Sunday, June 30, 2013

మామూలు బడిలో పెద్దాయన కూతురు

ఒక జిల్లా కలెక్టర్ తన కూతురిని కార్పోరేట్ స్కూల్‌లో కాక సర్కారు బడిలో చేర్పించారంటే నమ్ముతారా!.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు 2011లో కలెక్టర్‌గా పనిచేసిన ఆనంద్ కుమార్ తన ఆరేళ్ళ కూతురిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకుని అలాగే చేశారు. తన కుమార్తె గోపికను కుమళంకుట్టై పంచాయితీ యూనియన్‌ ప్రాథమిక పాఠశాలలో రెండవవ తరగతిలో చేర్పించారు. ఈ జిల్లాలో చాలా పెద్ద కార్పోరేట్ బడులున్నా ఈ కలెక్టర్‌ మాత్రం తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించి ఎందరికో ఆదర్శంగా నిలబడ్డారు. తమిళనాడులో జరిగే ప్లస్‌ టూ, ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించిన చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే. ఇక్కడ ఇంకొక విషయమేమంటే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫాంనే గోపికకూ ఇప్పించారు తప్ప ఆమె కోసం కలెక్టర్ గారు మరింత నాణ్యమైన వస్త్రం తెప్పించి యూనిఫాం కుట్టించలేదు. అంతకు మించిన మరో సంగతేమిటంటే ఆమె తన బడిలో ఉచితంగా పెట్టే మధ్యాహ్న భోజనమే తిన్నది తప్ప ఇంటి నుంచి ప్రత్యేకంగా క్యారేజీ రాలేదు. గోపిక తల్లి ఒక డాక్టర్ అట. జిల్లాకు ఎంతో మేలు చేస్తున్న ఈ కలెక్టర్ గారిని ఆ తర్వాత రాజకీయులు బదిలీ చేయించారు.