Saturday, October 08, 2011

ఏమి రాజండీ... అధికారం ఉండదని తెలిసీ..

ఒక దేశానికి రాజంటే.. మందీమార్బలం, హద్దుల్లేని అధికారం, కోరుకున్నదల్లా క్షణాల్లో సమకూరే విలాసవంతమైన జీవితం. ఇలాంటి జీవితాన్ని తమంత తాముగా త్యాగం చెయ్యడానికి ఎవరైనా ముందుకొచ్చారా ?.. త్రేతాయుగంలో శ్రీరాముడు, తర్వాత బుద్ధ భగవానుడు తప్ప మరెవరూ గుర్తుకురావడం లేదు కదూ.. ఈ దివ్య పురుషుల జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలోనే నడిచాడు భూటాన్ దేశ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్.

భూటాన్‌లో తమ వంశం అధికారంలో ఉన్న రాచరిక వ్యవస్థ కంటే ప్రజాస్వామ్యమే ప్రజలకు మేలు చేస్తుందని నమ్మిన జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 2008 కల్లా మహారాజు హోదాను వదులుకోవడానికి సిద్ధమని ముందే ప్రకటించాడు. తన ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికిగాను 34 సూత్రాల రాజ్యాంగాన్ని రూపొందించి దీనిని ప్రతి ఇంటికీ పంపి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు.

ఈ రాజ్యాంగం అమలులోకి వస్తే భూటాన్ రాజుకున్న అధికారాలన్నీ రద్దవుతాయి. మూడింట రెండొంతుల మంది పార్లమెంట్ సభ్యులు అంగీకరిస్తే రాజును తొలగించే అధికారాన్ని పార్లమెంట్‌కే ఉండేలా రాజ్యాంగాన్ని తయారు చేశారు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్. చివరికి 2006లో తన మహారాజుగా తప్పుకుని కుమారుడు జిగ్మే గేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్‌కు పాలనా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడీయన తండ్రి ఆశయాలకు అనుగుణంగా భూటాన్ దేశాన్ని ప్రజాస్వామ్యం దిశగా నడిపిస్తూ ఎన్నికల చట్టాలు, భూసంస్కరణల అమలుకోసం పార్లమంట్‌లో జరిగిన చర్చలకు నేతృత్వం వహించారు.

పదవుల కోసం పాకులాడే నేటి రాజకీయ నాయకులు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ గారి దగ్గర పనివారిగా చేరినా బాగుపడతారంటారా?..

ఈ రాజుగారి మరో గొప్పతనం ఏమిటంటే.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పొగతాగడాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నారు. అయితే తనకూ ఈ అలవాటు ఉండటంతో పూర్తిగా దాని నుంచి బయటపడి అప్పుడు భూటాన్‌లో పొగతాగడంపై నిషేధం విధించారు.

సౌజన్యం: శ్రీ మల్లాది కృష్ణమూర్తిగారు... Print this post

No comments: