Tuesday, July 21, 2009

దైవకార్యం కోసం పడవ మాయం

18వ శతాబ్దంలో సెయింట్ కొలంబియాకు 12 మంది మత ప్రచారకులను ఐరిష్ క్రైస్తవ మిషనరీ అప్పగించి అందరినీ ఉత్తర స్కాట్లాండ్‌కు పంపింది. అయితే, ఉత్తర స్కాట్లాండ్‌లోని పిక్ట్స్ అనే తెగకు చెందినవారు ఈ క్రైస్తవ మత ప్రచారకుల పాలిట యమకింకరుల్లా మారారు. ఈ సంగతి తెలిసీ ఇక్కడకు వచ్చిన కొలంబియా, ఆ మత ప్రచారకులు పడవ దిగిన వెంటనే ఆ పడవను తగలబెట్టేశారు. రాబోయే ప్రమాదాలకు భయపడి ఎప్పుడైనా తాము ఇదే మార్గంలో పడవ ఎక్కి వెనక్కి వెళ్ళిపోవచ్చనే ఆలోచన రాకుండా, వచ్చినా ఆ అవకాశం లేకుండా కేవలం క్రైస్తవ మత ప్రచారమనే దైవకార్యం కోసం కట్టుబడి వారు తమ పడవను తామే తగులబెట్టుకున్నారు. తర్వాత స్కాట్లాండ్‌లో క్రైస్తవ మతం పాతుకుపోవడంలో వీరంతా అత్యంత కీలకపాత్ర పోషించారు.

మనం నమ్మిన దైవం కోసం దైవ కార్యం చెయ్యడానికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడితే అన్నీ అనుకూలిస్తాయని ఈ ఘటన నిరూపించింది.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Monday, July 20, 2009

ప్రాణం పోతుందనుకుని రక్తమిచ్చాడు....

కెనడాలోని ఒంటరియో ప్రావిన్స్‌లో ఉన్న లిజ్ అనే టీనేజర్ ఒక అరుదైన, ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతోంది. ఆమె రోగానికి మందులేదు. ఆ రోగం వచ్చి తగ్గిన ఎవరి రక్తమైనా ఆమెకి ఎక్కిస్తే, అందులోని యాంటీబాడీస్ పనిచేసి ఆమె రోగం తగ్గవచ్చని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి కంప్యూటర్‌లోని రికార్డ్‌లను పరిశీలిస్తే కొద్ది కాలం కిందట మైఖేల్ అనే ఆరేళ్ళ బాలుడికి ఇదే రోగం వచ్చి తగ్గినట్లు వైద్యులకు తెలిసింది. వారు వెంటనే మైఖేల్ అమ్మానాన్నలతో మాట్లాడారు. ఒక ప్రాణం కాపాడటం కోసం రక్త మార్పిడి చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆరేళ్ళ చిన్నారి మైఖేల్‌ని ఒక రోజున ఆసుపత్రికి తీసుకువచ్చారు. రక్త మార్పిడి ఎలా జరుగుతుందో మైఖేల్‌కు వివరించిన వైద్యులు లిజ్ కోసం రక్తమివ్వడానికి అంగీకారమేనా అని అతన్ని అడిగారు. లిజ్ బతకడానికి రక్తం ఇస్తానని చిన్నారి మైఖేల్ చెప్పాడు.

రక్త మార్పిడి జరుగుతోంది. తన ఒంట్లోని రక్తం లిజ్ ఒంట్లోకి ఎక్కడం మైఖేల్ చూశాడు. కాసేపయ్యాక మైఖేల్ ముఖం పాలిపోయింది. ఏడుపు మొదలు పెట్టాడు. నొప్పిగా ఉందా అని ఒక వైద్యుడు అడిగినప్పుడు ఏమీ లేదని జవాబిచ్చాడు.

""నేను ఇక ఎంతసేపట్లో చనిపోతాను?'' అని మైఖేల్ అడిగాడు.

చిన్నపిల్లవాడైన మైఖేల్ తనకు వైద్యులు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. తన ఒంట్లోని రక్తం మొత్తం లిజ్‌కు ఎక్కిస్తారని, దాంతో తాను చచ్చిపోతానన్న అభిప్రాయంతో మైఖేల్ ఉన్నాడు.

""నువ్వు చనిపోవు. రక్తం అంతా తీసుకోం. కొంచమే తీసుకుంటాం'' అని మైఖేల్‌కు చెప్పాడు వైద్యుడు.

అయితే, తన రక్తం మొత్తం తీసేసి లిజ్‌కు ఎక్కిస్తారని, అందువల్ల లిజ్ బతుకుతుందని, అప్పుడు తాను మరణిస్తానని అనుకుని కూడా మైఖేల్ రక్తమివ్వడానికి ముందుకు రావడం ఆసుపత్రిలో అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. రక్తమార్పిడి జరిగాక మైఖేల్ ఇంటికి వెళుతుంటే అందరూ అతన్ని ఆరాధన భావంతో మెచ్చుకుని వీడ్కోలిచ్చారు.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.