Friday, April 30, 2010

నరికినందుకు నాటే శిక్ష

సుందర్ వాసుదేవ అనే పెద్ద మనిషి తన చిన్న మనసుతో 2003లో తాజ్‌పూర్ అనే గ్రామంలో 42 పీపల్ చెట్లను నేలకూల్చాడు. ఆయన ఢిల్లీ నగర వాసి. వాసుదేవ చేసిన తప్పును తీవ్రంగా పరిగణించి ఆయనపై "వృక్ష పరిరక్షణ చట్టం" కింద కేసు పెట్టారు. మామూలుగా అయితే ఆయన చేసిన తప్పుకుగాను ఆ చట్టం నిబంధనల మేరకు జరిమానా విధిస్తారు. అయితే ఢిల్లీలోని ఒక న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి దేవేందర్ కుమార్ భిన్నమైన శిక్షను విధించారు. అదేంటంటే... నరికిన ఒక్కో చెట్టుకూ పరిహారంగా ఐదేసి మొక్కల చొప్పున నాటాలి. అంటే వాసుదేవ మొత్తం 210 మొక్కలు నాటాలన్నది ఈ శిక్ష సారాంశం. అంతేగాక ఆయన ప్రవర్తనపై నిఘా ఉంటుందని, ఆరునెలల పాటు పరిశీలనలో ఉంటారని తెలియజేసి ప్రొబేషన్ మీద విడిచిపెట్టారు. ప్రాణవాయువునిచ్చి మానవాళి ప్రాణాలు కాపాడే వృక్ష దేవతల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఈ న్యాయమూర్తిగారు వనదేవతల జీవితాల్లో కొత్తకోణాలు పూయించిన పుణ్యమూర్తి.