Saturday, December 08, 2007

కప్పగంతులు...

జంతువుల్లో ఉభయచరమైన కప్ప నుంచి పుట్టిన ఈ కప్పగంతులు... మనుషుల్లో రాజకీయ నాయకులు మాత్రమే పార్టీలు మార్చేందుకు వేస్తుంటారు. అయితే తమిళనాడులోని వేలూరులో రాహుల్ గణేశ్ అనే 13 ఏళ్ల బాలుడు ఎయిడ్స్ వ్యాధిపై జనానికి అవగాహన కలిగించేందుకు డిసెంబర్ 7వ తేదీన ఏడు కిలోమీటర్ల దూరం కప్పగంతులు వేసుకుంటూ వెళ్లాడు. వేలూరు గ్రామీణ యువజన సంఘం నిర్వహించిన ఎయిడ్స్ ప్రచారంలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ కప్పగంతుల కార్యక్రమం సాగింది. మొత్తం మీద పరిశీలిస్తే రాహుల్ గణేశ్ కిలోమీటర్‌కు 1000 కప్పగంతులేసినట్లు లెక్క తేలింది. వేలూరులోని శ్రీపురం లక్ష్మీదేవి స్వర్ణాలయం నుంచి బస్టాండ్ వరకూ సాగిన ఈ కార్యక్రమంలో 100 చోట్ల ఆగి ఎయిడ్స్‌పై ప్రచారం కూడా చేశాడు. ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ను తరిమికొట్టి జీవితంలో కొత్త కోణాలను ఆస్వాదించమంటూ అరియూర్ గ్రామానికి చెందిన రాహుల్ గణేశ్ చేసిన ఈ వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. అతనిపై ప్రశంసల వర్షం కురిసింది.