Friday, April 13, 2007

ఔదార్యానికి అర్థం చెప్పిన అరక్కోణం...

అది మార్చి 31, 2007వ తేదీ. మిగిలిన అందరి విషయంలో అయితే ఇది వాళ్ల జీవితంలో గడిచిపోయిన ఒక రోజు. పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు, కోయంబత్తూర్-చెన్నై రైలు ప్రయాణీకులకు మాత్రం ఔదార్యానికి అర్థం తెలిసిన రోజు. తమ జీవితాలను కాపాడిన రోజు. ఇక అసలు విషయానికి వద్దాం...

ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన బంద్ కారణంగా ఈ రాష్ట్రంలో తిరుపతి వెళ్లే మార్గంలో ఉన్న అరక్కోణం స్టేషన్‌లో పైన చెప్పిన రెండు రైళ్లూ ఆగిపోయాయి. సాయంత్రం వరకూ బళ్లు కదలవని చెప్పేశారు. బంద్ ప్రభావంతో చుట్టుపక్కల దుకాణాలు, హొటళ్లు ఏమీ లేవు. రాత్రంతా ప్రయాణించిన ఈ రైలు ప్రయాణీకులు పొద్దున్న కూడా ఏమీ తినలేదు. రోజు గడిచిపోతోంది... దాంతో పాటు ఆకలీ మండిపోతోంది. మిట్ట మధ్యాహ్నం వేళైంది. యువకుల సంగతి ఎలా ఉన్నా... పసి పిల్లలు, ముసలివాళ్ల సంగతి దయనీయం.

అదే సమయంలో అరక్కోణం పట్టణంలో అహింసకు ప్రతీకగా నిలిచిన జైన మహనీయుడు మహావీర జయంతి జరుగుతోంది. ఇందులో భాగంగా స్థానిక జైనులు సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం రైల్వే అధికారులకు ఎవరో చెప్పారు. దాంతో వాళ్లు వెంటనే స్పందించి ప్రయాణీకుల పరిస్థితిని మహావీర జయంతి నిర్వాహకులకు తెలియజేసారు.

ఇంకేముంది, మానవత్వం పరిమళించగా ప్రయాణీకుల క్షుద్బాధ ఉపశమించింది. ఆత్మారాముడు శాంతించి ఔదార్యానికి అర్థం చెప్పాడు. అరక్కోణం వారి జీవితంలో కొత్త కోణాన్ని పూయించింది. Print this post

No comments: