Tuesday, July 31, 2012

రోగాలున్నా డబ్బులు తిరిగిచ్చేశారు..


అక్రమార్జన, అవినీతి కలసి ప్రళయ రుద్రతాండవం చేస్తున్న రోజులివి. వ్యక్తులను.. సామాజిక వాతావరణాన్నీ అనారోగ్యం పట్టి పీడిస్తున్న పరిస్థితులివి. అలాంటి తరుణంలో 89 సంవత్సరాల రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి చార్లెస్ విలియమ్స్ అనే ఆయన తన నిజాయితీని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం మైసూరులో నివసిస్తున్న ఈయన అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ తన పెన్షన్ అకౌంట్‌లో తనకు రావలసిన మొత్తంకంటే ఎక్కువగా జమ అయిన డబ్బును తిరిగిచ్చేశారు.

విలియమ్స్ గారు మన దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా చేరారు. పలు యుద్ధాల్లో పాల్గొని ఎన్నో చారిత్రక అనుభవాల గూడుగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత తనకు రావలసిన పెన్షన్ మొత్తంలో పొరపాట్లు చోటు చేసుకున్నట్లు గ్రహించిన విలియమ్స్ స్థానిక సైనిక సంక్షేమం, రీసెటిల్మెంట్ బోర్డు వారిని కలుసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి మైసూరులోని వెకరె ఎక్స్ సర్వీస్‌మెన్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎం ఎన్ సుబ్రమణిని సంప్రదించారు. చివరికి మంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు చెందిన సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఎక్కువ మొత్తం విలియమ్స్ పెన్షన్ ఖాతాలో పడినట్లు లెక్కల్లో తేలింది.

తనకు అర్హత లేనప్పటికీ fixed medical allowance కింద ప్రతి నెలా రూ.300 చొప్పున అదనపు మొత్తంగా ఖాతాలో 2007 నుంచీ రూ.15,200 జమ అయినట్లు గ్రహించిన విలియమ్స్ ఈ మొత్తాన్ని తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి కంటి సమస్య, గుండెకు ఆపరేషన్ కోసం ప్రస్తుతం ఆయన ఒకటిన్నర లక్ష రూపాయల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తనకు ఇబ్బందులున్నప్పటికీ దేశ ఖజానాపై భారం మోపకూడదన్న నైతికతతో ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు వారికి లేఖ పంపి తనపై ఆర్థిక భారం పడకుండా ఈ డబ్బును సులభ వాయిదాల్లో వెనక్కి తీసుకోవలసిందిగా కోరారు.

ఈ ఉదంతం ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటో చెప్పనక్కరలేదనుకుంటా...