Saturday, November 30, 2013

అతనొక్కడే... ఒక చోట స్టూడెంట్.. మరోచోట హెడ్మాస్టర్

అతనే బాబర్ అలీ. 17 సంవత్సరాల ఈ కుర్రాడు 9 ఏళ్ళ వయసుకే ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి అలా అలా ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు భుజానికెత్తుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్ గ్రామానికి చెందిన అలీ బెర్హంపూర్‌లో ఉన్న కాసింబజార్ రాజ్ గోవింద సుందరి విద్యాపీఠ్‌లో ఒక పక్క ప్లస్ టూ చదువుకుంటూనే తన ఊళ్ళో పేదల కోసం తమ ఇంటి పెరడులో ఏర్పాటు చేసిన బడికి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాడు. పెరడులో బడి అంటే ఏదో చిన్నదనుకునేరు. ఇక్కడ దాదాపు 800 మంది పేద విద్యార్థులకు అలీ ద్వారా విద్యాబుద్ధులందుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ బడికి గుర్తింపునిచ్చి ఇక్కడి విద్యార్థులకు నెల నెలా బియ్యం సరఫరా చేస్తోంది. బాబర్ అలీ సేవల్ని గుర్తించిన పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇతనిని పురస్కారాలతో సత్కరించి ప్రోత్సహిస్తున్నాయి.