Thursday, December 23, 2010

బాజా మోత... లక్షల దాత...

మీరెప్పుడైనా అమృత్‌సర్ వెళ్ళి ఉంటే... మునాడీవాలా (బాజా మోగించే వ్యక్తి)  ఉరఫ్ రామ్ లాల్ భల్లా గురించి చిల్లర దుకాణాలవారు, రిక్షావాలాల్ని అడిగి చూడండి. మెడలో బాజా మోగిస్తూ వీధుల వెంట ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి స్వచ్ఛంద దాతలందరి నుంచీ విరాళాలు సేకరించి దాదాపు 20 లక్షల వరకూ (ఇంకా ఎక్కువ కావచ్చు...) దానం చేశారు. ఎవరికి దానం చేశారండీ అంటే... ఉగ్రవాద బాధితులు, అనాధలు, 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక దాడుల బాధితులు ఇలా ఎవరున్నా వారందరికీ అందేలా చందాలు పోగేశారు. అమరుల కుటుంబాలకు చేయూతనిచ్చే లక్ష్యంతో సమాచార్ గ్రూపు వార్తాపత్రికల సంస్థ ఏర్పాటు చేసిన "షహీద్ పరివార్ నిధి"కి మన మునాడీవాలాగారు ఒక్కరే 1996 నాటికి 12 లక్షలిచ్చారు. ఆ నిధికి అంత మొత్తం ఇచ్చిన అతి పెద్ద దాత ఈయనే కావడం గమనార్హం. వీరి విరాళాల్లో కొంత మొత్తం ముంబై పేలుళ్ళ బాధితులకు, ఆంధ్రప్రదేశ్ తుఫాను బాధితులకూ అందింది.

1947లో జరిగిన దేశ విభజన కాలంలో లాహోర్ నుంచి అమృత్‌సర్‌కు వలస వచ్చిన రామ్ లాల్ భల్లా స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. నెల నెలా తనకు లభించే సమరయోధుల పింఛన్ మొత్తంలో కొంత భాగాన్ని కూడా తన విరాళాలకు జత చేసేవారు. తలపై అమృత్‌సర్ సంప్రదాయ టోపీ పెట్టుకుని, భుజానికి సంచీ, మెడలో బాజా తగిలించుకుని దానిని మోగిస్తూ అమృత్‌సర్ వీధుల్లో "వినండి స్నేహితులారా... వితంతువులు, అనాధలకోసం రామ్ లాల్ భల్లా లాహోర్‌వాలా మిమ్మల్ని చందాలు అడుగుతున్నాడు" అని నినదిస్తూ ముందుకు సాగిపోయేవారు. ఆయన గొంతు వినగానే ఆ వీధులగుండా వెళ్ళేవారు, దుకాణదార్లు, రిక్షావాలాలు సైతం స్పందించి ఎంతో కొంత మొత్తం భల్లాగారి సంచీలో వేస్తుండేవారు. 1986 నుంచి భల్లాగారు ఈ ఉద్యమాన్ని చేపట్టగా తనకు 105 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ సేవ కొనసాగించారు. ఈయన చందాలు ఎన్నెన్నో జీవితాల్లో కొత్తకోణాల్ని పూయించాయి.

Sunday, December 12, 2010

వృద్ధులు పాటించారు... డాక్టర్ అనుసరించారు

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన వృద్ధ దంపతులు ఎస్ ఎస్ పళనియప్పన్ (80), మీనమ్మాళ్ (74) ఒక రోజున తిరునెల్వేలి వైద్య కళాశాల ఆసుపత్రికి వచ్చారు.  మరణానంతరం అవయువదానంగా తమ దేహాల్ని ఈ ఆసుపత్రి వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధనల నిమిత్తం సమర్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పత్రాల్ని ఆసుపత్రి డీన్‌కు అందజేశారు.

పళనియప్పన్ గతంలో శంకరన్ కోవిల్ గ్రామంలో మెడికల్ స్టోర్ ఆపీసర్‌గా పనిచేసేవారు. మరణానంతరం వైద్య పరిశోధనల కోసం తమ దేహాల్ని దానంగా ఇవ్వాలని 40 ఏళ్ళ కిందటే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యునిగానూ ఉన్నారు. అవయువదాన ప్రాధాన్యత గురించి తన భార్యతో చర్చించినప్పుడు ఆమెకూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకుందని పళనియప్పన్ తెలిపారు. వీరి అభిమతాన్ని కుటుంబ సభ్యులంతా ఏ మాత్రం ప్రశ్నించక గౌరవించారట. ప్రచారం కోసం కాకుండా... అవయువదానం దిశగా మరిందరిని ప్రోత్సహించాలన్న ఆశయంతో తాము ఈ పని చేశామని వివరించారు.

ఇక పళనియప్పన్, మీనమ్మాళ్ దంపతుల ఔదార్యంతో చలించిపోయిన ఆసుపత్రి డీన్ ఎస్ రామగురు సైతం అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని తాను కూడా వారితోబాటే తమ ఆసుపత్రికి తన దేహాన్నీ మరణానంతరం అప్పగించేలా పత్రాలు సమర్పించేశారు. మరణించిన వ్యక్తుల నేత్రాలు, మూత్రపిండాలు, కాలేయం లాంటి అవయువాలు మరెందరికో జీవితాన్నిస్తాయని, సమాజంలో అవగాహన లేకపోవడంతో ఎందరో రోగులు వేదన చెందుతుండటం గురించి తనకు తెలుసని పేర్కొంటూ రామగురు ఆ వృద్ధుల్ని అనుసరించారు.