Saturday, January 22, 2011

దాసరి భూమయ్య... మామూలు SI కాదు

ఒకప్పుడు రాజులు, మంత్రులు మారు వేషాల్లో రాజ్య సంచారం చేసి ప్రజా సంక్షేమం గురించి తెలుసుకునేవారట. ఎక్కడైనా లోపాలు, నేరాలు వారి దృష్టికి వస్తే పరిస్థితిని చక్కదిద్ది సమాజాన్ని గాడిలో పెట్టేవారట. ఇలాంటి వాటి గురించి మనం కథల్లోనే తెలుసుకున్నాం గానీ... నేటి కాలంలోనూ అలాంటివారున్నారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరులో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి భూమయ్యగారే ఆ వ్యక్తి. ఈయన్ని నేరుగా కలుసుకోవాలంటే కాస్త కష్టం కావచ్చు. ఎందుకంటే నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాపెట్టి, వారిని కటకటాల వెనక్కి నెట్టే క్రమంలో భూమయ్యగారు ఆటో డ్రైవర్‌గా, సైకిల్ మీద సామాన్లు అమ్ముకునే వ్యక్తిగా లేదా మరో రూపంలోనో తిరుగుతూ ఉంటారు.

భూమయ్యగారి విజయాల్ని గమనిస్తే... ఎన్నోమార్లు సాధారణ ప్రయాణీకుడిలా ఆటోల్లో ప్రయాణించి, పరిమితికి మించిన ప్రయాణీకులతో ప్రమాదకరంగా బండి నడుపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడే ఆటో డ్రైవర్ల భరతం పట్టారు. పత్తి విత్తనాలు కొంటానంటూ ఒక చోటికెళ్ళి నకిలీ విత్తనాలు అంటగట్టే వ్యాపారులను కోర్టు మెట్లెక్కించారు.

భూమయ్యగారు 2006లో బసంత్‌నగర్‌లో ఎస్ఐగా పనిచేసేటప్పుడు ఒక భూస్వామికి చెందిన భూమిలో కొందరు ఎర్ర జెండాలు పాతిపెట్టారు. ప్రభుత్వం సాయంతో వాటిని పీకించడమేగాక, ఆ భూస్వామిని ఒప్పించి కామన్‌పూర్, మంథని మార్గంలోని 80 శాతం మంది పేదలకు అధికారికంగా పంపిణీ చేయించారు. జీవితంలో ఒక కొత్తకోణాన్ని చూచిన ఆ పేదలంతా ఒక కాలనీ కట్టుకుని దానికి "దాసరి భూమయ్య కాలని" అని పేరు పెట్టుకున్నారు. అక్కడ భూమయ్యగారి ఛాయాచిత్రం కూడా కనిపిస్తుంది.