Wednesday, March 29, 2006

ఎనిమిదే చదివింది ... దేశాలు తిరిగింది

మొక్కవోని దీక్షతో చేసిన స్వయంకృషే కస్తూరికి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం వచ్చేలా చేసింది. తమిళనాడులోని మదురై జిల్లా పెరుంగుడికి చెందిన ఈమె చదువు కేవలం 8వ తరగతి మాత్రమే. భర్త ఆటో డ్రైవర్ కాగా, నలుగురు పిల్లలతో కూడిన కుటుంబం ఆమెది. సిసిడి (కోనేనంట్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్) ద్వారా ప్రారంభమైన మహిళా స్వయం సహాయక బృందం సభ్యురాలిగా కస్తూరి ఉత్సాహంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. వివిధ సమస్యలపై సిసిడి నిర్వహించే సమావేశాల్లోని ప్రతి విషయాన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసి, చివరకు ఈ సమావేశాలకు ఆమె ప్రధాన వక్తగా మారారు. తన చొరవ, ఉత్సాహంతో ఎనిమిది జిల్లాల మహిళా స్వయం సహాయక బృందాలకు నాయకురాలయ్యారు. సమావేశాల ద్వారా వివిధ బృందాల స్త్రీల కష్టనష్టాలను పరిశీలించి వారి ఆదాయంలో అధిక మొత్తం వైద్యానికే సరిపోతోందని కస్తూరి గ్రహించి ఓ పరిష్కారం కోసం నడుం బిగించారు. వైద్యానికి ఉపకరించే వనమూలికల పెంపకం దిశగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారీమె. ఇప్పుడు ఈ ఉద్యమం సుమారు 125 గ్రామాలకు విస్తరించింది. అంతటితో ఆగక సునామీ బాధిత ప్రాంతమైన నాగపట్టణం జిల్లాలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి నిరాశ్రయులెందరికో పునరావాసం కల్పించారు. కస్తూరి కృషి, పట్టుదల గురించి తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి అధికారులు పంపిన ఆహ్వానంపై ఆమె దక్షణాఫ్రికాలో వనమూలికల పెంపకంపై జరిగిన సదస్సుకు హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత సునామీ సహాయక చర్యలు - పునరావాసం అంశంపై న్యూయార్క్, వాషింగ్టన్, బాంగ్లాదేశ్‌లలోనూ అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ఎందరో తమ జీవితాల్లోని కొత్త కోణాలను స్పృశించేందుకు కస్తూరి జీవితం తప్పక స్ఫూర్తినిస్తుంది. Print this post

No comments: