపతుల వాస్తవ స్థితిగతులకు సాక్ష్యంగా మెడికల్ రిపోర్ట్‌లు, వీరి కుటుంబ సభ్యుల ఫోటో, ఫోన్ నెంబర్, అనిల్ కుమార్ బ్యాంక్ ఖాతా వివరాలు తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు.

శశిధరన్ నిజాయితీని గమనించిన పలువురు బ్లాగర్లు వెంటనే స్పందించగా ఆ నోటా ఈ నోటా ఈ వార్త పాకి వందలాదిగా సాయమందించేందుకు ముందుకు వచ్చారు. వీరి ద్వారా సమకూరిన డబ్బు వివరాల్ని గూగుల్ స్ప్రెడ్ షీట్ ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేసి పారదర్శకంగా మంచిపనిని నిర్వహించాడు.

Saturday, October 08, 2011

ఏమి రాజండీ... అధికారం ఉండదని తెలిసీ..

ఒక దేశానికి రాజంటే.. మందీమార్బలం, హద్దుల్లేని అధికారం, కోరుకున్నదల్లా క్షణాల్లో సమకూరే విలాసవంతమైన జీవితం. ఇలాంటి జీవితాన్ని తమంత తాముగా త్యాగం చెయ్యడానికి ఎవరైనా ముందుకొచ్చారా ?.. త్రేతాయుగంలో శ్రీరాముడు, తర్వాత బుద్ధ భగవానుడు తప్ప మరెవరూ గుర్తుకురావడం లేదు కదూ.. ఈ దివ్య పురుషుల జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలోనే నడిచాడు భూటాన్ దేశ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్.

భూటాన్‌లో తమ వంశం అధికారంలో ఉన్న రాచరిక వ్యవస్థ కంటే ప్రజాస్వామ్యమే ప్రజలకు మేలు చేస్తుందని నమ్మిన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 2008 కల్లా మహారాజు హోదాను వదులుకోవడానికి సిద్ధమని ముందే ప్రకటించాడు. తన ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికిగాను 34 సూత్రాల రాజ్యాంగాన్ని రూపొందించి దీనిని ప్రతి ఇంటికీ పంపి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.

ఈ రాజ్యాంగం అమలులోకి వస్తే భూటాన్ రాజుకున్న అధికారాలన్నీ రద్దవుతాయి. మూడింట రెండొంతుల మంది పార్లమెంట్ సభ్యులు అంగీకరిస్తే రాజును తొలగించే అధికారాన్ని పార్లమెంట్‌కే ఉండేలా రాజ్యాంగాన్ని తయారు చేశారు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్. చివరికి 2006లో తన మహారాజుగా తప్పుకుని కుమారుడు జిగ్మే గేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌కు పాలనా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడీయన తండ్రి ఆశయాలకు అనుగుణంగా భూటాన్ దేశాన్ని ప్రజాస్వామ్యం దిశగా నడిపిస్తూ ఎన్నికల చట్టాలు, భూసంస్కరణల అమలుకోసం పార్లమంట్‌లో జరిగిన చర్చలకు నేతృత్వం వహించారు.

పదవుల కోసం పాకులాడే నేటి రాజకీయ నాయకులు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ గారి దగ్గర పనివారిగా చేరినా బాగుపడతారంటారా?..

ఈ రాజుగారి మరో గొప్పతనం ఏమిటంటే.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పొగతాగడాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నారు. అయితే తనకూ ఈ అలవాటు ఉండటంతో పూర్తిగా దాని నుంచి బయటపడి అప్పుడు భూటాన్‌లో పొగతాగడంపై నిషేధం విధించారు.

సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు...

Thursday, October 06, 2011

మాట నిలుపుకున్న జైలు వార్డర్

ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారి సంఖ్య నానాటికీ క్షీణిస్తున్న నేటి తరుణంలో మాటకు కట్టుబడి మంచితనానికి ప్రతిరూపమై ఉన్న నాగభూషణం (55) లాంటి కొద్దిమందిని స్మరించుకోవలసిన బాధ్యత మనందరిదీను. ఇక ఆయనిచ్చిన మాటేమిటో.. దానిని ఎలా నెరవేర్చారో తెలుసుకోండి.

నాగభూషణంగారి గురించి నాకు తెలిసే సరికి ఆయన కడప సెంట్రల్ జైల్ వార్డర్‌గా పనిచేస్తున్నారు. 2003లో ఆయన విశాఖపట్టణం సెంట్రల్ జైల్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక హత్యకేసులో జీవితఖైదు శిక్షకు గురైన దువ్వూరు రాజారావు అనే వ్యక్తి ఈ జైలుకు వచ్చాడు. రాజారావు కొడుకు దువ్వూరు నేతాజీ ఆ సమయంలో 10వ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. కొడుక్కి మంచి జీవితం ఇవ్వలేక తాను జైలుకు వచ్చానన్న బెంగతో రాజారావు తన వ్యథను జైల్ సూపరింటెండెంట్‌కు మొరపెట్టుకున్నాడు. ఆ సూపరింటెండెంట్‌గారు ఖైదీ రాజారావు కొడుకు నేతాజీకి సాయపడమని జైల్ వార్డర్‌గా ఉన్న నాగభూషణానికి చెప్పారు.

తన ఉన్నతాధికారి ఆదేశాల్ని శిలాశాసనంగా భావించిన వార్డర్ నాగభూషణం తన ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ బాధ్యతల్ని పూర్తిగా నెత్తిన వేసుకున్నారు. సుమారు ఎనిమిదేళ్ళపాటు దాతల సాయం తీసుకుని నేతాజీ చదువు కొనసాగించేలా చేయూతనిచ్చారు. తన వంతుగా నేతాజీ కూడా కష్టపడి చదువుకుని ఇంటర్మీడియెట్ నుంచి ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) వరకూ ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యి, ఒక ఆదర్శ విద్యార్థిగా నిలబడ్డాడు.

