Friday, November 21, 2008

చీపురు పట్టాడు ఉద్యోగం కొట్టాడు

అక్కడ బోలెడు చెత్త కనిపిస్తోంది. ఉన్నతాధికారులు, పనివాళ్లు అటూ ఇటూ తిరుగుతున్నారు గానీ ఆ చెత్తను తొలగించాలన్న ఇంగితం ఒక్కరికీ కలగలేదు. అదే సమయానికి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లతో ఆ ప్రాంగళం కిటకిటలాడుతోంది. ఇంటర్వ్యూకోసం సూటు బూటు వేసుకుని వచ్చిన 26 ఏళ్ల వికలాంగుడు గోపికన్నన్ పరిస్థితిని గమనించాడు. ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే అక్కడున్న చీపురు కట్ట తీసుకున్న ఊడ్చడం మొదలు పెట్టి పని పూర్తి చేశాడు. ఇతను ఊడ్చుతున్నప్పుడు అక్కడే ఉన్న పత్రికా ఫోటోగ్రాఫర్లు విలేఖరులు, గోపీకన్నన్ చొరవను ప్రశంసిస్తూ మర్నాడు పత్రికల్లో ప్రశంసిస్తూ వార్తలు వేసారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దృష్టికి వెళ్లడంతో వెంటనే మదురై మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

అసలు విషయం మీకు ఇంకా చెప్పలేదుగా... రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కార్యాలయానికి వేదికైన చెన్నైలోని సచివాలయంలో 2003 జులై నెలలో ఈ సంఘటన జరిగింది. గోపికన్నన్ వికలాంగుడే అయినా విద్యార్హతలతోబాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన మొనగాడు. మదురైలోని సుబ్రమణ్యపుర టీచర్స్ కాలనీ ఇతని నివాసం.

పద్యంతో మద్యం మాయం

అది పశ్చిమగోదావరి జిల్లా కొత్త తలారివాని పాలెం గ్రామం. మద్యం చుక్క పడందే నిద్రపట్టని గంగరాజు పూటుగా తాగి రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చాడు. ఐదో తరగతి చదువుతున్న ఇతని కొడుకు పడాల మహలక్ష్మినాయుడు ఆ రోజే తన పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతంగా పద్యాలు పాడి ఒక స్టీల్ కంచం బహుమతిగా అందుకున్నాడు. తండ్రికి ఈ బహుమతి చూపించాలన్న ఆరాటంలో తను సాధించిన బహుమతిని అతనికి చూపించాడు ఆ చిన్నారి. మందు పుచ్చుకున్న మత్తులో ఉన్న గంగరాజు దాన్ని విసిరికొట్టాడు. పాపం ఆ కొడుకు హృదయం గాయపడి నిద్రపోయాడు. కాసేపటికి మత్తుదిగిన గంగరాజు ఆ కంచం ఎప్పుడు కొన్నావని భార్యను అడిగాడు. ఆవిడ జరిగిన సంగతంతా చెప్పింది. తన ప్రవర్తనకు బాధపడిన గంగరాజు వెంటనే కొడుకును నిద్రలేపి పద్యాలు పాడమన్నాడు. తండ్రి అలా అడగటమే మహాభాగ్యంగా తలచిన ఆ కొడుకు వెంటనే రెండు పద్యాలు పాడి వాటి అర్థాలు వివరించాడు. గంగరాజు హృదయం గంగలా ఉప్పొంగింది. స్టీల్ కంచంకంటే పెద్ద బహుమతే ఇస్తాను ఏం కావాలో కోరుకోమని కొడుకుతో అన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోని ఆ కొడుకు ఇక ఏనాడు తాగరాదని తండ్రిని కోరాడు. ఊహ తెలిసినప్పటి నుంచి మద్యంతోనే పెరిగిన గంగరాజు కొడుక్కి మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు.

ఇక దీని మూలానికొద్దాం. మహాలక్ష్మి నాయుడు చదువుతున్న పాఠశాలలోని అతని గురువు పీలా బాబ్జీ ఈ బాలుడికి పద్య పఠనం నేర్పారు. అనకాపల్లిలో జరిగిన వివి రమణ వర్థంతి సభ సందర్భంగా బాబ్జీ తన గురువైన డాక్టర్ మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో మిగతా పిల్లలతోబాడు నాయుడుచేత కూడా పద్యాలు పాడించారు. రసరమ్యంగా ఉన్న నాయుడి ఆలాపనకు ముగ్ధులై ఈ కంచం బహుమతిగా ఇచ్చారు. ఆ పద్యమే ఆ తండ్రిచేత మద్యం మాన్పించింది. గంగరాజు భార్య సన్యాసమ్మ ఎన్నోమార్లు భర్తచేత తాగుడు మాన్పించాలని ప్రయత్నించింది. తాగనని గంగరాజు మాట ఇచ్చి మళ్లీ అదే బాట పట్టేవాడు. కానీ కొడుకు పద్యం వారి జీవితానికి కొత్త కోణాన్ని చూపించింది.