Thursday, April 30, 2015

దోపిడీ విద్యాసంస్థలు ఉమను చూసి సిగ్గు తెచ్చుకోవాలి..

తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాకు చెందిన ఉమ ఒక మామూలు గృహిణి. కానీ వీధి బాలల కోసం ఆమె చేసిన విద్యా సేవలు చూస్తే ప్రమాణాలు దిగజారిన మన విద్యావ్యవస్థ సిగ్గుతో తల దించుకోవాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్ల పరిసరాల్లో చదువూ సంధ్య లేకుండా తిరిగే వీధి బాలల కోసం ఏదో ఒకటి నిశ్చయించుకుని 2003లో సిరాగూ మాంటిస్సోరీ స్కూలును ఏర్పాటుచేశారామె. బిచ్చగాళ్ల పిల్లలు, వీధి బాలలు ఆ బడిలో చేరేలా ఆమె రోడ్లపై తిరిగి ప్రచారం చేశారు.  ఆ పిల్లలకు ఐసిఎస్‌ఇ సిలబస్‌‌లో విద్యా బోధన చేశారు. అక్కడితో ఆగలేదు. జీవన్ విద్య పేరిట ఐఐటి కోచింగ్ కూడా అందజేస్తున్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వచ్చిన పిల్లలకు వ్యవసాయం, ఆరోగ్యం, వంటలు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో తర్ఫీదు ఇచ్చి భవిష్యత్తులో వారి అభిరుచికి తగిన రంగాన్ని ఉపాధి కోసం ఎంచుకునేలా తయారు చేస్తున్నారు. తన సేవల్ని అంతటితో ఆపలేదు... సూయం చారిటబుల్ ట్రస్ట్, భారతమాత స్కూలు, కన్నిమేరీ నర్సరీ స్కూలు వంటి మరెన్నో సంస్థల్ని నడుపుతున్నారామె. తిరువల్లూరు, కన్యాకుమారి, నాగపట్నం లాంటి చోట్ల వైద్య శిబిరాలు, విద్యా సంబంధమైన అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నారు.