Saturday, June 30, 2012

రూపాయికే బీజా...పూర్ ఫీడింగ్


ఒక్క రూపాయిస్తే నాలుగు జొన్న రొట్టెలు, వాటికి సరిపడా కూర. ఎంతమంది వచ్చినా ఇదే రేటు అక్కడ. ఇంతకుముందు 50 పైసలకే ఇదంతా ఇచ్చేవారట. 50 పైసలు కనుమరుగైపోవడంతో ఈ ధరను రూపాయికి పెంచారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేనివారికి ఉచితంగానే ఈ రొట్టెలు, కూర ఇస్తారు. ఇంతకీ ఈ దృశ్యం ఎక్కడిదనుకుంటున్నారా ? కర్ణాటకలోని బీజాపూర్ పట్టణంలోని కబ్‌రాజీ బజార్‌లో ఉన్న హేమంత్ నగర్ దుకాణం వద్ద ఒక చేత్తో రూపాయి.. మరో చేత్తో విరిగిన పళ్ళెమో లేక పాలిథిన్ కవరో పట్టుకుని మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య సమయంలో పేదలు వరుసలో నిల్చుని ఉంటారు. 

ఇది దాదాపు నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్న సేవ. అప్పట్లో హేమంత్ తండ్రిగారు కేవలం 10 పైసలకే పేదల కోసం ఈ సేవను ప్రారంభించారట. అప్పటి 10 పైసలుకానివ్వండి.. ఇప్పటి రూపాయి కానివ్వండి. ఈ మొత్తం సొమ్ముకు మరి కొంత డబ్బు చేర్చి వంటవారికి, రొట్టెల కోసం పిండి ఆడే మిల్లువారికి ఇస్తుంటారు. హేమంత్ కుటుంబం చేస్తున్న ఈ సేవ గురించి తెలిసినవారు ఈ సేవలో భాగస్వాములై ఎంతో కొంత సొమ్మును విరాళంగా ఇస్తుంటారు. కొందరైతే జొన్నలు, కూరగాయలు ఇస్తుంటారు. దాతలెవరైనా 08352 250114 ద్వారా హేమంత్ నహర్‌ను సంప్రదించవచ్చు.