Friday, November 27, 2009

బ్యాంక్ మేనేజర్ జలయజ్ఞం

కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దేవరాజ్ అక్కడ మైసూర్ స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 30 నదుల అనుసంధానం, 50 వేలకు పైగా కుంటలకు జీవం పొయ్యడం లక్ష్యంగా కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకూ కొన్నేళ్ళ కిందట పాదయాత్ర చేపట్టారాయన. ఇందుకోసం తన ఉద్యోగానికి 9 నెలల పాటు సెలవు పెట్టి తన యాత్రలో భాగంగా 2006లో ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు. అప్పటికి ఆయన 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. తన పాదయాత్రలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించి నదులను అనుసంధానించాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈయన చేపట్టిన ఈ జలయజ్ఞం స్ఫూర్తిని రాజకీయ నాయకులు కూడా అందిపుచ్చుకోవాలి.

Thursday, November 26, 2009

సేవకుడు బాలసుబ్రహ్మణ్యన్

తమిళనాడులో దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మహామాఘం ఉత్సవం అంటే అందరికీ గుర్తుకొస్తారు 95 ఏళ్ల పైబడిన బాలసుబ్రహ్మణ్యన్. ఇంత పెద్దవయసులోనూ ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో సేవ చెయ్యడం కోసం పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవకులతో సన్నద్ధులవుతారు బాలసుబ్రహ్మణ్యన్. 1932 నుంచి ఈ సేవాయజ్ఞాన్ని తలపెట్టి 1944, 1956, 1968, 1980, 1992 సంవత్సరాల్లోనూ... తర్వాత 2004లో 95 ఏళ్ళ వయసులోనూ స్వచ్ఛంద సేవకుల బృందానికి నేతృత్వం వహించి తన బాధ్యతను నిర్వర్తించారాయన. స్కాట్స్ అండ్ గైడ్స్‌తో సుదీర్ఘకాల సాన్నిహిత్యం కలిగి ఉన్న బాలసుబ్రహ్మణ్యాన్ని తమిళనాడు ప్రభుత్వం నాగపట్టణం జిల్లాకు శాశ్వత కమిషనర్‌గా నియమించింది. న్యాయశాస్త్రపట్టభద్రుడైన ఈ సేవకుడు క్రైస్తవుల ఆరాధ్యదైవమైన వేలాంకన్నిమాత ఉత్సవానికి కూడా స్వచ్ఛంద సేవకులను తీసుకెళ్ళారు. అక్కడ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా, వినియోగదారుల మండలిలోను, ఉచిత న్యాయసహాయ సంఘంలోను సభ్యునిగా సేవలందించారు. నాగపట్టణం సెయింట్ జాన్స్ అంబులెన్స్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.