Monday, October 10, 2011

బ్లాగుతో బాగుపడిన జీవితం..

బ్లాగులు, ఇంటర్నెట్, చాటింగ్, బజ్.. ఈ పదాలు వింటూనే ఇవేమిటర్రా బాబూ అంటూ ముఖం చిట్లించుకునే ఒక వర్గానికి కనువిప్పు కల్గించాడు ఒక బ్లాగర్. అపూర్వ మానవత్వాన్ని ప్రదర్శించి బ్లాగులు తల్చుకుంటే జీవితాల్ని బాగుచేయవచ్చని నిరూపించాడు. అతనే కేరళకు చెందిన బ్లాగర్ సనల్ శశిధరన్. ఇతను తన బ్లాగు sanathanan.blogspot.com ద్వారా షరి అనే మహిళ ఆపరేషన్ కోసం లక్షలాది రూపాయల విరాళాలు సమకూర్చి సాయపడ్డాడు. ఆ వైనం ఏమిటంటే..

షరి, అనిల్ కుమార్ దంపతులు కేరళలోని కొల్లం పట్టణంలో నివసిస్తుంటారు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న షరికి తిరువనంతపురం ప్రాంతీయ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో వైద్యం చేయిస్తూ వచ్చారు. ఈమెకు కీమోథెరపీ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరగాల్సి ఉందని, ఇందుకోసం దాదాపుగా రూ.15 లక్షల మొత్తం అవసరమవుతుందని వైద్యులు చెప్పారు.

ఈ దంపతుల సమస్య గురించి తెలుసుకున్న శశిధరన్ తన బ్లాగ్ ద్వారా వీరి పరిస్థితిని Google buzz, Blogosphere, Facebook తదితరాల ద్వారా సైబర్‌వాసుల దృష్టికి తీసుకువచ్చాడు. సైబర్ మోసాలు మారుమోగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ దంపతుల వాస్తవ స్థితిగతులకు సాక్ష్యంగా మెడికల్ రిపోర్ట్‌లు, వీరి కుటుంబ సభ్యుల ఫోటో, ఫోన్ నెంబర్, అనిల్ కుమార్ బ్యాంక్ ఖాతా వివరాలు తన బ్లాగ్ ద్వారా వెల్లడించాడు.

శశిధరన్ నిజాయితీని గమనించిన పలువురు బ్లాగర్లు వెంటనే స్పందించగా ఆ నోటా ఈ నోటా ఈ వార్త పాకి వందలాదిగా సాయమందించేందుకు ముందుకు వచ్చారు. వీరి ద్వారా సమకూరిన డబ్బు వివరాల్ని గూగుల్ స్ప్రెడ్ షీట్ ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేసి పారదర్శకంగా మంచిపనిని నిర్వహించాడు. Print this post

1 comment:

vasantham said...

It is good to hear some thing positive about blogs and net, when everyone is mentioning it as a weakness.Thanks for posting and informing us this good deed.

vasantham.