Tuesday, July 22, 2008

ఆమెను గోమతి మామీ అంటారు

ఏ కుటుంబంలోనైనా మరణం సంభవించినట్లు తెలిస్తే చాలు, ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడానికి అక్కడ సిద్ధంగా ఉంటారు 70 ఏళ్లు పైబడిన గోమతి మామీ. అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చేస్తారు. వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పురోహితుణ్ణి మాట్లాడటంతోపాటు అంతిమయాత్రకు అవసరమైన పువ్వులు, నవధాన్యాలు, నూనె, గంధపుచెక్క, నిప్పు వరకూ అన్నిటికీ ఆమే దగ్గరుండి చేయూతనిస్తారు. ముఖ్యంగా బాధలో ఉన్నవారు ఏమీ తినరు. వారిని ఓదార్చి నాలుగు మెతుకులు తినిపించడం మర్చిపోరామె. తమిళనాడులోని ప్రముఖ నగరం కోయంబత్తూరుకు సమీపాన ఉన్న పొన్నయ రాజాపురంలో ఉంటారు సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 70 ఏళ్ల గోమతి అమ్మాళ్. అందరూ ఆమెను గోమతి మామీ అంటారు. 12 ఏళ్ల కిందట భర్తను కోల్పోయిన మామీ గారు ఆ దుఃఖాన్ని అనుభవించి తన లాంటి ఎందరికో సాయమందించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో అభ్యంతరాలు ఎదురైనా ఆవిడ పట్టించుకోలేదు. గత పదేళ్లకు పైగా ఈవిడ వేల సంఖ్యలో అంత్యక్రియలు జరిపించారు. పేదలకు అంతా ఉచితంగానే అందజేస్తారు. కుమార్తె మైథిలి, ఒక సహాయకుడు తోడుగా గోమతి మామీ తన సేవలు అందిస్తుంటారు. ఈవిడ దగ్గర అంబులెన్స్ కూడా ఉంది.