Wednesday, February 29, 2012

శ్రీనివాసాచార్యులు.. హృదయం చలువపందిరి

సికింద్రాబాద్ అడిక్‌మెట్ వేదపాఠశాలలో గురువు, హబ్సిగూడ రామాలయం పూజారి శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు. సత్గ్రంథ పఠనంతో మనస్సును, వాటి నుంచి నేర్చుకున్న మంచిని సత్కార్యాచరణ ద్వారా అమలు చేయడం ద్వారా దేవుడిచ్చిన శరీరాన్ని పునీతం చేసుకున్నారాయన. మండువేసవిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల్లో వచ్చిపోయేవారికి సూర్య(ప్ర)తాపం నుంచి ఉపశమనం కల్గిస్తూ ఎన్నో పందిళ్ళు స్వంత ఖర్చుతో వేయించారాయన.

"మానవ సేవే మాధవ సేవ" అని తండ్రి వెంకట నరసింహాచార్యులు చేసిన బోధననే శ్రీనివాసాచార్యులు తన బాటగా ఎంచుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని రాంనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, మెట్టుగూ, చిరుగానగర్, నాగోలు, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈయన పాదచారులు, బాటసారులు, ప్రయాణీకుల కోసం పలు తాత్కాలిక చలువ పందిళ్ళు వేయించారు. ఆచార్యులుగారి ఈ చలువ పందిరి సేవలో ఆటో రవి, తడికెల బాలయ్య, మల్లేష్ అనేవారు తగినంత చేయూతనిస్తున్నారట.

ఒక్కో చలువ పందిరి వేయడానికి సుమారు రూ.వెయ్యి వరకూ ఖర్చవుతున్నదని, ఎవరైనా తనతో ముందుకొస్తే ఈ సేవను మరింత ఉధృతంగా చేద్దామని పిలుపు ఇస్తున్నారాయన. మిత్రులారా స్పందిస్తారుగా..