Thursday, February 26, 2009

మాకు కరెంట్ వద్దు...

మన పొరుగున ఉన్న భూటాన్ మనకన్నా చిన్న దేశం. మనకన్నా పేద దేశం. కాని భూటాన్ ప్రజల మనసులు మాత్రం చాలా విశాలం. వారికి భూతదయ ఎంత ఎక్కువంటే, నదుల్లోని చేపలని పట్టరు. డబ్భై ఐదు శాతం అడవే అయినా జంతువుల్ని వేటాడి చంపరు. ఆ దేశంలోని ఫోబ్జికా లోయకు తరచూ కొంగలు వలస వస్తూంటాయి. ఆ లోయకి వచ్చే దారిలో ఉన్న ఓ ఊళ్ళోని కరెంటు తీగల మీద వాలి అవి మరణించడం గమనించిన ఆ ఊరి వాసులు విద్యుత్‌కు స్వస్తి చెప్పారు. సౌర శక్తితో తమ ఇళ్ళను వెలిగించుకుంటున్నారు. వారు బాగా సున్నిత మనస్కులు కాబట్టి హింసా ప్రవృత్తి గల రెజ్లింగ్ పోటీలను ప్రసారం చేసే పాశ్చాత్య ఛానెళ్ళకు అడ్డుకట్ట వేశారు. ఫ్యాషన్ టీవీ, టెన్ స్పోర్ట్స్, ఎంటీవీ లాంటి అర్ధనగ్న దృశ్యాలు ప్రసారం చేసే ఛానెళ్ళు కూడా భూటాన్‌లో ప్రసారం కావు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడాన్ని నిషేధించిన తొలి దేశం కూడా భూటానే. ప్రజలు ఇలాంటి మంచి పనులకు వ్యతిరేకతను తెలియచేయకపోవడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. సమున్నత సంస్కృతికి మారు పేరని చెప్పుకునే మన భారతీయులంతా భూటాన్‌ను అనుసరించాల్సిన అవసరముంది.

సౌజన్యం: గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు

Wednesday, February 18, 2009

వీళ్ళు పే......ద్ద పిల్లలు

శత్రువులు పాలిట తూపాకీ తూటాలాంటివాడు తుఫాన్ కుమార్ అయితే... భారతీయ సైనికుల ధన్వంతరి భారతీ సింగ్. ఈ విద్యార్థులు సాధించిన ఘనతల గురించి చదివాక నేను పెట్టిన శీర్షిక నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారని నా నమ్మకం. నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక బృందం) అధిపతి హేమంత్ కర్కారే, అశోక్ కామ్టే తదితరులు ప్రాణాలను లెక్కచెయ్యకుండా పోరాడి అసువులు బాసిన సంగతి తెలిసిందే. వాళ్ళు వేసుకున్న బులెట్ ప్రూఫ్ జాకెట్లు నాసిరకం కావడమన్నది వీరి మరణానికి ఒక కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని బట్టి ఉగ్రవాద నిర్మూలన పట్ల మన పాలనా వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందలాది ప్రాణాలను బలిగొన్న ఆ నాటి దాడి తర్వాత మనం నేర్చుకున్న పాఠాల సంగతేమోగాని ఈ మధ్య మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన ఒక బాలల సైన్స్ సమావేశంలో ఉగ్రవాద నిరోధానికి సంబంధించిన ఆవిష్కరణలతో ముందుకొచ్చారు.

ఇందులో పాల్గొన్న భువనేశ్వర్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థి తుఫాన్ కుమార్ సమాల్ తన వంతుగా... క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల (సిసిటివి) పైన తుపాకులు అమర్చి కంట్రోల్ రూం నుంచి వాటిని పేల్చడం ద్వారా ఉగ్రవాదులను అంతమొందించే వ్యవస్థను రూపొందించాడు. దీనివల్ల సమయం వృథా కాదు... ప్రాణ నష్టం చాలా చాలా తగ్గుతుంది. పెద్ద పెద్ద హొటళ్ళలో తిరిగే (రివాల్వింగ్) కెమెరాలుంటాయి. వాటి సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని చూస్తాం. మరో అడుగు ముందుకేసి వాటికి తుపాకులు అమర్చడం ద్వారా పని పూర్తి చెయ్యవచ్చట. తుఫాన్ కుమార్ తుఫాను వేగంతో కదిలే మానవరహిత ప్లాస్టిక్ విమానాన్ని కూడా తయరు చేశాడు. దీంతో శత్రు స్థావరాల్ని కచ్చితంగా కనిపెట్టడంతో పాటుగా తుఫానులు వచ్చి వరద బీభత్సం చోటు చేసుకున్నప్పుడు బాధితులకు సాయం కూడా చెయ్యవచ్చు...

ఉత్తరప్రదేశ్ నుంచి ఇదే సైన్స్ సమావేశంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థిని, బరైలీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన భారతీ సింగ్, నీటిలోని నాచును ఉపయోగించి సైనికులకు చికిత్స చేసే వ్యవస్థను రూపొందించింది. నాచు నుంచి ప్రొటీన్ తీసి యుద్ధ సమయాల్లో గాయపడిన సైనికులకు బాక్టీరియా వల్ల వ్యాధి వ్యాపించకుండా దీంతో చికిత్స చెయ్యవచ్చట. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అప్పటి సైనికులు వ్యాధులు రాకుండా ఈ నాచును పైన పెట్టుకుని కాపాడుకున్నట్లు చరిత్ర పాఠాల ద్వారా తెలుసుకుని దీనిని తయారు చేసినట్లు భారతీ సింగ్ చెప్పింది. నాచులోని ప్రొటీన్‌ను బయటకు తీసి కొన్ని వైరస్‌లపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆమె వెల్లడించింది. గడచిన డిసెంబర్ నెలలో తాను కనిపెట్టిన ఈ ఆవిష్కరణపై పేటెంట్ కూడా తీసుకుంది.

Wednesday, February 11, 2009

నస్రీన్ నుయ్యి తవ్వింది

అమ్మానాన్నలు ఎప్పుడు చస్తారా... ఓ గొయ్యి తవ్వి పారేద్దాం అనుకునే ఈ రోజుల్లో... నీళ్ళ కోసం తల్లి పడుతున్న కష్టం చూచి ఆవేదన చెందిన నస్రీన్ ఆమె కోసం ఒక నుయ్యి తవ్వింది. తన చెల్లాయిలు తోడుగా నస్రీన్ 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వింది. ఇక నస్రీన్ ఎవరో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఉన్న మహా విద్యాలయం విద్యార్థిని అయిన నస్రీన్ పేద కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి రంజాన్ ఖాన్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మరోవైపు నస్రీన్ పగలు కళాశాలకు వెళుతూ, విద్యార్థులకు ప్రయివేట్లు చెబుతూ తన వంతుగా నాలుగు రాళ్ళు సంపాదించి తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా ఉండేది. ఈ ఇంట్లో దాహార్తి తీర్చుకోవాలంటే నస్రీన్ తల్లి మైళ్ళ దూరం నడిచి మంచి నీళ్ళు తీసుకురావాల్సిందే. కని పెంచిన తల్లి కష్టం చూడలేకపోయిన ఈ ధీశాలి అమ్మ కోసం ఏమైనా చేసి తీరాలని సంకల్పించుకుని ఇంట్లేనే నుయ్యి తవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు అమ్మా నాన్నా ఒప్పుకోరు. చెల్లెళ్ళతో ఈ సంగతి మాట్లాడి అమ్మానాన్నలకు తెలియకుండా అందరూ కలిసి పలుగు పార పట్టుకొని 20 రోజుల్లో 35 అడుగుల లోతు బావి తవ్వేశారు. పని పూర్తయ్యాక అమ్మానాన్నల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక మహావిద్యాలయ ప్రిన్సిపాల్ ఆర్ కె పాటిల్ గారైతే నస్రీన్‌ను నోరారా పోగిడి కుట్టుమిషన్ బహుమతిగా ఇచ్చారు. ఇంకా డబ్బు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగి రెండేళ్లయినా ఆ వివరాలు నాకు ఇప్పుడు దొరికాయి.

ఇదంతా చూస్తుంటే లక్క ఇంటి నుంచి తన తల్లి, సోదరుల్ని కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో నిద్ర మానుకొని సొరంగం తవ్విన పాండవ మధ్యముడు భీముడు గుర్తుకు రావడం లేదూ...! భీమసేనుణ్ణి మనం చూడలేకపోయాం గానీ ఈ యుగంలో నస్రీన్ మన కళ్ళముందుంది. ఈ నస్రీన్ భారతంలోని భీముని తలపించింది. ఎందుకంటే సందర్భాలు, పరిస్థితులు వేరైనా దృఢ సంకల్పం ఒక్కటేగా...

Saturday, February 07, 2009

హిజ్రాలు కాదు మానవతా వజ్రాలు

హిజ్రాలు లేదా నపుంసకులనగానే ఈ (అ)సభ్య సమాజానికి గుర్తుకొచ్చేది వయ్యారమొలకబొసి, చప్పట్లు కొడుతూ నాట్యాలు చేస్తూ డబ్బులడుక్కుంటున్న దృశ్యం. హిజ్రాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో విలేఖరిని దత్తత తీసుకున్న ఈ నిజ సంఘటన గురించి తెలుసుకుంటే వారు మంచోళ్ళకంటే మంచోళ్ళన్న అభిప్రాయానికి రాక తప్పదు. మామూలు మనుషుల కొచ్చే కష్టాలనే పట్టించుకోని ప్రభుత్వం మామూలుగానే వీరి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే దేవుడనేవాడు వీరి కోసం విల్లుపురంలో ఒక మనిషిని పుట్టించాడు. అతనే రామ్మూర్తి. ఈ ఊరిలోనే అర్చకుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి (40 ఏళ్ళు) పత్రికా విలేఖరిగా కూడా సమాచార సేవలందిస్తుంటారు. ఈయన వార్తలు సేకరించడంతో ఆగిపోకుండా ఈ హిజ్రాలకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పించారు. వారి హక్కుల కోసం పోరాడుతూ వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు.

తమకేమీ కాని రామ్మూర్తి తమ సంక్షేమం కోసం ఇంతగా శ్రమించడం ఆ హిజ్రాల మనసును కరిగించేసింది. వెంటనే రామ్మూర్తిని తమ కుమారునిగా దత్తత తీసుకోవాలని జిల్లా నపుంసకుల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా 2005 డిసెంబర్ 31న శాస్త్రబద్ధంగా దత్తత స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నపుంసకులను శ్రీకృష్ణుని ప్రతిరూపంగా భావించే హిజ్రాలు తనను దత్తత చేసుకోవడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందని రామ్మూర్తి పారవశ్యంతో చెప్పారు. ఈ మానవతా వజ్రాలను ఎన్ని పొగడ్తలతో ప్రశంసిస్తే సరిపోతుంది చెప్పండి.