Wednesday, August 29, 2007

ఆ కిడ్నీ పేరు రాఖీ...

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని మోడ్రన్ మెడికల్ ఇన్‌స్టిస్ట్యూట్ (ఎమ్ఎమ్ఐ) ట్రామా యూనిట్‌లోని బెడ్ నెంబర్ 5లో ఉన్న రోగి అసిమ్ కుమార్ సిన్హాకు ఆగస్టు 26వ తేదీ ఆదివారంనాడు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. నిబంధనల ప్రకారం అతనికి కిడ్నీ ఇచ్చింది రక్త సంబంధీకురాలు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటారేమో ! ఇక అసలు విషయం చెబుతా...

రాఖీ పౌర్ణమి దగ్గరకొచ్చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా కుంకురి గ్రామానికి చెందిన 36 ఏళ్ల అనూమిత స్నేహితురాళ్లంతా వాళ్ల అన్నయ్యలు, తమ్ముళ్ల కోసం ఖరీదైన రాఖీలు కొన్నారు. అనూమిత, ఆమె అక్క చెల్లెళ్లందరూ తమ సోదరుడికి ఈసారి తప్పనిసరిగా ఓ అపూర్వమైన కానుక ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే, నలుగురు అమ్మాయిలు, ముసలివాళ్లయిన తల్లిదండ్రులున్న ఆ కుటుంబానికి ఏకైక ఆధారమై, చాలీచాలని జీతంతో తమను ఇన్నేళ్లూ పాడుకుంటూ వచ్చాడు వాళ్లన్నయ్య అసిమ్ కుమార్ సిన్హా. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక కుటుంబానికే జీవితాన్ని అర్పించి, చివరకు మూత్రపిండాలు రెండూ దెబ్బతిని కొన్ని నెలలుగా ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.

రాఖీ పౌర్ణమి ఇక రెండ్రోజులే ఉంది. అనూమిత, అక్కా చెల్లెళ్లంతా కలసి ఎమ్ఎమ్ఐ డాక్టర్లను కలుసుకున్నారు. తమ నిర్ణయం చెప్పారు. చివరకు ఆందరికంటే ఆరోగ్యంగా ఉన్నందున అనూమితకే తన అన్నయ్యకు ఆ అపూర్వ కానుక ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ కానుకతో అసిమ్ మళ్లీ ఆరోగ్యవంతుడయ్యాడు. జీవితంలో సోదర ప్రేమకు అసలైన అర్థాన్ని చెబుతూ కిడ్నీ దానంతో అన్నయ్య జీవితంలో కొత్త కోణాన్ని చూపించిన అనూమిత అందరికీ ఆదర్శప్రాయమే.