Friday, November 21, 2008

పద్యంతో మద్యం మాయం

అది పశ్చిమగోదావరి జిల్లా కొత్త తలారివాని పాలెం గ్రామం. మద్యం చుక్క పడందే నిద్రపట్టని గంగరాజు పూటుగా తాగి రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చాడు. ఐదో తరగతి చదువుతున్న ఇతని కొడుకు పడాల మహలక్ష్మినాయుడు ఆ రోజే తన పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అద్భుతంగా పద్యాలు పాడి ఒక స్టీల్ కంచం బహుమతిగా అందుకున్నాడు. తండ్రికి ఈ బహుమతి చూపించాలన్న ఆరాటంలో తను సాధించిన బహుమతిని అతనికి చూపించాడు ఆ చిన్నారి. మందు పుచ్చుకున్న మత్తులో ఉన్న గంగరాజు దాన్ని విసిరికొట్టాడు. పాపం ఆ కొడుకు హృదయం గాయపడి నిద్రపోయాడు. కాసేపటికి మత్తుదిగిన గంగరాజు ఆ కంచం ఎప్పుడు కొన్నావని భార్యను అడిగాడు. ఆవిడ జరిగిన సంగతంతా చెప్పింది. తన ప్రవర్తనకు బాధపడిన గంగరాజు వెంటనే కొడుకును నిద్రలేపి పద్యాలు పాడమన్నాడు. తండ్రి అలా అడగటమే మహాభాగ్యంగా తలచిన ఆ కొడుకు వెంటనే రెండు పద్యాలు పాడి వాటి అర్థాలు వివరించాడు. గంగరాజు హృదయం గంగలా ఉప్పొంగింది. స్టీల్ కంచంకంటే పెద్ద బహుమతే ఇస్తాను ఏం కావాలో కోరుకోమని కొడుకుతో అన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోని ఆ కొడుకు ఇక ఏనాడు తాగరాదని తండ్రిని కోరాడు. ఊహ తెలిసినప్పటి నుంచి మద్యంతోనే పెరిగిన గంగరాజు కొడుక్కి మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు.

ఇక దీని మూలానికొద్దాం. మహాలక్ష్మి నాయుడు చదువుతున్న పాఠశాలలోని అతని గురువు పీలా బాబ్జీ ఈ బాలుడికి పద్య పఠనం నేర్పారు. అనకాపల్లిలో జరిగిన వివి రమణ వర్థంతి సభ సందర్భంగా బాబ్జీ తన గురువైన డాక్టర్ మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో మిగతా పిల్లలతోబాడు నాయుడుచేత కూడా పద్యాలు పాడించారు. రసరమ్యంగా ఉన్న నాయుడి ఆలాపనకు ముగ్ధులై ఈ కంచం బహుమతిగా ఇచ్చారు. ఆ పద్యమే ఆ తండ్రిచేత మద్యం మాన్పించింది. గంగరాజు భార్య సన్యాసమ్మ ఎన్నోమార్లు భర్తచేత తాగుడు మాన్పించాలని ప్రయత్నించింది. తాగనని గంగరాజు మాట ఇచ్చి మళ్లీ అదే బాట పట్టేవాడు. కానీ కొడుకు పద్యం వారి జీవితానికి కొత్త కోణాన్ని చూపించింది. Print this post

4 comments:

Anonymous said...

సంతోషకరమైన కబురు చెప్పారు

rākeśvara said...

Bravo.
Finally some good news.

worthlife said...

ధన్యవాదాలు...

Anonymous said...

Meeku chala chala Krutagnudini