నేతాజీ చదువు కొనసాగించిన ఎనిమిదేళ్ళ కాలంలో వార్డర్ నాగభూషణం విశాఖపట్టణం నుంచి నెల్లూరు, తర్వాత కడప సెంట్రల్ జైల్‌కు బదిలీ అయ్యారు. అయితే ఎక్కడకెళ్ళినా నేతాజీ చదువు బాధ్యతను మాత్రం విస్మరించలేదాయన. అతనికి డబ్బు, వస్తువుల కొరత రాకుండా అండగా నిలిచారు. కాలేజీకి వెళ్ళడానికి సైకిల్ కూడా కొనిపెట్టారు. పోలీసుల వ్యవహారశైలి పట్ల నేటి సమాజంలో కొంత చిన్నచూపు ఉన్నప్పటికీ నాగభూషణం లాంటి ఎందరో ఆ శాఖలో మానవత్వానికి భూషణాల్లా ఉన్నారని తెలుసుకోవాల్సి ఉంది.

నాగభూషణం వ్యక్తిత్వాన్ని పరికిస్తే, స్వతహాగా గాయకుడు మాత్రమేగాక ఉత్తమ సామాజిక కార్యకర్తగా 1984 నుంచీ పలు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటివరకూ వివిధ సంస్థల నుంచి 17 వరకూ ప్రశంసాపత్రాలు పొందారు. అయితే, ఖైదీ రాజారావు కొడుకు నేతాజీ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారాయన. ఇక నేతాజీ కూడా దేశ పౌరునిగా బాధ్యతల్ని నిర్వర్తించాలని మాత్రమే ఆకాంక్షించారు.

ఆదర్శ జంట గ్రామాలు.. కడప జిల్లా ప్రత్యేకం

జంట నగరాల పేర్లు విన్నాం గానీ ఈ జంట గ్రామాల కథేమిటా అనుకుంటున్నారు కదూ..! జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్నగరాలు ఒకదానికొకటి ఎంత ఆదర్శంగా ఉన్నాయో మనకు తెలీదుగానీ.. కడప జిల్లాలోని "ఎగువ కంచరపల్లి", "దిగువ కంచరపల్లి"జంట గ్రామాలు మాత్రం గత 50 ఏళ్లుగా మద్యపానం, పొగతాగడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఈ జిల్లాకు "ఫ్యాక్షన్"ముద్రేమిటా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.

ఈ జంట గ్రామాల్లో ఉన్న దాదాపు 200 కుటుంబాలు భారతీయ సంప్రదాయ విలువల్ని ఆచరిస్తూ భవిష్యత్ తరాలకు వీటినేకానుకలుగా అందిస్తున్నాయి. 50 ఏళ్ళ క్రిందటే అప్పటి గ్రామ పెద్దలు ఊరి ప్రజలచేత దురలవాట్లకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞచేయించడమేగాక ఈ ప్రతిన ఏ మాత్రం సడలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకున్న ఈ గ్రామాల్లో అగ్గిపెట్టె దొరుకుతుందిగానీ చుట్ట, బీడీ, సిగరెట్ కనిపించవు. బయటి ఊళ్ళనుంచి వచ్చే వారికి సైతం ఇవే నియమాలు వర్తిస్తాయి. తేడా వచ్చిందో "బొబ్బిలి బ్రహ్మన్న", "మర్యాద రామన్న"ల సమక్షంలో రచ్చబండ పంచాయితీలు, శిక్షలు తప్పవు.

మంచితనపు సిరులు... సిరియా పౌరులు

సిరియాలోని నియంత ప్రభుత్వం తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న పౌరులపై కత్తిగట్టింది. ప్రత్యేకించి యువతులపై "రేప్" ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. దీంతో జీవితకాలపు అవమానభారాన్ని మోయలేక కుంగిపోతున్న ఈ బాధితురాళ్ళను పెళ్ళి చేసుకుని అండగా నిలుస్తామని సిరియా యువకులు ముందుకొచ్చి తమలోని నిజమైన మానవత్వాన్ని చాటుకున్నారు.

సిరియాలోని క్రూర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన షబియా మిలిషియా వర్గం ఆ దేశ మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతుండటంతో గౌరవంగా బతుకుతున్న కుటుంబాలు ఈ మహళలను పరువు హత్యలకు గురిచేస్తున్నాయి. సిరియా - టర్కీ సరిహద్దులో ఉన్న Jisr al-Shughur లాంటి పలు పట్టణాల్లో వేధింపులు, అత్యాచారాలకు గురైన 10 వేలమందికి పైగా సిరియా యువతులు టర్కీలోని శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ దారుణమైన పరిణామాల మధ్య సుమేరియా పట్టణంలో రేప్‌కు గురైన నలుగురు అక్కాచెల్లెళ్ళు టర్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షుగౌర్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం కాయిస్ అనే వ్యక్తి ఇచ్చిన స్ఫూర్తితో మరికొందరు యువకులు ఇలాంటి యువతుల తెలుసుకుని కొత్త జీవితాన్ని అందించడానికి ముందుకొచ్చారు.

సిరియాలో ప్రభుత్వ అకృత్యాల గురించి ఇంతకంటే ఎక్కువ రాయలేను. ఆక్కడి పరిస్థితులపై మీకు ఆసక్తి ఉంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి..