Tuesday, March 21, 2006

రోగిగా వచ్చింది... తోడై నిలిచింది

ఆమె ఎవరికీ చుట్టం కాదు. కానీ క్షణం పాటు కనిపించకపోతే చాలు అల్లాడిపోతారు. మనం చెప్పుకుంటోంది పులివెందుల ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందించే రంగలక్ష్ముమ్మ గురించి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపాన లింగారెడ్డిపల్లె వాసి అయిన ఈమె ఆయాసంతో బాధపడుతూ చికిత్స కోసం 6 నెలల కిందట ఈ ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యవంతురాలైంది. అయితే, ఇదే ఆసుపత్రిలో పలుకరించే దిక్కులేక, సాయం చేసే తోడులేక అవేదనతో కుమిలిపోతున్న మహిళలు, వృద్ధులైన రోగులు చాలామందిని రంగలక్ష్ముమ్మ చూసింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి, నాటి నుంచీ అక్కడి రోగులపాలిటి ఆత్మబంధువుగా మారిపోయింది. బాధపడుతున్న వారిని ఊరడిస్తూ, కబుర్లు చెప్పి నిద్రపుచ్చుతుంది. ఎవరికేం కావాలన్నా బజారుకెళ్లి అన్నీ తెచ్చిపెడుతుంది. రోగుల మధ్య ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుందని అక్కడ పనిచేసేవారు అంటే .... నన్ను చూసుకోవడానికి మీరున్నారుగా అంటూ నవ్వేస్తుంది. తోటివారికి సాయపడటానికి ఆర్థిక స్థోమతే ఉండాల్సిన అవసరం లేదని, ఆదరించే మనసుంటే చాలనేది రంగలక్ష్ముమ్మ అందరికీ చెప్పేమాట. ముసలి వయసులో తనకు తోడులేదన్న దిగులును విడిచిపెట్టి, తోటివారినే తనవారిగా భావించి సాయంచేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న రంగలక్ష్ముమ్మ అందరికీ ఆదర్శం కదూ. Print this post

No comments: