Monday, April 20, 2009

పెద్దలు ఓటేస్తే పిల్లలకు స్టార్

ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఏమిటన్నది నిజంగా గ్రహించిన పాఠశాల ఇది. హైదరాబాద్ నగరం చింతల్‌లో ఉన్న సెయింట్ మార్టిన్ హైస్కూల్ యాజమాన్యం తనకున్న పరిధిలో పౌరులను ఓటు వేసే దిశగా చైతన్యపరిచేందుకు ఓ మంచి పథకం వేసింది. తన పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యత గుర్తెరిగి ఓటు వేస్తే వారి పిల్లల రిపోర్ట్ కార్డ్‌లో సదరు విద్యార్థికి ప్రత్యేక గౌరవం ఇస్తూ బోనస్ స్టార్ కేటాయిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా ఆ విద్యార్థి తల్లిదండ్రులను ఉత్తమ పౌరులుగా గుర్తిస్తామని కూడా వెల్లడించింది. ఈ బోనస్ స్టార్ ద్వారా ప్రత్యేక గౌరవం పొందడానికి ఆ పిల్లలు తమ అమ్మానాన్నలతో ఓటు వేయించడంతో పాటు తాము ఉత్తమ పౌరుల బిడ్డలమన్న గుర్తింపు కూడా పొందుతారు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఓటు వేసినట్లు రుజువు చేసుకోవడానికి ఈ నెల 25న స్వయంగా పాఠశాలకు వచ్చి తమ వేలిపై ఉన్న ఇంకు మార్కును పాఠశాల ఉపాధ్యాయులకు చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని, ఇది జరగాలంటే పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటు వెయ్యాలన్నది ఈ పాఠశాల గుర్తించిన వాస్తవం. Print this post

No comments: