Saturday, December 31, 2016

పుస్తక ప్రియులకు, స్టాల్స్‌కు పిల్లలే చిల్లర ఇచ్చారు...

భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన సందర్భంలో ప్రజల్ని చిల్లర సమస్య ఎంతగా వేధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనం చిన్న చిన్న అవసరాల కోసం ఏం కొనాలన్నా, వ్యాపారులు అమ్మాలన్నా ఎన్ని తిప్పలు పడ్డారో మనకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు కూడా ఇబ్బందులు తప్పవనే అనుకున్నారు కానీ.... పుస్తక ప్రియులకు చిల్లర సమస్య ఉండరాదని భావించారు ఘట్‌కేసర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పాఠశాల విద్యార్థులు. వరుసగా మూడు రోజుల పాటు రోజుకు రూ.10 వేల చొప్పున బుక్ స్టాల్స్ నిర్వాహకులకు చిల్లర పంచారు. కాస్తంత చిల్లర కోసం జనం ఏటీఎంల దగ్గర క్యూలు కడుతున్నారు. చాలామంది అనారోగ్యం పాలయ్యారు కూడాను. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులు రూ.40 వేల విలువైన చిల్లరను అందించడమంటే మామూలు విషయం కాదు ! భళా‌.. అంటూ ఈ పిల్లలను పుస్తక ప్రియులు నోరారా మెచ్చుకుంటున్నారని ఆ పాఠశాల డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ గర్వంగా చెప్పారు. తల్లిదండ్రులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చిల్లర డబ్బులను కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న ఈ పిల్లలు వాటి ద్వారా పుస్తక ప్రియులకు సాయపడ్డారు. పుస్తక ప్రదర్శనలో ఈ పిల్లలను చూసిన పెద్దలందరూ బ్యాంకుల కన్నా ఈ చిన్నారులే మంచి సేవ చేశారని తెగ పొగిడారు.

Wednesday, November 30, 2016

వ్యాపారే గానీ మనసున్నోడు...

వెయ్యి, 500 నోట్ల రద్దయిన ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లర కోసం జనం రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఇలా వయో, లింగ భేదాలతో సంబంధం లేకుండా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద రేయింబవళ్ళు పడిగాపులు కాస్తున్నారు.  పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న కష్టాలు, బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పెరుగుతున్న క్యూలను చూసిన ఓ వ్యాపారి వారి కష్టాలు తీర్చడానికి పెద్దమనసుతో ముందుకొచ్చాడు. తన దగ్గరున్న చిల్లర నోట్లు, నాణేలను బ్యాంకులో జమచేసి చిల్లర కష్టాలు తీర్చడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఆయన పేరు చెందిన అవదేశ్ గుప్తా. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఈయన, బ్యాంకులో రూ.1.55 లక్షల మొత్తాన్ని చిల్లర రూపంలో జమచేశాడు. రూ.10, రూ.50, రూ.100 నోట్ల రూపంలో ప్రజల కోసం చిల్లరను జమ చేయడం విశేషం. ఒక వ్యాపారస్తుడైన అవదేశ్‌కు చిల్లర ఎంతో ముఖ్యం. ఆయన వద్ద చిల్లర ఉంటేనే వ్యాపారం బాగా సాగుతుంది. అయితే, చిల్లర డబ్బుల కోసం బ్యాంకుల వద్ద జనం పడుతున్న పాట్లను తొలగించాలనే సదుద్దేశంతో అవదేశ్ ముందుకొచ్చారు. లాభాపేక్షను పక్కన పెట్టి తక్కువ విలువ కలిగిన నోట్లను జమచేశారు. నవంబర్ 8వ తేదీన రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ స్వయంగా ప్రకటించారు. ఆ క్షణం నుంచే చిల్లర సమస్యలు చుట్టుముట్టాయి. అవదేశ్ లాంటివారు మరికొందరు ముందుకొస్తే దేశవ్యాప్తంగా చిల్లర సమస్య కొంతలో కొంతయినా పరిష్కారమవుతుంది.

Sunday, July 31, 2016

తెలియని స్నేహితురాలికి గిఫ్ట్‌గా టాయ్‌లెట్...

పుట్టినరోజులనగానే మనలో చాలామంది స్నేహితులిచ్చి టాయ్స్ కోసం ఎదురుచూస్తుంటాం. అయితే, చెన్నైలో ఉంటున్న విద్యార్థిని అక్షయ (13) తన పుట్టినరోజు సంబరాన్ని కొత్తగా చేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక, తన పుట్టినరోజు నాడు మరో పేద బాలికకు భలే బహుమతిని ఇచ్చింది. ఆమెకు టాయ్‌లెట్ కట్టించి చక్కని కానుకను ఇచ్చింది.  తన పుట్టినరోజున మరో బాలికకు ఇలాంటి సాయం చెయ్యాలని అక్షయ తన తండ్రి జయకాంతన్‌కు చెప్పగానే ఆయన ఎంతో సంతోషించారు. టాయ్‌లెట్ అవసరం ఉన్న ఒక పేద కుటుంబాన్ని గుర్తించాల్సిందిగా Centre for Sustainable Development అనే ఎన్జీవోను కోరారు. ఆ సంస్థ కడలూరు జిల్లాలోని భువనగిరి పట్టణానికి దగ్గర్లో ఉన్న పెరుమత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆర్తి కుటుంబాన్ని లబ్ధిదారుగా గుర్తించింది. అక్షయ తండ్రి జయకాంతన్ ఆ ఎన్జీవోకు 25 వేలు పంపి ఎకోశాన్ టాయ్‌లెట్ ఏర్పాటు చేయించారు.

ఈ రకమైన టాయ్‌లెట్‌కు నీరు అవసరం లేదట. ఆర్తి కుటుంబంలో పిల్లలు పెద్దలు కలిపి ఏడుగురు మహిళలున్నారు. ఈ సాయం వారందరికీ ఉపయోగపడుతుంది. అక్షయ పుట్టినరోజైన జులై 22 కల్లా ఆర్తి కుటుంబానికి ఈ టాయ్‌లెట్ ఉండేలా సిద్ధం చేశారు. ఆ రోజున ఆర్తి కుటుంబంతోనే అక్షయ గడిపి వారి ఆశీర్వాదం తీసుకుంది. ఈ ఫోటోలో అక్షయ, ఆర్తిలను చూడండి...

Saturday, April 30, 2016

బాలికలకు అపురూపం... మీనమ్మ కానుక !

మీనా మెహతా... ఈ పేరు వింటే సూరత్, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బాలికలందరికీ ఒక ఆరాధనా భావం కలుగుతుంది. ఎందుకంటే, మీనా ఆ బాలికలకు అందిస్తున్న సాయం మిగతా దాతలకంటే భిన్నమైంది కనుక. సాధారణంగా పేద బాలబాలికలకు స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలు, పెన్సిళ్లు, ఒక పూట భోజనం లాంటివి దాతలు అందిస్తుంటారు. కానీ, మీనా మెహతా రూటే సపరేటు. ఈమే ఆ విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. స్కూళ్ళలోని బాలికలకు హైజీన్ కిట్స్, శానిటరీ నాప్‌కిన్స్ ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజెపుతుంటారు. ఈ హైజీన్ కిట్స్‌లో శానిటరీ నాప్‌కిన్స్‌తో పాటు లోదుస్తులు, షాంపూ ప్యాకెట్లు, సబ్బులు ఉంటాయి. సూరత్ పరిసరాల్లోని 22 మున్సిపల్ పాఠశాలలు, అంగవికలురకు ఉద్దేశించిన బడులలో మీనా ఈ కిట్స్ పంచుతుంటారు. ఇప్పుడామే విద్యార్థినులకే కాకుండా పేద మహిళలకు కూడా ఈ కిట్స్‌ని ఇస్తున్నారు. మీనా భర్త అతుల్ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని తన వల్ల చెయ్యగల్గినదంతా చేస్తుంటారు.

Thursday, March 31, 2016

1000 బార్బీ బొమ్మలు ఊరికే ఇచ్చేస్తా...

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం నార్‌ఫోక్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి 1000 బార్బీ డాల్స్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమె పేరు గియానీ గ్రాహం (Gianni Graham) అవన్నీ తానొక్కత్తే ఆడుకోవడానికి కాదు. తనకి అలాంటి బొమ్మలు చాలానే ఉన్నాయి. కానీ, తనలాగా బొమ్మలతో ఆడుకునే భాగ్యం లేని నిరుపేద బాలికలకు పంచడానికి ఈ సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆడుకునే తోడులేక ఒంటరిగా జీవించే బాలికలకు తానిచ్చే బొమ్మ ఒక స్నేహితురాలిగా ఉంటూ వారిలో నవ్వులు పూయిస్తుందని, అదే తనకు చాలని అంటోంది. తన ఈ కార్యక్రమానికి " ‘1K Barbiers For 1K Girls" అని నామకరణం చేసింది. ఇందుకోసం అదే పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి నెల నాటికి 700 బొమ్మలు సేకరించింది. ఈ పాటికి మిగిలినవి కూడా సంపాదించే ఉంటుంది. మంచి పనులు చెయ్యడానికి డబ్బు మాత్రమే ఉండాల్సిన పనిలేదని చాటి చెప్పింది గియానీ...

Sunday, January 31, 2016

పిల్లల కోసం ముంబై కుర్రాడి వెదురు వంతెన

ప్రభుత్వాలు చెయ్యని (చెయ్యగలిగినవే...) పని 17 ఏళ్ల కుర్రాడు పూర్తి చేసి నేటి తరానికి, భావి తరాలకు ఆదర్శంగా నిలిచాడు. ముంబై నగరంలోని సాతే నగర్ ప్రాంతంలో బడికి వెళ్లడానికి రోజూ మురికి కాలువను దాటుతూ నానా అవస్థలు పడుతుండేవారు. ఆ చిన్నారుల అగచాట్లను గమనించిన ఎషాన్ బాల్‌బలే వారి కోసం తాత్కాలికంగా సాతేనగర్ నుంచి పీజీఎంపీ కాలనీ వరకు 100 అడుగుల మేర వెదురుతో ఒక వంతెన నిర్మించాడు. ఇప్పుడిది ఆ చిన్నారులకు విద్యా వరప్రదాయినిగా మారింది. ఈ కుర్రాడు థానేలోని బెడేకర్ కాలేజీలో ప్లస్ 2 చదువుతున్నాడు. ఈ వంతెన 4 అడుగుల వెడల్పుతో ఒకేసారి 50 మంది బరువును మోయగలదట. ఈ కుర్రాడి వంతెన వల్ల అక్కడ స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గాయి. ఆ చిన్నారుల జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఎషాన్‌ని మనసారా ఆశీర్వదిద్దాం...