Tuesday, April 30, 2013

'స్ఫూర్తిదాత.. శ్రీ మామయ్య

ఆయన అమెరికా వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో ఎంఎ పట్టా పొందారు. బిజినెస్ స్కూల్‌లో బోధకుడిగానూ పనిచేశారు. వ్యాపార విలువల గురించి లోతైన అధ్యయనం చేసినా జీవితాన్ని మాత్రం మానవతా విలువలతోనే అల్లుకున్నారు. ఆయనే శ్రీవ్యాల్. 2004లో మాతృభూమికి తిరిగి వచ్చిన శ్రీవ్యాల్ బిజినెస్ స్కూల్ బోధకునిగా చేరినప్పుడు ఎదురైన కొన్ని అనుభవాల నుంచి పుట్టిందే "స్ఫూర్తి" ఫౌండేషన్. భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో 2006లో హైదరాబాద్ చర్లపల్ల ప్రాంతంలో ఒక కిరాయి ఇంటిలో ముగ్గురు అనాథ బాలల కేరింతల నడుమ ఈ ఫౌండేషన్ ఆవిర్భవించింది. శ్రీవ్యాల్ స్నేహితులు, దాతల విరాళాలతో ప్రస్తుతం సుమారు 200 మంది చిన్నారులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. తన భార్య వెంకటేశ్వరి తోడ్పాటుతో ఇక్కడి పిల్లలకు అన్నీ తామై వారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

పిల్లలంతా శ్రీ మామయ్యగా పిల్చుకునే శ్రీవ్యాల్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుండిగల్ వద్ద స్థలాన్ని కేటాయించింది. వీరి కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు జెజె మెహతా మెమోరియల్ ఫౌండేషన్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు "స్ఫూర్తి" బాలల కోసం అప్పుడప్పుడూ కార్యక్రమాల్ని చేపడుతున్నాయి. ఆ మధ్య అమెరికాలోని మేరీలాండ్ ఫస్ట్ లేడీ మేరీ క్యాథరీన్ కూడా ఈ ఫౌండేషన్‌కు వచ్చి అభినందనలు కూడా తెలిపారు.

"స్ఫూర్తి" బాలలందరికీ భోజనం, బస, వస్త్రాలు, కాన్వెంట్ చదువు ఉచితమే. 7వ తరగతి వరకూ అక్కడి ప్రయివేట్ పాఠశాలలోను, తర్వాత 10వ తరగతి వరకూ "అధ్య"లో వీరిని చదివిస్తారు. సంగీతంతో పాటు ఇక్కడ కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠ్యప్రణాళికను బోధిస్తారు.

ఈ స్ఫూర్తిని మనందరం అందిపుచ్చుకుందాం...